జమ్మూలో ఘోరం | Jammu And Kashmir: An Army Vehicle Fell Into Gorge In Doda District | Sakshi
Sakshi News home page

జమ్మూలో ఘోరం

Jan 22 2026 2:57 PM | Updated on Jan 23 2026 6:02 AM

Jammu And Kashmir: An Army Vehicle Fell Into Gorge In Doda District

లోయలోకి పల్టీకొట్టిన ఆర్మీ వాహనం

10 మంది సైనికుల దుర్మరణం

11 మందికి గాయాలు

బందేర్వాహ్‌/జమ్మూ: ఉగ్రవ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న 10 మంది సైనికులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జ మ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లాలోని భందేర్వాహ్‌–ఛంబా అంతర్రాష్ట్ర రహదారిలో 9,000 అడుగుల ఎత్తయిన ఖన్నీ పర్వత ప్రాంతంలో సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భారత ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

విషయం తెల్సిన వెంటనే సైన్యం, పోలీసులు అన్వేషణ, సహాయక చర్యలను ఆరంభించారు. 200 అడుగుల లోతైన లోయలో పడిపోయిన వాహనం నుంచి నలుగురు సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 17 మంది సైనికులను ఎలాగోలా పైకి తీసుకొచ్చి ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సైనిక వాహనం చాలా ఎత్తు నుంచి పల్టీలు కొడుతూ లోయలో పడటంతో ఎక్కువ మంది చనిపోయారని అదనపు డిప్యూటీ కమిషనర్‌ సుమిత్‌ భుత్యాల్‌ వెల్లడించారు. 

అసలేమైంది?
ఖన్నీ పర్వతం మీద ఉన్న ఆర్మీ పోస్ట్‌కు చేరుకునేందుకు పలువురు సైనికులు గురువారం మధ్యాహ్నం అత్యంత అధునాతన ‘క్యాస్పిర్‌’ ఆర్మీ వాహనంలో బయల్దేరారు. రహదారిలో పాతిపెట్టిన మందుపాతరలు, శక్తివంత పేలుడు పదార్థాలు(ఐఈడీ)లను గుర్తించే, ఉగ్రవాదుల తుపాకీ గుళ్ల వర్షాన్ని సైతం తట్టుకోగల బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనంగా ‘క్యాస్పిర్‌’ పేరొందింది. గురువారం అననుకూల వాతావరణంలో వెళ్తున్న సమయంలో డ్రైవర్‌ చేతుల్లోంచి వాహనం అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని జమ్మూ కేంద్రంగా పనిచేసే వైట్‌నైట్‌ కోర్‌ బలగం తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టింది.

దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని
సైనికుల వీరమరణం ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘డోడా ఘటన అత్యంత విచారకరం. సాయుధ బలగాల్లో అత్యంత ధైర్యవంతులను కోల్పోయాం. దేశసేవలో ప్రాణాలు కోల్పోయిన మీ త్యాగాలను జాతిజనులు సదా గుర్తుంచుకుంటారు’’ అని ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తన ఆకాంక్ష తెలియజేశారు. గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికార యంత్రాంగానికి ప్రధాని సూచించారు.  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం

Advertisement
 
Advertisement
Advertisement