న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్పైనే కాకుండా.. ఆమె ధరించే చీరలు కూడా ఏటా ఆసక్తికి కేంద్రంగా మారుతుంటాయి. నిర్మల వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిసారీ ప్రత్యేకమైన చీరలో కనిపించారు. తమిళనాడులో సంప్రదాయ కుటుంబంలో జన్మించి, తెలుగింటికి కోడలిగా వచ్చిన నిర్మలా సీతారామన్ దక్షిణ భారత సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబించే వస్త్రాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు.


ఈసారి బడ్జెట్ సందర్భంగా మెజెంటా రంగు కంచి పట్టుచీర ధరించారు. బంగారు రంగు గడులు, కాఫీ–ఊదా రంగు బోర్డర్ చీరలో హుందాగా కనిపించారు. పసుపు రంగు, నిండు చేతుల రవిక ధరించారు. తమిళనాడు చేనేత కార్మికులు మగ్గంపై తయారుచేసే కంచి పట్టుచీరలకు దేశవ్యాప్తంగా పేరుంది. ఈ చీరలకు శతాబ్దాల చరిత్ర ఉంది. 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం దాకా చోళ రాజుల హయాంలో కంచి చేనేత పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది.


