దేశ చరిత్రలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రిగా రికార్డు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ వరుసగా తొమ్మిది బడ్జెట్లను సమర్పించలేదు. మొరార్జీ దేశాయ్ మొత్తంగా 10 బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పటికీ అవి వివిధ కాలాల్లో చోటుచేసుకున్నవే. ఆయన 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించారు. తిరిగి 1967–1969 మధ్య నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
మాజీ ఆర్థిక మంత్రులైన పి.చిదంబరం తొమ్మిది, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లు సమర్పించారు. అది కూడా వివిధ ప్రధాన మంత్రుల కాలంలో. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ 1991 నుంచి 1995 వరకు ఆర్థిక మంత్రిగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ సారథ్యంలో వరుసగా తొమ్మిదో బడ్జెట్తో రికార్డు సృష్టించనున్నారు. 2019లో కేంద్రంలో రెండోసారి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీతారామన్ మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె చేతుల మీదుగానే బడ్జెట్ ప్రయాణం సాగిపోతోంది. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్తో కలిపి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను అందించారు.
⇒ స్వాతంత్య్రానంతరం మొదటి బడ్జెట్ను 1947 నవంబర్ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి
సమర్పించారు.
⇒ అత్యధిక సమయంపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన ఆర్థిక మంత్రి రికార్డు నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించారు.
⇒ అతితక్కువ బడ్జెట్ ప్రసంగం 1977 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా హీరూభాయ్ ముల్లిజ్భాయ్ పేరిట ఉంది. కేవ లం 800 పదాలతో ఆయన బడ్జెట్ ప్రసంగం ముగించారు.
⇒ ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మోదీ సర్కారు 2017 నుంచి ఫిబ్రవరి 1కి మార్చింది.


