విమర్శలకు దీటైన జవాబు | Sitharaman Responds To Rahul Gandhi Criticism Of Union Budget 2026 | Sakshi
Sakshi News home page

విమర్శలకు దీటైన జవాబు

Feb 2 2026 2:35 AM | Updated on Feb 2 2026 2:35 AM

Sitharaman Responds To Rahul Gandhi Criticism Of Union Budget 2026

బడ్జెట్‌ ప్రవేశపెట్టేముందు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు నోరు తీపిచేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

మీడియా సమావేశంలో నిర్మల

న్యూఢిల్లీ: రైతులు, యువత, తయారీ దారులు, కుటుంబాల వ్యథలను పట్టించుకోకుండా బడ్జెట్‌ను తయారుచేశారని విపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మల మీడియా భేటీలో తిప్పికొట్టారు. ‘‘ రాహుల్‌గాంధీ ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థంకాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి, ప్రతికూల పరిస్థితుల ప్రభావం మన రంగాల మీదా పడుతోంది. అందుకే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొదలు వస్త్ర, తోలు పరిశ్రమల దాకా అన్నింట్లోనూ కొత్త పథకాలు తీసుకొచ్చాం. రైతులు, మహిళా వ్యవస్థాపకుల దాకా అందరి ప్రయోజనాలకు పెద్దపీట వేశాం. ఇవన్నీ చూశాక కూడా మీరు(రాహుల్‌) రాజకీయంగా విమర్శలు గుప్పించాలనుకుంటే అది మీ ఇష్టం.

కానీ మీరు ఏ అంశాల మీదయితే విమర్శించాలనుకుంటున్నారో అవన్నీ నాకు చెప్తే నేను సావధానంగా వింటా. అందుకు తగ్గట్లు బదులిస్తా’’ అని నిర్మల అన్నారు. ‘‘ గత 12 ఏళ్లుగా భారతీయ ఆర్థికపథం స్థిరంగా ముందుకు సాగుతోంది. స్థిర అభివృద్ధిని సాధిస్తోంది. ద్రవ్యోల్బణం మధ్యస్తంగా ఉంది. అత్యధిక అనిశ్చితి, అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా మేం తీసుకున్న నిర్ణయాల వల్లే భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలకు జై కొట్టాం. ప్రజోపయోగ పథకాలపై పెట్టుబడులు పెడుతూనే ఆర్థిక వివేకం ప్రదర్శించాం. ఆత్మనిర్భరతను మదిలో నిలుపుకుని దేశీయ తయారీరంగ సామర్థ్యాన్ని ఇనుమడింపజేశాం. ఇంధన భద్రతకు పట్టంకట్టాం. దిగుమతులపై ఆధారపడే తత్వం నుంచి కాస్తంత దూరం జరిగాం’’ అని ఆమె అన్నారు. 

డెరివేటివ్‌ మార్కెట్లో ఎస్‌టీటీ పన్ను పెంపు
అత్యాశకు పోయి పెట్టుబడులను పోగొట్టుకొనే మదుపరులను అప్రమత్తంచేసే లక్ష్యంతో డెరివేటివ్‌ మార్కెట్లో సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ పన్ను(ఎస్‌టీటీ)ని కాస్తంత పెంచామని నిర్మల చెప్పారు. తాజా బడ్జెట్‌లో ఎస్‌టీటీని ప్రస్తుతమున్న 0.02 నుంచి 0.05 శాతానికి పెంచారు. ‘‘ నేనేం డెరివేటివ్‌ ట్రేడింగ్‌కు వ్యతిరేకం కాదు. చిన్న మదుపరులు పెట్టుబడులను నష్టపోవద్దనే సదుద్దేశంతోనే ఎఫ్‌ అండ్‌ ఓ మార్కెట్లో పన్నులను పెంచాం’’ అని నిర్మల పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement