సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాలన, పరిశ్రమల అభివృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామన్నారు. ఈ క్రమంలో యూనియన్ బడ్జెట్ 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు.
పాలన- ప్రజా సేవలు.. ఏఐ అనువర్తనాలు “ఫోర్స్ మల్టిప్లయర్స్”గా పనిచేస్తాయని.. సేవల అందజేతలో సమర్థత పెరుగుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆరోగ్యరంగం, వ్యవసాయం, సామాజిక సంక్షేమ పథకాలలో AI వినియోగం ద్వారా లక్ష్యబద్ధత పెరిగి.. లీకేజీలు తగ్గుతాయని అంచనా వేశారు.
రంగాల వారీగా AI వినియోగం చూసుకుంటే..
డిజిటల్ పాలన: మోసాల గుర్తింపు, కంప్లయెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం.
విద్య: వ్యక్తిగతీకరించిన లెర్నింగ్ ప్లాట్ఫారమ్లు
ఆరోగ్య రంగం: డయాగ్నస్టిక్స్, టెలీమెడిసిన్ విస్తరణ.
వ్యవసాయం: పంట దిగుబడుల అంచనా, వాతావరణ సూచనలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం..
ఇండియా AI మిషన్ విస్తరణ.. పరిశ్రమ వర్గాలు ఇండియా AI మిషన్కు కేటాయింపులను రూ.2,000 కోట్ల నుంచి కనీసం రూ.5,000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా.. జాతీయ కంప్యూట్ సామర్థ్యం (GPUలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపు), స్టార్టప్లు, పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం అవసరమైన కంప్యూటింగ్ వనరులు (GPUలు, క్లౌడ్ సర్వర్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటర్లు) తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునేలా ప్రభుత్వం లేదా సంస్థలు క్రెడిట్లు/సబ్సిడీలు ఇవ్వడం.. అందుబాటులో ఉండే AI ప్రయోగశాలలు (labs) ఏర్పాటు చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వనరులు, సాంకేతికత, శిక్షణ, పరిశోధన అవకాశాలను అందరికీ సమానంగా అందించడం ఉన్నాయి.
AI స్టార్టప్లకు ప్రోత్సాహకాలు.. AI స్వీకరణ ఖర్చు తగ్గించేందుకు పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలని సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. తక్కువ ఖర్చుతో కంప్యూట్ వనరులు, స్పష్టమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భారత్ను గ్లోబల్ AI అభివృద్ధిలో పోటీదారుగా నిలపాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనుకుంటోంది. మొత్తంగా ఏఐని దేశ అభివృద్ధి, పరిశ్రమల పోటీ, ప్రజా సేవల సమర్థత కోసం ప్రధాన సాధనంగా ప్రభుత్వం గుర్తించినట్లు ఈ బడ్జెట్తో అర్థమవుతోంది.


