● గ్రీన్ ఆయుష్ ఎండీ పులి రాజేష్
చింతపల్లి: మన్యం ముఖచిత్రాన్ని మార్చిన కాఫీ తోటల్లో ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం పడుతోంది. సాధారణంగా కాఫీ గింజలతో కాఫీని తయారు చేస్తారు, కానీ ఇకపై కాఫీ ఆకులతోనూ కాఫీ పొడిని తయారు చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టినట్లు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, గ్రీన్ ఆయుష్ ప్రైవేట్ కంపెనీ ఎండీ పులి రాజేష్ తెలిపారు. ఆదివారం ఆయన చింతపల్లి మండలంలోని పలు కాఫీ తోటలను సందర్శించి, రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
అంతర్జాతీయ వేదికపై గుర్తింపు
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. గత ఏడాది దుబాయ్లో నిర్వహించిన ఆర్గానిక్ నేచురల్ ఎక్స్పో సదస్సులో కాఫీ ఆకులతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించగా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ వినూత్న ప్రాజెక్టుపై పేటెంట్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.
గిరి రైతులకు అదనపు ఆదాయం
కాఫీ గింజలతో పాటు ఆకులను కూడా ఎగుమతి చేయగలిగితే గిరిజన రైతులకు మరింత గుర్తింపుతో పాటు అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వివరాలను త్వరలోనే కలెక్టర్కు వివరించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో కంపెనీ ప్రతినిధులు రజాక్, కనకారావు తదితరులు పాల్గొన్నారు.


