సందర్శనలకు అనుమతించనున్న రాష్ట్రపతి భవన్
మార్చి 31వ తేదీ వరకు అవకాశం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ఆవరణలోని అమృత్ ఉద్యాన్ను ప్రజల సందర్శన కోసం మంగళవారం నుంచి తెరవనున్నారు. భీమ్, అర్జున్, మదర్ థెరెస్సా తదితర 145 వెరైటీల గులాబీ లు సహా వేలాది రకాల ఫల, పుష్ప జాతులను ఉచితంగా చూసే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఉచితంగా బుక్ చేసుకోవచ్చని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రెస్ సెకట్రరీ నవికా గుప్తా శనివారం మీడియాకు వెల్లడించారు.
సందర్శన వేళలివే..
ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. వారంలో ఆరు రోజులపాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించుకోవచ్చు. అయితే, చిట్టచివరి ఎంట్రీకి సాయంత్రం 5 గంటల వరకే అవకాశం ఉంటుందని గుప్తా వివరించారు. నిర్వహణ సంబంధ పనుల కోసం ప్రతి మంగళవారం ఉద్యాన్ను మూసివేస్తామని, అలాగే హోలి పండుగను పురస్కరించుకుని 4వ తేదీన సందర్శకులను అనుమతించమన్నారు.
ఆన్లైన్లో స్లాట్ బుకింగ్..
ఈ ఏడాది సందర్శకులు ఆన్లైన్లో https:// visit.rashtrapatibhavan.gov.in/. ద్వారా ముందుగానే స్లాట్లను బుక్ చేసుకుకోవాల్సి ఉంటుందని నవికా గుప్తా చెప్పారు. తర్వాతి రోజు సందర్శన కోసం ముందు రోజు ఉద యం 10 గంటల్లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నార్త్ అవెన్యూ, రాష్ట్రపతి భవన్ మధ్యన గల ప్రెసిడెంట్ ఎస్టేట్ 35వ నంబర్ గేటు ద్వారా సందర్శకుల రాకపోకలకు ఏర్పాట్లు చేశామని ఆమె వివరించారు. సందర్శకుల కోసం ప్రతి 30 నిమిషాలకు సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి 35వ నంబర్ గేట్ వరకు షటిల్ బస్సు సౌకర్యం ఉందన్నారు. చివరి షటిల్ బస్ సర్వీసు సాయంత్రం 4 గంటలకు ఉంటుందని చెప్పారు.
ఏమేం చూడొచ్చునంటే..
బాల వాటిక, ప్లుమెరియా గార్డెన్, బన్యన్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, బాబ్లింగ్ బుక్, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్లను సందర్శించుకునేందుకు అవకాశ ముంది. వందలాది రకాల గులాబీలతో పాటు తులిప్లను చూడొచ్చని నవికా గుప్తా అన్నారు. సందర్శకులు ఇక్కడ గలగల పారే సెలయేరు(బాబ్లింగ్ బ్రూక్)ను, అందంగా తీర్చిదిద్దిన బన్యన్ గార్డెన్లో పాదాల ఒత్తిడి చికిత్సకు అనువైన నడక దారులు (రిఫ్లెక్సా లజీ పాథ్స్)ను కూడా చూడొచ్చని ఆమె వివరించారు. ఈ ఏడాది అమృత్ ఉద్యాన్ కోసం 85 పుష్ప జాతులను ఎంపిక చేశామని ఉద్యాన్ ఇన్ఛార్జి అవనీశ్ బన్సల్ తెలిపారు. అమృత్ ఉద్యాన్తోపాటు రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ మ్యూజియంలను వారంలో ఆరు రోజులపాటు మంగళవార నుంచి ఆదివారం వరకు చూడొచ్చు. అదేవిధంగా, ప్రతి శనివారం జరిగే ఛేంజ్ ఆఫ్ గార్డ్ వేడుకను కూడా తిలకించే అవకాశముంది.
వీటిని వెంట ఉంచుకోవచ్చు
సందర్శకులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ తాళం చెవులు, పర్సులు, హ్యాండ్బ్యాగులు, వాటర్ బాటిళ్లు, శిశువుల కోసం పాల బాటిళ్లను వెంట తెచ్చుకోవచ్చని చెప్పారు. ఉద్యాన్ లోపల వివిధ పాయింట్లలో తాగు నీరు, టాయిలెట్లు, ప్రాథమిక చికిత్స సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. అదేవిధంగా, రక్షణ శాఖ సిబ్బంది కోసం మార్చి 3న, సీనియర్ సిటిజన్ల కోసం మార్చి 5న, మహిళలు, గిరిజన స్వయం సహాయక బృందాల మహిళల కోసం మార్చి 10న, దివ్యాంగుల కోసం మార్చి 13వ తేదీన సందర్శనలకు ప్రత్యేకించామన్నారు.


