రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు సవాల్
123 మున్సిపాలిటీల్లో రూ.3,600 కోట్లు, జీహెచ్ఎంసీలో రూ.5 వేల కోట్ల అప్పులు
‘12 ఇయర్స్ ఆఫ్ ఎరోజన్ అఫ్ అర్బన్ తెలంగాణ–బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ లెగసీ’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో రూ.3,600 కోట్ల మేర అప్పులతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.5 వేల కోట్ల అప్పు ఉందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు తెలిపారు. ఇది తప్పు అయితే నిరూపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇది మొత్తం పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్లకు పైగా కాంగ్రెస్ పాలనలో జరి గిన ఘనకార్యమని ఎద్దేవా చేశారు. ఇప్పటికే అప్పుల్లో మునిగి తేలుతున్న మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లను గెలిపిస్తే ‘ట్యాక్స్ టెర్రరిజం’ ప్రవేశపెట్టి, పట్టణ ప్రజలపై వివిధ రూపాల్లో పన్నుల భారాలు మోపి పన్నుల ఉగ్రవాదానికి పాల్ప డతాయని ఆరోపించారు.
గురువారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ‘12 ఇయర్స్ ఆఫ్ ఎరో జన్ అఫ్ అర్బన్ తెలంగాణ–బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ లెగసీ’ పేరిట రాంచందర్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.‘తెలంగాణను రక్షించండి–బీజే పీకి ఓటేయండి’ నినాదంతో రూపొందించిన పాట, వీడియోతోపాటు సేవ్ తెలంగాణ క్యాంపెయిన్లో భాగంగా బీజేపీకి మద్దతు చేపడుతున్న మిస్డ్కాల్ 7878783030 ఉద్యమాన్ని రాంచందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్లలో అభివృద్ధి పేరుతో కాకుండా కమీషన్లు, అవినీతి, దోపిడీ ద్వారానే పట్టణ స్థానిక సంస్థలు నడిచాయని ఆరోపించారు. ఫలితంగా పట్టణ పరిపాలన పూర్తి గా అస్తవ్యస్తమైందన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఏసీబీకి 1,500 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడినా, వారిపై సరైన చర్యలు లేక అవినీతి మరింత పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘మార్పు’ పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇటీవల విడుదలైన దురంధర్ సినిమాలోని విలన్ పాత్రధారి రెహ్మాన్లా, రేవంత్ దోచుకుంటున్నాడని ఆరోపించారు. పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ ఆశిష్ షెలార్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వీరేందర్గౌడ్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


