వికసిత్‌ భారత్‌కు రోడ్‌మ్యాప్‌ | PM Narendra Modi lauds Nirmala Sitharaman Union Budget 2026 | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌కు రోడ్‌మ్యాప్‌

Feb 2 2026 2:42 AM | Updated on Feb 2 2026 2:42 AM

PM Narendra Modi lauds Nirmala Sitharaman Union Budget 2026

‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్‌. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్‌. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ అనే పేరుతో 140 కోట్ల మంది భారతీయులు సంతృప్తి చెందడం లేదు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగాలని కోరుకుంటున్నారు. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, పెట్టుబడి వ్యయాన్ని పెంచడం, అధిక వృద్ధిని సాధించడమే ధ్యేయంగా బడ్జెట్‌ రూపుదిద్దుకుంది. ఇది భారతీయుల సమ్మిళిత సంకల్పం. విశ్వసనీయ ప్రజాస్వామ్య భాగస్వామిగా, విశ్వసనీయ నాణ్యమైన ఉత్పత్తుల సరఫరాదారుగా భారత్‌ పాత్ర మరింత విస్తరిస్తుంది.

యువతకు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్‌ను రూపొందించారు. ఈ చరిత్రాత్మక బడ్జెట్‌ యువత ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మహిళల సాధికార స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. గ్రామాల సంక్షేమం, పేదలు, రైతుల అభివృద్ధి కోసం చక్కటి బడ్జెట్‌ను తీసుకొచ్చిన నిర్మలా సీతారామన్, ఆమె     బృందానికి నా అభినందనలు. వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉంది. అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్‌ ఒక రహదారి. వికసిత్‌ భారత్‌–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం.

మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి  రోడ్‌మ్యాప్‌గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్‌ నుంచి గ్లోబల్‌ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన చర్యలతో ‘అభివృద్ధి చెందిన భారత్‌’ దిశగా మన ప్రయాణం వేగవంతమవుతుంది. ఏ దేశానికైనా ప్రజలే అతిపెద్ద బలం. అందుకే ప్రజల్లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు పెంచడానికి   కృషి చేస్తున్నాం. యువశక్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తాజా బడ్జెట్‌తో వేర్వేరు కీలక  రంగాల్లో నాయకులు, నూతన ఆవిష్కరణలు తయారు కాబోతున్నారు. క్రీడా రంగంలో యువతకు నూతన అవకాశాలు దక్కబోతు న్నాయి.

మన దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పన్ను మినహా యింపులు ప్రకటించాం. దేశంలో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టికి  మరింత ప్రోత్సాహం లభిస్తుంది. మహిళల సారథ్యంలోని స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుంచి మరింత మద్దతు దక్కుతుంది. ప్రతి జిల్లాలో బాలికల కోసం కొత్త హాస్టళ్లు రాబోతున్నాయి. దాంతో వారి విద్యాభ్యాసం మరింత మెరుగవుతుంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమలు ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలే. కొబ్బరి, జీడిపప్పు, కోకోవా, చందనం రైతులకు బడ్జెట్‌లో ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించాం’’     – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement