మోస్ట్‌ వాంటెడ్‌ నిందితులను పట్టిచ్చిన ‘రోబో’ | robot helps police catch most wanted criminals | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ వాంటెడ్‌ నిందితులను పట్టిచ్చిన ‘రోబో’

Feb 4 2026 10:13 AM | Updated on Feb 4 2026 11:44 AM

robot helps police catch most wanted criminals

 విశాఖపట్నం: రైల్వే స్టేషన్‌ అంటేనే నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఒక జనసముద్రం. ఆ రద్దీలో సామాన్య ప్రయాణికులను, మారువేషంలో తిరిగే నేరగాళ్లను వేరు చేసి చూడటం మానవమాత్రులకు కత్తిమీద సామే. కానీ.. ఆధునిక సాంకేతికత తోడైతే అసాధ్యం సుసాధ్యమని ‘రైల్‌ రోబోకాప్‌ – ఏఎస్‌సీ అర్జున్‌’ నిరూపించింది. సోమవారం నిశ్శబ్దంగా సాగిపోతున్న రాత్రి వేళ, ప్లాట్‌ఫారంపై తన గస్తీని కొనసాగిస్తున్న ఈ రోబో రూపంలోని కృత్రిమ మేధస్సు ఒక్కసారిగా అప్రమత్తమైంది.

 దాని డిజిటల్‌ కళ్లు రద్దీలో ఉన్న ప్రతి ముఖాన్ని నిశితంగా స్కాన్‌ చేస్తుండగా, ఇద్దరి వ్యక్తుల ముఖకవళికలు తన డేటాబేస్‌లోని ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితాతో సరిపోలాయి. కనురెప్పపాటు కాలంలోనే ఆ రోబో తన విశ్లేషణను పూర్తి చేసి, కంట్రోల్‌ రూమ్‌కు ప్రమాద హెచ్చరికలను పంపింది. అప్పటివరకూ సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రోబో పంపిన నిక్కచ్చి సమాచారంతో ఆరీ్పఎఫ్‌ ఎస్‌ఐ వి. కీర్తిరెడ్డి నేతృత్వంలోని బృందం, క్రైమ్‌ ప్రివెన్షన్‌ డిటెన్షన్‌ స్క్వాడ్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఎటు నుంచి ముప్పు వస్తుందో ఊహించలేక ఆ ఇద్దరు అనుమానితులు తచ్చాడుతుండగానే, పోలీసులు వారిని చుట్టుముట్టారు. ప్రాథమిక తనిఖీలో వారి వద్ద కనీసం టికెట్లు కూడా లేకపోవడం అధికారుల అనుమానాన్ని బలపరిచింది.

అయితే అసలు సంచలనం వారి గతాన్నితవ్వినప్పుడు బయటపడింది. పట్టుబడిన హడప శివ, జె. బంగారు సాధారణ దొంగలు కాదని, రాయగడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, దాడులు, డకాయిటీలతో భీభత్సం సృష్టించిన గజదొంగలని తేలింది. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ నేరగాళ్ల ఆటను ‘ఏఎస్‌సీ అర్జున్‌’ తన ఏఐ మేధస్సుతో కట్టిపడేసింది. ఈ చారిత్రాత్మక విజయంపై డీఆర్‌ఎం లలిత్‌ బోరా స్పందిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించడంలో ఏఐ సాంకేతికత ఒక తిరుగులేని ఆయుధమని ప్రశంసించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement