సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున ఆటవిక పాలనను వైఎస్సార్సీపీ, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బుధవారం ఆ పార్టీ నేతల బృందం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రమాసుబ్రమణ్యంను కలిసి అరాచక పాలన గురించి ఆధారాలతో సహా వివరించింది.
తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను, అలాగే.. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో తమ కార్యకర్త మందా సాల్మన్ రాజును టీడీపీ శ్రేణులు ఎలా హత్య చేశాయో మానవ హక్కుల సంఘం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. టీడీపీ నేతలు తమ పార్టీ వాళ్లను ఎలా చంపాలని చూశాయో తెలియజేస్తూ.. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన ముందు ఉంచింది. ఫిర్యాదును స్వీకరించిన చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.


ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను కలిసిన బృందంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, తనూజా రాణి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ , ఎమ్మెల్సీఅరుణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీజూపూడి ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. టీడీపీ చేస్తున్న దాడుల పైన దర్యాప్తు చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరాం. టీడీపీ దాడులపై దర్యాప్తు చేసేందుకు చైర్మన్ అంగీకరించారు. డీజీపీ ద్వారా నివేదిక తెప్పించుకుంటానని అన్నారు. త్వరలోనే దర్యాప్తు కమిటీ రాష్ట్రానికి వస్తుందని భావిస్తున్నాం. చంద్రబాబు అనే నరహంతకుడు ప్రజల్ని చంపేస్తున్నారు. ఈ ఆటవిక పాలన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని కేంద్రాన్ని కోరుతున్నాం.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో దళితుల పైన దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలను మానవ హక్కుల సంఘానికి వివరించాం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల పైన పెట్రోల్ బాంబులు వేసి చంపేయాలని చూశారు. దళితులపై దాడులు ఏమాత్రం జరుగుతున్న పట్టించుకోవడం లేదు.
మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ.. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థ పనిచేయడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అందుకే జాతీయ మానవ హక్కుల సంఘం ఆశ్రయించాం. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు, హత్యలు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరాం. డీజీపీ ద్వారా నివేదిక తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది.
మందా సాల్మన్ రాజు సోదరుడు మాట్లాడుతూ.. మాలాంటి దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మా గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని వేడుకుంటున్నాం. మానవ హక్కు సంఘానికి నివేదిక ఇచ్చాం.


