Alluri Sitarama Raju District News
-
‘హనీట్రాప్’ కేసులో నిందితుడు అరెస్ట్
అల్లిపురం: హనీ ట్రాప్ పేరుతో ఆన్లైన్ మోసా లకు పాల్పడుతున్న నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించా రు. ఆర్థిక ఇబ్బందులు, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ అలవాటు కారణంగా త్వరగా డబ్బు సంపాదించాలని భావించిన నిందితుడు అన్నపురెడ్డి సాంబశివరావు ‘సంధ్యారాణి’, ‘కావ్య’ పేర్లతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించాడు. విశాఖపట్నా నికి చెందిన 62 ఏళ్ల వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న నిందితుడు మాయమాటలు చెప్పి తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని నమ్మించి, దశలవారీగా రూ.5.20 లక్షలను తన ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఆ డబ్బును ఆన్లైన్ బెట్టింగ్కు వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని హైదరాబాద్లోని బోడుప్పల్, ఫిర్జాదిగూడకు చెందిన సాంబశివరావుగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
స్నానానికి దిగి గిరిజన కూలీ మృతి
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలపాతం (హనుమరాయి) వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒక గిరిజన కూలీ ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోతంగి పంచాయతీ అంత్రిగుడ గ్రామానికి చెందిన కొర్ర సొంబ్రు (41) అనే గిరిజనుడు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... సొంబ్రు మండల కేంద్రంలోని ఒక చికెన్ దుకాణంలో రోజువారీ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం దుకాణంలో పని ముగించుకుని ఆయన తన స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో చాపరాయి గెడ్డకు ఆనుకుని ఉన్న హనుమరాయి వద్ద స్నానం చేయడానికి నీటిలోకి దిగాడు. అక్కడ విధుల్లో ఉన్న జలవిహారి సిబ్బంది దీనిని గమనించి, ఆయనను వారించేలోపే సొంబ్రు హఠాత్తుగా కాళ్లు జారి నీటి ప్రవాహంలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే జలవిహారి సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కేంద్రమైన పాడేరు నుంచి వచ్చిన ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సా యంతో గాలింపు చర్యలు చేపట్టి, సొంబ్రు మృతదేహాన్ని వెలికితీశారు. కన్నీరుమున్నీరు సంఘటనా స్థలానికి చేరుకున్న సొంబ్రు కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. దివ్యాంగురాలైన భార్య, చిన్న పిల్లలు ఉన్న ఆ కుటుంబానికి సొంబ్రు ఒక్కడే ఆధారం. సంపాదించే వ్యక్తి ఇలా అకస్మాత్తుగా అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధితుడి కుటుంబ పరిస్థితిని చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ సురేష్ తెలిపారు. చాపరాయి జలపాతం వద్ద ప్రమాదం మృతదేహాన్ని వెలికితీసిన ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం యజమానిని కోల్పోవడంతో దయనీయ స్థితిలో కుటుంబం -
జైల్లో కంప్యూటర్ మాస్టర్
ఐఐటీ ప్రొఫెసర్ఆరిలోవ: విధి ఆడే వింత నాటకంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో ఊహించడం కష్టం. బయటి ప్రపంచంలో వందలాది మంది మేధావులను, ఐఐటీ ఇంజనీర్లను తీర్చిదిద్దిన ఓ ప్రొఫెసర్.. క్షణికావేశంలో చేసిన నేరానికి ఖైదీ దుస్తులు ధరించి, జైలు నాలుగు గోడల మధ్య తోటి ఖైదీలకు కంప్యూటర్ పాఠాలు చెబుతున్నాడు. విశాఖ కేంద్ర కారాగారంలో వెలుగుచూసిన ఈ ఆసక్తికర ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ శిక్షణ ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ చరిత్రలోనే తొలిసారిగా.. ఖైదీల కోసం ‘ఆఫీస్ అసిస్టెంట్’ పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణ కోర్సును జైలు అధికారులు, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ గురువారం ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2018 నుంచి నిలిచిపోయిన నైపుణ్య శిక్షణలు, సుమారు 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ ప్రారంభం కావడం ఒక విశేషమైతే.. గంజాయి కేసుల్లో చిక్కుకుని జీవితాలను పాడుచేసుకుంటున్న యువ ఖైదీలకు మాత్రమే (ప్రస్తుత బ్యాచ్లో 30 మంది) ఈ రెండు నెలల ప్రత్యేక శిక్షణ ఇస్తుండటం మరో విశేషం. గురువుగా మారిన ఐఐటీ ప్రొఫెసర్ అయితే..ఈ శిక్షణ కేంద్రంలో అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వీరికి కంప్యూటర్ నైపుణ్యాలు నేర్పిస్తున్న శిక్షకుడు బయటి నుంచి వచ్చిన వ్యక్తి కాదు.. ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒక తోటి ఖైదీయే కావడం. ఆయన సామాన్యుడు కాదు.. ఇంజనీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేసి, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఐఐటీ మద్రాస్’లో ప్రొఫెసర్గా పనిచేసిన మేధావి. చైన్నెకి చెందిన ఈయన ఓ కేసు వ్యవహారంలో పదేళ్ల జైలు శిక్షకు గురయ్యారు. చైన్నె జైలు నుంచి ఎనిమిది నెలల క్రితమే బదిలీపై విశాఖ కేంద్ర కారాగారానికి వచ్చారు. ప్రతిభను గుర్తించిన అధికారులు సాధారణంగా ఇలాంటి కోర్సులకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలే ఇన్స్ట్రక్టర్లను పంపుతాయి. కానీ అత్యవసరంగా ఈ బ్యాచ్ ప్రారంభించాల్సి రావడంతో, జైల్లోనే ఉన్న ఈ ఐఐటీ ప్రొఫెసర్ ప్రతిభను జైలు సూపరింటెండెంట్ ఎం. మహేష్ బాబు, డిప్యూటీ సూపరింటిండెంట్ సీహెచ్. సూర్యకుమార్ గుర్తించారు. గంజాయి కేసుల్లో పడి జీవితాన్ని కోల్పోతున్న యువతలో మార్పు తెచ్చేందుకు ఈయన విద్యార్హత, అనుభవం దోహదపడతాయని భావించి, ఆయననే శిక్షకుడిగా నియమించారు. జైలు నిబంధనల ప్రకారం లోపల పరిశ్రమల్లో పనిచేసే నైపుణ్యం గల ఖైదీలకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని ఈ ప్రొఫెసర్కు కూడా చెల్లించనున్నారు. కలెక్టర్ ఆశ్చర్యం.. అభినందనలు ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్.. ఈ పీహెచ్డీ ఖైదీ ప్రొఫెసర్ గురించి, ఆయన నేపథ్యం గురించి ఆరా తీసి ఆశ్చర్యానికి లోనయ్యారు. జైలులో ఉంటూ కూడా తోటి ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విద్యాబోధన చేస్తున్న ఆయనను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. -
విత్తన గండం
ఆకు పోసే వేళ..● నాడు గాదెల్లో ‘సంప్రదాయ’ వైభవం ● నేడు పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు ● కూటమి ప్రభుత్వంలో అన్నదాతను వేధిస్తున్న ప్రణాళికలోపం ● ఏపీ సీడ్స్ అనాలోచిత సరఫరా ● ఫలితంగా పది కిలోలు వృథా ● వ్యవసాయశాఖ కోరుతున్నా పట్టించుకోని వైనం కొయ్యూరు: మూడు దశాబ్దాల కిందటి వరకు మన్యంలో వ్యవసాయం ఒక సంప్రదాయ వైభవం. విత్తనాల కోసం రైతు ఏనాడూ ప్రభుత్వం వైపో, ప్రైవేటు దుకాణాల వైపో చూసింది లేదు. పంట చేతికి రాగానే తదుపరి సీజన్ కోసం రైతులే నేరుగా విత్తనాలను సిద్ధం చేసుకుని, ఎలుకలు, పురుగులు పట్టకుండా గాదెల్లో భద్రపరుచుకునేవారు. కానీ, కాలక్రమేణా మార్కెట్ విత్తనాలు అందుబాటులోకి రావడం, సొంతంగా విత్తనోత్పత్తి చేసే పద్ధతులు మరుగైపోవడంతో అన్నదాతల పరిస్థితి ఇటు సొంతంగా తయారు చేసుకోలేక.. అటు ప్రభుత్వం పూర్తిగా సరఫరా చేయలేక.. దారుణంగా తయారైంది. ఏటా సీజన్ ప్రారంభంలో విత్తనాల కొరతతో జిల్లావ్యాప్తంగా రైతాంగం అల్లాడిపోతోంది. వ్యవసాయశాఖ సూచించినా.. జిల్లాలోని విత్తన కొరతకు, అధికారుల ప్రణాళికా లోపానికి కొయ్యూరు మండలంలో ఉన్న పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ మండలంలో ఏటా ఏడు వేల ఎకరాలకు పైగా వరి సాగవుతుండగా.. వ్యవసాయ శాఖ మాత్రం నాలుగు వేల ఎకరాలకు సరిపడా విత్తనాలను మాత్రమే అందుబాటులోకి తెస్తోంది. అంటే కనీసం 50 శాతం రైతులకు కూడా ఈ విత్తనాలు చాలడం లేదు. ● నిజానికి ఎకరా వరి సాగుకు 20 కిలోల విత్తనాలు సరిపోతాయి. కానీ ఏపీ సీడ్స్ సంస్థ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 30 కిలోల బస్తాలను సరఫరా చేస్తోంది. 20 కిలోల బస్తాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ అధికారులు కోరుతున్నా ఏపీ సీడ్స్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీనివల్ల రైతులు ఎకరాకు 20 కిలోలు వేయాల్సింది పోయి 30 కిలోలు చల్లుతున్నారు. ఫలితంగా ఒక్కో ఎకరాకు.. అర ఎకరాకు సరిపడా (10 కిలోలు) విత్తనాలు వృథా అవుతున్నాయి. ఈ అనాలోచిత విధానం వల్ల కొందరు రైతులకు విత్తనాలు ఎక్కువవుతుంటే, మరికొందరికి అసలు దక్కని పరిస్థితి ఏర్పడింది. బయోమెట్రిక్ తప్పనిసరితో.... రైతుల అవస్థలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు రైతులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టాయి. గత ఏడాది వరకు ఈ–క్రాప్లో నమోదైన వివరాలు, పట్టాదారు పాస్ పుస్తకం చూపిస్తే విత్తనాలు ఇచ్చేవారు. కానీ ఈసారి వీటికి తోడు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేశారు. మన్యంలో నెట్వర్క్ సమస్యల వల్ల బయోమెట్రిక్ పడక ఎంతోమంది రైతులు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీనికి తోడు.. వచ్చే సబ్సిడీ విత్తనాలను కూడా ఒకటి లేదా రెండు ఎకరాలు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐటీడీఏ పీవో గారు స్పందించండి.. ఇది కేవలం కొయ్యూరు మండల సమస్య మాత్రమే కాదు.. పాడేరు, అరకు, చింతపల్లితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది. ఆకుమడులు పోసే సమయం ఆసన్నమవుతున్నా విత్తనాల కొరత వేధిస్తోంది. ఇప్పటికై నా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ తక్షణమే స్పందించి, జిల్లావ్యాప్తంగా విత్తనాల కోటాను పెంచాలని, కొయ్యూరుకు అదనంగా కనీసం మరో మూడు టన్నుల విత్తనాలనైనా సరఫరా చేయాలని, అలాగే ఏపీ సీడ్స్ నుంచి 20 కిలోల బస్తాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మన్య ప్రాంత రైతాంగం డిమాండ్ చేస్తోంది. 50 శాతం మందికి దక్కని రాయితీ..ప్రభుత్వం వరి విత్తనాలపై 90 శాతం రాయితీ ఇస్తుండటంతో గిరిజన రైతులు వీటి కోసం ఎగబడుతున్నారు. అయితే కోటా సగం మందికే సరిపోతుండటంతో మిగిలిన 50 శాతం మంది రైతులు విత్తనాల కొరతతో అల్లాడుతున్నారు. కొయ్యూరు మండలంలో ప్రైవేటు ఎరువులు, విత్తనాల షాపులు లేకపోవడంతో, విత్తనాల కోసం రైతులు ఇతర మండలాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. అటు సబ్సిడీ లేక, ఇటు రవాణా ఖర్చులు భరించలేక గిరిజన రైతులకు కన్నీరే మిగులుతోంది. విత్తనాల కోటా పెంచాలని మొరపెట్టుకుంటున్నా..రాయితీ నెపంతో అధికారులు పరిమితులు విధిస్తున్నారు. వరి రైతులకు తప్పని సాగు కష్టాలుఅందరికీ విత్తనాలు ఇవ్వాలి మండలంలో వరి పండించే గిరిజన రైతులు అందరికీ రాయితీ విత్తనాలు అందేలా చూడాలి. కేవలం కొద్దిమంది రైతులకే విత్తనాలు ఇచ్చి, మిగిలిన వారిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతమాత్రం సరికాదు. క్షేత్రస్థాయిలో అన్నదాతలు పడుతున్న బాధలను అధికారులు అర్థం చేసుకోవాలి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయ శాఖ తక్షణమే విత్తనాల ఇండెంట్ను పెంచి, ప్రతి రైతుకూ పూర్తి స్థాయిలో విత్తనాలు సరఫరా చేయాలి. – బి. రమేష్బాబు, ఎంపీపీ, కొయ్యూరుసరిపడా విత్తనాలు ఇస్తాం జిల్లాలోని రైతులకు సరిపడా విత్తనాలు అందిస్తాం. ప్రస్తుతానికి జిల్లా కోసం 10 వేల క్వింటాళ్ల విత్తనాలకు ఇండెంట్ పెట్టాం. ఒకవేళ ఇవి చాలకపోతే అదనపు కోటా కోసం తిరిగి ఇండెంట్ పెడతాం. ఇప్పటికే ఆయా రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు సరఫరా అవుతున్నాయి. అయితే, మేము 10, 20 కిలోల బ్యాగుల రూపంలో విత్తనాలు ఇవ్వాలని ఏపీ సీడ్స్ సంస్థను కోరుతున్నా.. వారు మాత్రం 30 కిలోల బస్తాలనే ఇస్తున్నారు. దీనివల్ల విత్తనాలు వృథా అవుతున్నాయి. అదే 10 కిలోల బ్యాగ్ ఉంటే అర ఎకరా రైతుకు, 20 కిలోల బ్యాగ్ ఉంటే ఎకరా రైతుకు కచ్చితంగా సరిపోయేలా పంపిణీ చేసే అవకాశం ఉండేది. – నందు, జిల్లా వ్యవసాయ అధికారి, పాడేరు. -
అక్రమ నిర్మాణం
దుప్పితూరు ఆలయ భూముల్లో అచ్యుతాపురం రూరల్: కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఏపీఐఐసీ అధికారులు శుక్రవారం ఆలయ భూమిలో దౌర్జన్యంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఏపీఐఐసీ అభివృద్ధి పేరిట తీసుకున్న భూముల్లో దుప్పితూరులో చేనేతల ఆరాధ్య దైవమైన భద్రావతీ భావనాఋషి ఆలయ భూములు కూడా ఉన్నాయి. 22 ఏళ్లుగా ఆలయ భూమికి అధికారులు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. దాంతో స్వామివారికి నిత్య ధూప, దీప నైవేద్యాలు, ఏటా కళ్యాణ మహోత్సవాలు కమిటీ సభ్యుల సహకారంతోనే జరుపుకుంటూ వస్తున్నారు. ఏపీఐఐసీ అధికారులు ఇక్కడ గ్రామం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీలో దేవస్థానం సంబంధించిన సర్వే నంబరు 275/1, 276/3లో ఎ.0.79 సెంట్ల భూమిలో ఇనుప కంచె వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రావతీ దేవస్థానం గ్రామ కమిటీ అధ్యక్షుడు మాడెం సూరిఅప్పారావు, ఆలయ కమిటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం కోర్టు నుంచి ఆదేశాలు సంబంధిత శాఖల అధికారులకు వచ్చాయి. వాటిని బేఖాతరు చేస్తూ స్టేటస్ కో ఉన్న భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై దేవస్థాన కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం నుంచి వచ్చిన ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా, సంబంధిత ఆలయ భూమిలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా అక్రమ ప్రహరీ నిర్మాణానికి కొమ్ముకాయడం ఏంటని ప్రశ్నించారు. వారిపై ఉన్నత న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్న ఏపీఐఐసీ అధికారులు -
వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు
బుచ్చెయ్యపేట: తీవ్ర ఎండల దృష్ట్యా ఏ గ్రామంలోనూ ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి డీఎంహెచ్వో హైమావతి ఆదేశించారు. శుక్రవారం ఆమె వడ్డాది మేజర్ పంచాయతీలోని ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. ఇక్కడ రికార్డులను, రోగుల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు(ఈహెచ్ఆర్), అభయకార్డుల నమోదు తీరును పరిశీలించారు. గ్రామాల్లో వడదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే తక్షణ వైద్య సేవలు అందించాలని సూచించారు. ల్యాబ్ను, మందులు, పేషెంట్లు గదులను తనిఖీ చేశారు. డాక్టర్ మాధవి, ఎంపీహెచ్ఓ మోజేష్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీను పాల్గొన్నారు. డీఎంహెచ్వో హైమావతి -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
కశింకోట: స్థానిక జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఎస్ఐ లక్ష్మణరావు అందించిన వివరాలు.. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు స్థానిక కూడలిలో ఆగి ఉన్న బ్రాండిక్స్ ఉద్యోగుల వ్యాన్ను ఢీకొంది. దీంతో ఆ వ్యాన్ రోడ్డు దాటడానికి బైక్పై సిద్ధంగా ఉన్న బయ్యవరం గ్రామానికి చెందిన షేక్ న్యామతుల్లా (65)ను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన షేక్ న్యామతుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. అనకాపల్లి మండలం వేట జంగాలపాలెం నుంచి అచ్యుతాపురం వద్ద బ్రాండిక్స్ పరిశ్రమలో విధులకు వెళ్లడానికి వ్యాన్లో ప్రయాణిస్తున్న అదే గ్రామానికి చెందిన బండి లక్ష్మి, కొడాలి సత్యవతి, రూప, కుమార్ గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన న్యామతుల్లా మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం జరిపించి, కేసు నమోదు చేసి సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణమైన పశ్చిమ బెంగాల్కు ఖాళీగా వెళుతున్న బస్సును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ చెప్పారు. న్యామతుల్లా కూరగాయలు కొనుగోలు కోసం కశింకోటకు వస్తూ రోడ్డు దాటుతుండగా ప్రమాదంలో మృతి చెందాడు. -
కోరుకొండ ఘాట్లో ప్రమాదం
చింతపల్లి: ఎస్ఆర్ పైప్లైన్ పనుల నిమిత్తం పెద్ద లారీపై తరలిస్తున్న జేసీబీ ప్రమాదవశాత్తు ఘాట్ రోడ్డులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో జేసీబీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బలపం పంచాయతీ ఇటుకబెడ్డలు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రం దామన్జోడి నుంచి చింతపల్లి మండలం బలపం పంచాయతీ మీదుగా ఎస్ఆర్ పైప్లైన్ ద్వారా ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ రెండవ పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టడానికి ఇటుకబెడ్డలు గ్రామ సమీపంలో పైపులు, ఇతర సామగ్రిని నిల్వ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పనుల నిర్వహణ కొరకు విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి ఒక జేసీబీని పెద్ద లారీపై ఎక్కించి ఇక్కడికి తరలిస్తున్నారు. లారీ బలపం పంచాయతీ పరిధిలోని కోరుకొండ – చెరువూరు గ్రామాల మధ్య గల ఇటుకబెడ్డలు ఘాట్ రోడ్డు మలుపుల వద్దకు చేరుకోగానే.. లారీపై ఉన్న జేసీబీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ డి. రమేష్కు తలకు, చేతికి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని హుటాహుటిన కోరుకొండ పీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే రమేష్ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో, అక్కడ నుంచి చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. లోయలో పడిన జేసీబీ డ్రైవర్కు తీవ్ర గాయాలు విశాఖ తరలింపు పైప్లైన్ పనుల కోసం తరలిస్తుండగా ప్రమాదం -
గల్లంతైన గిరిజనుడి మృతదేహం లభ్యం
పెదబయలు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దుమత్స్యగెడ్డ వంతెన సమీపంలో గల్లంతైన గిరిజన రైతు వంతాల నాగేశ్వరరావు (35) మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. మునిగిపోతున్న తన ఇద్దరు చిన్నారులను ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చిన ఆయన.. ఆ తర్వాత ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతవడం తెలిసిందే. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు నాటు పడవల సహాయంతో రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడటంతో గాలింపు నిలిపివేయాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం తిరిగి గాలింపు ప్రారంభించగా.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వంద అడుగుల దూరంలో, వంతెన కింద నాగేశ్వరరావు మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం అంబులెన్స్లో ముంచంగిపుట్టు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మాకు దిక్కెవరు? విలపించిన మృతుని భార్య పిల్లల ప్రాణాలు కాపాడి, తన ప్రాణాలను అర్పించిన నాగేశ్వరరావు ఉదంతం కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. భర్త మృతదేహాన్ని చూసి భార్య ఈశ్వరమ్మ బోరున విలపించింది. వ్యవసాయం, కూలి పనులు చేస్తూ ఆయనే మా కుటుంబాన్ని, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. పిల్లలకు ప్రాణదానం చేసి ఆయన వెళ్లిపోయాడు.. ఇప్పుడు మా కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయాం. మాకు దిక్కెవరు?.. అంటూ కంటతడి పెట్టింది. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని, పిల్లల చదువులను ఆదుకోవాలని ఆమె వేడుకుంది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో స్థానిక ఎంపీటీసీ కిమంకరి బొంజుబాబు, మాజీ సర్పంచ్ పలాసి మాధవరావు ఉన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని వారు కోరారు. -
విశాఖ కొండలకు గుండు కొడుతున్న కూటమి
కొమ్మాది: నగరంలో అనేక చోట్ల కొండలను గుండులుగా మార్చి కూటమి ప్రభుత్వం ప్రకృతికి విఘాతం కలిగిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు మెరవ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిమ్మాపురం కొండపై నిర్మిస్తున్న యూనిటీ మాల్ ప్రాంతాన్ని పార్టీ ఐటీ వింగ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు విస్మరించి ఈ ప్రాంతంలో యూనిటీ మాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో రుషికొండ ప్రభుత్వ భవనాల నిర్మాణ సమయంలో పర్యావరణ విధ్వంసం జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కూటమి నాయకులు, అదే ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ వింగ్ కార్యదర్శి గీతారెడ్డి, నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు తాలూరి అశోక్, అనీల్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ముంచంగిపుట్టు సీహెచ్సీకిఅరుదైన గౌరవం
● రాష్ట్రస్థాయిలో అత్యధిక ప్రసవాలు ● ఉత్తమ ఆస్పత్రిగా గుర్తింపు ● ఉన్నతాధికారుల నుంచిప్రశంసాపత్రం ముంచంగిపుట్టు: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా, సురక్షితంగా ప్రసవాలు చేసిన ఉత్తమ ఆసుపత్రిగా నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర హెల్త్ సెకండరీ డైరెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు వైద్యులు, సిబ్బంది ప్రతిభను కొనియాడుతూ శుక్రవారం ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని ఆసుపత్రికి పంపించారు. గిరిజన ప్రాంతంలో రికార్డు స్థాయిలో ప్రసవాలు నిర్వహించి, గర్భిణులకు అండగా నిలిచినందుకు గాను ఈ పురస్కారం లభించింది. వైద్యులు, సిబ్బంది సామూహిక కృషి.. సూపరింటెండెంట్ ధరణి ఈ సందర్భంగా సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి మాట్లాడుతూ... ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ గర్భిణులకు అందించిన నాణ్యమైన సేవలకు దక్కిన ప్రతిఫలమే ఈ పురస్కారమని హర్షం వ్యక్తం చేశారు. ప్రసవాల సమయంలో సిబ్బంది తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలు, అంకితభావం వల్లే మారుమూల ప్రాంతంలోనూ అత్యధిక ప్రసవాలు చేయడం సాధ్యపడిందని ఆమె వివరించారు. రాష్ట్ర స్థాయి ప్రశంసా పత్రం లభించడం తమకెంతో ఆనందాన్ని ఇస్తోందని, భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆమె పేర్కొన్నారు. సీహెచ్సీకి ఈ గౌరవం దక్కడంపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు వైద్యాధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. -
వేళాపాళా లేకుండా విధులకు హాజరు
ఉదయం 11.20 గంటలకు ఖాళీగా ఉన్న మండల సర్వేయర్, ఆర్ఐల కుర్చీలుఉదయం 11.15 గంటలకు తాళం వేసి ఉన్న మండల పౌర సరఫరాల శాఖ కార్యాలయంఅనకాపల్లి: మండల స్థాయి అధికారులు వేళాపాళా లేకుండా విధులకు హాజరవుతున్నారు. కార్యాలయాల్లో వీరు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనులపై వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సరైన సమాచారం లేక కొంతమంది తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రధానంగా అనకాపల్లిలో పౌర సరఫరాల శాఖ మండల కార్యాలయం శుక్రవారం ఉదయం 11.15 గంటల వరకు తెరచుకోలేదు. 11.45 గంటలకు సీఎస్డీటీ తాపీగా వచ్చి తాళం తీసి కార్యాలయాన్ని తెరిచారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్, ఆర్ఐ గదులకు తాళాలు తీసి ఉన్నప్పటికీ ఉదయం 11.20 గంటల వరకు ఖాళీగానే కుర్చీలు దర్శనమిచ్చాయి. తహసీల్దార్ ఉదయం 10 గంటలకు వచ్చినప్పటికీ మండల సర్వేయరు, ఆర్ఐ లేకపోవడం గమనార్హం. ఆయా అధికారులు సాయంత్రం సమయంలో రావడంతో వివిధ పనులపై వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా లైట్లు వెలుగుతుండగా, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు విద్యుత్ పొదుపు చర్యలు చెప్పినప్పటికీ నిర్లక్ష్యం వృథా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. -
జీవీఎంసీలో ఎస్సీ రోస్టర్ అమలు చేయాలి
ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాండాబాగార్డెన్స్: జీవీఎంసీలో ఎస్సీ సామాజిక వర్గానికి రాజ్యాంగం కల్పించిన 22 శాతం రోస్టర్ను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మతో కలిసి రిజర్వేషన్లు, పదోన్నతులు, కాంట్రాక్ట్ పనుల కేటాయింపులపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ ఉద్యోగుల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేయాలంటూ జీవీఎంసీ ఎస్సీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. సీతారాం మాట్లాడుతూ ఎస్సీల ఆర్థికాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు, కాంట్రాక్ట్ పనుల్లో వారికి తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. ఇంజినీరింగ్ పనుల కేటాయింపుల్లో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందన్న ఫిర్యాదులు కమిషన్ దృష్టికి వచ్చాయని తెలిపారు. రూ.9 కోట్ల విలువైన పనుల్లో కేవలం రూ.20 లక్షల పనులు మాత్రమే ఎస్సీ వర్గానికి కేటాయించడంపై అధికారులను ప్రశ్నించారు. ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన 22 శాతం నిధులు, పనులు తప్పనిసరిగా కేటాయించాలని స్పష్టం చేశారు. ఎస్సీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
జోలాపుట్టు, డుడుమ వెలవెల
● అడుగంటిన నీటిమట్టాలు ● మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తిపై ప్రభావం నీటి నిల్వలు తక్కువగా ఉన్న జోలాపుట్టు జలాశయంపూర్తిగా అడుగంటిన జోలాపుట్టు స్పిల్వే జలాశయంముంచంగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ప్రధాన ఆధారమైన డుడుమ, జోలాపుట్టు జలాశయా ల్లో ఈ ఏడాది నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. నిత్యం జలకళతో కలకలలాడే ఈ జలాశయాలు, ప్ర స్తుతం నీరు లేక వెలవెలబోతూ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జోలాపుట్టులో ఉన్న ఒడిశా పరిధిలోని స్పిల్వే జలాశయం పూర్తిగా అడుగంటిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలోని జలాశయంలో మా త్రమే కొంతమేర నీటి నిల్వలు ఉన్నాయి. జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా.. శుక్రవారం నాటికి అది 2,707 అడుగులుగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజున ఇక్కడ నీటి మట్టం 2,729 అడుగులుగా ఉండటం గమనార్హం. అంటే గత ఏడాదితో పోల్చితే ఈసారి ఏకంగా 22 అడుగుల నీటి నిల్వ తక్కువగా ఉంది. మరోవైపు, డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,590 అడుగులు కాగా.. ప్రస్తుతం అక్కడ 2,582 అడుగుల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఎండ తీవ్రత పెరగడం, ఎగువ నుంచి ఇన్–ఫ్లో తగ్గడంతో నీటి మట్టాలు వేగంగా పడిపోతుండటం పట్ల అధికారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చెరువు ఆక్రమణలు తొలగించకుండా పనులా?
మాడుగుల రూరల్: మాడుగుల పాండవుల చెరువులో ముందుగా ఆక్రమణలు తొలగించి, అభివృద్ధి పనులు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడారు. ఇక్కడ చెరువు ఆక్రమణలపై గత నెల 27వ తేదీన కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై దర్యాప్తు చేయకుండా అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. మోదమాంబ గుడి సమీపంలో సర్వే నంబరు 258లో 11 ఎకరాలు 50 సెంట్లు పాండవుల చెరువు ఉందన్నారు. ఈ చెరువు కబ్జా బాగోతం బయటపడకుండా ఎమ్మెల్యే సహకారంతో కూటమి నాయకులు అభివృద్ధికి పూనుకున్నారన్నారు. మానస సరోవరం పేరుతో నాబార్డు మంజూరు చేసిన రూ. 50 లక్షలతో కొంతమేర అభివృద్ధి చేసినట్లు చూపించి, కొంత మొత్తం నిధులు పంచుకోవడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. దీనిపై తహసీల్దారు, ఇతర ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చెరువు ఆక్రమణలు తొలగించకుండా పనులు చేపట్డడం సరికాదన్నారు. ఆక్రమణలు తొలగించే వరకు స్థానికులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వెంకన్న, మండల కార్యదర్శి నర్సింహమూర్తి -
సాంకేతిక నైపుణ్య రథం
● మారుమూల ప్రాంతాల విద్యార్థుల్లో ప్రతిభకు తోడ్పాటు ● ప్రాచీన విద్యా నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ అచ్యుతాపురం రూరల్: మన సంస్కృతీ సంప్రదాయాల్నీ, దేశంలో దాగి ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని విద్యార్థులకు తెలియజేయడంలో ‘సైన్స్ అండ్ ఇండిజినస్ టెక్నాలజీ ఆన్ వీల్స్’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన బస్సులో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యటించి 70కి పైగా పాఠశాలల్లో 50 వేలకుపైగా విద్యార్థులను చైతన్య వంతులను చేస్తున్నారు. ఈ బస్సు లోపల భాగంలో ప్రాచీన స్వదేశీ విద్యా విధానంలో గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, పంచాంగం, పురావస్తు వ్యవస్థ, సాంప్రదాయ ఆహారం, ఆయుర్వేదం, లోహశాస్త్రం, వాస్తు శాస్త్రం, సేంద్రియ వ్యవసాయం, విద్యుత్ ఉత్పాదన వంటి చార్టులు, పరికరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్నతమైన విద్యా విధానం పెంపొందించడంలో బస్సులో ఉండే పరికరాలు ఆకర్షితులను చేస్తున్నాయి. వైదిక గణిత బోధనంలో రేఖా చిత్రాల ప్రదర్శనలు నిపుణుల ద్వారా సరళమైన పద్ధతిలో గణిత బోధనలు తెలియజేస్తున్నారు. ఖగోళ శాస్త్రంలో పంచాంగ వికాసం, గ్రహణాలు ఏర్పడే విధానం, ఉదయిస్తున్న సూర్యుని స్థానంలో వచ్చే మార్పులను వివరిస్తున్నారు. భారతీయ ప్రాచీన కళ, సాంస్కృతిక వ్యక్తీకరణాలను, వారసత్వ వాస్తు శిల్పాలు ప్రదర్శిస్తున్నారు. చేతి వృత్తులు అనగా చేనేత వస్త్రాల తయారీ, మట్టి కుండలు, లోహాలతో పనిముట్లు తయారీ విధానం తెలుసుకోవచ్చు. ప్రాచీన కాలంలో విద్యుత్ ఉత్పత్తిని వీచే గాలి, బయోగ్యాస్ ద్వారా తయారు చేసే విధానాన్ని తెలియపరుస్తున్నారు. దేశీయ ఆరోగ్య విధానంలో మూలికలు, సుగంధ ఔషధ మొక్కలు, ప్రకృతి వైద్యం ఆరోగ్య సంరక్షణ విధానాలపై అనుభవపూర్వక అభ్యాసాలపై వివరణ కల్పిస్తున్నారు. -
ఇంధన పొదుపుప్రతి ఒక్కరి బాధ్యత
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వినూత్నంగా స్పందించారు. శుక్రవారం ఆయన తన సొంత వాహనాన్ని పక్కన పెట్టి, అరకులోయ నుంచి హుకుంపేట వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించారు. మార్గమధ్యంలో బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తుతున్న తరుణంలో ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలంతా ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని, అత్యవసరమైతేనే సొంత వాహనాలను రోడ్డుపైకి తీయాలని ఆయన కోరారు. -
పోరాటంలో భాగస్వాములు కావాలి
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పిలువు చింతపల్లి: విద్యుత్ సబ్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (ఇఈయూ) నాయకులు సత్యనారాయణ కోరారు. గురువారం చింతపల్లి సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు ఆయన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. హక్కుల సాధనకై సాగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లాలో నూతనంగా జరగబోయే తొలి మహాసభలను అందరూ విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జి.సత్యనారాయణ, చంద్రశేఖర్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యగెడ్డ కాదు.. మృత్యుగెడ్డ!
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు పెదబయలు: చేపల వేటకు వెళ్లి, నీటిలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఒక తండ్రి.. తాను మాత్రం గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైన హృదయవిదారక ఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని సీతగుంట పంచాయతీ ముసిడిపుట్టు గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావు (35) గురువారం ఉదయం గుత్తులపుట్టు వారపు సంతకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తన కుమారుడు వంతాల వరుణ్, మేనల్లుడు పసుపుల సాత్విక్లను వెంటబెట్టుకుని పెదబయలు సమీపంలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మత్స్యగెడ్డ వంతెన వద్దకు వెళ్లారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం వైపు నుంచి గెడ్డలోకి దిగి వలతో చేపలు పడుతున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో చిన్నారులిద్దరూ గెడ్డ ఒడ్డున దిగి ఈత కొడుతుండగా, ఒక్కసారిగా లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోసాగారు. గమనించిన నాగేశ్వరరావు తక్షణమే స్పందించి, ప్రాణాలకు తెగించి వారిద్దరినీ పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే, పిల్లలను కాపాడే క్రమంలో ప్రవాహ వేగానికి నాగేశ్వరరావు నీటిలో మునిగిపోతూ గల్లంతయ్యాగు. పిల్లల అరుపులు విని కొంత దూరంలో చేపలు పడుతున్న మిగతా వారు వచ్చేసరికే నాగేశ్వరరావు నీటిలో కొట్టుకుపోయాడు. ప్రమాద సమాచారం తెలియడంతో భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది. లభ్యం కాని ఆచూకీ మత్స్యగెడ్డలో గల్లంతైన నాగేశ్వరరావు కోసం స్థానికులు నాటు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహం లభ్యం కాలేదు. చీకటి పడటంతో ప్రస్తుతానికి గాలింపు నిలిపివేశారు. ప్ర మాద స్థలాన్ని స్థానిక తహసీల్దార్ త్రినాథరావు నా యుడు, ఎంపీడీవో శ్యాంసుందర్, డీటీ రంగారా వు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి సమాచారం తీసుకెళ్లామని అధికారులు తెలిపారు. తరచూ ప్రమాదాలు.. పెదబయలు మత్స్యగెడ్డలో తరచూ ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల 12వ తేదీన సీకరి పంచాయతీ పన్నెడ గ్రామానికి చెందిన ముగ్గు రు చిన్నారులు ఈతకు వెళ్లి ఇదే మత్స్యగెడ్డలో మునిగి మృత్యువాత పడ్డారు. ఆ ఘటన మరవక ముందే మరో వ్యక్తి గల్లంతు కావడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వేసవిలో గెడ్డలో నీరు తగ్గడంతో గిరిజనులు చేపల వేటకు ఎక్కువగా వెళ్తుంటారని, అధికారులు కేవలం ప్రమాదాలు జరిగినప్పు డే కాకుండా, ముందస్తుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇద్దరి ప్రాణాలు నిలిచాయన్న ఆనందం ఆ కుటుంబంలో క్షణం కూడా నిలవలేదు.. కాపాడిన వ్యక్తే కళ్ల ముందే కొట్టుకుపోతుంటే ఆ చిన్నారుల ఆర్తనాదాలు మత్స్యగెడ్డ తీరాన్ని కన్నీరు పెట్టించాయి. -
నాగలి కదిలింది!
మన్యంలో ఖరీఫ్ సాగుకు గిరిజన రైతులు ముందస్తుగా సన్నద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూములు పదును అవ్వడంతో పెదబయలు మండల వ్యాప్తంగా వేసవి దుక్కులు జోరందుకున్నాయి. దీనివల్ల దుక్కుల వల్ల భూసారం పెరగడమే కాకుండా, చీడపీడల నివారణ జరిగి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని అటు రైతులు, ఇటు వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెదబయలు: మన్యంలో వేసవి దుక్కులు జోరందుకున్నాయి. చీడపీడల నివారణకు ఈ దుక్కులు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లో పంటల సాగుకు వేసవి దుక్కులు అనివార్యమని వారు భావిస్తున్నారు. ● జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు భూమి మెత్తబడడంతో, రైతులు ఒక్కసారిగా పొలాల్లో నాగలి పట్టారు. వేసవి దుక్కుల వల్ల భూసారం పెరిగి, తద్వారా పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నారు. దీంతో గిరిజన రైతులు ఖరీఫ్ పంటల సాగుకు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. ఆశాజనకంగా దిగుబడి మండలంలో వరి, రాగులు, సామలు, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటల సాగు కోసం రైతులు వేసవి దుక్కులు చేస్తున్నారు. వేసవి దుక్కి వల్ల మట్టి వదులుగా మారుతుందని, తద్వారా భూమికి నీటిని పీల్చుకునే (ఇంకే) శక్తి పెరుగుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల మొక్కల వేళ్లు భూమిలోకి బలంగా పాతుకుంటాయని వివరించారు. ● మరోవైపు వేసవి దుక్కుల వల్ల భూమిలోని తెగుళ్ల అవశేషాలు, కీటకాలు, పురుగుల గుడ్లు, లార్వాలు ఎండ తీవ్రతకు చనిపోతాయని రైతులు పేర్కొంటున్నారు. దీనివల్ల తెగుళ్ల సంతతి తగ్గి, కలుపు నివారణ జరిగి పంట దిగుబడి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాసటగా ఆర్బీకేలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా మండల వ్యవసాయ అధికారులు గ్రామాల్లో కల్పించిన అవగాహన వల్లే తాము ప్రతి ఏటా వేసవి దుక్కులు చేస్తున్నామని గిరిజన రైతులు చెబుతున్నారు. ముందస్తు దుక్కులతో మేలు మన్యంలో ఎక్కువ శాతం పంటలు వర్షాధారంపైనే పండుతాయని, అందుకే ముందే వేసవి దుక్కులు చేసి పెట్టుకుంటే తొలి వర్షాలు పడగానే విత్తనాలు వేసుకోవడానికి వీలుంటుందని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల పంట ఏపుగా ఎదుగుతుందని, అలాగే వేసవి దుక్కుల తర్వాత పొలంలో పశువుల ఎరువును పలుచగా చల్లి పంట వేస్తే మరింత నాణ్యమైన దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
కలెక్టర్తో అరకు ఎంపీ భేటీ
పాడేరు: కలెక్టర్ టి.నిశాంతితో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నిశాంతిని ఆమె తొలిసారిగా కలిసి జిల్లాలోని పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధానంగా తాగునీటి సమస్య అధికంగా ఉందని, ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల నేటికీ డోలీ మోతల సమస్యలు తీరలేదని, మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే తన ఎంపీ లాడ్స్ నిధులతో జిల్లాకు కేటాయించిన అంబులెన్స్లను సక్రమంగా వినియోగించాలని, ఏవైనా మరమ్మతులు తలెత్తితే వాటిని తక్షణమే బాగు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అధికారులు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా పారదర్శక పరిపాలన అందించాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎంపీ భర్త, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్ ఉన్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ
వివరాలు సేకరించిన పాడేరు డీఎల్పీవో కుమార్కొయ్యూరు: బూదరాళ్ల పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వచ్చిన ఫిర్యాదులపై ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, తక్షణమే నివేదిక సమర్పించాలని పాడేరు డీఎల్పీవో పీఎన్ కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన బూదరాళ్ల పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గరిమండ గ్రామానికి చెందిన పరమేశ్వరరావు, శివ తదితరులు పంచాయతీలో సుమారు రూ.80 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ జేసీ తిరుమణి శ్రీపూజకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె విచారణకు ఆదేశిస్తూ.. డీఎల్పీవోను విచారణ అధికారిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన బూదరాళ్ల సచివాలయంలో ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. డీఎల్పీవో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా పంచాయతీలో నిర్వహిస్తున్న రికార్డులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. రూ.82.19 లక్షల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈలు ఫిర్యాదుదారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తారని తెలిపారు. ఇందులో తాగునీటి పథకాల కోసం ఖర్చు చేసిన రూ.47 లక్షలు, క్లాప్ మిత్రల వేతనాలు, ఇతర పనులకు కేటాయించిన రూ.5 లక్షలతో పాటు మిగిలిన నిధుల వ్యయంపై పూర్తిస్థాయిలో పరిశీలన జరుగుతుందన్నారు. పది రోజుల్లో ఈ నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని చెప్పారు. ఈ విచారణలో పూర్వ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రస్తుత కార్యదర్శి కృష్ణ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, పంచాయతీని అభివృద్ధి చేసిన వారిపై రాజకీయ ఉద్దేశాలతో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటూ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విచారణాధికారి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. -
మండుతున్న మన్యం
కొయ్యూరులో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చింతపల్లి: మన్యంలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. గురువారం కొయ్యూరు మండలంలో అత్యధికంగా 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ విభాగం నోడల్ అధికారి, స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రాంతీయ పరిశోధనా సంచాలకులు (ఏడీఆర్) డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. కొయ్యూరులో 40.8, అరకువ్యాలీలో 37.5, చింతపల్లిలో 36.7, అనంతగిరిలో 36.4, ముంచంగిపుట్టులో 33.5, పెదబయలులో 32.6 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. మైదాన ప్రాంతాల తరహాలోనే ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో మధ్యాహ్నం వేళల్లో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏడీఆర్ పేర్కొన్నారు. -
31 నుంచి రాకాసమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు
చింతపల్లి: ఆంధ్రా కాశ్మీర్గా పేరొందిన లంబసింగిలో శ్రీ రాకాసమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగుతాయని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.మూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను, భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ తీర్థ మహోత్సవాలకు మన్యం ప్రాంతం నుంచే కాకుండా మైదాన ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై, జాతరను జయప్రదం చేయాలని వారు కోరారు. -
పంప్డ్ స్టోరేజీ నిర్వాసితుల పునరావాసంపై సమగ్ర నివేదిక
ఏపీ జెన్కో అధికారులకు జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశం సీలేరు: నూతనంగా నిర్మించనున్న 1350 మెగావాట్ల సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు కల్పించే పునరావాసం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఉపాధి అవకాశాలపై 15 రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. గురువారం సీలేరు వచ్చిన ఆమె.. ప్రాజెక్టు స్టేజ్–2 అటవీ క్లియరెన్స్ అనుమతుల కోసం మార్కింగ్ చేసిన సరిహద్దు ప్రాంతాలను అటవీ, జెన్కో అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక టింబర్ డిపో వద్ద జెన్కో అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూములు, ఖాళీ చేయిస్తున్న గ్రామాల వివరాలు, అక్కడి జనాభా ప్రాతిపదికన ఆర్అండ్ఆర్ ప్యాకేజీని సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్, ఆర్అండ్ఆర్ అధికారులు ఫైనలైజ్ చేసిన నిర్వాసితుల జాబితాను ప్రజల ముందు ఉంచాలని సూచించారు. అనుమానాలు నివృత్తి చేయండి ప్రాజెక్టు నిర్మాణంపై నిర్వాసిత గ్రామాల్లో ఏవైనా అభ్యంతరాలు లేదా అనుమానాలు ఉంటే, అధికారులు నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లి వారితో సమావేశాలు నిర్వహించాలని జేసీ సూచించారు. నిర్వాసితులకు కల్పించే ప్యాకేజీని లిఖితపూర్వకంగా ఇస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. ప్రాజెక్టు వల్ల పూర్తిగా ఖాళీ అవుతున్న పార్వతీనగర్, బూసుకొండ గ్రామస్తులకు ఒకే చోట పునరావాసం కల్పిస్తే.. అక్కడ అంగన్వాడీ, పాఠశాల, తాగునీరు వంటి వసతులు కల్పించడానికి అనుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. నిర్వాసితుల ఉపాధిపై జేసీ ఆరా తీయగా.. ప్రాజెక్టు పనులు ప్రారంభమైన మొదటి రెండేళ్లు నిర్మాణ సంస్థ మెగా కంపెనీలో ఉపాధి కల్పిస్తామని, ఆ తర్వాత ఏపీ జెన్కో ద్వారా నిర్వాసిత కుటుంబంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని జెన్కో సీఈ రాజారావు జేసీకి వివరించారు. ఈ ఉపాధి హామీపై మరోసారి గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ డీఎఫ్వో వైవీ నరసింహారావు, తహసీల్దార్ అన్నాజీరావు, పంప్డ్ స్టోరేజీ ఎస్ఈ సీతారామ్, ఈఈలు బాలకృష్ణ, టి.అప్పలనాయుడు, రేంజ్ అధికారి వెంకటరావు పాల్గొన్నారు. -
దోమల నివారణ మందు పిచికారీకి సహకరించాలి
జి.మాడుగుల: గ్రామాల్లోని ప్రజలు దోమల నివారణకు తమ నివాస గృహాలలో మలేరియా స్ప్రేయింగ్ (పిచికారీ) చేయించుకోవాలని జిల్లా మలేరియా అధికారి తులసి కోరారు. మండలంలోని పెదలోచలి పంచాయతీ మారుమూల గ్రామాలైన లక్కపాడు, కర్జపల్లి, తియ్యమామిడిలలో జరుగుతున్న మలేరియా స్ప్రేయింగ్ పనులను గురువారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో ఎంపిక చేసిన గ్రామాలు, ఇప్పటివరకు పూర్తయిన పిచికారీ పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ పనులను నిర్దేశిత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దోమకాటు వల్ల ప్రబలే ప్రమాదకర వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, దోమల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దోమకాటు నుంచి రక్షణ పొందడానికి ప్రజలు తమ ఇళ్ల లోపల, బయట స్ప్రేయింగ్ చేయించుకునేలా సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అలాగే, రాత్రి సమయాల్లో విధిగా దోమతెరలు వాడాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గ్రామాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను, వైద్య సిబ్బంది పనితీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్సల్టెంట్ శ్రీనివాసరావు, గిరి, మలేరియా సబ్ యూనిట్ అధికారి గెమ్మెలి నీలకంఠంనాయుడు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
పాడేరు: గిరిజన గ్రామాల్లో వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ నిశాంతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో ఆమె వర్చువల్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో తాగునీటి సరఫరాకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్న మారుమూల గ్రామాలను గుర్తించి అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పాడైపోయిన బోర్లు, మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి సమస్యపై పదే పదే ఫిర్యాదులు రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ఉపాధి కూలీల పనివేళల మార్పు వేసవి ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉపాధి కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనివేళలను మార్చినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు నీడతో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. ముఖ్యమైన కూడళ్లు, బస్ షెల్టర్ల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఇంచార్జ్ డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు, డ్వామా పీడీ విద్యాసాగర్రావు, డీఎల్పీవో కుమార్, సీపీవో ప్రసాదరావు, ఏపీఎంఐసీ పీడీ రహీం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కరుణాకర్, ఏడీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనాథ్
పాడేరు రూరల్: ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనాథ్ శ్రీను ఎన్నికవ్వడం పట్ల ఆ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నూతనంగా నిర్వహించిన ఆర్యవైశ్య కుల సంఘం ఎన్నికల్లో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాపై నమ్మకంతో ఈ జిల్లా బాధ్యతలను అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పదవి ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందని, జిల్లాలోని ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ఇకపై మరింత కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన ఎన్నికకు సహకరించిన పెద్దలకు, సంఘ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
● కలెక్టర్ నిశాంతి హెచ్చరిక ● పీజీఆర్ఎస్ వేదికగా 88 అర్జీలు స్వీకరణ ● జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో నిర్వహణ
అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు డుంబ్రిగుడ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి. నిషాంతి అధికారులను హెచ్చరించారు. దరఖాస్తులపై సంబంధిత అధికారులు అర్జీదారులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. వివిధ సమస్యలపై మొత్తం 88 అర్జీలు నమోదయ్యాయి. భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, సరిహద్దు వివాదాలకు సంబంధించి 10, పంచాయతీరాజ్, ఉపాధి హామీ, విద్యుత్, తాగునీరు, రహదారులు, అంగన్వాడీ భవనాలు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి మొత్తం 78 అర్జీలు దాఖలయ్యాయి. గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలి వచ్చిన వినతులపై కలెక్టర్ తక్షణమే స్పందిస్తూ.. ఆయా శాఖల అధికారులు అర్జీదారులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఒకవేళ సాంకేతిక లేదా చట్టపరమైన కారణాల వల్ల సమస్యను తిరస్కరించాల్సి వస్తే.. అందుకు గల కారణాలను ఫిర్యాదుదారునికి స్పష్టంగా వివరించాలని పేర్కొన్నారు. అర్జీదారుల సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించినప్పుడే ఐవీఆర్ఎస్ కాల్స్లో ప్రతికూల స్పందన రాదన్నారు. అధికారులు అర్జీదారులతో సక్రమంగా మాట్లాడకపోవడం, సమస్యలను సరిగ్గా పరిష్కరించకపోవడం వల్లే ఒకే అర్జీ పదేపదే రీ–ఓపెన్ అవుతోందని, ఈ విషయాన్ని అధికారులు గమనించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (ఎఫ్ఏసీ) ఎంవీఎస్ లోకేశ్వరరావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ నీలకంఠరావు, జెడ్పీ సీఈవో సత్యనారాయణ, ఐటీడీఏ ఏపీవోతో పాటు జిల్లా, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండల కేంద్రంలో బుధవారం కలెక్టర్ టి. నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజలు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జల్ సంచయ్ జన్ భాగీదారీ పథకం పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో ఉపాధి హామీ పనుల నిర్వహణలో ముందంజలో ఉన్నందుకు గాను స్థానిక అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈ పర్యటనలో భాగంగా అంతకుముందు మండల కేంద్రంలో నిర్వహించిన ‘స్వచ్ఛ పథం’ కార్యక్రమంలో కలెక్టర్, జేసీలు స్వయంగా పాల్గొన్నారు. చేతుల్లో చీపుర్లు పట్టి వీధులను శుభ్రం చేస్తూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక ఎంపీపీ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో విశ్వనాథ్, తహసీల్దార్ త్రివేణి, ఎంఈవోలు శెట్టి సుందర్రావు, జి. గెన్ను, పంచాయతీ కార్యదర్శులు విజయ్, గౌతమి పాల్గొన్నారు. -
తృప్తి క్యాంటీన్ ప్రారంభం
నర్సీపట్నం: మెప్మా ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేలా 750 తృప్తి క్యాంటీన్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మంజూరు చేసిన రూ.13.75 లక్షల ఆర్థిక సాయంతో మెప్మా ఆధ్వర్యంలో ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లాలో మొట్ట మొదట క్యాంటీన్ ఇదే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, బ్యాంకు మేనేజర్ నాగరాజు, మెప్మా డీపీఎంయూటీఈ సందీప్, డీఆర్సీ రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, టిడిపి పట్టణ అధ్యక్షులు సీహెచ్.రాజేష్,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, జెడ్పీటీసీ సుకల రమణమ్మ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. -
తీరంలో వేసవి సందడి
పరవాడ: మండుతున్న ఎండలతో పాటు వీపరీతంగా వీస్తున్న వడగాల్పులకు మండల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు, ఉక్కపోతతో గ్రామీణ ప్రజలు ఉడుకెత్తిపోతున్నారు. ఓ పక్క తరచూ విద్యుత్ కోతలను అమలు చేస్తుండటంతో ప్రజలు ఇంట్లో ఉండలేని పరిస్థితులతో విసుగెత్తిపోతున్నారు. దీంతో మండల ప్రజలు పిల్లాపాపలతో ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీర ప్రాంతాలకు తరలి వెళ్లి సేదదీరుతున్నారు. సముద్రంలో స్నానాలు చేస్తూ ఉపశమనం పొందుతున్నారు. అగ్నికార్తెల ఆరంభంతో ప్రారంభమైన వేడిగాలులు ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. -
అధినేతతో ఆత్మీయ భేటీ
జగన్మోహన్రెడ్డితో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ముంచంగిపుట్టు: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర బుధవారం కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి జగన్మోహన్రెడ్డిని కలిశారు. పార్టీ అధ్యక్షుడు తమకు ఎంతో విలువైన సమయం కేటాయించి, మాట్లాడడం సంతోషాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు. -
సినిమా పాటకు వన్నె తెచ్చిన సీతారామశాస్త్రి
అనకాపల్లి టౌన్: తెలుగు భాషకు వన్నె తెచ్చే విధంగా అనే రచనలు చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానం పొందారని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. ప్రముఖ గేయ రచయిత పద్మశ్రీ సిరి వెన్నెల సీతారామశాస్త్రి 71 జయంతి సందర్భంగా అనకాపల్లి పట్టణం గాంధీ నగరంలో ఆయన విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్మించనున్న సిరివెన్నెల స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీతారామశాస్త్రి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అద్భుతంగా పాటలు రాసిన ఆయనకు సినీ పరిశ్రమలో అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, చిత్ర పరిశ్రమలో అన్నయ్య అని పిలిచిన ఏకై క వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని అన్నారు. ఆయన పేరు మీద నిర్మిస్తున్న సిరివెన్నెల స్మృతి వనంకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన జ్ఞాపకాలను మరవకుండా ఈ ప్రాంతం నుంచి మరొక సీతారామశాస్త్రి రావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ ఈ ప్రాంతానికి, తెలుగు భాషకు వన్నె తెచ్చిన రచయిత సీతారామశాస్త్రి ఎన్నో ప్రఖ్యాత అవార్డులు అందుకున్నారని చెప్పారు. తెలుగు భాష ఉన్నంతవరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరు ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అనకాపల్లి వాసిగా ఆయనను గౌరవించడం ఆనందం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు -
డిజిటల్ సైన్ రద్దుతో దీక్షలు విరమించిన ఆదివాసీలు
రోలుగుంట: కె.అడ్డసరం, కొంతలం ఆదివాసీల సమస్య పరిష్కారానికి తహసీల్దార్ సెట్టి నాగమ్మ చర్యలు తీసుకున్నారు. వివాదానికి కారణమైన డిజిటల్ సైన్ను రద్దు చేశారు. దీంతో బుధవారం గిరిజనులు దీక్ష విరమించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఐలాజ్ కార్యదర్శి పి.ఎస్.అజయ్ కుమార్, ఆదివాసీల కార్యసాధన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్.కల్యాణ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కె.అడ్డసరం, కొంతలం గ్రామాలకు చెందిన ఆదివాసీలు దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములపై కన్నెసి సొంతం చేసుకోవడానికి ఫోర్జరీ సంతకాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన యలమంచిలికి చెందిన చంద్రశేఖర్ ఒత్తిడితో తహసీల్దార్ కార్యాలయంలో ఒక అధికారి డిజిటల్ డిజటల్ సైను పుణరుద్ధరించారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆదివాసీలు తమకు జరుగుతున్న అన్యాయం, నష్టానికి కారణమైన వెబ్ల్యాండ్ డిజిటల్ సైను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న తహసీల్దార్ కార్యాలయం ఎదుట రీలే దీక్షలు ప్రారంభించారని చెప్పారు. అధికారులు దిగివచ్చి డిజిటల్సైను రద్దు చేశారని వారు తెలిపారు. దీనికి సారధ్యం వహించి, ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ అండగా ఉన్న నల్లి కళ్యాణ్ను అభినందించారు. సమస్య పరిస్కారానికి చర్యలు తీసుకున్న తహసీల్దార్కు ఆదివాసీలు కృతజ్ఞతలు తెలిపారు. -
డెయిరీ నగర్ గిరిజనులకు ఇళ్ల పట్టాలు
చింతపల్లి: చింతపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని డెయిరీ నగర్లో నివాసముంటున్న గిరిజనులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు తక్షణమే పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె మండల కేంద్రం పరిధిలోని డెయిరీ నగర్ గ్రామాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు. గడిచిన కొన్నేళ్లుగా తాము ఈ ప్రాంతంలోనే నివాసముంటున్నప్పటికీ.. నేటికీ ఇళ్ల పట్టాలు లేకపోవడం వల్ల ఎటువంటి ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకోలేకపోతున్నామని, పక్కా ఇళ్లు కూడా మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పాడేరు పీజీఆర్ఎస్ (మీకోసం) వేదికగా జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అర్జీలపై సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్, నేరుగా గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. గ్రామంలో అర్హులైన 39 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేలా సమగ్ర విచారణ జరిపి, పూర్తి స్థాయి నివేదికను తనకు అందజేయాలని తహసీల్దార్ శంకరరావును ఆదేశించారు. అదేవిధంగా, ఈ గ్రామంలోని గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వ్యవసాయ పరంగా అవసరమైన ప్రభుత్వ సహాయ సహకారాలను అందిస్తామని జేసీ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో చింతపల్లి ఆర్ఐ కృష్ణమూర్తి, స్థానిక రెవెన్యూ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
3 చేపల బోట్లపై కేసు నమోదు
ఎస్.రాయవరం: వేట నిషేధం సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళితే బోటు లైసెన్స్ రద్దు చేసి రాయితీలు ఉపసంహరించం జరుగుతుందని నక్కపల్లి ఎఫ్డీవో శృతి హెచ్చరించారు. బంగారమ్మపాలెం మొగ నుంచి గడిచిన కొన్ని రోజులుగా రేవుపోలవరం గ్రామానికి చెందిన మత్స్యకారులు రహస్యంగా చేపల వేటకు వెళుతున్నట్టు గుర్తించామన్నారు. మంగళవారం రాత్రి చేపల వేటకు వెళ్లి తిరిగి వచ్చిన 3 బోట్లను గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. వేట చేసి తీసుకువచ్చిన చేపలను ఎగుమతులకు పాల్పడిన వాహన దారులపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. వేట నిషేధ ప్రకటించాక ఇప్పటి వరకు 18 బోట్లపై కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పుడు వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే ఆ యజమానులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ రాయితీలు వర్తించవని చెప్పారు. -
కలెక్టర్ ‘హెల్మెట్’ బైక్ రైడ్
హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న కలెక్టర్ డుంబ్రిగుడ: రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కలెక్టర్ టి. నిశాంతి స్వయంగా రంగంలోకి దిగారు. ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘హెల్మెట్ తప్పనిసరి’ అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ స్వయంగా హెల్మెట్ ధరించి, ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. పోలీసు శాఖ చేపట్టిన ఈ వినూత్న అవగాహన కార్యక్రమం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. -
సెజ్ పేరిట భూములు కాజేసే కుట్ర
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్నదేవరాపల్లి: మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు అత్యంత కీలకమైన గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూసివేసి, కొత్తగా సెజ్ల పేరిట పేద రైతులు, దళితులు, గిరిజనులు భూములను కాజేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తో సహా టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో రూ. 5వేల కోట్ల పెట్టుబడులతో మాడుగుల నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టిన ఎమ్మెల్యే రైతు ఆధారిత సుగర్ ఫ్యాక్టరీని నడిపించలేక పోయారని పేర్కొన్నారు. పేద గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని, దీనికి రైతులంతా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేవరాపల్లి మండలంలో కొండకొడాబు, సమ్మెద, కొత్తూరు, చింతలపూడి, కోరాడ గ్రామాల్లో అధాని హైడ్రో పవర్ ప్లాంట్ పేరిట 820 ఎకరాలను, చీడికాడ మండలం జి.కొత్తపల్లి, అడవిల అగ్రహారం, చినగోగాడ, బైలపూడి గ్రామాలలో సోలార్ ప్లాంట్ పేరిట 262 ఎకరాలను, కె.కోటపాడు మండలం ఆర్లి, గుల్లేపల్లి, చింతపాలెం, గరుగుబిల్లి గ్రామాల్లో ఎస్ఈజెడ్ పేరు చెప్పి 10,250 ఎకరాలు, మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీలో వీఎంఆర్డీఏ పేరిట 110 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నాయుకులు ఎక్కడ మీటింగ్ పెట్టిన భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని అన్నదాతలు తెగేసి చెబుతున్నా పోలీసులతో రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో సైతం హైడ్రోప్లాంట్ పేరిట బలవంతంగా గిరిజనుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తున్నారన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కంపెనీలు రాకపోయిన భూ బ్యాంక్ పేరిట పేద రైతుల నుంచి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోని ప్రభుత్వం రియల్ఎస్టేట్ వ్యాపారానికి పూనుకుందని విమర్శించారు. ఇప్పటికే సెజ్ పేరిట పరవాడ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేశారని, పచ్చని పంట పొలాలతో నిండి ఉన్న మాడుగుల నియోజకవర్గాన్ని కాలుష్యంతో నింపి సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు నియోజకవర్గంలోని రైతుల పట్ల ప్రేమ ఉంటే ముందుగా సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరిట పేదల భూములను కాజేయాలని చూస్తే సీపీఎం రైతులు, గిరిజనులతో కలిసి ప్రజా ఉద్యమాన్ని చేపట్టి భూములను రక్షించుకుంటామని సీపీఎం నేత వెంకన్న స్పష్టం చేశారు. -
నమ్మకమే జీవం
మారుతున్న కాలంలోనూ చెరిగిపోని సంస్కృతికి, తరతరాల నమ్మకానికి అద్దం పడుతోంది మన్యం. కొయ్యూరు మండలంలోని గిరిజన పల్లెలు ప్రస్తుతం గంగాలమ్మ పండగ వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో.. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని గిరిజనులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ‘జడి’ ప్రక్రియతో మొదలై, గంగాచెల్లి ఆటలు, ఊయల ఉత్సవాలు, పనసకాయ వేట వంటి విభిన్న క్రతువులతో పదిరోజులపాటు వేడుకలు సాగుతాయి. ప్రకృతే దైవం.. విభిన్నం గిరిజన సంస్కృతీ సంప్రదాయంకొయ్యూరు: ఖరీఫ్ సీజన్లో చేపట్టే వ్యవసాయ పనులు సజావుగా సాగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ గిరిజనులు గ్రామగ్రామానా గంగాలమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గంధ అమావాస్య ముగిసిన తర్వాత ఒక్కో గ్రామంలో దాదాపు పది రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. వందల సంవత్సరాల నుంచి గిరిజన మండలాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ పండగలో భాగంగా గ్రామం నుంచి దుష్టశక్తులను పారదోలే ’జడి’ ప్రక్రియ మొదలుకొని, అడవికి వేటకు వెళ్లే వరకు అనేక రకాల క్రతువులను నిర్వహిస్తారు. ఈ పండుగ ముగిసిన తర్వాత గిరిజనులు వినోదాలకు స్వస్తి చెప్పి, తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. దుష్టశక్తులను పారదోలే ‘జడి’ పండగ ఆరంభంలో మొదట మూడు రోజుల పాటు ఘటాలను డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగిస్తారు. ఆ తర్వాత వివిధ రకాల పప్పులను కలిపి వండి, ఆ వంటకాన్ని గంగాలమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ఒక బుట్టలో పూజా సామగ్రీతో పాటు కోడిని ఉంచి, దానిని ఈడ్చుకుంటూ గ్రామ పొలిమేర వరకు తీసుకువెళ్తారు. దీనినే ‘జడి’ అని పిలుస్తారు. గ్రామంలోని దుష్టశక్తులన్నీ పొలిమేర అవతలికే వెళ్లిపోవాలనే నమ్మకంతో అక్కడ ఉన్న చెట్లకు నైవేద్యం సమర్పించి పూజలు చేస్తారు. సాధారణంగా ఆదివారం నాడే ఈ క్రతువును నిర్వహిస్తారు. దీంతో ‘జడి’ ప్రక్రియ ముగుస్తుంది. రాత్రంతా జాగారాలు.. గంగాచెల్లి ఆటలు పండగ ప్రక్రియ ప్రారంభం కాగానే రాత్రి వేళల్లో మహిళలంతా ఒక జట్టుగా ఏర్పడి గంగాచెల్లి ఆట ఆడుతారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండాలనే భావనను చాటిచెప్పేందుకు ఈ ఆటను నిర్వహిస్తూ రాత్రంతా జాగారం చేస్తారు. ఒకవైపు మహిళలు గంగాచెల్లి ఆడుతుంటే, మరోవైపు పురుషులు డప్పుల మోతల మధ్య గంగాలమ్మ తల్లిని స్మరిస్తూ కోలాటం ఆడతారు. ఊయల ఉత్సవం జడి ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రామంలో ఒక పెద్ద ఊయలను ఏర్పాటు చేస్తారు. గ్రామస్తులంతా సంతోషంగా ఉండాలనే ఆకాంక్షతో దీనిని వారం రోజుల పాటు ఉంచుతారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ఊయలపై ఊగుతూ కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతారు. బాణంతో వేట.. ‘గొర్రె’ వేషాలు పండగలో భాగంగా నాలుగో రోజున గ్రామ సమీపంలో ఒక పనసకాయను, చిన్న పందిపిల్లను ఒకే చోట ఉంచి బాణంతో వేటాడుతారు. వింటిబద్దతో వేసిన బాణాలు గురితప్పకుండా తగిలితే, అడవికి వేటకు వెళ్లినప్పుడు కచ్చితంగా జంతువులు దొరుకుతాయని వారి నమ్మకం. జంతువు దొరికే వరకు వారు వరుసగా వేటకు వెళ్తూనే ఉంటారు. వేట దొరకని సమయంలో రాత్రి పూట గ్రామంలో ఒకరు ‘గొర్రె వేషం’ వేస్తారు. డప్పు చప్పుళ్ల మధ్య గొర్రె వేషంలో ఉన్న వ్యక్తిని బాణాలతో వేటాడుతున్నట్లుగా అభినయిస్తారు. ఇక పగటివేళల్లో యువకులు ఒంటికి పసుపు, పేడ నీళ్లు పూసుకుని రోడ్డుపై వెళ్లే వాహనదారుల నుంచి డబ్బులు అడుగుతారు. డబ్బులు ఇచ్చిన వారి వాహనాలపై పసుపు నీళ్లు చల్లి, కుంకుమ బొట్లు పెడతారు. అలాగే తమకు వరసయ్యే వారిపై సరదాగా పసుపు నీళ్లతో పాటు పేడ నీళ్లను కూడా పోస్తూ అల్లరి చేస్తారు. వరుణుడు కరుణించాలని పండగవర్షంపై ఆధారపడిన రైతులు వరుణుడు కరుణ చూపాలని చేసేది గంగాలమ్మ పండగ. గంగ అంటే జలం కావడంతో దాని కోసం ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నిచోట్ల దీనిని ఇటుకల పండగ కూడా పిలుస్తారు. పూర్వీకుల కాలం నుంచి సంస్కృతి ప్రతిబించించేలా ఈ పండగను నిర్వహిస్తున్నారు. కోలాటం, గంగాచెల్లి ఆటలు ప్రత్యేకత సంతరించికున్నాయి. – డీవీడీ ప్రసాద్, సేవా ప్రతినిధి, ధార్మిక సంస్థలు, కొయ్యూరు నాటికి నేటికీ ఎంతో తేడా గంగాలమ్మ పండగ సందర్భంగా పూజలు క్రతువులు బాగానే నిర్వహిస్తున్నారు. అయితే అనేక విషయాల్లో గతంలో మాదిరిగా జరగడం లేదు. గంగాచెల్లి ఆడేందుకు మహిళలు సరిగా రావడం లేదు. ఒకప్పుడు దీని కోసం పోటీ పడేవారు. ఇక కోలాటం కూడా తక్కువగానే నిర్వహిస్తున్నారు. గతంలో పెద్దవాళ్లు ఆడినట్టుగా ఇప్పుడు యువత ఆడలేకపోతుంది. వేటలకు వెళ్లడం తగ్గించేశారు. – పూజారమ్మ, మంప, కొయ్యూరు మండలం -
చోరీ కేసులో మూడేళ్ల జైలు
తుమ్మపాల/రామికమతం: రావికమతం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో చోడవరం కోర్టు నిందితుడికి మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఈ నెల 20న తీర్పు వెలువరించినట్టు ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఒక ప్రకటలో బుధవారం తెలిపారు. ఈ మేరకు కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను, కోర్టులో సమర్ధవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రత్యేకంగా అభినందించారు. గత ఏడాది ఆగస్టు 21న రావికమతం గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు గెంజి దేవి తమ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సుమారు అర తులం బంగారం, 50 తులాల వెండి, రూ.1, లక్ష నగదు దొంగిలించారని రావికమతం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రావికమతం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ కె.ఈశ్వరకుమార్ ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఎం.రఘువర్మ సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో దర్యాప్తు వేగవంతం చేసి విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం, కొత్తపాలెం గ్రామానికి చెందిన నిందితుడైన గొల్లపూడి శ్రీనును అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి చోరీ సొత్తు వెండి, నగదును రికవరీ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. దర్యాప్తు అధికారి నిర్దేశిత సమయంలోనే పకడ్బందీగా చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం చోడవరం ఏజెఎఫ్సిఎం కోర్టు ఇన్చార్జి మేజిస్ట్రేట్ బి.వి.విజయలక్ష్మి ఎదుట నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరిప్రియ దేవరకొండ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చట్టపరమైన వాదనలు వినిపించారు. నేరం పూర్తిగా రుజువు కావడంతో శిక్షను విధించినట్టు ఆయన తెలిపారు. -
విశాఖలో మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
డాబాగార్డెన్స్: ఆంధ్రప్రదేశ్లో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలిచే మూడు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎపెక్స్ కమిటీ(ఎన్ఏసీ), జీవీఎంసీ, గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్సిటీ కార్పొరేషన్లు సంయుక్తంగా అందజేసిన మూడు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. మధురవాడలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు, అదే ప్రాంతంలో 24/7 నిరంతర తాగునీటి సరఫరా, అలాగే నగర వ్యాప్తంగా బల్క్ అండ్ సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థను ఆటోమేషన్ చేయడం.. వంటి మూడు కీలక ప్రాజెక్టులను రూ.1,501.03 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యయంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.375.26 కోట్ల గ్రాంట్ లభించనుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులను యూసీఎఫ్ గ్రాంట్లతో పాటు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణాలు, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకుల టర్మ్ లోన్ల సమ్మిళిత ఆర్థిక నమూనా ద్వారా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా జీవీఎంసీ పరిధిలోని మధురవాడ, ఈస్ట్, భీమిలి జోన్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఆధునిక భూగర్భ మురుగునీటి సౌకర్యం, 24 గంటల తాగునీటి సరఫరా వంటి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు. -
రెండు పరీక్ష కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలు
కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొయ్యూరు: ఈనెల 25 నుంచి జరగనున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి కొయ్యూరు మండలానికి రెండు పరీక్ష కేంద్రాలను మంజూరు చేశారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత, గురుకుల పాఠశాలలో వీటిని ఏర్పాటుచేశారు. ఇదివరకు సప్లిమెంటరీ పరీక్షలు చింతపల్లిలో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో రాయాల్సి వచ్చేది. దీనివల్ల ఇక్కడి నుంచి వెళ్లి రాసేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈ ఏడాది పది ఫలితాలు ఘోరంగా పడిపోవడంతో దాదాపుగా 370 మందికిపైగా విద్యార్థులు పరీక్ష తప్పారు. వీరిలో 329 మంది గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులు కాగా ప్రభుత్వోన్నత పాఠశాల, బాలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వారు మిగిలిన వారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉన్నందున ఈ విషయాన్ని ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ విద్యాశాఖాధికారులు, పీవో, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రెండు పరీక్ష కేంద్రాలను ఉన్నతాధికారులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. -
దాడి చేసి కులంపేరుతో దూషించారని ఫిర్యాదు
కోటవురట్ల: అగ్ర వర్ణానికి చెందిన ఓ వ్యక్తి అకారణంగా తనపై దాడి చేసి కులం పేరుతో దూషించాడని ఓ వృద్ధుడు స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశాడు. వివరాలివి..అన్నవరం గ్రామంలో మాదిగ కులానికి చెందిన పెదపూడి రాంబాబు తన ఇంటి ముందు కుర్చీలో కూర్చుని వుండగా అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన దుబాసి సురేష్ అనే వ్యక్తి అటుగా వస్తూ కులం పేరుతో దూషించి నేను వస్తుంటే కుర్చీలో కూర్చుని వుంటావా అంటూ కర్రతో దాడి చేశాదని, తలకు తీవ్ర గాయం కావడంతో అతని భార్య కేకలు వేయగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారని, అయినా కులం పేరుతూ దూషిస్తూ దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాయానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్టు బాధితుడు తెలిపాడు. తనను కులం పేరుతో దూషించి గాయపరిచినందుకు సురేష్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కేసు వివరాలను ఉన్నతాధికారులకు తెలిపి విచారణ చేస్తామని ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
కేజీహెచ్..
సర్వర్ డౌన్.. రోగులు విల విల.. మహారాణిపేట(విశాఖ): అటు భానుడి భగభగలు.. ఇటు ఊపిరాడని ఉక్కపోత.. ఆపై గంటన్నరపాటు నిలిచిపోయిన ఓపీ సర్వర్! వెరసి విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్) అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగం బుధవారం నరకప్రాయంగామారింది. సాంకేతిక స మస్యల కారణంగా ఓపీచీటీ జారీకి తీవ్ర అంతరా యం కలిగింది. ఎండ వేడిలో ఓపీ కోసం వేచి ఉన్న రోగులు, వారి బంధువులకు చుక్కలు చూపించింది. సర్వర్ పనిచేసిన తర్వాత కూడా రద్దీకి తగ్గట్లు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహా నికిగురైన రోగులు ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. సాంకేతిక లోపాలు.. పేదలకు శాపాలు! కేజీహెచ్లో వైద్య సేవలు పొందాలంటే ‘ఏబీహెచ్ఏ’ యాప్ ద్వారా ఓపీ టిక్కెట్ల జారీని ఆసుపత్రి వర్గాలు తప్పనిసరి చేశాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగుల వద్ద స్మార్ట్ఫోన్లు లేకపోవడం, ఒకవేళ ఉన్నా నెట్వర్క్ సిగ్నల్ అందకపోవడం, ఆధార్ అప్డేట్ కాకపోవడం, వేలిముద్రలు పడకపోవడంతో ఒక్కో టిక్కెట్ జారీకి గంటల సమయం పడుతోంది. దీనికి తోడు బుధవారం ఉదయం నుంచే ఆన్లైన్ సర్వర్ పూర్తిగా మొరాయించడంతో ఎన్నడూ లేని విధంగా ఓపీ కౌంటర్లన్నీ రోగులు, వారి సహాయకులతో కిక్కిరిసిపోయాయి. సర్వర్ పనిచేయకపోవడంతో చేసేదేమీ లేక సిబ్బంది సైతం చేతులెత్తేసి ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. సాధారణం కంటే రెట్టింపు రద్దీ కేజీహెచ్ ఓపీ విభాగంలో నిత్యం సగటున 1200 నుంచి 1300 వరకు టిక్కెట్లు జారీ అవుతుంటాయి. కానీ బుధవారం ఆ సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. కేజీహెచ్ పరిధిలోని 26 విభాగాలకు సంబంధించి క్యాజువాలిటీ వద్ద 3, ఓపీ విభాగంలో 7 కౌంటర్ల ద్వారా మొత్తం 2,589 ఓపీ టిక్కెట్లు, ఆసుపత్రిలో చేరే రోగుల కోసం 120 కే–షీట్లను జారీ చేశారు. ఉదయం 8:30 గంటలకే కౌంటర్లు కిక్కిరిసిపోవడంతో మధ్యాహ్నం 1 గంట వరకు రద్దీ కొనసాగింది. క్యూలైన్లను అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బందికి సైతం పెద్ద తలనొప్పిగా మారింది. ఆన్లైన్ విధానంలో రోగి పేరు, వయస్సు, చిరునామాతో పాటు వెళ్లాల్సిన ఓపీ విభాగాన్ని కూడా టిక్కెట్పై ముద్రించాల్సి రావడంతో మరింత జాప్యం జరిగింది. కౌంటర్లలో సరిపడా ఫ్యాన్లు లేవు! రోగులే కాకుండా కౌంటర్లలో విధులు నిర్వహించే సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఆన్లైన్ కౌంటర్లలో ఏసీ సదుపాయమే కాదు, సరిపడా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది చెమటలు కక్కుతూనే పని చేయాల్సి వచ్చింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత తోడవ్వడంతో రోగుల అసహనం కట్టలు తెంచుకుంది. ఇప్పటికై నా కేజీహెచ్ అధికారులు స్పందించి, సర్వర్ సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. సహాయకులు లేక.. సాధారణంగా కేజీహెచ్కు వచ్చే రోగులకు, వారి బంధువులకు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేయడం, ఆన్లైన్ టిక్కెట్లు తీయడంలో నర్సింగ్ విద్యార్థినులు దగ్గరుండి సహాయం అందిస్తుంటారు. అయితే వేసవి సెలవుల కారణంగా బుధవారం విద్యార్థినులు విధులకు రాలేదు. విద్యార్థినులు రాని పక్షంలో ఆసుపత్రి అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కౌంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. -
విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
అనకాపల్లి: ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ద్వారా విద్యుత్బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు కె.ఎన్.రమేష్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో గేటు వద్ద బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి, నిర్వహించాలన్నారు. సీ్త్ర శక్తి బస్సుల్లో జీరో టికెట్లు ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి, మిగతా ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, సిబ్బందిపై పనిభారం తగ్గించాలని, కొత్త పీఆర్సీ కమిటీని నియమించి, ఐఆర్ను వెంటనే ప్రకటించాలని,పెండింగ్లో ఉన్న డీఏలు, అరియర్స్, లీవ్ ఎన్క్యాష్మెంట్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అరకులోయలో గ్యాస్ కష్టాలు
● అల్లాడుతున్న వినియోగదారులు ● పెదలబుడు ఎంపీటీసీ ఆనందకుమార్ ఆవేదనఅరకులోయ టౌన్: మండలంలోని గ్యాస్ వినియోగదారులు తీవ్ర గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్నారని పెదలబుడు ఎంపీటీసీ దురియా ఆనంద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో హుకుంపేట భారత్ గ్యాస్ డీలర్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ దురియా ఆనంద్ కుమార్ అక్కడికి చేరుకొని గ్యాస్ వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.గ్యాస్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకొని నెలలు గడుస్తున్నా.. నేటికీ గ్యాస్ బండలను పంపిణీ చేయడం లేదని వినియోగదారులు వాపోతున్నట్లు ఎంపీటీసీ తెలిపారు. వడ్డాది మాడుగులకు చెందిన భారత్ గ్యాస్ డీలర్ మృతి చెందడంతో, అక్కడి నుంచి గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. దీంతో స్థానిక గ్యాస్ వినియోగదారులు సిలిండర్ల కోసం నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. -
కార్పొరేట్కు మేలు చేయడమే కేంద్రం లక్ష్యం
మాకవరపాలెం: కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు జి.వామనమార్తి ఆరోపించారు. మంగళవారం మాకవరపాలెంలో ఆటో కార్మికులతో కలసి ఆయన మాట్లాడారు. 2014లో ఎన్నో హామీల్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 36 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందన్నారు. విదేశాల్లో నల్లధనాన్ని వెలికితీసి పేదల అకౌంట్లలోకి వేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని బూచిగా చూపి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిందని ఆరోపించారు. ఈ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదానీ, అంబానీ వంటి వారిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా సామాన్యులపై భారం మోపడం సరికాదన్నారు. ఆటో, మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు వీరికి భారంగా ఉన్న జీవోలను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు రవి, కృష్ణ, దేవరాజు, దేవుడు, స్థానిక ఆటో యూనియన్ సభ్యులు శేషు, సూరిబాబు, చిన్నబ్బాయి, తదితరులు పాల్గొన్నారు. -
ఆగ్రహం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాంబిల్లి(అచ్యుతాపురం): సామాన్యుల నడ్డివిరిచే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని, విచక్షణా రహితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా వైఎస్సార్సీపీ అఽఽధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో మంగళవారం రాంబిల్లి మండలం మామిడివాడలో పార్టీ కార్యాలయం నుంచి కొత్తూరు పెట్రోల్ బంక్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలోని కీలక నేతలు గత ప్రభుత్వ హయాంలో చేసిన విమర్శలను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల ప్రభావం అన్ని వర్గాలపై, అన్ని రంగాలపై పడుతుందన్నారు. నిత్యావసర ధరలు సైతం అమాంతం పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం గురించి పరితపించే నేతలు ప్రస్తుత ప్రభుత్వంలో కరువయ్యారని విమర్శించారు. మీడియా పరంగా హంగూ ఆర్భాటాలు చేసే కూటమి నేతలు ధరల పెంపుపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ వద్ద లీటర్ ధర ఎంత పెరిగిందని బంక్ ప్రతినిధులు, సామాన్యులతో ధర్మశ్రీ మాట్లాడారు. బంక్లోని ధరల పట్టికను పరిశీలించారు. పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయండి... అంతకు ముందు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నేతలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రతినిధులతో ధర్మశ్రీ సమావేశమయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నాలుగు మండలాల్లో పార్టీ, అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని ఆయా మండలాల బాధ్యులకు సూచించారు. పోరాటాల ద్వారానే ప్రజల మన్ననలు పొందగలరని ఉద్బోధించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు, రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు, ఎంపీపీ భర్త శ్రీనుబాబు, రాంబిల్లి, యలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక మండలాల అధ్యక్షులు కిశోర్, బొద్దపు ఎర్రయ్యదొర, దేశంశెట్టి శంకర్రావు, ఆడారి అచ్చింనాయుడు, నాలుగు మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. -
మత్స్యకార భరోసా నిధుల పంపిణీ
పరవాడ: కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలాఅండగా ఉంటుందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు అన్నారు. ముత్యాలమ్మపాలెంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన మత్స్యకార భరోసా నగదు ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున అందించారు. అనంతరం ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం గ్రామాల్లో సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగి మరణించిన వారికి చెరో రూ.5 లక్షలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్తో కలిసి బాధిత కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేపల వేట నిషేధ సమయంలో గంగపుత్రులను ఆదుకోనేందుకు ఈ నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మపాలెం తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో 960 మంది మత్స్యకారులకు రూ.1.92 కోట్లు, యలమంచిలి నియోజకవర్గంలో 4,352 మందికి రూ.8.7 కోట్లు, పాయకరావుపేట నియోజకవర్గంలో 8,349 మందికి రూ.16.69 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారులు విజయ్, మత్స్యకార సంస్థ డెవలప్మెంట్ అధికారి రవితేజ, పరవాడ ఇన్చార్జ్ తహసీల్దార్ అరుణ్, ముత్యాలమ్మపాలెం ప్రత్యేక అధికారి రమాదేవి, పరవాడ మాజీ జెడ్పీటీసీ పైల జగన్నాథరావు, మాజీ సర్పంచ్ చింతకాయల సుజాత, ఎంపీటీసీలు అరిజిల్లి దేవి రవి, సూరాడ బంగార్రాజు, తిక్కవానిపాలెం మాజీ సర్పంచ్ చేపల మసేను, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ బి.అప్పారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
రేడియోతో పెరిగాం.. జీవితాన్ని మలచుకున్నాం
బీచ్రోడ్డు: ‘రేడియో కేవలం వినోద మాధ్యమం కాదు.. అది విజ్ఞానం, క్రమశిక్షణ, జీవిత విలువలను అందించే గొప్ప వేదిక’ అని విశాఖ జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి పేర్కొన్నారు. 90 వసంతాల ఆకాశవాణి ఉత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన వాక్థాన్ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తాను రేడియో వింటూ పెరిగానని, రేడియో ద్వారా విజ్ఞానం, వినోదం రెండింటినీ పొందానని చెప్పారు. ‘మా అమ్మతో పాటు మా కుటుంబమంతా రేడియో అభిమానులమే. జీవితాలను ఉన్నతంగా మలచే శక్తి రేడియోకు ఉంది’ అని ఆమె అన్నారు. ఈ ప్రత్యేక వేడుకల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, రీజినల్ ఛానెల్ మేనేజర్ ఆర్. హర్షలత మాట్లాడుతూ తన 32 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆకాశవాణి 90వ వార్షికోత్సవాలను నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమాజానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన రేడియో తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. డైరెక్టర్ ఇంజనీరింగ్ జె.కృష్ణారావు, డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీరింగ్ బి.వేణు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల నాటికి మరింత నాణ్యమైన కార్యక్రమాలతో శ్రోతలకు చేరువ కావడమే లక్ష్యమన్నారు. కార్యక్రమ విభాగాధిపతి పి.వి.రాంగోపాల్ మాట్లాడుతూ విభిన్న కార్యక్రమాల రూపకల్పనతో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్నో వేలాది మంది శ్రోతల అభిమానాన్ని సంపాదించుకుందని చెప్పారు. సిరిపురంలోని ఆకాశవాణి కేంద్రం వద్ద ప్రారంభమైన వాక్థాన్ పాండురంగపురం, బీచ్రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం, రామకృష్ణ మిషన్ మీదుగా సాగి తిరిగి కేంద్రం వద్ద ముగిసింది. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ కె. ఇందిర, సంఘమిత్ర, ఎన్. సుధాకరరెడ్డి, తేతలి దిలీప్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజయ్యపేటలో వీఆర్పీ అక్రమాలపై ఫిర్యాదు
నక్కపల్లి : మండలంలో రాజయ్యపేటగ్రామంలో జరుగుతున్న ఉపాధి హమీ పథకం పనుల్లో వీఆర్పి మైలపల్లి సత్యనారాయణ బినామీ మస్తర్లు వేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడంటూ మంగళవారం గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 70 గ్రూపులు ఉన్నాయన్నారు. 70 మంది మేట్లు పనిచేస్తున్నారన్నారు. వీఆర్పి సత్యనారాయణ స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి జూమ్కాల్ద్వారా మస్తర్లు వేస్తున్నాడన్నారు. పనుల్లోకి రాని వారికి సైతం మస్తర్లు వేసి స్థానికంగా ఉన్న కూలీలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. వీఆర్వో చేస్తున్న అక్రమాల వల్ల గ్రామంలో 1400 మంది ఉపాధి కూలీలకు పనులు కల్పించడం లేదన్నారు. పనుల్లోకి రానివారిని ఆన్లైన్ విధానంలో మస్తర్లు వేసి అసలైన కూలీలకు అన్యాయం చేస్తున్నాడన్నారు. తక్షణమే వీఆర్పీ ఆక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పిక్కి కోదండరావు, బొంది గురన్న,పిక్కిచిన్నారి, పిక్కి కిరణ్ పిక్కికోటేశ్వరరావు, ఎరిపల్లి అమ్మోరియ్య, పిక్కిరమణ,కాశీరావు,తదితరులు మంగళవారం ఇన్చార్జ్ ఎంపీడీవో సీతారామరాజుకు ఫిర్యాదు అందజేశారు. -
జిల్లాలో తేలిక పాటి వర్షాలు పడే అవకాశం
అనకాపల్లి టౌన్: జిల్లాలో వచ్చే ఐదు రోజులు తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్. ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 36.8 నుంచి 37.9 డిగ్రీలుగా నమోదవుతాయన్నారు. ఈ మేరకు రైతులు చెరకు పైరుకు నీరు పెట్టాలన్నారు. చెరకులో కొరడా తెగులు ఆశిస్తే. ప్రోపికొనజోల్ 1 మి.లీ లేదా అజోక్సిస్ట్రోబిన్, టెబుకోనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలన్నారు. నీటి వసతి ఉన్న రైతులు ముందస్తు ఖరీఫ్ పంటగా నువ్వులను వేసుకోవచ్చన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో పండు ఈగ ఆశించే అవకాశం ఉందన్నారు. ఇది ఆశించి రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలని, ఈగ నివారణకు ప్లాస్టిక్ పళ్లెంలో మిథైల్ యూజినాల్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి తోటలో వేలగట్టాలన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితుల బట్టి వేసవి జల్లులు కురిసిన తర్వాత ఖాళీ పొలాల్లో వేసవి దుక్కులు దున్నుకోవాలన్నారు. పంట కోత అనంతరం ఖాళీ పొలాల్లో మట్టి నమూనాలను సేకరించి విశ్లేషణ చేసినట్లయితే రాబోయే ఖరీఫ్లో భూసారం తగినట్టుగా యాజమాన్య పద్ధతులు చేపట్టవచ్చన్నారు. సమావేశంలో డాక్టర్ ఆదిలక్ష్మి, డాక్టర్ రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మానస్ మేథస్సుకు యాపిల్ సలాం
కొమ్మాది: టెక్ దిగ్గజం యాపిల్ నిర్వహించిన స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్–2026లో విశాఖ సీతమ్మధారకు చెందన యువకుడు మానస్ మల్లా అద్భుత విజయం సాధించారు. జూన్ 9న ఆయన యాపిల్ సీఈవో టీమ్ కుక్ను కలవనున్నారు. ఈ ఛాలెంజ్ను క్రాక్ చేసిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 15 మంది విద్యార్థుల్లో ఈయన ఒకరు. ఈ 15 మంది ఎలైట్ బృందంలో స్థానం దక్కించుకున్న ఏకై క భారతీయుడు కావడం, విశాఖ యువకుడు కావడం విశేషం. విశాఖలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మల్లా మానస్ రూపొందించిన ఆఫ్లైన్ ఏఆర్ ఆధారిత పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్ స్టెమ్ క్వెస్ట్ ఆయనకు ఆపిల్ పార్కులో జరిగే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ను సందర్శించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అక్కడ ఆయన టీమ్ కుక్తో ముఖాముఖి ఇంటరాక్ట్ అవుతారు. స్టెమ్ క్వెస్ట్ విద్యార్థులకు స్నేహపూర్వక, సహాయక ట్యూటర్గా పనిచేసేలా రూపొందించబడింది. బట్టి పట్టే విధానంతో తాను పడిన ఇబ్బందులు, భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని గమనించిన మల్లా, సాధారణ క్విజ్లకు బదులుగా విద్యార్థులు భావోద్వేగాలను నేర్చుకునే విధానాలను బాగా అర్ధం చేసుకోవడానికి ఏఐ ఆధారిత కథలు చెప్పేవిధానాన్ని, ఫేషియల్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. మాతృభాషలు, ప్రాంతీయ మాండలీకాలు అందరికి అందుబాటులో ఉండే సాంకేతికతను ఉపయోగించి అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా, కలుపుకుపోయేలా, ఒత్తిడి లేకుండా చేయడం ఈ యాప్ ఉద్దేశం. ప్రధానికి వివరించిన మానస్ న్యూఢిల్లీలో జరిగిన స్టార్టప్ మహాకుంభ్లో మల్లాకు తన లెర్నింగ్ యాప్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనకు తగిన ప్రోత్సాహం లభించింది. అక్కడ ఆయన ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో స్టెమ్ క్వెస్ట్ గురించి తన విజన్ పంచుకోగా, ఆ కలను సాకారం చేసుకోవాలని ప్రధాని ఆయనను ప్రోత్సహించారు. ఫిబ్రవరిలో, యాపిల్ ఛాలెంజ్ గడువు ముగియడానికి కేవలం ఒక వారం ముందు మల్లా తన ఆలోచనలను డిజిటల్–ఫస్ట్ అప్లికేషన్గా మార్చారు. ఈ కొత్త వెర్షన్ స్టెమ్ క్వెస్ట్గా రూపాంతరం చెందింది. ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ను బోధించే యానిమేటెడ్ ట్యూటర్లతో వీడియో కాల్లాగా డిజైన్ చేయబడిన ఆఫ్లైన్ ఏఐ విధ్యా ఫ్లాట్ఫారమ్. విద్యార్థులు తమకు కావాల్సిన టాపిక్ ఎంచుకుని స్నేహపూర్వక వర్చువల్ మెంటర్తో ఇంటరాక్ట్ కావచ్చు. ఇది ఒత్తిడితో కూడిన క్లాస్రూమ్లో కూర్చోవడానికి బదులుగా ఒక స్నేహితుడుతో మాట్లాడుతున్న అనుభూతిని ఇస్తుంది. యాప్ అతి పెద్ద బలం సానుభూతితో కూడిన అభ్యాసం. ‘సాధారణ పరీక్షలు, క్విజ్లపై ఆధారపడే బదులు ఫేషియల్ ట్రాకింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్ల ద్వారా విద్యార్థి గందరగోళంగా ఉన్నాడా.. ఆసక్తిగా ఉన్నాడా.. సంతోషంగా ఉన్నాడా.. విసుగు చెందాడా అనే విషయాలను అర్ధం చేసుకోవడానికి ఈ ఫ్లాట్ఫారమ్ ప్రయత్నిస్తుందని’ మల్లా తెలిపారు. వ్యక్తిగతీకరణ అనేది దీని మరొక ముఖ్య లక్షణం. స్టెమ్ క్వెస్ట్ విద్యార్థుల హాబీలు, ఆసక్తులను ఉపయోగించి కాన్సెప్ట్లను వివరిస్తుంది. ఆన్–డివైజ్ ఏఐ జనరేటెడ్ విజువల్స్, స్టోరీ టెల్లింగ్ ద్వారా విద్యార్థులకు అభ్యాసాన్ని మరింత ఆకర్షనీయంగా, ఇంటరేక్వివ్గా, భయం లేకుండా చేస్తుందని ఆయన చెబుతున్నాడు. ఆవేదన నుంచి వచ్చిన ఆలోచన నేను అమెరికాలో చదివినప్పుడు ప్రయోగాల ద్వారా నేర్చుకునే విద్యా విధానాన్ని చూశాను. కానీ భారతదేశం తిరిగి వచ్చి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు విద్యార్థులపై ఉన్న విద్యా ఒత్తిడిని గమనించాను. ఐఐటీ ఫలితాల వల్ల నా మిత్రుడు ఆత్మహత్యకు యత్నించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటనలతో మన విద్యావ్యవస్థలో మానవతా దృక్పథం అవసరమని గుర్తించి, ఒత్తిడి లేని అభ్యాసం కోసం ‘స్టెమ్ క్వెస్ట్’ యాప్ను రూపొందించాను. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఇందులో వాయిస్ ఇంటరాక్షన్, హై–కాంట్రాస్ట్ ఫీచర్లు చేర్చాను. ఇంటర్నెట్, ఖరీదైన ఫోన్లు లేని పేద విద్యార్థుల కోసం ఇది ఆఫ్లైన్లో, తక్కువ ధర స్మార్ట్ఫోన్లలో కూడా స్థానిక భాషల్లో పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణకు గాను నాకు అమెరికాలోని యాపిల్ పార్క్ను సందర్శించి, అక్కడి ఇంజనీర్లతో చర్చించే అవకాశం, ఏడాది పాటు ఉచిత యాపిల్ డెవలపర్ మెంబర్షిప్ లభించాయి. -
గురుకుల సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ
సబ్బవరం: విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకుల విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లతోపాటు నాన్ టీచింగ్ సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం రాష్ట్రంలోనే తొలిసారిగా స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. విశాఖపట్నం–అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త(డీసీవో) జి.గ్రేస్ మాట్లాడుతూ ఇలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల అవసరాలు మరింత మెరుగ్గా తీర్చడంతోపాటు, పరిపాలనా విధుల్లో సమర్ధత పెంపొందించుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, విద్యాసంస్థల పరిపాలనను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. శిక్షణలో భాగంగా కార్యాలయ నిర్వహణ, ఫైల్ మెయింటెనెన్స్, ఈ ఆఫీస్ విధానం, రికార్డుల సంరక్షణ, సమయపాలన, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రభుత్వ ఉత్తర్వుల అమలు, డిజిటల్ సేవల వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రిన్సిపాళ్లు ఎస్.రామకృష్ణ, పి.శ్రీనివాసరావు, రత్నవల్లి, మృదుల ప్రియదర్శిని, ఉషారాణి, సత్యవతి, పద్మకుమారి, రాజేశ్వరి, ఎం.కోటేశ్వరరావుతోపాటు సూపరింటెండెంట్లు ఎస్. శ్రీనివాసరావు, నరేష్, రాజేష్, అనిత పాల్గొన్నారు. -
మోదమ్మా..తోడుండమ్మా!
పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, గిరిజనుల ఇలవేల్పు అయిన పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర ముగింపు వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను భారీ ఊరేగింపుతో సతకం పట్టు వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. అక్కడ మూడు రోజుల పాటు భక్తుల నుంచి అమ్మవారు విశేష పూజలందుకున్నారు. కనులపండువగా తిరుగు ప్రయాణం జాతర చివరి రోజున వేదమంత్రోచ్ఛారణలు, సన్నాయి మేళాలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ థింసా నృత్యాలు, శక్తి వేషధారణల మధ్య అమ్మవారి ఊరేగింపు కనులపండువగా సాగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మోయగా.. అమ్మవారి పాదాలను కలెక్టర్ నిశాంతి, ఘటాలను జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి, భక్తులు భుజాలపై మోస్తూ ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి చేర్చారు. దీంతో మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దర్శించుకున్న ప్రముఖులు జాతర ముగింపు రోజున పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఉదయమే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ నిశాంతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆలయ కమిటీ ప్రతినిధులు వారిని ఘనంగా సన్మానించి అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఘనంగా ముగిసిన మోదకొండమ్మ రాష్ట్ర గిరిజన జాతర తరలివచ్చిన భక్తజనం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాదాలు, ఘటాలను మోసిన కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ,పీవో ఆదిత్యవర్మ -
పాడేరు ఎమ్మెల్యేపై తప్పుడుఆరోపణలు తగదు
● దాడికి పాల్పడిన వారిని కఠినగా శిక్షించాలి ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అచ్యుత్ కొయ్యూరు: బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టడం టీడీపీ నాయకులకు అల వాటుగా మారిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. అచ్యుత్ ఆరోపించారు. పాస్టర్ అభినయ్పై జరిగిన దాడికి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు కూటమి నాయకులు ముడిపెట్టాలని చూడడం దారుణమన్నారు. ఎమ్మెల్యేనే ఈ దాడి చేయించారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మంగళవారం తెలిపారు. అభినయ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని, అవి కూటమి నాయకులకే వర్తిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో వారే అభినయ్పై శతృత్వం పెంచుకుని ఉండే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే దాడి చేయించారని ప్రచారం చేయడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అభినయ్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
కెమిస్టుల సమరభేరి
ఇ–ఫార్మసీలపై ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా ఏఐఓసీడీ పిలుపు నేడు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ ఉమ్మడి జిల్లాలో 3,400 మెడికల్ దుకాణాలు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇ–ఫార్మసీలు కృత్రిమ మేథస్సు(ఏఐ)తో నకిలీ ప్రిస్క్రిప్షన్ల సృష్టి నియంత్రణ లేని మందులతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ముప్పు తనిఖీలు లేవు.. జవాబుదారీతనం శూన్యం ప్రజల ఆరోగ్యం, రోగుల భద్రతపై ప్రభావమంటున్న అసోసియేషన్ ప్రతినిధులు సాక్షి, అనకాపల్లి : అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం (ఏఐఓసీడీ) పిలుపుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఔషధ వ్యాపారులు ఉద్యమబాట పడుతున్నారు. ఆన్లైన్ మందుల విక్రయాలు, ఈ–ఫార్మసీల ధోరణిని నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ప్రభావంతో సాధారణ మందుల కొనుగోళ్లు ఒక రోజు పాటు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అయితే ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రం తెరిచి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బంద్లో మందులు దుకాణాల సిబ్బంది, కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గోనున్నారు. మూడు జిల్లాల్లోనూ నిరసన ప్రభావం ఈ నిరసన కాక ఉమ్మడి విశాఖ జిల్లాల్లో స్పష్టంగా కనిపించనుంది. విశాఖపట్నం జిల్లాలో 1600, అనకాపల్లి జిల్లాలో 1500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 300 చొప్పున మొత్తం 3400 మందుల దుకాణాల సిబ్బంది, కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ బంద్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతున్నారు. కార్పొరేట్ శక్తుల అండతో నడుస్తున్న ఆన్లైన్ ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల స్థానిక, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న మెడికల్ షాపులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని, ఈ అసమాన పోటీని తట్టుకోలేక చిన్న వ్యాపారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ ప్రిస్క్రిప్షన్ల ముప్పు ఆన్లైన్ ఫార్మసీల వల్ల కేవలం వ్యాపారులకే కాకుండా ప్రజారోగ్యానికి కూడా తీవ్ర ముప్పు పొంచి ఉందని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండానే విచ్చలవిడిగా డ్రగ్స్ ఆన్లైన్ ద్వారా చేతులు మారుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వాడుకుని నకిలీ ప్రిస్క్రిప్షన్లను సృష్టిస్తున్నారని, తనిఖీలు లేకపోవడంతో నాసిరకం, నకిలీ మందులు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నియంత్రణ లేని యాంటీబయోటిక్స్ వాడకం వల్ల రోగులలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరిగి ప్రాణాలకే ముప్పు వస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ఉల్లంఘన.. సాధారణంగా హోల్సేలర్ మార్జిన్ 8 నుంచి 10 శాతం, రిటైల్ ఫార్మసిస్ట్ మార్జిన్ 16 నుండి 20 శాతం వరకు ఉంటే, ఈ–ఫార్మసీలు ఏకంగా 20 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తూ మార్కెట్ను శాసిస్తున్నాయి. నేషనల్ ప్రైస్ అథారిటీ నిబంధనలను పక్కనబెట్టి సాగుతున్న ఈ ధరల వ్యత్యాసాన్ని అరికట్టాలని కెమిస్టులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో మందులను డోర్ డెలివరీ చేసేందుకు ఇచ్చిన తాత్కాలిక సడలింపులను ఆసరాగా చేసుకుని ఇప్పుడు వ్యాపారాలు చేయడం సరికాదని, ఆ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని వారు కోరుతున్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే ఈ బంద్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. శాంతియుత నిరసనకు పిలుపు ఈ బంద్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలతో గానీ, అధికారులతో గానీ ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని, సోషల్ మీడియా ద్వారా పుకార్లను వ్యాప్తి చేయవద్దని అసోసియేషన్ సభ్యులకు పిలుపునిచ్చారు. అలాగే అంబులెన్సులు, అత్యవసర వైద్య సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా శాంతియుతంగా నిరసన చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ఔషధ విక్రయశాలలుఈ–ఫార్మసీని నియంత్రించాలి రోగులకు ఇబ్బంది లేకుండా ప్రధాన సెంటర్లో ఒకటి రెండు మందుల దుకాణాలు తెరిచేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆసుపత్రుల అనుబంధ మెడికల్ షాపులో ఉన్న సిబ్బంది కూడా బంద్లో పాల్గొంటారు. రోగులకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా మా నిరసనను తెలియజేస్తున్నాం. ఈ–ఫార్మసీ, ఆన్లైన్లో మందుల విక్రయాలను పూర్తిగా నియంత్రించాలనేదే మా డిమాండ్. నకిలీ మందులకు చెక్ పెడుతూ ప్రజా రోగ్యాన్ని కాపాడాలనేదే మా నిరసన. – నొదిరిపాటి సూర్య ప్రకాష్ గుప్తా, అనకాపల్లి జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షుడుఎమర్జెన్సీ రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఏఐఓసీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ కారణంగా విశాఖ నగరం, అనకాపల్లి జిల్లా, అల్లూరి జిల్లాల్లో ఎమర్జెన్సీ రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆసుపత్రి అనుబంధ మెడికల్ షాపులు తెరిచే ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నాం. రోగులకు ఇబ్బంది కలగకుండా మెడ్ప్లస్, అపోలో ఫార్మసీలను ప్రధాన సెంటర్లలో తెరిచే ఉంచాలని కోరడం జరిగింది. – రజిత, ఔషధ నియంత్రణ డిప్యూటీ డైరెక్టర్ -
నిర్వహణ నిధులుమంజూరుకాక ఇబ్బందులు
● కాఫీ రైతుల ఆవేదన అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని హెక్టాగుడ గ్రామంలోని కాఫీ రైతులతో కాఫీ బోర్డు సభ్యుడు శెట్టి రాజు సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగా కాఫీ తోటల నిర్వహణ నిధులు మంజూరు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని ఈ సందర్భంగా రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతగిరి మండలంలో వేల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నప్పటికీ, ఇక్కడ కనీసం పూర్తి స్థాయి కార్యాలయం కూడా లేకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శెట్టి రాజు స్పందిస్తూ.. త్వరలోనే కాఫీ రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలతో చర్చించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం హెక్టాగుడలోని కాఫీ నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో కాఫీ లైజన్ వర్కర్లు అప్పన్న, మొష్యా, సీతారాం, రాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
భానుడి ప్రతాపం.. ఆపై కుంభవృష్టి
పాడేరు: పాడేరు శ్రీ మోదకొండమ్మ రాష్ట్ర గిరిజన జాతర చివరి రోజున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం ఉదయం వేకువజాము నుంచే దట్టమైన మంచు కమ్ముకోగా.. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. అయితే, ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో ఏకధాటిగా సుమారు మూడు గంటల పాటు కుంభవృష్టి కురవడంతో పట్టణమంతా తడిసి ముద్దయింది. దుకాణాలు మునిగి.. జాతర ముగింపు రోజున భారీగా వ్యాపారం జరుగుతుందని ఆశించిన చిరు వ్యాపారులను ఈ అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. రోడ్డు పక్కన, మైదానాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారుల సామగ్రి అంతా తడిసిపోయింది. ఆకస్మిక వరద నీరు చేరడంతో దుకాణదారులు ఎన్నో అవస్థలు పడ్డారు. నాలుగు గంటలు అంధకారం.. భారీ ఈదురుగాలుల కారణంగా పట్టణంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు నాలుగు గంటల పాటు కరెంట్ నిలిచిపోవడంతో జాతర పరిసర ప్రాంతాలన్నీ చీకటమయమయ్యాయి. జాతర ముగింపు వేడుకలను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు కారుచీకట్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. సరైన సమయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు సాయంత్రం ఏడు గంటలకు అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాడేరులో ఈదురు గాలులతో భారీ వర్షం నాలుగు గంటలపాటు నిలిచిన విద్యుత్ సరఫరా కారుచీకట్లో మోదకొండమ్మ భక్తుల అవస్థలు -
తండ్రిని కడతేర్చిన తనయుడు
పెదబయలు: కన్న తండ్రిని ఓ కుమారుడు అతికిరాతకంగా కర్రతో తలపై కొట్టి హతమార్చిన ఘోర ఘటన మండలంలోని సీకరి పంచాయతీ వెల్లపాలెం గ్రామంలో జరిగింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వెల్లపాలెం గ్రామానికి చెందిన లకే సింహాచలం (55) ఈ నెల 18వ తేదీ సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో తన ఇంటి ముంగిట కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అతని కుమారుడు లకే రమేష్... నీకు నెలనెలా వస్తున్న వృద్ధాప్య పింఛను డబ్బులు నాకు ఎందుకు ఇవ్వడం లేదు?.. అంటూ తండ్రితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో, రమేష్ ఒక్కసారిగా ఆగ్రహంతో పక్కనే ఉన్న కర్రను తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో చెవి, ముక్కుల నుంచి తీవ్ర రక్తస్రావమై సింహాచలం అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొంతకాలంగా తండ్రీకొడుకులు ఇద్దరూ మద్యం సేవించి తరచూ గొడవ పడుతుండేవారని, సోమవారం రాత్రి కూడా అలాగే గొడవపడి తండ్రిని కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. మృతుడికి రమేష్ ఒక్కడే కుమారుడు. గతంలో భార్యను కూడా హత్య చేసిన రమేష్ నిందితుడు లకే రమేష్కు నేరచరిత్ర ఉంది. గతంలో 2018 సంవత్సరంలో గర్భవతిగా ఉన్న తన భార్య సంధ్య (21)ను కొట్టి చంపిన కేసులో ఇతను ఐదేళ్ల పాటు విశాఖపట్నం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. గత ఏడాది జైలు నుంచి విడుదలైన రమేష్.. ఇంటికి వచ్చినప్పటి నుంచి తాగి వచ్చి తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే తండ్రి పింఛను డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడి కోసం గాలింపు.. మృతుడి భార్య నీలమ్మ, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్లో ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించి, శవపరీక్ష అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, రేపటికల్లా పట్టుకుంటామని జి.మాడుగుల సీఐ ఎస్.లక్ష్మణరావు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో వెల్లపాలెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దర్యాప్తులో పెదబయలు, జి.మాడుగుల ఎస్ఐలు పి. వెంకటేష్, పోలీసు క్లూస్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధాప్య పింఛను కోసం కర్రతో దాడి మద్యం మత్తులో హతమార్చిన వైనం నిన్న భార్య.. నేడు తండ్రి.. జైలు నుంచి వచ్చినా మారని బుద్ధి పరారీలో నిందితుడు వెల్లపాలెంలో ఘటన -
జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట
అరకులోయటౌన్: జగనన్న ప్రభుత్వహయాంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసినట్టు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, నివారణ అవగాహన సదస్సును ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వైఎస్సార్సీసీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ ఫ్యామిలీడాక్టర్, విలేజ్ క్లినిక్ల ద్వారా ఉచిత పరీక్షలు, మందులు అందించారని తెలిపారు. 15 ఏళ్లు పైబడిన వారందరి హెల్త్ రిపోర్టును ఆన్లైన్ యాప్లో పొందుపరిచి, బీపీ, మధుమేహం, కిడ్నీ, గుండె జబ్బులు వంటి అసంక్రమిత వ్యాధులను ప్రాథమిక దశలో నివారించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. అనంతరం హైపర్ టెన్షన్ డేని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీపీ పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాల మేరకు మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య,ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రామ్మూర్తి, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జ్ పాంగి విజయ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, సుంకరమెట్ట పంచాయతీ అధ్యక్షుడు కొర్రా అర్జున్రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శోభారాణి, వైద్యులు రాము, బాలాజీ, పావని, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
భరోసా పార్టీ అధినేతపై దుండగుల దాడి
గూడెంకొత్తవీధి: భరోసా పార్టీ అధినేత డాక్టర్ ధార అభినయ్ దసన్పై మండలంలో మొండిగెడ్డ పంచా యతీ నీరుతోటపాలెం కాఫీ తోటల సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.కడపకు చెందిన అభినయ్ కొన్ని రోజులుగా జిల్లా లో ఉంటున్నారు. నీరుతోటపాలెంలో సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి కారులో తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అభినయ్, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి దింపి, కాఫీ తోటల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అభినయ్పై బ్లేడుతో దాడి చేశారు. తల,కాళ్లపై కోసేశారు. అభినయ్తో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి చేశారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అభినయ్ స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి, దుండ గులు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అభినయ్ను జెర్రెల ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఎవరో, ఎందుకు దాడి చేశారో తెలియడం లేదు. కడప నుంచి వచ్చిన అభినయ్కి ఇక్కడ ఎవరు శత్రువులున్నారో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. అభినయ్ కారుపై కూడా దాడి చేయడంతో కారు అద్దం పగిలిపోయింది. -
మోదమ్మ జాతరలో బ్రహ్మకుమారీస్ఆధ్యాత్మిక ప్రదర్శన
పాడేరు : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని ప్రశాంతమైన జీవితం గడపాలని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. పట్టణంలో మోదకొండమ్మ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో స్థానిక మోదకొండమ్మ ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రదర్శనను జ్యోతి ప్రజల్వన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 108 శివలింగాలను ఒకేచోట కొలవుదీర్చడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఆధ్యాత్మిక విజ్ఞాన చిత్రప్రదర్శనను ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక అకడామీ చైర్మన్ వంపూరి గంగులయ్య, పోలవరం ప్రాజెక్టు అధికారి అభిషేక్, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
చాపరాయిని సందర్శించిన పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్
డుంబ్రిగుడ: మండు వేసవిలోనూ చాపరాయి అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్ అన్నారు. సోమవారం ఆయన చాపరాయిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను పాడేరు ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహించిన సమయంలో చాపరాయి అభివృద్ధికి సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చాపరాయి జలపాతం గిరిజన ప్రాంతంలో మినీ బీచ్ లాంటిదని, మద్రాసులో మెరీనా బీచ్, విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్లుఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయో చాపరాయి జలపాతం కూడా అంతే ప్రాముఖ్యత పొందిందని చెప్పారు. అనంతరం చాపరాయి ఉద్యోగులు, వ్యాపారులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. -
పెట్రో బాదుడుపై
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాడేరు, అరకులోయలలో ఆ పార్టీ నాయకులు, ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వ్యాన్కు తాడుకట్టి లాగుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జి.మాడుగుల జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, పార్టీ నాయకులుపాడేరు/ జి.మాడుగుల: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం రూ.3,200కోట్లు భారం మోపిందని, దీంతో సామాన్యుడి మనుగడ ప్రశార్థకరంగా మారిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. వైఎస్సార్సీపీ అధి ష్టానం పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రం జి.మాడుగులలో జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. ఇన్చార్జీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలు పెట్రోల్,డీజిల్ ధరలు పెంచబోమని చెప్పి, ఇప్పుడు ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు, మాజీ ఎంపీపీ మత్స్య రాస వెంకటగంగరాజు, ఎంపీటీసీ మత్స్యరాస విజయకుమారి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, తాజా మాజీ సర్పంచ్లు మాల్లన్న, ఐసరం హనుమంతరావు, సీదరి కొండబాబు, నియోజకవర్గ వలంటీర్ల విభాగం అధ్యక్షుడు కూర్మరాజు, పార్టీ క్రిస్టియన్, మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వంతాల కృష్ణారావు, మాజీ ఎంపీటీసీ బ్రహ్మలింగం, మండల మహిళ అధ్యక్షురాలు నీలమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు సిర్మా పండన్న, రామకృష్ణ్ణ, మన్మధరావు, పెదబాలన్న, చిట్టిబాబు, బంగార్రాజు, రమణ, లింగమూర్తి, కొండబాబు, సన్యాసిరావు, చంటిబాబు తదితరుల పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న కూటమి సర్కార్ : ఎమ్మెల్యే మత్స్యలింగం అరకులోయటౌన్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, రాష్ట్ర ప్రజల్ని కూటమి ప్రభుత్వం దోచుకుంటోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం అరకులోయలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముందుగా అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ నుంచి వ్యాన్కు తాడుకట్టి తహసీల్దార్ కార్యాలయం వరకూ లాగుతూ తీసుకువెళ్లారు. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, చేతకాని కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సివేరి సురేష్కుమార్కు వినతి పత్రం అందజేవారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల ఏడాదికి ప్రజలపై రూ. 3 వేల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఆరు నెలల నుంచే దోపిడీ : జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల నుంచే దోపిడీ ప్రారంభించిందన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె, ఇతర నిత్యావసరాల ధరలు పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. పక్క రాష్ట్రంలో పెట్రోల్కు లీటర్కు రూ.3, డీజిల్కు రూ.2 పెంచితే మన రాష్ట్రంలో పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3.50 పెంచడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, ఎంపీపీలు బాక ఈశ్వరి, మిథుల, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, రామచందర్, జయ వర్ధిని, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల అధ్యక్షులు రామ్మూర్తి, కొర్రా సూర్యనారాయణ, పాంగి పరశురామ్, అనిల్, పద్మారావు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్, మండల ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జీ పాంగి విజయ్, నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, మాజీ సర్పంచ్లు పాగి అప్పారావు, సమిడ వెంకట పూర్ణిమ, గుమ్మ నాగేశ్వరరావు, కొర్రా సింహాద్రి, అర్జున్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అరకులోయ డిప్యూటీ తహసీల్దార్ సురేష్కుమార్కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, నాయకులు జి.మాడుగులలో ఇన్చార్జి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేస్తున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు -
సరిహద్దులో సారాకాసి
● యథేచ్ఛగా తయారీ, విక్రయాలు ● పూటుగా తాగి అనారోగ్యం బారిన పడుతున్న గిరిజనులు ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గిరిజన, అటవీ ప్రాంతాల్లో ప్రాంతంలో సారా ఏరులైపారుతోంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. వారపు సంతల్లో, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పంచాయతీల్లో జోరుగా సారా అమ్మకాలు జరుగుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో సారాను తయారు చేసి, మండలంలో అన్ని గ్రామాలకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. సారా తయారు చేసేందుకు ఒడిశా ప్రాంతం నుంచి అవసరమైన నల్లబెల్లాన్ని గుట్టుచప్పుడుగా ఆంధ్రకు తీసుకొస్తున్నారు. జోలాపుట్టు,ముంచంగిపుట్టు,కుమడ,బూసిపుట్టు,లక్ష్మీపురం గ్రామాల్లో నల్లబెల్లం నిల్వ చేసేందుకు ప్రత్యేక గోదాములు ఏర్పాటు చేశారు. ఆ గోదాముల నుంచే అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా సరిహద్దులో పండగలు, జాతర్లు జరుగుతుండడంతో సారాకు డిమాండ్ పెరిగింది. మారుమూల గ్రామాలతో పాటు మండల కేంద్రం ముంచంగిపుట్టులో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాల సమీపంలో సారా బట్టీలను సైతం ఏర్పాటు చేసి, భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. సారాను అరి కట్టేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్లు కృషి చేశారు. గ్రామాల్లో వెళ్లి అవగాహన కలిపించడం, సారా వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ లేక పోవడంతో ఎక్సైజ్ అధికారులు అటువైపు దృష్టి సారించకపోవడంతో సారా తయారీ,అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ‘సారా’సమైన ధరకే... వారపు సంతల్లో ప్యాకెట్ రూ.10 చొప్పున్న విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే సారా ప్యాకెట్ దొరుకుతుండడంతో పూటగా సేవించి,మందు బాబులు ఎక్కడబడితే అక్కడ రోడ్ల మీద పడిపోవడంతో పాటు గొడవలు పడుతున్నారు. ఆ మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు బారిన పడుతున్నారు. రోజూ సారా మత్తులో గడుపుతుండడంతో పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆరోగ్యం క్షీణించి తమ వారు మరణించే ప్రమాదం ఉందని గిరిజన మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఎకై ్సజ్ అధికారులు,పోలీసులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని, సారా వల్ల ఇబ్బందులు పడుతున్న గృహిణులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఎకై ్సజ్ అధికారులు,పోలీసులు సారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సరిహద్దు ప్రాంత వాసులు కోరుతున్నారు. గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం సారా వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. సారా అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సారా లేని గ్రామాలే లక్ష్యాంగా పనిచేస్తున్నాం. వారపు సంతల్లో, సారా అమ్ముతున్న గ్రామాల్లో దాడులు నిర్వహిస్తాం. సారా అమ్మకాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులోస్తే వెంటనే చర్యలు చేపడతాం. – పి.నాని, ఎస్ఐ, ముంచంగిపుట్టు నాటుసారా అమ్మకాలుఅరికట్టాలి రాత్రీపగలు తేడా లేకుండా సారాను తాగుతూ గొడవలకు దిగుతున్నారు. ఎవరు చెప్పిన పట్టించుకోవడం లేదు. మత్తులో రోడ్లపై తూలుతూ ఎక్కడ పడితే అక్కడ పడి పోతున్నారు. అధికారులు స్పందించి సారా తయారీ, విక్రయాలను కట్టడి చేయాలి. కె.త్రినాఽథ్, సీపీఎం మండల కార్యదర్శి, ముంచంగిపుట్టు -
చేతిలో అర్జీ నెత్తిపై ఎండ
తుమ్మపాల: తమ సమస్యలు పరిష్కారమవుతాయని గంపెడాశతో వస్తున్న అర్జీదారులు కలెక్టరేట్లో తీవ్ర అసౌకర్యానికి గురై అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. దీనికితోడు మండుటెండలో గంటల తరబడి క్యూలో నిలబడి, నీడ లేక చెట్ల కిందే అర్జీలు రాసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండుటెండలో వస్తే, ఇక్కడ గుక్కెడు తాగునీరు లేక విలవిల్లాడుతున్నారు. ప్రజల కష్టాలను తీర్చాల్సిన పీజీఆర్ఎస్ తమ సహనాన్ని పరీక్షించే కేంద్రంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు గంటల కొద్దీ క్యూలో నిల్చున్నారు. వీరి కోసం ఏర్పాటు చేసిన తాగునీటి డబ్బాలో చుక్క నీరు లేకపోవడం గమనార్హం. దాంతో మంచినీటి కోసం వెతలు పడ్డారు. రెండు వారాల క్రితం పెట్టిన చలివేంద్రం జాడ కూడా లేకపోవడంతో తీవ్ర ఎండలో అర్జీదారులు చెమటలు కక్కుకున్నారు. 278 అర్జీల నమోదు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చే ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరిస్తామన్న భరోసా కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆమెతోపాటు డీఆర్వో సత్యనారాయణ, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించడం కారణంగానే రీఓపెన్ అవుతున్నాయన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కార మార్గాలను తెలియజేయాలన్నారు. ఈ వారం మొత్తం 278 అర్జీలు నమోదయ్యాయన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా అఽఽధికారులు పాల్గొన్నారు. -
ఏపీ లాసెట్లో 123వ ర్యాంకు
కోటవురట్ల: మట్టిలో మాణిక్యం ప్రతిభతో మెరిసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సీఈసీ విద్యార్ధిని గొట్టివాడకు చెందిన వాకాడ అంజలి ఏపీ లాసెట్లో ప్రతిభ చాటింది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో అంజలి 123వ ర్యాంకు సాధించి మిగతా విద్యార్ధుకు స్పూర్తిధాయకంగా నిలిచింది. ఇటీవల వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో కూడా అంజలి 902 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎఆర్టి సుజాత, లెక్చరర్లు, గ్రామస్తులు అంజలికి అభినందనలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. న్యాయ రంగంలో ఉన్నతంగా ఎదిగి పేదలకు అండగా ఉంటూ సమాజాభివృద్ధికి పాటుపడతానని అంజలి తెలిపింది. -
టీడీపీ మండలాధ్యక్షుడి ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
అధికారులతో సభలు, సమావేశాల నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు చేస్తూ రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను కాలరాస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్దం, అతనికి సహకరిస్తున్న అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ ఎస్.రాయవరం జెడ్పీటీసీ కాకర దేవి, ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి పీజీఆర్ఎస్లో జెడ్పీ సీఈవో నారాయణమూర్తికి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడి, గౌరవ పదవుల్లో ఉన్న తమను కాదని, మండల పరిషత్ కార్యాలయంలోనే ప్రభుత్వ పథకాలు, అధికార కార్యక్రమాలను చేపడుతున్నారని, ఎస్సీ, బీసీ మహిళలుగా ఉన్న తమపై చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. అతని ఆగడాలపై విచారించి తమ నిర్ణయాలు అమలు చేసే విధంగా అధికారులు సహకరించాలని కోరారు. -
ఉపాధి కూలీకి అస్వస్థత
రావికమతం: మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఎండ దెబ్బకు తాళలేక అస్వస్థతకు గురవుతున్నారు. ఉపాధి పనులు ప్రదేశంలో మెడికల్ కిట్లు, టెంట్లు, తాగునీరు ఉండటం లేదు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఉపాధి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 9 గంటల నుంచి ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. వడగాల్పులకు ఇంటిలోంచి బయటికి రావడానికి జనం భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీస వసతులు లేక ఉపాధి కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా మండలంలోని వమ్మవరం పంచాయతీలో అడవిరాజుల బాబు కొండపై నీటి నిల్వ కోసం కందకాల పనులు చేస్తున్నారు. ఇక్కడ గ్రామానికి చెఽందిన చేబులు గంగునాయుడు (50) సోమవారం ఉపాధి పనులు చేస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని తక్షణమే ఫీల్డ్ అస్టిసెంట్ నీటిపల్లి రామకృష్ణ, తోటి కూలీలు కొత్తకోట పీహెచ్సీకి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి పనుల ప్రదేశంలో ప్రభుత్వం తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. -
పేకాట స్థావరాలపై దాడి
కోటవురట్ల: పేకాట, కోడి పందాల స్ధావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను ఆరెస్టు చేశారు. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలివి..ముందస్తు సమాచారంతో బోడపాలెం శివార్లలో ఆదివారం రాత్రి దాడి జరిపి పేకాడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.25,200, కోడి పందాలు ఆడుతున్న ఇద్దరిని ఆరెస్టు చేసి వారి నుంచి రూ.2,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, పేకాట, కోడి పందాలు, డైస్, కాయిన్ గేమ్ వంటి జూదం నిర్వహించిన ఏపీ గేమింగ్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విజయ్కుమార్ హెచ్చరించారు. -
ఆ సాగు భూమిని ఆదివాసీలకు పంచాలి
సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్రకార్యదర్శి బుగతా బంగార్రాజు డిమాండ్ రోలుగుంట: కె.అడ్డసరంలో వారసులు లేని భూమిని దీర్ఘకాలంగా సాగుచేసుకుంటున్న ఆదివాసీలకు పంచి, ఫోర్జరీ సంతకాలతో ధ్రువపత్రాలు పొంది వారసుడిగా చెప్పుకుంటున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శిఽ బుగతా బంగర్రాజులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కె.అడ్డసరం రెవెన్యూలో భూమి పంతులమ్మదని, ఈమెకు వారసులు లేరన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువపత్రాలు పొంది తానే వారసుడిగా చెప్పుకుంటున్న చంద్రశేఖర్పై నర్సీపట్నం, యలమంచిలిలో కేసులు కూడా ఉన్నాయన్నారు. ఈ భూమికి చంద్రశేఖర్కి సంబంధం లేదని ఆర్డీవో చెప్పడంతో జేసీ కోర్టులో కేసు పెండింగు ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని సమగ్ర విచారణ చేసి సాగులో ఉన్న ఆదివాసీల పేర్లు నంబర్ –3 అడంగల్లో నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ డిజిటల్ సైన్ తొలగిస్తేనే దీక్షలు విరమిస్తామని 48 మంది ఆదివాసీలు తెలిపారు. లేకుంటే జిల్లాలో అన్ని మండలాల్లో విస్తరింపజేస్తామని ఆదివాసీ సంఘ నాయకులు కోసూరు రాజు, రావి నూకరాజు హెచ్చరించారు. -
సోలార్ ప్లాంట్కు భూములివ్వబోమని ధర్నా
చీడికాడ: సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో నాలుగు గ్రామాల రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, జీఎంపీఎస్ జిల్లా చైర్మన్ గంటా శ్రీరాం, సీఐటీయూ మండల కార్యదర్శి ఆర్.దేముడునాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత గ్రామాలైన బైలపూడి, చినగోగాడ, జి.కొత్తపల్లి, అడవి అగ్రహారం గ్రామాల రైతులతో బైలపూడిలో మహాధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ నాలుగు గ్రామాల్లో భూ సేకరణను వ్యతిరేకిస్తూ అధికారులు జారీ చేసిన నోటీసులకు సమాధానం చెప్పినా సరే తహసీల్దార్ బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. అవి ప్రభుత్వ భూములని పోలీసుల సహకారంతో సేకరిస్తామని బెదిరించడం తగదన్నారు. నాలుగు గ్రామాల్లో 262 ఎకరాలకు 40 ఏళ్ల క్రితమే సాగు హక్కు పత్రాలు మంజూరు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్ ద్వారా 57.97 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మంచనున్నట్లు ప్రకటించిందన్నారు. ఈ భూముల్లో వందలాది మంది రైతులు పామాయిల్, నువ్వులు, వేరుశనగ, తదితర పంటలతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ పేరిట ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. గ్రామసభల్లోనే భూములు ఇవ్వబోమని చెప్పినా పట్టించుకోకుండా సేకరణ పేరిట ముందుకు వెళ్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ఎ.అగ్రహారం మాజీ సర్పంచ్ సలాది గంగశేషు, మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, గంటా మత్స్యరాజు, జాజిమొగ్గల రమేష్, సిహెచ్ శ్రీను, సన్యాసిరావు, సిరికి రాము, అప్పలనాయుడు, మహాలక్ష్మి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. -
చలివేంద్రాలకు ‘నీరు’సం
నర్సీపట్నం: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు పట్టణ ప్రధాన కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మండుతున్న వేసవి తాపానికి దాహార్తిని తీర్చుకునేందుకు పాదచారులు, వాహనదారులు చలివేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. సిబ్బంది పర్యవేక్షణ కొరవడటంతో చలివేంద్రాల్లో నీళ్లు మధ్యాహ్నానికే నిండుకుంటున్నాయి. సోమవారం ఎల్ఐసీ భవనానికి ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రంలో నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. చలివేంద్రంలో మూడు వాటర్ క్యాన్లు ఉన్నప్పటికీ చుక్కనీరు లేదు. దీంతో పాదచారులు వెనుతిరిగారు. కొంత మంది విద్యార్థుల షాన్షాపులో నిమ్మ సోడాలు కొనుకోని దాహార్తిని తీర్చుకున్నారు. చలివేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వారం రోజుల్లో అర్జీలకు పరిష్కారం : ఎస్పీ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 65 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య వేధింపులు, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సీఐ సేనం రమేష్ పాల్గొన్నారు. -
అనుకోని ప్రమాదం.. మంచానికే పరిమితం!
మాకవరపాలెం: అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆ ఆటో డ్రైవర్ను మంచానికే పరిమితం చేసింది. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో కుటుంబ పోషణ కష్టమై ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన పట్నాల శ్రీను(33) ఆటో నడుపుకొంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే 2024 మార్చి 3వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుకొని ఇంటికి వస్తుండగా రాచపల్లి గ్రామం దగ్గరలో మలుపు వద్ద కారును తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో సుమారు 5 గంటలపాటు మెడపైన ఉండిపోయింది. దీంతో మెడ భాగం దెబ్బతినగా ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఒక వైపు భాగం మొత్తం చేయి, కాలు, శరీరంలో చలనం లేకపోవడంతో శ్రీను రెండేళ్లుగా మంచానికే పరిమితం అయ్యాడు. శ్రీనుకు భార్య జయ, కుమార్తెలు నవ్యశ్రీ(8), రోహిత(7), కుమారుడు పార్థు(5) ఉన్నారు. మంచంపైనే ఉండడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని వాపోతున్నాడు. కనీసం పెన్షన్ అయినా ఇప్పించాలని వేడుకుంటున్నాడు. చాపలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులే తమకు ఆధారంగా ఉన్నారని శ్రీను తెలిపాడు. ఆపరేషన్కు రూ.24 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారని, అంత నగదు లేక మంచానికే పరిమితం అయ్యాయని వాపోయాడు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నాడు. తల్లిదండ్రులపైనే ఆధారం -
ఇంధన కొరత లేకుండా చూడాలి
తుమ్మపాల: జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం జరిగిన దిశా (జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మానటరింగ్ కమిటీ) సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్బాబు, బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ, కె.ఎస్.ఎన్.ఎస్. రాజులతో కలిసి వారు వివిధ అంశాలపై సమీక్షించారు. జలజీవన్ మిషన్ ద్వారా జిల్లాల చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 68 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రహదారికి ఇరువైపులా సోలార్ లైటింగ్ ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు. నాలుగైదు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలను రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలతో పూర్తయ్యే వాటికి నిధులు మంజూరు చేయాలని జెడ్పీ సీఈవో సత్యనారాయణమూర్తిని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మళ్ల సురేంద్ర, బత్తుల తాతయ్యబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
సత్యసాయి సేవా మార్గం అనుసరణీయం
దేవరాపల్లి: భగవాన్ సత్యసాయి బాబా చూపిన ఆధ్యాత్మిక, ప్రేమ, సేవా మార్గం అనుసరణీయమని సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త తోట అరుణ తెలిపారు. మండలంలోని చిననందిపల్లిలో భగవాన్ సత్యసాయి నామస్మరణం మారుమోగింది. సోమవారం ఇక్కడ నిర్వహించిన 101 పాటల భజన కార్యక్రమంతో ఆధ్యాత్మిక శోభ సంతరించరించుకుంది. సత్యసాయి భజన మండలి జోన్–6 ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త తోట అరుణ చేసిన ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులను పులకరింపజేసింది. ఈ కార్యక్రమంలో జోన్ ఇంచార్జ్ సిహెచ్వి. రవిశంకర్, నౌడు అప్పారావు మాష్టారు, కొటాన శ్రీను, పద్మ దంపతులు, భవాని, సూర్య, భాస్కరరావు, కృష్ణ, అప్పారావు, కొరుకొండ పెంటారావు, స్వామినాయుడు, రామకృష్ణ, రమణమూర్తి, రమామణి తదితర మహిళా సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త తోట అరుణ -
గడ్డిమందు తాగిన మహిళ మృతి
మునగపాక: అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగిన మహిళ సోమవారం మృతి చెందినట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మరాజుపేటకు చెందిన దొడ్డి వనజ (47) కొంత కాలంగా అనారోగ్య సమస్యతో మానసిక ఆవేదనకు గురై ఈ నెల 17న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి చెల్లెలు బొడ్డేడ విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. -
ఎక్కువ మంది పిల్లలనుకనమనడం తగదు
డుంబ్రిగుడ: మహిళలు ఎ క్కువ మంది పిల్లల్ని కనాల ని ముఖ్యమంత్రి చంద్రబా బు చెప్పడం తగదని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ఎంపీపీ శెట్టి ఆనంద్రావు మండిపడ్డారు. సోమవారం వారు మాట్లాడుతూ మీరు మాత్రం ఒక్క లోకేష్, మీ కుమారుడు ఒక్క దేవాన్ష్నే కంటారు, ప్రజలకు మాత్రం ఉపన్యాసాలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్య, కుటుంబ పోషణ భారం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాజీ ఎంపీటీసీ తాంగుల రాందాసు, తుమ్నాథ్ పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో నూతన భవనాలు ప్రారంభం
అనకాపల్లి: ఎన్టీఆర్ ఆస్పత్రిలో జిల్లా ఆర్హెచ్ఐ మ్యాగ్నిటిక్ సంస్థకు చెందిన సీఎస్ఆర్ రూ.1.50కోట్ల నిధులతో నిర్మించిన నూతన భవనాలను ఎంపీ సీఎం.రమేష్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ , ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్హెచ్ఐ సీఎస్ఆర్ నిధులతో ఆస్పత్రి ఆవరణలో రోగులకు కావలసిన మౌలిక సదుపాయలు నిమిత్తం నూతన భవనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రూ.6లక్షల ఎంపీ నిధులతో మాత శిశువు వార్డు వద్ద పరిశుభ్రమైన ఆర్ఓ ప్లాంట్ను నిర్మించామన్నారు. ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సుమారుగా రూ.5 నుంచి 6 కోట్ల నిధులతో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్హెచ్ఐ సంస్థ సీఈవో అభిషేక్ శర్మ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, డీఎంహెచ్వో శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ పాల్గొన్నారు. -
ఆర్టీసీలో విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణ ఆపాలి
విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలని, ప్రైవేటీకరణ అంశాన్ని ఆపాలని, సీ్త్ర శక్తి పథకం ద్వారా పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచాలని, నూతన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగులను భర్తీ చేయాలంటూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ డీఎన్ మూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలన్నారు. పదవీ విరమణ, మరణించిన ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ వాసు, జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వై.వి.ఎస్. కుమార్, డిపో కమిటీ ట్రెజరర్ పి.సతీష్ పాల్గొన్నారు. -
భక్తులకు మజ్జిగ,మంచినీరు పంపిణీ
పాడేరు రూరల్: మోదకొండమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా గిరి కై లాస క్షేత్రం శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ రాజేశ్వరి అమ్మవారి దేవాలయ ఆధ్యాత్మిక సేవా బృందం ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తాగునీరు, మజ్జిగ, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరి కై లాస క్షేత్రం ఆలయ చైర్మన్, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ నర్సింగరావు దంపతులు హాజరై పంపిణీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... దైవ మార్గంతోనే మానసిక ప్రశాంతత, ముక్తి కలుగుతాయని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గిరి కై లాస క్షేత్ర ధర్మకర్తల మండలి సభ్యురాలు రమాదేవి, ప్రధాన అర్చకులు ఉప్పల సీతారామశాస్త్రి, నిర్వాహకులు రామారావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెదబయలులో 24 నుంచి మోదమ్మ ఉత్సవాలు
పెదబయలు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర ఉత్సవాల గోడపత్రికలను ఆదివారం ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహం, అమ్మవారి పాదాలు, ఘటాలతో ఊరేగింపుగా వెళ్లి శతకంపట్టు వద్ద కొలువు దీరుస్తారు. అక్కడ మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఉత్సవాల చివరి రోజైన 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం నుంచి అమ్మవారి విగ్రహంతో భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, అదే రోజు భక్తులు ఆలయంలో తమ మొక్కులు తీర్చుకుంటారని కమిటీ సభ్యులు వివరించారు. పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ముగిసిన తర్వాత వారంలో పెదబయలు ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితిగా వస్తోందని వారు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు రాత్రి వేళల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు భక్తులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మండల ప్రజలు పూర్తి సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కిమంకరి బొంజుబాబు, కమిటీ గౌరవ పెద్దలు గంపరాయి సూరయ్య, దడియా రాంబాబు, పలాసి కొండబాబు, శశిధర్, చంద్రమౌళి, పలాసి తిరుపతిరావు, పాంగి పాల్గుణ, సమరెడ్డి పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పోస్టర్లు ఆవిష్కరణ -
నిండు గర్భిణికి నరకయాతన
పెదబయలు : మన్యం ప్రాంతంలో డోలీ మోతలు లేకుండా చేస్తాం.. ప్రతి గ్రామానికీ రోడ్డు సదుపాయం కల్పిస్తాం అని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పెదబయలు మండలం గోమంగి పీహెచ్సీ పరిధిలోని బొంగరం పంచాయతీ వెదురుగొయ్యి గ్రామంలో ఆదివారం ఒక గర్భిణి పడిన అవస్థలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి. ప్రసవ వేదనతో.. వెదురుగొయ్యి గ్రామానికి చెందిన చిక్కుడు సిమ్మలి అనే మహిళకు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు భర్త చిక్కుడు చిక్కన్న, ఆశా కార్యకర్త విజయకుమారి, బంధువులు ఇబ్బందులు పడ్డారు. గర్భిణిని సుమారు రెండు కిలోమీటర్ల దూరం కొండల మధ్య కాలినడకన వంచుర్భ గ్రామం రోడ్డు పాయింట్ వరకు నడిపించాల్సి వచ్చింది. అక్కడికి చేరుకున్నాక గోమంగి పీహెచ్సీ అంబులెన్స్కు సమాచారం అందించగా, వాహనం వచ్చిన తర్వాత ఆమెను పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తరలింపు.. సిమ్మలికి ఇది రెండో కాన్పు. గోమంగి పీహెచ్సీలో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ప్రసవ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడం, శరీరంలో రక్తం శాతం తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి చైతన్య తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని, తల్లికి అవసరమైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి తమ గ్రామానికి వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు మాధవరావుతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేశారు. లింగేటి పంచాయతీ లింగేరిపుట్టు నుండి వెదురుగొయ్యి గ్రామానికి, అలాగే వంచుర్భ నుండి వెదురుగొయ్యికి రోడ్లు వేయాలని కోరారు. రోడ్డు లేకపోవడం వల్ల అత్యవసర వైద్య సేవలు అందడం లేదని, చివరికి పీఎం జన్మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణ సామగ్రిని కూడా గ్రామానికి తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు కిలోమీటర్లు నడవడంతోరక్తస్రావం వంచుర్బ నుంచి గోమంగి పీహెచ్సీకి అంబులెన్స్లో తరలింపు ముంచంగిపుట్టు ఆస్పత్రిలో కాన్పు తల్లీబిడ్డ క్షేమం -
జి.మాడుగులలో భారీ వర్షం
జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదుర గాలులు, పిడుగులతో భారీ వర్సం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. జి.మాడుగుల– లంబసింగి జాతీయ రహదారి మార్గంలో మట్టిరోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించేందుక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డుంబ్రిగుడ: డుంబ్రిగుడలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కురవడంతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. వర్షం వల్ల వేరుశనగ, అల్లం పైరుకు మేలు చేకూరుతుందని రైతులు తెలిపారు. -
శివపురంలో బంగారు ఆభరణాలు చోరీ
నర్సీపట్నం: పట్టణంలోని శివపురంలో నివాసం ఉంటున్న మద్దికొండ సిరిల్పాల్ ఇంట్లో ఈ నెల 15వ తేదీ రాత్రి చోరీ జరిగినట్టు టౌన్ సీఐ ఎస్.కె.గఫూర్ తెలిపారు. సిరిల్పాల్ కుటుంబ సభ్యులతో కలిసి వేరే ఊరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఎవరైనా ఇతర ఊళ్లకు వెళ్లే సమయంలో తమ విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలని, లేదా తమ వెంట తీసుకువెళ్లాలని సీఐ సూచించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్: మునిపాలిటీ పరిధి సోమలింగపాలెం సమీపంలో గోకివాడ ఆనకట్ట వద్ద శారదానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.ఇక్కడ నదిలో తేలుతూ ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రమాదవశాత్తు నదిలో జారిపడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహం స్థితిని బట్టి ప్రమాదం జరిగి ఒకరోజు కావచ్చని ఎస్ఐ తెలిపారు.మృతదేహాన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని,మృతుని చిరునామా,ఇతర వివరాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9440796104 నంబరులో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
వేధింపుల పర్వం
ఏయూలో దళిత పరిశోధకుడిపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఈ దారుణ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ ఎస్సీ కమిషన్.. ఏడు రోజుల్లోగా పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని వీసీ రాజశేఖర్కు కస్టమ్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ వర్సిటీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. కమిషన్ తాజాగా ‘అత్యవసర’ రిమైండర్ను పంపింది. ఇంకా నిర్లక్ష్యం వహిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం కమిషన్కు ఉన్న సివిల్ కోర్టు సమానమైన అధికారాలను ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. మద్దిలపాలెం: జాతీయ స్థాయిలో ఘన చరిత కలిగిన విశ్వవిద్యాలయంగా వెలుగొందుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వర్సిటీ ఉన్నతాధికారుల అనుచిత వైఖరి, మొండితనం కారణంగా జాతీయ స్థాయిలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేడ్కర్ పేరుతో నడుస్తున్న ప్రతిష్టాత్మక పీఠం(చైర్)లోనే ఒక దళిత పరిశోధక విద్యార్థికి ఘోర అవమానం ఎదురైంది. ‘జాతీయ ఎస్సీ కమిషన్’ఆదేశాలను సైతం వర్సిటీ ఉన్నతాధికారులు బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖతో పాటు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కుతూ ఒక మేధావిని మానసికంగా కుంగదీస్తున్న వైనంపై జాతీయ కమిషన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఫెలోషిప్ నిలిపివేత.. వీసీ, డీన్లపై వేధింపుల ఆరోపణలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పీఠం కింద డాక్టరల్ ఫెలోగా అత్యున్నత పరిశోధన చేస్తున్న యాడాల ప్రవీణ్కుమార్ ఏడాది కాలంగా నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితుడు జాతీయ ఎస్సీ కమిషన్కు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ప్రకారం.. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఆర్ అండ్ డీ డీన్లు తనను పదేపదే వివక్షకు గురిచేస్తున్నారు. పరిశోధనకు సంబంధించిన ఫెలోషిప్ సొమ్మును ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తూ, ఆర్థికంగా దెబ్బతీస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. కన్నతల్లిని కోల్పోయినా కరగని మానవత్వం తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకునేందుకు వీసీ కార్యాలయానికి పదేపదే తిరిగినా ప్రవీణ్ను కనీసం గదిలోకి కూడా రానివ్వలేదు. చివరకు వీసీ కారు ఎక్కి వెళ్తుండగా.. పరుగున వెళ్లి వేడుకున్నా కనీస మానవతా దృక్పథం చూపకపోగా, ‘అంబేడ్కర్ చైర్ను మూసేస్తాం, నిన్ను యూనివర్సిటీలో లేకుండా చేస్తాం’అంటూ చిన్నచూపు చూస్తూ మాట్లాడారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారుల మనసు కరగలేదు. చివరకు వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేదనను భరిస్తూనే, తల్లికి సరైన వైద్యం అందించలేక ప్రవీణ్కుమార్ తన తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. సీపీకి ఎస్సీ కమిషన్ లేఖ మరోవైపు ఈ ఘటనపై అట్రాసిటీల నిరోధక చట్టం కింద తక్షణమే కేసు నమోదు చేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్కు జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో నగర పోలీసులు రంగంలోకి దిగి, ఈ వేధింపుల ఆరోపణలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించడంతో ఏయూ వర్గాల్లో వణుకు మొదలైంది. బాబాసాహెబ్ సందేశమే నన్ను బతికించింది: ప్రవీణ్ కుమార్ ‘వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేధింపులను తట్టుకోలేక, ఒక దశలో ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ హక్కుల కోసం పోరాడాలి, ఉద్యమించాలి అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ సందేశం నన్ను బతికించింది. ధైర్యాన్ని కూడగట్టుకుని, అన్ని ఆధారాలతో జాతీయ కమిషన్ను ఆశ్రయించాను’అని ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. -
కేంద్ర గిరిజన మంత్రి దృష్టికి ఆదివాసీల సమస్యలు
పాడేరు రూరల్: ఆదివాసీ ప్రాంతాల్లో నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, ఆదివాసీ హక్కుల చట్టాల పరిరక్షణపై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలోని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఒరామ్ను ఆయన అధికార నివాసంలో ఏఏఆర్ఎం నేషనల్ చైర్మన్ జితేంద్ర చౌదరి, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకారత్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్లతో కలిసి ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం అప్పలనర్స కేంద్ర మంత్రికి సమర్పించిన వినతిపత్రంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. ఐదో షెడ్యూల్ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో అన్ని రకాల హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నూరు శాతం అమలు చేయాలని, ప్రస్తుతం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. అలాగే పీఎం జన్మన్ బకాయి సొమ్మును వెంటనే విడుదల చేయాలన్నారు. గ్రామసభల ఆమోదం లేకుండా గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తున్న హైడ్రోపవర్ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలన్నారు. ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2026 నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరామన్నారు. గతంలో ఉన్న జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను తీసుకురావాలని విన్నవించామన్నారు. గత 50 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నాన్–షెడ్యూల్ ఆదివాసీ గ్రామాలన్నింటినీ 5వ షెడ్యూల్ ప్రాంతాలలో విలీనం చేస్తూ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పీఎం జన్మన్ పథకం కింద ఇచ్చే ఇంటి యూనిట్ విలువను ప్రస్తుతం ఉన్న రూ. 3.39 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కోరామన్నారు. ఆదివాసీ మాతృభాషా వలంటీర్లతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో సానుకూలంగా చర్చించినట్లు అప్పలనర్స తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స -
ముగిసిన రాష్ట్ర స్థాయివాలీబాల్ పోటీలు
పాడేరు రూరల్: పట్టణంలోని తలారిసింగి బాలుర పాఠశాల మైదానంలో ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈటోర్నిలో సుమారు 40 జట్లు తలపడ్డాయి. ప్రథమ స్థానం హకుంపేట. ద్వితీయస్థానం పాడేరు మండలం చీడిమెట్ట జట్లు సాధించాయి. వీటికి అమ్మవారి జాతర ముగింపు రోజు ఈనెల 19న నగదు బహుమతులు అందజేస్తామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. మహేష్, కృష్ణ, పీడీలు మహేష్బాబు, మన్మథరావు, సింహాచలం, వినోద్ పాల్గొన్నారు. -
భక్తజన ప్రమోదంగా..
పాడేరు: గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వేశ్వరరాజు, కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవంగా అమ్మవారి ఊరేగింపు ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలుత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తలపై ఎత్తుకోగా, అమ్మవారి పాదాలను, ఘటాలను కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి కొద్దిసేపు తమ తలపై మోశారు. అనంతరం అమ్మవారి ఆలయం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న సతకం పట్టు వరకు ఊరేగింపు సాగింది. వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, నేలవేషాలు, వివిధ రకాల సంప్రదాయ నృత్యాల నడుమ ఈ ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. ● అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను తాకి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పోటీ పడ్డారు. ఊరేగింపు అనంతరం సతకం పట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఉత్సవ విగ్రహం, ఘటాలు, పాదాలను అక్కడ ప్రతిష్టించారు. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పాడేరు నుంచి అన్ని ప్రధాన మార్గాల్లో 100 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా పట్టణంలో ట్రాఫిక్ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు జాతర తొలిరోజు సందర్భంగా పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లతో పాటు, ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అధికారులు భారీ ఎత్తున ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జాతర తొలిరోజు వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టాళ్లు ప్రారంభించిన కలెక్టర్ నిశాంతి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ప్రారంభించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో కాఫీ ప్రాజెక్టు, సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ఐసీడీఎస్, గ్రామీణాభివృద్ధిపై డీఆర్డీఏ, జీసీసీ, బాల్యవివాహాల నిర్మూలనపై సీడ్ ఆర్గనైజేషన్, ఉద్యానవన శాఖ, సుగంధ ద్రవ్యాల బోర్డు తదితర ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన వైద్యారోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అధికారికంగా ఏర్పాటు చేసిన స్టేజీపై సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి అభిషేక్, రాష్ట్ర సృజనాత్మక, జానపద కళాల అకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లలో ‘కూటమి’ వైఫల్యం ఘనంగా పాడేరు మోదకొండమ్మ జాతర ప్రారంభం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయకమిటీ చైర్మన్ విశ్వేశ్వరరాజు దర్శించుకున్న కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ ఆలయం నుంచి సతకంపట్టు వరకు భారీగా ఊరేగింపు ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ కట్టుదిట్టమైన పోలీసు భద్రత పాడేరు: రాష్ట్ర గిరిజన జాతరగా వైభవంగా సాగాల్సిన పాడేరు శ్రీ మోదకొండమ్మ ఉత్సవాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అట్టహాసంగా ప్రచారం చేసుకున్న అధికార యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో భక్తులు, ప్రభుత్వ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. జాతర తొలి రోజైన ఆదివారం అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాల ఊరేగింపును తిలకించేందుకు ఆలయం నుంచి సతకం పట్టు వరకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. అయితే, ఎండ తీవ్రతకు అల్లాడిపోయిన భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అధికారులు కల్పించలేకపోయారు. ఆహార పొట్లాలు ఐటీడీఏకే పరిమితం.. సాయంత్రం జాతరకు వచ్చే భక్తులకు ఉచితంగా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకున్న నిర్వాహకులు.. తీరా చూస్తే కేవలం ఒక్క ఐటీడీఏ ఆవరణ రహదారి వద్ద మాత్రమే ఆ ప్రక్రియను ముగించారు. దీంతో కొద్దిమందికి తప్ప మెజార్టీ భక్తులకు ఆహార పొట్లాలు అందలేదు. ఇక జాతరకు పోటెత్తిన మహిళా భక్తులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో వారు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. విధుల్లో ఉన్న సిబ్బందికి ‘సొంత’ ఖర్చులు! మరోవైపు, జాతర పర్యవేక్షణ కోసం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి 24 గంటల పాటు విధుల్లో ఉండాలని 17 మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. వీరికి ఆహారం సంగతి దేవుడెరుగు.. కనీసం గుక్కెడు మంచినీరు కూడా అందించే నాథుడు కరువయ్యాడు. రాత్రింబవళ్లు విధుల్లో ఉండే తమను కనీసం పట్టించుకోకపోగా.. మీ సొంత డబ్బులతోనే ఆహారం ఏర్పాటు చేసుకోండి అని నిర్వాహకులు ఉచిత సలహా ఇవ్వడంపై సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై భక్తులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా మిగిలిన రెండు రోజులైనా అన్ని సౌకర్యాలు సక్రమంగా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తులకు కరువైన తాగునీరు మహిళలకు తప్పని మరుగుదొడ్ల తిప్పలు కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి గుక్కెడు నీరివ్వని నిర్వాహకులు -
రెండు లారీలు ఢీ
మాకవరపాలెం: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మండలంలోని శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున తాళ్లపాలెంవైపు నుంచి రాచపల్లి వద్దగల పయినీర్ కంపెనీకి బొగ్గులోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ప్రమదంలో బొగ్గులారీ డ్రైవర్ గాయపడడంతో వెంటనే విశాఖ తరలించినట్టు స్థానికులు తెలిపారు. బొగ్గు లారీ ముందు భాగం బాగా దెబ్బతినడంతో సాయంత్రం వరకు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం స్థానిక పోలీసులు దగ్గరుండి లారీని పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.డ్రైవర్కు గాయాలు -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు పెదకోరాడలో ఉరి వేసుకుని ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా నారిపల్లి మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల హనుమంతురెడ్డి పెదకోరాడ గ్రామానికి చెందిన చీపిరి కృష్ణవేణిని సుమారు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. పెదకోరాడలో ఈ నెల 12న జరిగిన పండగకు భార్య, తల్లితో కలిసి హనుమంతురెడ్డి వచ్చాడు. భార్యాభర్తల మధ్య శనివారం చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తాను ఇంటికి వెళ్తానని చెప్పి హనుమంతురెడ్డి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు. సాయంత్రం పశువుల పాకలో ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.మృతుడు అనంతపురం జిల్లా వాసి -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ఆలయ ఏఈవో పిల్లా శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. -
చెరువులో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు
యలమంచిలి రూరల్: మండలంలోని జంపపాలెం సమీపంలో మొండి గెడ్డ చెరువులో ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పొక్లెయిన్తో మట్టి తవ్వకాలు చేపట్టడంపై ఆ గ్రామానికి చెంది దాడి జగ్గ అప్పలనాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు.కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారని ఫిర్యాదుచేయడంతో పాటు అందుకు సంబంధించిన వీడియోలు,ఫొటోలను రెవెన్యూ అధికారులకు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టు చేశారు. తహసీల్దార్ వరహాలు స్పందించి అక్కడకు వెళ్లాల్సిందిగా వీఆర్వో నూకరాజు,వీఆర్ఏలు రమాదేవి,అప్పారావులను ఆదేశించారు.వాళ్లు అక్కడకు వెళ్లేసరికే అక్రమ తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులు వాహనాలతో పరారయ్యారు.అయితే అప్పటికే కొంత మట్టిని తరలించుకుపోయారు.తాను ఆరు నెలల క్రితమే మొండి గెడ్డలో పూడిక తీయిస్తానని జలవనరుల శాఖ అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చానని,కానీ తనకు అనుమతి ఇవ్వకపోగా ఇప్పుడు అక్రమార్కులు దర్జాగా మట్టి తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని అప్పలనాయుడు ప్రశ్నించారు.అదేవిధంగా చెరువు గట్టుపై యూకలిప్టస్ చెట్లను కొందరు నరికి పట్టుకుపోయారన్నారు.అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
‘రాపెప్’ శిక్షణలో రాటు దేలుతున్న అగ్రి విద్యార్థులు
● ఉపయుక్తంగా గ్రామీణ వ్యవసాయ పని అనుభవ (రాపెప్) కార్యక్రమం ● వ్యవసాయ విద్యార్థులకు గ్రామాల్లో ప్రత్యేక శిక్షణఅనకాపల్లి: అధునిక యుగంలో అగ్రికల్చర్ డిగ్రీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. శ్రీకాకుళం జిల్లా నైరా అగ్రికల్చర్ నాలుగో ఏడాదికి కళాశాల 38 మంది విద్యార్థులు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిధిలో ఫిల్డ్ విజిట్లో భాగంగా శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో 38 మంది విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి ఒక విభాగంలో 18 మంది, మరో విభాగంలో 20 విద్యార్థులుగా ఒక్కో బృందానికి రైతులను అప్పగించి, గ్రామాల్లో రైతులు పండిస్తున్న పంటలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అధికారిగా ఆర్ఏఆర్ఎస్లో వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త దాడి ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఒక హోస్ట్ రైతును కేటాయించి, ఆయా రైతుల కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ భూముల వివరాలు, పంటల సాగు విధానాలు తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు గ్రామాల్లో రైతులతో ప్రత్యక్షంగా మమేకమై, గ్రామ సచివాలయం ద్వారా గ్రామానికి సంబంధించిన వివిధ వివరాలను సేకరిస్తున్నారు. రైతుల పొలాలను సందర్శించి పంటలలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి తగిన శాసీ్త్రయ సూచనలు అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ సమాచార కేంద్రం ఏర్పాటు చేసి, పంటలలో వచ్చే చీడపీడలు, వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ, సాంకేతికతలు, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రామ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారాన్ని నిరంతరం చేరవేసే పనిలో అగ్రికల్చర్ విద్యార్థులు చేస్తున్నారు. రాపెప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మట్టి నమూనాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించి, మట్టి పరీక్షల ప్రాముఖ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులతో సమూహ చర్చలు నిర్వహించి, పొలాల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. రైతులను నూతన సాంకేతికతలు, ఆధునిక వ్యవసాయ ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నారు. గ్రామ ప్రజల అభిప్రాయాలు, అవసరాలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పరిస్థితులపై సమగ్ర అవగాహన విద్యార్థులతో పాటు రైతులు పొందుతున్నారు. నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కొత్త వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు పొలాల్లో మెథడ్ డిమానిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను ప్రదర్శిస్తూ మెరుగైన దిగుబడులు సాధించే మార్గాలను తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రైతులు అనుసరిస్తున్న పద్ధతులు, శాసీ్త్రయ సిఫార్సుల మధ్య ఉన్న తేడాలను గుర్తిస్తూ ‘గ్యాప్ అనాలిసిస్’నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి, పంటలలో మెరుగైన దిగుబడుల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించి అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయంపై ప్రత్యక్ష అనుభవం లభించడంతో పాటు రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెరుగుతోంది. -
మట్టి వ్యాపారం ‘పచ్చ’గా...
● చెరువులు గుల్ల చేస్తున్న టీడీపీ నేతలు ● ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు ● పట్టించుకోని అధికారులు కోటవురట్ల : అడ్డదారులు తొక్కేందుకు పచ్చనేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అక్రమాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. మనల్ని ఆపేదెవడు అంటూ పేట్రేగిపోతున్నారు. వరాహనది నుంచి ఇసుక, కొండలను తవ్వేసి గ్రావెల్ తరలించుకుపోతుండగా ప్రస్తుతం పలువురి టీడీపీ నేతల దృష్టి మట్టిపై పడింది. చెరువులను జంకూ గొంకూ లేకుండా తవ్వేసి మట్టిని తరలించుకుపోతున్నారు. పెట్టుబడి లేకుండా మట్టి వ్యాపారం రూ.లక్షలు తెచ్చిపెడుతుండడంతో మండలంలోని పలువురి టీడీపీ నేతల కన్ను చెరువులపై పడింది. దీనికి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు తమకేమీ తెలియనట్టు మిన్నకుండిపోవడంతో మట్టిని ఇష్టానుసారం తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు మట్టి రూ.2500లకు విక్రయించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. బి.కె.పల్లి, రామచంద్రపాలెం రెవెన్యూ పరిధిలోని చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చీకటి పడితే చాలు పచ్చనేతలు పొక్లెయిన్, ట్రాక్టర్లతో చెరువులో వాలిపోతున్నారు. అడ్డేవారు లేకపోవడంతో తెల్లవార్లూ మట్టిని తవ్వేసి తరలించుకుపోతున్నారు. ఆదివారం రాత్రి రామచంద్రపాలెంలోని ఎర్ర చెరువులో గ్రామానికి చెందిన టీడీపీ నేత నేరుగా పొక్లెయిన్తో మటి తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండడంతో తాజా మాజీ సర్పంచ్ పరదేశమ్మ భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు తమరాన కన్నంనాయుడు అడ్డగించారు. చెరువులో నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డుగా ద్విచక్ర వాహనాన్ని నిలిపి అడ్డగించారు. దాంతో టీడీపీ నాయకుడు వాగ్వాదానికి దిగినట్టు కన్నబాబు తెలిపారు. కన్నబాబు మాట్లాడుతూ చెరువులో పొక్లెయిన్తో మట్టిని తవ్వి 5 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం తవ్వగా అడ్డుకున్నామని, తిరిగి ఆదివారం కూడా తవ్వకాలు జరపడంతో అడ్డుకుని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫోన్ చేసినట్టు తెలిపారు. అయితే అధికారులు స్పందించలేదని ఆరోపించారు. -
మోదమ్మ జాతరలో కూటమి రాజకీయం
● పండగ తేదీల మార్పు.. గిరిజన సంప్రదాయాలపై దాడే! ● వైఎస్సార్సీపీ నేతల మండిపాటు డుంబ్రిగుడ: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ తల్లి రాష్ట్ర గిరిజన జాతరను సైతం కూటమి ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు వేదికగా మార్చుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్రావు మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం క్యాంపు కార్యాలయంలో డుంబ్రిగుడ మండల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు, గిరిజన సంఘాలతో పాటు అన్ని పక్షాలు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన మోదకొండమ్మ జాతర తేదీలను.. కూటమి నేతలు తమ వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం మార్చడం గిరిజన సంప్రదాయాలపై దాడి చేయడమేనని విమర్శించారు. టీడీపీ నేత వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో.. ఆయన పర్యటనకు వీలుగా ఇన్చార్జ్ మంత్రి సంధ్యారాణి, టీడీపీ పాడేరు ఇన్చారిర్జ గిడ్డి ఈశ్వరి కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడి తెచ్చి, జాతర తేదీలను ఏకపక్షంగా మార్పించారని ఆరోపించారు. పోస్టర్లలో ప్రొటోకాల్ ఎక్కడ? ఇంతటితో ఆగకుండా జాతరకు సంబంధించిన అధికారిక, సాంస్కృతిక పోస్టర్లలో కూడా కూటమి నాయకులు రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగారని నాయకులు ధ్వజమెత్తారు. పాడేరులో స్థానిక ఎమ్మెల్యేనే ఆలయ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారని, ఆ హోదాలో ఉన్న ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఫొటోతో పాటు జిల్లాలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పొటోలను ప్రొటోకాల్ ప్రకారం పోస్టర్లలో ముద్రించడం ఆనవాయితీ అని గుర్తుచేశారు. కానీ, గిడ్డి ఈశ్వరి రాజకీయ ద్వేషంతో ప్రస్తుత ఎమ్మెల్యే, జిల్లా ప్రజాప్రతినిధుల ఫొటోలు ఎక్కడా లేకుండా చేసి.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, సంధ్యారాణి ఫొటోలతో పాటు తన పొటోను పెద్దదిగా ముద్రించుకున్నారని విమర్శించారు. ఇది రాష్ట్ర గిరిజన జాతరలా ఉందా? లేక టీడీపీ కూటమి జాతరలా ఉందా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు చేస్తున్న కుట్రలను మన్యం ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో గుంటసీమ, లైగండ ఎంపీటీసీలు గోపాల్ రావు, బి. రామరావు, తుమ్నాథ్, అర్జున్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముత్యాలమ్మతల్లి హుండీ ఆదాయం లెక్కింపు
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న కమిటీ సభ్యులు చింతపల్లి: స్థానిక శ్రీ ముత్యాలమ్మ తల్లి మూలవిరాట్ హుండీ ఆదాయం రూ. 68,600 వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవాలు గత నెల 14వ నుంచి 17 వరకు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ జాతర సందర్భంగా భక్తులు హుండీలో వేసిన విరాళాలను శనివారం కమిటీ పెద్దల సమక్షంలో ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సుర్ల అప్పారావు, సుర్ల వీరేంద్ర, కమిటీ సభ్యులు మాదల తిరుపతి, పెదిరెడ్ల బేతాళుడు, మాజీ వైస్ సర్పంచ్లు గంజారి రమణ, బండారు అప్పలనాయుడు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. -
700 మందితో భారీ బందోబస్తు: ఎస్పీ అమిత్బర్దర్
జాతర సందర్భంగా మూడు రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాడేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర రద్దీ దృష్ట్యా ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి పట్టణంలోకి భారీ వాహనాల అనుమతిని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 700 మంది సిబ్బందితో పాటు రెండు శక్తి బృందాలు, మూడు డ్రోన్ కెమెరాలు, క్రైమ్ పార్టీ సిబ్బందిని రంగంలోకి దించామన్నారు. విశాఖపట్నం వైపు నుంచి పాడేరు వచ్చి పోయే వాహనాలు వంతాడపల్లి చెక్పోస్టు నుంచి తుంపాడ, సన్యాసమ్మపాలెం మీదుగా చింతలవీధి మార్గం మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. అరకు, ముంచంగిపుట్టు మార్గాల నుంచి వచ్చే వాహనాలు కూడా చింతలవీధి వరకే అనుమతి ఉందన్నారు. జి. మాడుగుల ప్రాంతం నుంచి విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వచ్చేపోయే వాహనాలు గొందూరు సెయింటాన్స్ పాఠశాల జంక్షన్ నుంచి లగిసిపల్లి, నక్కలపుట్టు మీదుగా వెళ్లాలని ఎస్పీ సూచించారు. -
ఆర్గానిక్ జిల్లాగా తీర్చిదిద్దుతాం
పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణే ధ్యేయంగా ‘గ్రీన్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఆంధ్ర’ విభాగాలను మరింత బలోపేతం చేయనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. పాడేరు మండలంలోని కిండంగి పంచాయతీ కేంద్రంలో ఉన్న తడి, పొడి చెత్త ద్వారా సంపద సృష్టి కేంద్రాన్ని శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన పరిశ్రమలకు ప్రాధాన్యం ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ.. పరిశుభ్రమైన, హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో జిల్లాలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాను వంద శాతం ఆర్గానిక్ (సేంద్రియ) జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని పునరుత్పాదక ఇంధన వనరుల వాడకానికి, అలాగే వ్యర్థాలను పునర్వినియోగం చేసే గ్రీన్ ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలకు జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. స్వచ్ఛతపై నిరంతర నిఘా ఉంచుతూ.. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన, వ్యర్థాల నిర్మూలనకు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లాలో సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులకు, క్లాప్ మిత్రలకు వారి రక్షణ కొరకు చేతి తొడుగులు, గం బూట్లు, యూనిఫాం, శానిటేషన్ పరికరాలు, టోపీలు, మాస్క్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, సీపీఆర్ కమిషన్ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో చంద్రశేఖర్, స్థానిక అధికారులు, గ్రామసచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
చెత్తమయం
జిల్లా కేంద్రం..పాడేరు రూరల్: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో పంచాయతీ పాలన పూర్తిగా పడకేసింది. పురవీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోవడమే కాకుండా, కల్వర్టులు, డ్రైనేజీలు పూడికతీతకు నోచుకోక అస్తవ్యస్తంగా మారాయి. ● ముఖ్యంగా ప్రభుత్వ పాత ఆసుపత్రి, కోర్టు భవనాల సమీపంలో, ఐటీడీఏ కార్యాలయం వెనుక వైపు, జీసీసీ చైర్మన్ క్యాంపు కార్యాలయం ఎదురుగా, అలాగే కింద బజార్లోని మాంసం దుకాణాల సెంటర్ వద్ద పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి, ఈగలు, దోమల బెడద తీవ్రమైంది. ● పలు వీధుల్లో మురుగు కాలువలు మురిగిపోయి విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో వీధుల్లో పిల్లలను ఆటలాడించాలన్నా ఎక్కడ వ్యాధులు ప్రబలుతాయోనని తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రతకు కేరాఫ్.. పాడేరు పట్టణం పేరుకే జిల్లా కేంద్రంగా చలామణి అవుతోంది కానీ, క్షేత్రస్థాయిలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు పలు వీధుల్లో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పురవీధుల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ● గత కొన్నాళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండటంతో పారిశుధ్య నిర్వహణ మరింత అధ్వాన్నంగా తయారైందని, ఈ సమస్యపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నామని స్థానికులు వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పండగ వేళల్లోనూ పట్టించుకోరా? ఈ నెలలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మోదకొండమ్మ తల్లి రాష్ట్ర జాతర వేడుకలు జరగనున్నాయి. ఇంతటి పెద్ద పండగ వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాపాలనను గాడికి వదిలేసి, కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. మంచినీటికీ ఇబ్బందే! గత కొద్దిరోజులుగా కురుస్తున్న వరుస వర్షాలకు డ్రైనేజీలు వ్యర్థాలతో పూర్తిగా పూడుకుపోయాయి. పట్టణంలో ఇప్పటికే డెంగ్యూ, మలేరియా వంటి కేసులు నమోదవుతున్నాయని, ఇప్పటికై నా అధికారులు తేరుకుంటారా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు వీధుల్లో వచ్చే రక్షిత మంచినీటి పైప్లైన్ సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంటోందని, పర్యవేక్షణ లోపంతో ప్రజా సేవలు పూర్తిగా కుంటుపడ్డాయని స్థానికులు మండిపడుతున్నారు. పాడేరులో అధ్వానంగా పారిశుధ్యం పేరుకుపోయిన వ్యర్థాలు దోమలు, ఈగలతో వ్యాధుల భయం జాతర వేళ కూడా పట్టించుకోని అధికార యంత్రాంగం స్థానికుల ఆగ్రహం -
పులి సంచారంతో గుబులు
కొయ్యూరు: రాజవొమ్మంగి–కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం అటు అటవీ అధికారులను కలవరానికి గురిచేస్తుంటే, ఇటు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. సరిహద్దుల్లోని కొమ్మిక, రాజులపాలెం, చిన్నరెల్లలపాలెం, బరతనపల్లి గ్రామాల మధ్య ఉన్న యూకలిప్టస్ తోటల్లో పులి సంచరిస్తున్నట్టు శనివారం అటవీ అధికారులు గుర్తించారు. పులి రోజుకు చాలా తక్కువ దూరం మాత్రమే కదులుతుండటంతో.. ఒకటి లేదా రెండు రోజుల క్రితమే అది ఏదైనా వన్యప్రాణిని లేదా పశువును వేటాడి తిని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పులి వెళ్లేందుకు మూడు మార్గాలు.. ప్రస్తుతం పులి ఉన్న ప్రాంతం నుంచి ముందుకు వెళ్లేందుకు మూడు మార్గాలు ఉన్నాయని అటవీ సిబ్బంది చెబుతున్నారు. బకులూరు మీదుగా తాండవ జలాశయం వైపు వెళ్లడం లేదా ఇటు నుంచి మంప వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు అది వచ్చిన మార్గంలోనే వెనక్కి వెళ్లే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భయపడొద్దు.. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు, తోటల్లో పనులు చేసుకునే రైతులు అప్రమత్తంగా ఉండాలని పెదవలస రేంజ్ అధికారి (రేంజర్) ప్రశాంతికుమారి, ఎఫ్ఎస్వో శ్రీరాములు సూచించారు. కొమ్మిక, మంప పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. పులి కదలికలను రేడియో కాలర్ ట్రాకింగ్ సాంకేతికత ద్వారా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఒకవేళ పులి దాడిలో పశువులు మృతి చెందితే రైతులకు తక్షణమే ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. భయం గుప్పిట్లో గిరిజనం అప్రమత్తమైన అటవీశాఖ యూకలిప్టస్ తోటల్లో ఆనవాళ్ల గుర్తింపు రేడియో కాలర్ ట్రాకింగ్తో కదలికలపై నిఘా కూలీలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక -
మా వీధిలో అన్నీ సమస్యలే
మా వీధిలో అన్నీ సమస్యలే ప్రబలుతున్నాయి. సక్రమంగా తాగునీరు అందడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ అస్సలు లేదు. దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – కె.జ్యోతి, బక్కలపనుకు, పాడేరు పేరుకే జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలో అన్ని రకాల సమస్యలు పేరుకుపోయాయి. మా వీధిలో ఎప్పటి నుంచో డ్రైనేజీ సమస్య వేధిస్తోంది. మురుగునీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలు మరింత ప్రబలుతున్నాయి. – బొండ కనకరత్నం, సుండ్రుపుట్టు, పాడేరు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగిస్తాం. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు, డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – రమేష్, ఈవో (ప్రత్యేకాధికారి), పాడేరు -
జిల్లా కేంద్రం.. చెత్తమయం
జిల్లాకు గుండెకాయ లాంటి ప్రధాన పట్టణం.. ఐటీడీఏ సహా కీలక ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొలువై ఉన్న కేంద్ర స్థానం.. కానీ క్షేత్రస్థాయికి వెళ్తే పారిశుధ్యం పడకేసి మురుగు నిలయంగా దర్శనమిస్తోంది. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో పంచాయతీ పాలన పూర్తిగా నిర్వీర్యమవడంతో పురవీధులన్నీ నరకకూపాలుగా మారాయి. డ్రైనేజీలు పూడికతీతకు నోచుకోక, వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీనికితోడు ఇటీవల కురుస్తున్న వర్షాలు తోడవడంతో ఈగలు, దోమల బెడద తీవ్రమై, పట్టణ ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధుల భయంతో అల్లాడిపోతున్నారు. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
చింతపల్లి: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండగలరని ఎంపీడీవో సీతామహాలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగి పంచాయతీ కేంద్రంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని పురవీధుల్లో పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జి.మాడుగుల: మండలంలోని అన్ని గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్లలో ఉద్భవించే తడి, పొడి చెత్తను విడివిడిగా వేరు చేసి పంచాయతీ వాహనాలకు అందించాలని ఎంపీడీవో డేవిడ్రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని అన్ని పంచాయతీ కేంద్రాల్లో పంచాయతీ అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జి.మాడుగుల కేంద్రంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో పురవీధుల్లో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక ప్రధాన కూడలిలో (సెంటర్లో) భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను రోడ్లపై వేయకుండా, పంచాయతీ స్వచ్ఛరథం వాహనాలకు మాత్రమే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, పీఆర్ ఏఈ మాణిక్యాలరావు, ఏపీఎం రుద్రరావు, ఏపీవో కొండబాబు, వెలుగు స్వయం సహాయక సంఘాల మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కొయ్యూరు: రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మర్రిపాలెం మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కె.సుధా పిలుపునిచ్చారు. శనివారం కళాశాల ఆవరణలో ’స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజాన్ని ప్లాస్టిక్ రహితంగా నిర్మించడంలో భాగంగా మన పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలన్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలంతా పర్యావరణ హితమైన అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వీకేటీ మహాలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ మహమ్మారి ప్రకృతి సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒక్కసారి మాత్రమే వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ను పూర్తిగా నిలిపివేయడం ఎంతో మంచిదన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజుబాబు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల నేల, నీరు, వాతావరణం పూర్తిగా కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ను వాడబోమంటూ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. డుంబ్రిగుడ: మండల కేంద్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు, ప్రజలు అటవీశాఖ, పంచాయతీ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఎంపీడీవో విశ్వనాథ్ కోరారు. మండల కేంద్రంలో మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రకార్యక్రమంలో భాగంగా.. స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సముదాయాల వద్ద ప్లాస్టిక్ నిషేధంపై శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రస్తుతం కిరాణా దుకాణాలు, హోటళ్లు, చికెన్ సెంటర్ల వద్ద ప్లాస్టిక్ కవర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై పారేసే ప్లాస్టిక్ కవర్లను ఆహారంగా భావించి తింటున్న మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్ మహమ్మారిని నివారించడమే ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, ప్రజలు కూడా ఇళ్ల నుంచి వచ్చేటప్పుడే గుడ్డ సంచులను తెచ్చుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు విజయ్, గౌతమి పాల్గొన్నారు. -
పాలపొంగు
గిరి క్షేత్రంలో..ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో విస్తారంగా బత్తిరి సాగు దుంప నుంచి పాలు సేకరణ ● ఎండబెట్టి గుండ తయారీ ప్రకృతి వనరులతో పండిస్తున్న గిరి రైతులు ● సిరులు కురిపిస్తున్న పైరు కిలో రూ.300 నుంచి రూ.350 వరకు ఆదాయంమన్యంలో సాంప్రదాయ పంటల వైభవం మళ్లీ సంతరించుకుంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గిరిజన ప్రాంతాలైన ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు సరిహద్దు ఒడిశా పరిధిలో పాలగుండ (బత్తిరి) సాగు విస్తారంగా సాగుతోంది. పూర్వకాలం నుంచి గిరిజనుల జీవన విధానంలో, ఆహార అలవాట్లలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ పంటకు ప్రస్తుత వేసవి సీజన్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రసాయనాలకు దూరంగా, పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండే ఈ పాలగుండను కొనుగోలు చేసేందుకు మైదాన ప్రాంతాల ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్థానిక వారపు సంతల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది.ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన ముంచంగిపుట్టు, పెదబయలుతో పాటు ఒడిశాలోని లంతాపుట్టు, మాచ్ఖండ్, ఒనకడిల్లీ ప్రాంతాల్లో పాలపిండి (బత్తిరి) సాగు విస్తారంగా జరుగుతోంది. పూర్వకాలం నుంచి గిరిజన ప్రాంతాల్లో ఈ పంటకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం వేసవి కావడంతో మార్కెట్లో దీని ధర ఒక్కసారిగా పెరిగింది. ముంచంగిపుట్టు మండలంలో కరిముఖిపుట్టు, కించయిపుట్టు, సుజనకోట, బంగారుమెట్ట, పెదబయలు మండలంలో పన్నెడ, గోమంగి, గంపరాయి, గలగండ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో విరివిగా సాగుచేస్తున్నారు. శాసీ్త్రయ నేపథ్యం.. ఈ మొక్కను శాసీ్త్రయంగా కర్క్యుమా ఆంగుస్టిఫోలియా అని పిలుస్తారు. దీనినే ’ఈస్ట్ ఇండియన్ యారోరూట్’ అని కూడా అంటారు. ఇది ఉష్ణమండల పంట. వేడి, తేమతో కూడిన వాతావరణం ఈ సాగుకు చాలా అనుకూలం.నీరు నిల్వ ఉండని, సారవంతమైన ఇసుకతో కూడిన లోమ్ నేలల్లో మంచి దిగుబడి వస్తుంది. పైరు పసుపు మొక్కను పోలి ఉంటుంది. ● వర్షాకాలం ప్రారంభమయ్యే జూన్ మొదటి వారంలో తల్లి దుంపలను లేదా చిన్న చిన్న దుంప ముక్కలను విత్తనంగా వాడి నాటుకుంటారు. ● వరుసల మధ్య 30–45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15–20 సెంటీమీటర్ల దూరం ఉండేలా 5–7 సెంటీమీటర్ల లోతున నాటాలి. ● ఎకరాకు 8–10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువులే ఈ పంటకు మేలు చేస్తాయి. ● ఇది ఏడు నుంచి తొమ్మిది నెలల పంట. ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నప్పుడు (జనవరి–ఫిబ్రవరిలో) పంట కోతకు వస్తుంది. ఎకరాకు సుమారు 10–15 టన్నుల పచ్చి దుంపల దిగుబడి వస్తుంది. తయారీ.. శ్రమతో కూడిన ప్రక్రియ దుంపల నుంచి పిండిని సేకరించడం ఎంతో ఓపికతో కూడిన పని. మొదట దుంపలను సేకరించి శుభ్రం చేస్తారు. వాటిని జల్లెడపై గంటల తరబడి రుద్ది, పిప్పి నుంచి రసాన్ని సేకరిస్తారు. దీనినే బత్తిరి పాలు అంటారు. ఈ రసాన్ని రాత్రంతా నిల్వ ఉంచి (ఊరబెట్టి), మరుసటి రోజు ఉదయం చాపలపై లేదా పాత్రల్లో పోసి ఎండబెడతారు. సుమారు వారం రోజుల తర్వాత అది గట్టిగా కేకు ఆకారంలో మారుతుంది. అప్పుడు చిన్న ముక్కలుగా కోసి భద్రపరుస్తారు. ● గిరిజన రైతులు వారపు సంతల్లో కిలో రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో దీని ధర కిలో రూ.500 పైనే పలుకుతోంది. పాలపిండి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నీరసంగా ఉన్నవారికి, చిన్నారులకు ఇది మంచి శక్తినిచ్చే ఆహారమని గిరిజనులు చెబుతున్నారు.మైదాన ప్రాంతంలో గిరాకీ పాలగుండ నీటిని తాగడం వల్ల చలువ చేస్తుంది. ఎటువంటి ర సాయనాలు వినియోగించకుండా ప్రకృతి వనరు లతో పండించిన దుంపల నుంచి పాలపిండిని సేకరిస్తాం. ఇంట్లో నిల్వ ఉంచుకుంటాం. వారపు సంతల్లో, మండల కేంద్రాలకు తీసుకువెళ్లి విక్రయిస్తాం. మైదాన ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – కిల్లో బుద్రి, దొరగూడ, ముంచంగిపుట్టు మండలంసాగును ప్రోత్సహించాలి పాలపిండి సాగును ఐటీడీఏ ప్రోత్సహించాలి. రాయితీపై దుంపను రైతులకు అందించాలి. పెట్టుబడి సాయం అందిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. డిమాండ్ ఉన్న పాలపిండిని పండిస్తేనే ఆర్థికంగా మేలు కలుగుతుంది. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు బత్తిరి సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. – పాంగి రాంబాబు, కిందుగూడ, ముంచంగిపుట్టు మండలం -
నేటి నుంచి మోదకొండమ్మ జాతర
పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఈనెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని అన్ని వర్గాల ప్రజలు, భక్తులు నిర్ణయించారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల భద్రత కారణాలను సాకుగా చూపిస్తూ, భక్తుల మనోభావాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం ఈ ఉత్సవాల తేదీలను ఈనెల 17, 18, 19 తేదీలకు మార్చింది. ఈ సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల కోసం 100 ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మూడు రోజుల పాటు పాడేరు నుంచి వివిధ మార్గాల్లో సుమారు 100 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు తెలిపారు. రోజువారీ సర్వీసులు యథావిధిగా సాగుతూనే.. ఈ ప్రత్యేక బస్సులు 24 గంటల పాటు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయన్నారు. మద్యం దుకాణాలు మూసివేత జాతర ఉత్సవాలు ముగిసే వరకు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు పాడేరు పట్టణంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఆచారి తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా, నాటుసారా, ఇతర మత్తు పదార్థాలు రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.పాడేరులో మూడు రోజులు నిర్వహణ -
కృష్ణాపురంలో మార్మోగిన రామనామం
రామనామం జపిస్తున్న భక్తులు జి.మాడుగుల: చింతపల్లి మండలం కృష్ణాపురంలోని శ్రీ పాకలపాటి గురుదేవుల ఆశ్రమంలో జరుగుతున్న అఖండ రామనామ జప యజ్ఞానికి మద్దతుగా.. జి.మాడుగులలో శ్రీరామ ఆలయ సన్నిధిలో సోమవారం 24 గంటల అఖండ రామనామ జప యజ్ఞం ప్రారంభమైంది. శ్రీ పాకలపాటి గురుదేవుల భక్తుల సంఘం ఆధ్వర్యంలో భక్తులంతా ఏకమై శ్రీరామ జయరామ జయ జయ రామ నామ జపాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సంఘం అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ అఖండ రామనామ స్మరణ మంగళవారం ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు సాగుతుందని వెల్లడించారు. లోకకల్యాణార్థం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీరామాలయం పూజారి నాగేశ్వరరావు, శ్రీ మత్స్య మాడుగులమ్మ ఆలయం పూజారి సన్యాసిరావు, పాకలపాటి గురుదేవుల భక్త బృందం సభ్యులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అతిగా మద్యం తాగి యువకుడు మృతి
అచ్యుతాపురం రూరల్ : అతిగా మద్యం తాగి వికాష్ కుష్వా (26) అనే యువకుడు మృతి చెందిన ఘటన చీమలాపల్లి రెవెన్యూ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలి ఇలా ఉన్నాయి. వికాష్ కుష్వా మడుతూరు కూడలిలో ఉన్న మై చాయిస్ ఐస్ క్రీమ్ కంపెనీలో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 11 తేదీన విధులు ముగించుకుని దగ్గర్లో ఉన్న మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి, అతిగా మద్యం తాగాడు. శివ ప్రియా గార్డెన్స్ వద్ద మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం వెళ్లి పరిశీంచి, మృతి చెందిన వ్యక్తి వికాష్ కుష్వాగా గుర్తించారు. ఎక్కువగా మద్యం తాగడం వల్లే మృతి చెంది ఉంటాడని ఎస్ఐ వెంకటరావు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ చంద్ర శేఖర్ రావు తెలిపారు. -
అప్పన్న సాక్షిగా ట్రస్ట్ కోల్పోయిన కూటమి
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యుల నియామకంలో పారదర్శకత లోపించిందని కూటమి నాయకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పదవుల కోసం ఆశగా ఎదురుచూసిన సొంత పార్టీల నేతలకు మొండిచేయి ఎదురైంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని పక్కనపెట్టి, కూటమితో ఏమాత్రం సంబంధం లేని వారికి, స్థానికేతరులకు బోర్డులో చోటు కల్పించడంపై ఆశావాహులు మండిపడుతున్నారు. జగన్ హయాంలో పారదర్శకత సింహాచలం దేవస్థానానికి 2005 నుంచి 2019 వరకు ట్రస్ట్బోర్డు నియామకం జరగలేదు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2020 మార్చిలో, మళ్లీ 2022 ఏప్రిల్లో ట్రస్ట్బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పట్లో స్థానికులకు, ఆలయ విశిష్టతను కాపాడే వారికి పెద్దపీట వేయడంతో పాటు మహిళలకు 50 శాతం అవకాశం కల్పించారు. అయితే 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాటు బోర్డును నియమించకపోవడం సొంత నేతల్లోనే అసంతృప్తికి దారితీసింది. ఎట్టకేలకు శుక్రవారం 17 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ పార్టీ శ్రేణులకు కనీస సమాచారం లేకుండా ఆగమేఘాల మీద ఈ జాబితాను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలో అనర్హులకు పెద్దపీట ప్రకటించిన జాబితాలో అనర్హులకు పెద్దపీట వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఒక హోటల్ సీఈవో గుత్తికొండ శ్రీలతకు టీడీపీ కోటాలో బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. ఆమె అసలు పార్టీ కోసమే పనిచేయలేదని టీడీపీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. అలాగే టీడీపీ సానుభూతిపరుడైన మధుపాడ సన్యాసిరావును బీజేపీ ప్రతినిధిగా చూపించి నియామకం చేపట్టడంపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పేరుతో లబ్ధి పొందుతూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకు కూడా తగిన ప్రాధాన్యం దక్కలే దని జనసేన నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పట్టించుకోని ఎమ్మెల్యే సిఫార్సులు నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలను నమ్ముకుని పదవుల కోసం ఆశించిన వారికి తీవ్ర భంగపాటు ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులను అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు సూచించిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వీటన్నింటికీ మించి, సింహాచలం దేవస్థానంతో నేరుగా ముడిపడి ఉన్న అడవివరం గ్రామానికి చెందిన వారికి కూడా బోర్డులో కనీస అవకాశం కల్పించకపోవడం పట్ల స్థానికులు, కూటమి నేతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి అవమానం ఏపీలో బీజేపీ పూర్తిగా టీడీపీమయమైపోయింది. సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలపై అవగాహన లేని వారిని నియమించి అపప్రధ పాలవుతోంది. కూటమి వల్ల లబ్ధి పొందుతూనే బీజేపీని ప్రతి విషయంలోనూ చిన్నచూపు చూస్తోంది. కనీసం బీజేపీ నగర, రాష్ట్ర అధ్యక్షులకు తెలియకుండానే, తమకు అనుకూలంగా ఉండేవారిని బీజేపీ కోటాలో నియమించుకోవడం పార్టీని దెబ్బతీయడమే. గత ప్రభుత్వం 80 శాతం వరకు భక్తులకు ప్రాధాన్యం ఇస్తే, ప్రస్తుత బోర్డు మాత్రం దేవస్థానం భూముల అన్యాక్రాంతంపై నోరు మెదపని వారి కోసం వేసినట్లుగా ఉంది. –విజయశంకర్ ఫణీంద్ర, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ -
జిల్లాలో 89 లక్షల మొక్కల పెంపకం
కె.కోటపాడు: సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని 80 వన నర్సరీల్లో వివిధ రకాలకు చెందిన 89 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు సోషల్ ఫారెస్ట్ అధికారి(డీఎఫ్వో) ఎం.సోమసుందరం తెలిపారు. కె.కోటపాడు మండలం కొత్తూరు, ఎ.కోడూరు, సింగన్నదొరపాలెం, రామచంద్రపురం, పొడుగుపాలెం, బత్తివానిపాలెం గ్రామాల్లో వన నర్సరీలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవి ఉష్ణోగ్రత్తలు ఎక్కువగా ఉండడం వల్ల నర్సరీల్లో మొక్కలకు నీటి తడులను తరచూగా ఇవ్వాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి జిల్లా ఫారెస్ట్ కమిటీ సమావేశం అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. ఏయే మొక్కలు రైతులకు, ప్రభుత్వ అవసరాలకు ఉచితంగా ఇవ్వాలనేది కమిటీ నిర్ణయిస్తుందన్నారు. పరిశ్రమలకు నిర్దేశించిన ధరలకు ఈ మొక్కలను అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెంచుతున్న మొక్కల్లో 70 లక్షల సరుగుడు మొక్కలతోపాటు మిగిలిన 19 లక్షలు జీడి, మహగణి, ఎర్రచందనం, ఏగిస, యూకలిప్టస్, నేరేడు, రోజ్వుడ్, కందంబ, ఫెల్టోఫారం తదితర మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. గతేడాది రోడ్లకిరువైపులా రహదారి వనాల కార్యక్రమంలో బాగంగా మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు బ్లాక్ ఫ్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటామన్నారు. ఈ ఏడాది ఎన్టీపీసీ(సింహాద్రి) నిధులతో రహదారి వనాలు, బ్లాక్ ప్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వన నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వీబీ జీ రాంజీ, ఎన్టీపీసీ, ఆగ్రో ఫారెస్ట్రీ, కాంపా నిధులతో పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శివరంజిని, డిప్యూటీ రేంజ్ అధికారి నూకరాజు, వన సేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు. -
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
● నిర్లక్ష్యం చేస్తే చర్యలు ● కలెక్టర్ నిశాంతి హెచ్చరిక ● పాడేరు ఐటీడీఏలో పీజీఆర్ఎస్ నిర్వహణపాడేరు: పీజీఆర్ఎస్లో స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇంచార్జీ డీఆర్వో లోకేశ్వరరావు పలు సమస్యలపై 62, రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 41 వినతులను స్వీకరించారు. ఫిర్యాదులను ఎంత గడువులోగా పరిష్కారిస్తారో అర్జీదారులకు వివరించాలన్నారు. ప్రతి శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించే పీజీఆర్ఎస్కు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని, కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అధికారులు ఉండాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమం తప్పకుండా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో, ప్రతి రోజు గ్రామ స్థాయిలో ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కారించాలని సూచించారు. ఫిర్యాదుదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విద్యసాగర్, డీఆర్డీఏ పీడీ మురళి, టీడబ్ల్యూ డీడీ పరిమళ, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, డీపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
● ఇద్దరి అరెస్టు
నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని నర్సీపట్నం రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముందుస్తుగా వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్ఐ రాజారావు, సిబ్బందితో చింతపల్లి రూట్లో నెల్లిమెట్ట జంక్షన్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన చల్లా గోపి(25), ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా కలిమెల మండలం పపులర్ పంచాయతీకి చెందిన మహాదేబ్ ఖిలా(23)ను అరెస్ట్ చేసినట్ట సీఐ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.12.70 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రెండు సెల్ఫోన్లు, రూ.1000 నగదు సీజ్ చేసినట్టు సీఐ చెప్పారు. -
దైవ దర్శనానికి వెళ్లి వృద్ధుడు అదృశ్యం
మాడుగుల రూరల్: తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వృద్ధుడు 12 రోజులైనా తిరిగి ఇంటికి చేరలేదు. మండలంలోని వీరనారాయణం గ్రామానికి చెందిన కోరుకొండ కళ్యాణం అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దాడి పెంటయ్యతోపాటు అతడు ఈ నెల 1న వృద్ధాప్య పింఛను తీసుకుని 4వ తేదీన అనకాపల్లిలో తిరుమల రైలు ఎక్కి 5వ తేదీన తిరుపతికి చేరుకున్నారు. అక్కడ దర్శనం చేసుకుని వెంగమాంబ భోజన శాల వద్ద భోజనాలు చేశారు. పెంటయ్య తన బ్యాగ్ను కళ్యాణంకు ఇచ్చి చేతులు కడుక్కోని వచ్చేలోగా కనిపించలేదు. బ్యాగ్లో నగదు, బట్టలు ఉండటంతో పెంటయ్య ఆందోళనకు గురయ్యాడు. అక్కడ మైక్లో అనౌన్స్ చేసినా ఆచూకీ తెలియరాలేదు. తర్వాత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి గాలించినా సరే జాడలేదు. దీంతో పెంటయ్య కట్టుబట్టలతో తిరిగి ఈ నెల 14వ తేదీన స్వగ్రామం వీరనారాయణం చేరుకున్నాడు. ఈ విషయం కళ్యాణం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు. -
భలే రుచి!
కొండమామిడి తాండ్రపుల్లపుల్లగా.. తియ్యతియ్యగా.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మన్యం మామిడి తాండ్రకు మళ్లీ టైం వచ్చింది. ఎటువంటి రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన రుచి కావాలంటే.. గిరిజన పల్లెల్లో తయారయ్యే తాండ్రను రుచి తినాల్సిందే. ప్రస్తుతం మన్యంలో ఎటు చూసినా కొండ మామిడి పండ్ల గుజ్జుతో తాండ్రను తయారు చేసే పనుల్లో గిరిజన మహిళలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక్కడి సంప్రదాయ రుచికి మార్కెట్లో డిమాండ్ మామూలుగా లేదు. ముంచంగిపుట్టు: మన్యంలోని కొండ కోనల్లో, అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర రుచి చూడాలే కానీ, మరెక్కడా దొరకదు. మన్యంలోని గిరిజన గ్రామాల్లో ప్రస్తుతం ఎటు చూసినా తాండ్ర తయారీ పనులే కనిపిస్తున్నాయి. ఎటువంటి రసాయనాలు కలపకుండా, కేవలం ఎండను నమ్ముకుని గిరిజన మహిళలు ఈ తాండ్రను తయారు చేస్తున్నారు. సంతల్లో జోరుగా అమ్మకాలు గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తున్న ఈ తాండ్రకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. స్థానిక వారపు సంతల్లో కిలో రూ.100 నుంచి రూ.120 వరకు ధర పలుకుతున్నా, వినియోగదారులు ఆ రుచికి ఫిదా అయి ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మామిడి పండ్ల సీజన్ అయిపోయినప్పటికీ, ఈ తాండ్రను ఎక్కువ కాలం భద్రపరుచుకుని తినే వీలుండటంతో దీనికి డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తయారీ విధానం.. మన్యం తాండ్ర తయారీలో గిరిజన కుటుంబాలు పడే శ్రమ ఎంతో ఉంటుంది. కొండ ప్రాంతాల్లోని అడవి మామిడి చెట్ల నుంచి రాలిపడిన పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి సేకరిస్తారు.వీటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు లేదా బిందెల్లో వేస్తారు. రోకలితో దంచి మామిడి రసాన్ని వేరు చేస్తారు. తీసిన రసాన్ని చాపలు, చేటలు లేదా స్టీలు ప్లేట్లలో పలుచని పొరలుగా పోస్తారు.ఒక పొర ఆరిన తర్వాత మళ్లీ దానిపై మరో పొర వేస్తూ, ఇలా వారం నుంచి పది రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. ఏ రకమైన రసాయనాలు లేదా కృత్రిమ రంగులు కలపకపోవడమే ఈ తాండ్ర విశిష్టత. పది పొరలు ఆరిన తరువాత వచ్చే తాండ్ర తింటే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండి జిహ్వకు అమృతప్రాయంగా అనిపిస్తుంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించిన గిరిజన మహిళలు, తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి తాండ్ర ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తున్నారు.ప్రకృతి సిద్ధమైన ఆహారం జిహ్వకు అమృతప్రాయం మార్కెట్లో మంచి డిమాండ్ గిరిజన పల్లెల్లో సందడి -
అప్పన్న కొండపై తవ్వకాలు అపచారం
డాబాగార్డెన్స్ (విశాఖ): హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న సింహాచలం కొండను చంద్రబాబు ప్రభుత్వం బోడిగుండు చేస్తోందని సీపీఎం నాయకుడు గంగారావు ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల కొండ ప్రాంతంలో డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. నరసింహ స్వామి కొలువై ఉన్న పవిత్ర కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యలను భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాగే సింహాచలం కొండ నుంచి వచ్చే వర్షపు నీరు ముడసర్లోవకు చేరే సహజ ప్రవాహ వ్యవస్థ దెబ్బతింటుందని, కొండను తవ్వడం వల్ల నీటి ప్రవాహానికి అంతరాయం కలిగే ప్రమాదం ఉందని గంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. -
కేకే లైన్తో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలి
సీతంపేట: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కె.కె. లైన్ను చేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంపీ శ్రీభరత్ బీచ్ రోడ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం అందజేయనున్నట్లు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జె.టి. రామారావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘కె.కె. లైన్తో ఉన్న రైల్వే జోన్ – భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రధాన ఆస్తులు, ఆదాయ మార్గాలను ఇతర జోన్లకు అప్పగించి విశాఖకు కేవలం పేరు మాత్రమే ఇవ్వడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కె.కె. లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ అసంపూర్ణమని, దీని సాధన కోసం పాదయాత్రలు, ర్యాలీలు, ‘చలో ఢిల్లీ’ వంటి కార్యక్రమాలతో దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇప్పటికై నా గళమెత్తాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు అడారి కిషోర్ కుమార్, కస్తూరి వెంకట్రావు, గొలగాని రాము, ఎం.ఎల్.ఎన్. పట్నాయక్ , పలు మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్నేహితుడి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..
బుచ్చెయ్యపేట: మండలంలో కశింకోట– బంగారుమెట్ట(కేబీ) రోడ్డులో నీలకంఠాపురం వద్ద విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి అనకాపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు స్నేహితులు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నారు. రాజాం గ్రామానికి చెందిన మరిసా శివ పని మీద అనకాపల్లి వెళ్లాడు. అర్ధరాత్రి వాహనాలు లేకపోవడంతో తన స్నేహితులైన మరిసా సాయి, పడాల శివకు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకెళ్లడానికి రావాలని కోరాడు. స్నేహితుడిని తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై మరిసా సాయి, పడాల శివ అనకాపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు వస్తుండగా, రాత్రి 2 గంటల ప్రాంతంలో నీలకంఠాపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. 108 వాహనంలో పడాల శివ, మరిసా శివలను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన స్నేహితుడి కారులో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి వెళ్తున్న మరిసా సాయి(20) జంగాలపాలెం గ్రామ దగ్గర ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంలో పడాల శివ కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. మరిసా శివ అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివాహమైన ఏడాదికే.. మరిసా సాయి తురకలపూడికి చెందిన మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 8వ తేదీన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయి తన గ్రామంలో పొలం అమ్మడానికి 20 రోజుల క్రితం భార్యతో కలిసి రాజాం వచ్చాడు. రెండు రోజుల క్రితం భూమి రిజిస్ట్రేషన్ అయింది. మళ్లీ హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. తన స్నేహితుడు అనకాపల్లిలో ఉండిపోవడంతో అర్ధరాత్రి తీసుకురావడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య మాధవి ప్రస్తుతం ఆరో నెల గర్భిణి. భర్త మృతితో ఆమె రోదిస్తున్న తీరును చూసి పలువురు చలించిపోయారు. సాయి తల్లి లచ్చమ్మ అనారోగ్యంతో మంచాన ఉండగా, తండ్రి సన్యాసినాయుడు కుమారుడు మృతితో భోరున విలపిస్తున్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శ్రీనివాసరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. సాయి మృతదేహానికి పోస్టుమార్టం జరిపి, సాయంత్రం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. కేబీ రోడ్డును ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని మార్చాలని ఫిర్యాదులు చేస్తున్నా ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎంపీ నిధులతో వీధి లైట్ల పంపిణీ
వీధిలైట్లు పంపిణీ చేస్తున్న ఎంపీపీ తదితరులు కొయ్యూరు: అరకు ఎంపీ తనూజరాణి ఎంపీ లాడ్స్ నిధులతో కొనుగోలు చేసిన వీధిలైట్లను శుక్రవారం ఎంపీపీ బడుగు రమేష్, వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు,డౌనూరు ఎంపీటీసీ బి. అప్పారావు పంపిణీ చేశారు. మండలానికి వీధిలైట్లు కేటాయించడంపై వారంతా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. మండలానికి మరిన్ని నిధులను కేటాయించాలని వారు ఎంపీని కోరారు. కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.నేడు కంటి వైద్య శిబిరం పెదబయలు: మండలంలోని గోమంగి పీహెచ్సీలో ఈ నెల 16 తేదీన కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారి చైతన్య తెలిపారు.ఈ శిబిరాన్ని విజయనగరం పుష్పగిరి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. దృష్టిలోపం ఉన్న వారు శిబిరానికి హాజరు కావాలని కోరారు.అవసరమైన వారికి శస్త్ర చికిత్స చేసేందుకు రిఫర్ చేస్తామన్నారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
గంజాయి రవాణా కేసులో నిందితుడికి జైలు
అనకాపల్లి: జిల్లాలో మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి రవాణా కేసులో నిందితుడికి 2 సంవత్సరాల 7 నెలల జైలుశిక్ష విధిస్తూ విశాఖ 1వ అదనపు న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించారని, జరిమానా చెల్లించని పక్షంలో ఒక నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా విల్లవంకోడ్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ 2023 నవంబర్ 8న ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడుకు ఏడు కిలోల గంజాయిని తరలిస్తుండగా అప్పటి మాకవరంపాలెం ఎస్ఐ పి.రామకృష్ణ పట్టుకున్నట్టు ఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాలు అనంతరం జైలు శిక్షణ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు తెలిపారు. కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్ బలమైన వాదనలు వినిపించారని చెప్పారు. -
ఉత్సవ పోస్టర్లలోనూ రాజకీయమా?
పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర సందర్భంగా ముద్రించిన సాంస్కృతిక పోస్టర్లు ఇప్పుడు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ప్రొటోకాల్ను తుంగలో తొక్కి, ఏకపక్షంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ, బీజేపీ శ్రేణులతో పాటు సామాన్య భక్తులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై విమర్శలు సాధారణంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఉంటే వారే అమ్మవారి ఆలయానికి ఐదేళ్ల పాటు చైర్మన్గా వ్యవహరిస్తారు. జాతర ఉత్సవాల గోడ పత్రికలలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ ఫొటోను ముద్రించడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది ఉత్సవ కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న గిడ్డి ఈశ్వరి.. రాజకీయ కక్షతో ప్రస్తుత ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఫొటోను ముద్రించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, సంధ్యారాణిల ఫొటోలతో పాటు తన ఫోటోను పెద్దదిగా ముద్రించి, స్థానిక ఎమ్మెల్యేను విస్మరించడంపై భక్తులు తప్పుపడుతున్నారు. పోస్టర్లలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతికుమారి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు తీవ్రంగా స్పందించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములమనే విషయాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు మరచిపోయారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రుల ఫొటోలు ముద్రించి.. ప్రధాని నరేంద్ర మోదీ, స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఫొటోలను విస్మరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని నిలదీశారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల జాతరను ప్రశాంతంగా నిర్వహించలేరని హితవు పలికారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రవికుమార్, పాపిడిరాజు, సల్లా రామకృష్ణ, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వేశ్వరరాజుకు దక్కని గౌరవం కనిపించని ఫొటో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ నేతల అభ్యంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ఏకపక్ష నిర్ణయం ఆమె తీరుపై భక్తుల మండిపాటు -
బైక్ల దొంగ అరెస్టు
రూ.12.70 లక్షల గంజాయి స్వాధీనం నాతవరం: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం తెలిపారు. రోడ్డుపై పలు కార్యాలయాలు, దుకాణాలు వద్ద నిలిపి ఉంచిన వాహనాలు చోరీకి గురైనట్టు చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇటీవల తాండవ జంక్షన్లో జరిగిన చోరీ కేసులో అనుమానితులపై ప్రత్యేంగా నిఘా పెట్టామన్నారు. శుక్రవారం వల్సంపేట జంక్షన్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఆ సమయంలో వచ్చిన నిందితుడు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన కె.దుర్గాప్రసాద్ను పట్టుకుని, చోరీ చేసిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించాలమని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో సహకరించిన మైత్రి బృందానికి ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు. -
● మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు ● పక్కా ప్లాన్తోనే హత్య ● హైదరాబాద్ పారిపోతుండగా నిందితుడి అరెస్టు ● 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
అద్దె అడిగితే గొంతు కోశాడుఅల్లిపురం(విశాఖ): అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమైపె కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధు రి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
నిధుల గండం
పల్లెకుపన్నులు వసూలుకాక కునారిల్లుతున్న గ్రామ పంచాయతీలు కొయ్యూరు: జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు, ప్రస్తుత ఏడాది పన్నులు కలిపి మొత్తం రూ. 7.73 కోట్లకు చేరుకున్నాయి. గ్రామ పంచాయతీల మనుగడకు ప్రధాన వనరుగా ఉన్న ఇంటి పన్నుల వసూలు మందగించడంతో, స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. జనగణన బాధ్యతలతో.. సాధారణంగా ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను పర్యవేక్షించాల్సిన సచివాలయ సిబ్బందికి ప్రస్తుతం జనగణన పనులను అప్పగించడమే ఈ మందగింపునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ● గతంలో ప్రతి జనగణన ప్రక్రియకు ఉపాధ్యాయులను నియమించేవారు. అయితే, ఈసారి వారిని మినహాయించి కేవలం సచివాలయ సిబ్బందిని మాత్రమే వినియోగించడంతో, వారిపై పనిభారం పెరిగి పన్నుల వసూలు కుంటుపడింది. ● జిల్లాలోని ఏ ఒక్క మండలంలో కూడా కనీసం 5 శాతం వసూళ్లు కూడా సాధించలేకపోవడం గమనార్హం. పాలనపై తీవ్ర ప్రభావం గ్రామ పంచాయతీలు తమ దైనందిన కార్యకలాపాలకు, ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణకు ఇంటి పన్నుల నుంచి వచ్చే ఆదాయంపై అధికంగా ఆధారపడి ఉంటాయి. ● గ్రామాలలోని చెత్తను సేకరించి, శుభ్రం చేసే ‘క్లాప్ మిత్రల’కు వేతనాల చెల్లింపులు ఈ పన్నుల ఆదాయం నుంచే జరుగుతాయి. ● వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇతర అత్యవసర గ్రామాభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ● కొయ్యూరు మండలంలో పన్నుల వసూలును వేగవంతం చేసేందుకు అధికారులు కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదు. గతంలో ప్రజలు నగదు చెల్లించడానికి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా వాట్సాప్ ద్వారా గానీ, సచివాలయాల్లో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా గానీ సులభంగా పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. గడువు విధించినా.. జనగణన పనులలో కొందరు సిబ్బంది నిమగ్నమైనప్పటికీ, మిగిలిన సిబ్బంది ద్వారా ఇంటింటికీ డిమాండ్ నోటీసులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు పన్నులు చెల్లించాలని గడువు విధిస్తున్నారు. దృష్టిపెట్టకుంటే కష్టమే.. ఆర్థిక సంవత్సరం ముగిసిన తరుణంలో, కనీసం సగం మొత్తమైనా వసూలు కాకపోతే పంచాయతీల మనుగడ కష్టం కానుంది. జనగణన పనులతో పాటు పన్నుల వసూలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డిజిటల్ చెల్లింపుల విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని పలువురు సూచిస్తున్నారు. -
మోదమ్మ ఉత్సవాల సాక్షిగా కూటమి కుట్ర
పాడేరు: గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల విషయంలో కూటమి నాయకులు కుట్రలకు తెరలేపారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో పాడేరు, అరకు మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, గిరిజన సంఘాలు, అన్ని పక్షాల ఏకగ్రీవ నిర్ణయం మేరకు ఈ నెల 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహించాలని అనుకున్నాం. కానీ, కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఇంచార్జ్ మంత్రి సంధ్యారాణి, గిడ్డి ఈశ్వరి రాజకీయ జోక్యంతో ఉత్సవాల తేదీలను ఏకపక్షంగా మార్చేశారన్నారు. ఎన్నికల దృష్ట్యా పోలీసు బందోబస్తు ఇవ్వలేమని, అందుకే ఉత్సవాలు నిర్వహించలేమని అప్పట్లో సాకులు చెప్పారన్నారు. మరి ఇదే నెల 13న పాడేరులో జరిగిన జీసీసీ చైర్మన్ శ్రవణ్ కుమార్ వివాహానికి, మంత్రి లోకేష్ పర్యటనకు ఐదు రోజుల ముందు నుంచే వందల సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. బెదిరింపులతో జనసమీకరణ చేపట్టారని ధ్వజమెత్తారు. కిడారి శ్రవణ్ కుమార్ వివాహానికి 64 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, మంత్రి లోకేష్ సమావేశానికి రాకపోతే పెన్షన్లు, రేషన్ కార్డులు, జాబ్ కార్డులు తొలగిస్తామని గిరిజనులను బెదిరించి తరలించారని ఆరోపించారు. తరలించిన ప్రజలకు కనీసం మంచినీరు, ఆహారం కూడా అందించకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. మంత్రి పర్యటన, టీడీపీ నేత వివాహం కారణంగా పట్టణంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయిందని, కనీసం అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వలేదని విమర్శించారు. అసలు మంత్రి లోకేష్ వచ్చింది ప్రభుత్వ కార్యక్రమానికా లేక ప్రైవేట్ కార్యక్రమానికా అని ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశీరాణి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు రామసత్యవతి, ఎంపీటీసీ రాజేశ్వరి, మాజీ సర్పంచ్లు వంతాల రాంబాబు, పాంగి నాగరాజు, నాయకులు మోద బాబురావు, పలాసి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
చీడికాడ: మండలంలోని జి.కొత్తపల్లి శివారు చినగోగాడకు చెందిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ తాటిచెట్టుపై నుంచి జారి పడి మృతి చెందినట్లు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కోన నారాయణమూర్తి(43)గురువారం మధ్యాహ్నం తమ కల్లం సమీపంలో తాటికాయలు కోసేందుకు తాటిచెట్టు ఎక్కాడన్నారు. ప్రమాదవశాత్తూ కాలుజారి చెట్టు పైనుంచి కిందికి పడిపోవడంతో తలకు,శరీరంపై బలమైన గాయాలై మృతి చెందాడన్నారు. ఘటనపై మృతుని భార్య వెంకట వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. -
కాఫీ రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యం
1అరకులోయ టౌన్: గిరిజనుల జీవితాల్లో ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం గొప్ప మార్పును తీసుకువచ్చిందని కాఫీ బోర్డు రాష్ట్ర కార్యదర్శి కూర్మరావు అన్నారు. గురువారం కేంద్ర కాఫీ బోర్డు ఆధ్వర్యంలో స్థానిక పున్నమి హరిత వ్యాలీ రిసార్ట్స్లోని గోష్టి సమావేశ మందిరంలో ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 15 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్న కాఫీ ఉత్పత్తిని 50 వేల మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 2.15 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని 4 లక్షల ఎకరాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సేంద్రియ జిల్లాగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ నిశాంతి కాఫీతో పాటు హార్టికల్చర్ సాగును కూడా ప్రోత్సహిస్తామని, జిల్లాను పూర్తిస్థాయి సేంద్రియ వ్యవసాయ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ టి.నిశాంతి ప్రకటించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని, ఇక్కడి నమూనాను స్ఫూర్తిగా తీసుకుని ఒడిశాలోని మరో 8 జిల్లాల్లో కాఫీ సాగుకు అక్కడి అధికారులు ఆసక్తి చూపుతున్నారని ఆమె తెలిపారు. మొదటి స్థానమే లక్ష్యం: కాఫీ బోర్డు డైరెక్టర్ భార్గవి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అరకు కాఫీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేక వెనుకబడిందని కాఫీ బోర్డు డైరెక్టర్ భార్గవి అభిప్రాయపడ్డారు. దేశంలో కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని.. భవిష్యత్తులో మన రాష్ట్రం ప్రథమ స్థానానికి చేరుకోవాలంటే అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. లోగో ఆవిష్కరణ ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకల లోగో, థీమ్ను అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు డైరెక్టర్ చందుల్ కుమార్, బెంగళూరు ఐహెచ్ఆర్ డైరెక్టర్ తుషార్ కాంతి బెహరా, కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్, జీసీసీ ఎండీ శేఖర్ బాబు, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధిక సంఖ్యలో కాఫీ రైతులు పాల్గొన్నారు. -
కానరాని పర్యాటక సందడి
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో సందర్శకుల తాకిడి గణనీయంగా తగ్గింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అరకులోని పర్యాటక ప్రాంతాలన్నీ గత కొన్ని రోజులుగా పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి.ఈ పరిస్థితికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పర్యాటకుల రాకపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం పర్యాటక రంగంపై కనిపిస్తోంది.రవాణా ఖర్చులు పెరగడం, ఇంధన కొరత కూడా పర్యాటకులు తగ్గడానికి ఒక కారణమని పర్యాటక ప్రాంతాల్లో నిర్వాహఖులు భావిస్తున్నారు. వీకెండ్లో అంతంత మాత్రంగా.. సాధారణ రోజుల్లో పర్యాటకుల తాకిడి అసలు కనిపించడం లేదని, కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో వస్తున్నారని స్థానిక వ్యాపారులు, పర్యాటక కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్యాటక రంగంపై ఆధారపడిన స్థానిక గిరిజనులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణనీయంగా తగ్గిన సందర్శకుల సంఖ్య -
మహిళ దారుణ హత్య
● బంగారు నగల కోసమే ఘాతుకం ● అక్కయ్యపాలెంలో ఘటనపార్వతి మృతదేహంతాటిచెట్లపాలెం: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్లోని పీఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న పార్వతి (53)ని దుండగులు హతమార్చారు. మృతురాలి భర్త దొండపర్తిలో పాన్షాప్ నిర్వహిస్తుండగా, ఆయన గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తన దుకాణానికి వెళ్లాడు. తిరిగి రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి చేరుకునేసరికి పార్వతి విగతజీవిగా పడి ఉండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు లోపలికి ప్రవేశించి, కాళ్లు చేతులు బంధించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మంగళసూత్రం, నల్లపూసల తాడు, చెవి రింగులు, చేతి గాజులను దోచుకుని అక్కడ నుంచి పరారయ్యారు. నేరం జరిగిన ప్రదేశంలో క్లూస్ దొరకకుండా ఉండేందుకు దుండగులు కారంపొడి చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి మెడపై గాయాలు ఉండటాన్ని బట్టి, నిందితులతో ఆమె తీవ్రంగా పెనుగులాడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పార్వతి సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో తన పిల్లలతో ఫోన్లో మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. దీనిని బట్టి ఆ తర్వాతే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న ఫోర్త్టౌన్ క్రైం పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. క్రైం డీసీపీ, ఏసీపీలతో పాటు లా అండ్ ఆర్డర్ ఏసీపీలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మాయమాటలతో పసిబిడ్డ అపహరణ
పాడేరు: వైద్య చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చిన నెలన్నర బాబును ఓ గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి అపహరించిన ఘటనను పోలీసులు అత్యంత చాకచక్యంగా గంటల వ్యవధిలోనే ఛేదించారు. పాడేరు సీఐ డి. దీనబంధు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం, సలుగు పంచాయతీ, బూరుగుచెట్టు గ్రామానికి చెందిన పాంగి రామారావు, కాంతమ్మ దంపతుల నెలన్నర బాబు అనారోగ్యానికి గురవ్వడంతో, గురువారం వారు పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఓ గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి, బాబును ఎత్తుకుంటానని వారిని నమ్మించింది. వారిని మాటల్లో పెట్టి, అదును చూసి బాబుతో సహా అక్కడి నుంచి పరారైంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బాబు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పాడేరు సీఐ దీనబంధు, హుకుంపేట సీఐ విజయ్కుమార్, ఎస్ఐ విజయ్కుమార్ తమ సిబ్బందితో కలిసి రెండు బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లా ఆసుపత్రితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సదరు మహిళ బిడ్డను ఎత్తుకొని హుకుంపేట మార్గంలో వెళ్తున్నట్లు గుర్తించారు. కొంతిలి సమీపంలో నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాబును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో తల్లిదండ్రులకు బాబును అప్పగించారు. బాబును అపహరించిన మహిళ హుకుంపేట మండలం, ఉప్ప గ్రామానికి చెందిన సంతరి కృష్ణవేణి (భర్త దామోదర్) గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ దీనబంధు తెలిపారు. తమ బిడ్డను గంటల వ్యవధిలోనే ప్రాణాలతో తిరిగి అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. -
పెళ్లింట పెను విషాదం
అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ హృదయవిదారక ఘటన అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్. ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి తీవ్ర గాయాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతుంది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు కూడా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరు మున్నీరవుతున్న బంధువులు అత్తారింట్లో అడుగుపెట్టి ఆనందంగా ఉండాల్సిన వధువు ప్రమాదంలో తీరనిలోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. పెళ్లి వేడుక ముగిసి 24 గంటలు కూడా కాకముందే పెళ్లికూతురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
యలమంచిలి రూరల్ : పార్క్ చేసి ఉంచిన ద్విచక్రవాహనాలను చాకచక్యంగా చోరీ చేస్తున్న వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీన పర్చుకున్నామన్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లికి కోడిగుడ్డు సన్యాసిరావు ద్విచక్రవాహనాలను చోరీ చేసి వాటిని తెలిసిన వారి వద్ద తాకట్టు పెట్టి డబ్బుతో తన అవసరాలు తీర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. యలమంచిలి పట్టణ ఠాణాలో 2023లో రెండు, 2024 నాగుల చవితి జాతర రోజు ఒకటి మొత్తం మూడు ద్విచక్ర వాహనాలను నిందితుడు అపహరించాడు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న మూడు కేసుల్లో నిందితుడిగా సన్యాసిరావును పోలీసులు నిర్థారించుకున్నారు. గురువారం 16వ నెంబర్ జాతీయ రహదారిపై పెదపల్లి కూడలి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా చోరీకి గురైన మూడు వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. -
జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం
అనకాపల్లి: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, యువత భవిష్యత్తో అడుకుంటున్న నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తుహిన్ సిన్హా గురవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం అసాంఘిక కార్యక్రలాపాలకర పాల్పడుతున్న, గంజాయి స్మగ్లర్పై ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉత్తర్హులు మేరకు పీటీ ఎన్డీపీఎస్ యాక్టును ప్రయోగించి జైలుకు తరలించడం జరుగుతుందన్నారు. రోలుగుంట మండలం, బెన్నభూపాలపట్నం గ్రామానికి చెందిన చిన్నికృష్ణ(35) కొంతకాలంగా వరుసగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడుతున్నాడని, ఇతనిపై జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లో ఐదుకు పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ సమాజానికి ముప్పుగా మారిన చిన్ని కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని, దీనిపై పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈనెల 11న పీటీ యాక్టు అమలు చేయాలని ఆదేశించినట్టు ఎస్పీ చెప్పారు. కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్ఐ పి.రామకృష్ణారావు చిన్నికృష్ణను అదుపులోనికి తీసుకుని, విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. ఈ చట్టం కింద అరెస్టుయిన వ్యక్తికి ఏడాది వరకూ బెయిల్ వచ్చే అవకాశం ఉండదన్నారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. సాదారణ సెక్షన్లతో పాటు పీటీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. -
పిడుగుపాటుకు మూడు ఆవుల మృతి
జి.మాడుగుల: మండలంలోని సింగర్భ పంచాయతీ కంబాలుబయలు గ్రామంలో గురువారం సాయంత్రం ప్రకృతి ప్రకోపం చోటుచేసుకుంది. ఉరుములు, మెరుపులు, భీకర శబ్దాలతో కూడిన పిడుగుపాటుకు ఇద్దరు గిరిజన రైతులకు చెందిన మూడు ఆవులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంబాలుబయలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి పశువులను మేత కోసం తోలుకెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. ఈ ప్రమాదంలో మేత మేస్తున్న పశువులపై పిడుగు పడటంతో కిముడు బొజ్జాచారికి చెందిన రెండు ఆవులు, కొమ్మంగి మత్స్యలింగంకు చెందిన ఒక ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. మృతి చెందిన ఆవుల విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశువులే తమకు జీవనాధారమని, పిడుగుపాటుతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి, తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత గిరిజన రైతులు వేడుకుంటున్నారు. -
భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తాం
అనకాపల్లి: జిల్లాలో పెండింగ్లో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తెలిపారు. గురువారం స్థానిక గాంధీనగరంలోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లాలోని ఎస్సీ సంక్షేమ భూములకు సంబంధించిన భూ కబ్జా, సర్వే కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కార మార్గాలపై సంబంధిత అధికారులకు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ద్వారా తదుపరి చర్యల కోసం లేఖలు పంపించామన్నారు. 54 మంది ఫిర్యాదులు చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, సోషల్ వెల్ఫేర్ డీడీ బి.రామానందం, డీవీఎంసీ సభ్యులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూ వివాదంపై విచారణ దేవరాపల్లి: మండలంలోని ముషిడిపల్లిలో రెవెన్యూ పరిధిలో దళితులు, కల్లుగీత కార్మికులు మధ్య నెలకొన్న భూ వివాదంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం గురువారం విచారణ చేపట్టారు. మండలంలోని కె.ఎం.పాలెం గ్రామానికి చెందిన కణితి అర్జున్ ముషిడిపల్లిలోని తన భూ సమస్యపై రాష్ట్ర ఎస్సీ కమీషన్ను ఆశ్రయించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ సూచనల మేరకు సదరు వివాదాస్పద స్థలాన్ని స్థానిక తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, ఎస్ఐ వి. సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం సదరు స్థలానికి సంబంధించి ఇరువురి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించారు. ఇరువర్గాల వారి వాదనలను వినడంతో పాటు స్థానిక పెద్దలను, అధికారులను సైతం భూమికి సంబంధించిన పూర్వపరాలపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల వారు పరస్పర వాదోపవాదనలకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించారు. -
18 కిలోల గంజాయితో ముగ్గురు అరెస్టు
చీడికాడ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు, ఒక మైనర్ను అదుపులోకి తీసుకుని వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. ఆయన గురువారం అందించిన వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని అప్పలరాజుపురం లలితా దేవి మెట్ట వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు స్కూటీలపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా ఆపి తనిఖీ చేయగా రెండు వాహనాల్లో 18 కిలోల గంజాయిని గోనె సంచిల్లో గుర్తించామన్నారు. దీంతో విజయవాడ ప్రాంతానికి చెందిన ఎం.యువనాగ సాయి సుధర్, వాసి గోపితో పాటు 17 సంవత్సరాల మైనర్ బాలుడిని పట్టుకున్నామన్నారు. వీరు అల్లురి జిల్లా పాడేరు ఏజేన్సీకి చెందిన గుంత నర్సు, నారీస్ పాంగి వద్ద నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు తరలిస్తున్నట్టు విచారణలో తెలిపారన్నారు. వారి వద్ద రెండు స్కూటీలు, గంజాయిని, మూడు సెల్ఫోన్లను స్వాధినం చేసుకుని కోర్టుకు తరలించామని తెలిపారు. గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ బుచ్చెయ్యపేట : గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకుని కోర్టుకి అప్పగించినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన బుచ్చెయ్యపేట వద్ద 194 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న చీడికాడ మండలం బైలపూడికి చెందిన గొల్లవిల్లి గోపిని వడ్డాదిలో వాహనాల తనిఖీల్లో భాగంగా గురువారం పట్టుకున్నామన్నారు. గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిగా గుర్తించి సీఐ కోటేశ్వరరావు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారన్నారు. పట్టుబడిన గంజాయి నిందితులతో ఎస్ఐ సతీష్ బుచ్చెయ్యపేటలో పట్టుకున్న వ్యక్తితో సీఐ, ఎస్ఐ -
మ్యూజియం పనులు మరింత వేగవంతం
చింతపల్లి: మండలంలోని తాజంగిలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సుధాభార్గవి ఆదేశించారు. గురువారం ఆమె మ్యూజియం నిర్మాణ ప్రాంతాలను సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్ష మ్యూజియంలోని బ్లాక్–1, బ్లాక్–2లలో జరుగుతున్న నిర్మాణ పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి ఆమె సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల ప్రస్తుత స్థితిగతులను, నిర్మాణ నాణ్యతను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఈ సందర్భంగా సుధాభార్గవి మాట్లాడుతూ.. మ్యూజియం నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన గిరిజన వీరుల చరిత్రను భావితరాలకు అందించడమే ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగం గిరిజన వీరుల పోరాట పటిమను నేటి తరానికి వివరించేలా అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ, ఆడియో విజువల్స్ ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసే ప్రతి శిల్పం, ప్రతి చిత్రం వారి పోరాట స్ఫూర్తిని రగిలించేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ, చీఫ్ ఇంజనీర్ వసంత, టీఆర్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రాణి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, ఈఈ డేవిడ్రాజ్, డీఈ రఘునాథ్నాయుడు, జేఈ యాదకిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలి
కశింకోట: జిల్లాలోని ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని విశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు బి. విజయకుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక సెయింట్ జాన్స్ స్కూలులో జిల్లా స్థాయిలో మండల విద్యా శాఖ అధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, హైస్కూలు ప్లస్ ప్రధానోపాధ్యాయులకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంపొందిస్తూ బలోపేతం చేయాలన్నారు. జిల్లా విద్యా పరంగా అన్ని అంశాల్లో ముందుండాలన్నారు. పదో తరగతి పునశ్చరణ తరగతులు నిర్వహించి మార్చిలో ఉత్తీర్ణులు కాని వారందరిని అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ కావడానికి ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు, రాష్ట్ర పరిశీలకుడు నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
మాకవరపాలెం: మండలంలోని వజ్రగడ శివారు తమ్మయ్యపాలెంలో గురువారం మధ్యాహ్నం బొడ్డు అప్పలనాయుడు(50) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరి కొందరితో మంగళవారం హనుమాన్ జయంతి రోజున నిర్వహించిన అన్నసమారాధనలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పలనాయుడుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు తమ్మయ్యపాలెం వెళ్లగా, అతడు భయంతో మనస్తాపానికి గురై తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. దీనిపై మృతుడు భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
లారీ బోల్తా.. తప్పిన ప్రాణాపాయం
కొయ్యూరు: జాతీయ రహదారి 516–ఈ విస్తరణ పనుల్లో భాగంగా సరకు చేరవేస్తున్న ఒక లారీ గురువారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. రంపుల ప్రాంతానికి సరకు అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా, నడింపాలెం మలుపు వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనా స్థలంలో ఉన్న వారు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ మలుపు వద్ద లారీని వేగంగా పోనివ్వడంతో అదుపు తప్పి ఎడమవైపునకు పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులందరూ భయాందోళనతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ ఎడమవైపునకు బోల్తా పడటంతో డ్రైవర్ సీటు వైపు ఖాళీ ఉండటంతో డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
మేలురకం కాఫీ మొక్కలు సరఫరా చేయాలి
గూడెంకొత్తవీధి: రైతులకు అధిక దిగుబడినిచ్చే మేలురకపు కాఫీ మొక్కలను సరఫరా చేయాలని కోరుతూ అరకులో గురువారం కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్, సీఈవో ఎం. కూర్మారావులకు కాఫీ రైతుల సంఘం వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో కాఫీ రైతుల సంఘం అధ్యక్షులు అడపా విష్ణుమూర్తి, అభ్యుదయ కాఫీ రైతు అడపా లక్ష్మి పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, అధునాతన పద్ధతుల్లో సాగు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అందించాలని కోరినట్టు వారు తెలిపారు. అలాగే ఆధునిక కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రైయింగ్ యార్డులు, నిల్వ గోదాములు, విలువ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలను మంజూరు చేయాలని విన్నవించామని వారు పేర్కొన్నారు. మార్కెటింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైతు ఉత్పత్తి గ్రూపులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరారు. కాఫీ ధరల్లో స్థిరత్వం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సేంద్రియ సాగును ప్రోత్సహించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్స వేడుకలను జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వీటిపై కాఫీ బోర్డు చైర్మన్, సీఈవో సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని అడపా విష్ణుమూర్తి తెలిపారు. కాఫీ బోర్డుకు గిరి రైతుల విన్నపం -
భూ సమస్యలపై ఆదివాసీల రిలే దీక్షలు
రోలుగుంట: మండలంలోని కె.అడ్డసరం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే దీక్షలు గురువారం చేపట్టారు. గతంలో కె.అడ్డసరం రెవెన్యూ గ్రామంలో ఖాతా నెంబర్ 559లో భూములను ఫోర్జరీ వారసత్వ ధ్రువపత్రంతో రాయివరపు చంద్రశేఖరరావు పేరున మార్చారు. తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఆన్లైన్లో నమోదు కావడంతో సాగుదారులైన గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టి తహసీల్దార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చంద్రశేఖరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. భూముల హక్కు పత్రాలపై తహసీల్దార్ డిజిటల్ సంతకం రద్దు చేసే వరకూ రిలే దీక్షలు కొనసాగుతాయని కె.అడ్డసరం ఆదివాసీలు, కొంతలం ఓబీసీ రైతులు తేల్చిచెప్పారు. జాయింటు కలెక్టర్ కోర్టులో ఆర్వోఆర్ అపీల్పై ఆర్డరు వచ్చేంత వరకూ తమ జోలికి రావ్వొద్దని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం జిల్లా కార్యదర్శి మూసూరి రాజు, కేదారి దేవి, వెంగళరావు సత్య, తుర్రి నూకరాజు, అర్జున్ పాల్గొన్నారు. -
వేసవి శిక్షణ విజ్ఞానదాయకం
మాట్లాడుతున్న ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ జోగారావు మునగపాక : వేసవి సెలవులను వృఽథా చేయకుండా విజ్ఞానాన్ని అందించే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ మళ్ల జోగారావు కోరారు. మునగపాక గ్రామీణ యువజన మందిరం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. లక్ష్యం కోసం చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. కర్ర సాము, చెస్, క్యారమ్, గీత శ్లోకాలపై శిక్షణ పెంచుకోవాలన్నారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మందిర సభ్యులు ఆడారి లక్ష్మణరావు, ఆడారి సూర్య చంద్రరావు, వెలగా ప్రవీణ పాల్గొన్నారు. -
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకన్న
దేవరాపల్లి: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దేవరాపల్లికి చెందిన డి.వెంకన్న ఎన్నికయ్యారు. అమలాపురంలో ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు వెంకన్న బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, వృత్తిదార్లు, సన్న,చిన్నకారు రైతులు పాల్గొన్న ఈ మహాసభలో పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు తీర్మానాలు చేశామన్నారు. దళితులపై దాడులు, కుల వివక్షను అరికట్టాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినట్టు చెప్పారు. దళితులు, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని వెంకన్న విమర్శించారు. క్రైస్తవ మతం తీసుకున్న దళితులను ఎస్సీలు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని వారి సర్టిఫికెట్లను రద్దు చేయించాలని చూస్తుండటాన్ని మహాసభలో తీవ్రంగా ఖండించినట్టు చెప్పారు.ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
ఆగని మట్టి అక్రమ తరలింపు
మంగళవారం రాత్రి తరలించుకు వచ్చిన చెరువు మట్టి ఎస్.రాయవరం : ఇటుక బట్టీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసినా, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా తమ బట్టీలకు అక్రమ మట్టి రవాణా ఆపబోమని ఇటుక బట్టీల యజమానులు యధావిధిగా మంగళవారం రాత్రి వమ్మవరం గ్రామంలో బట్టీల వద్దకు మట్టిని తరలించారు. యలమంచిలి కృష్ణాపురం చెరువులో అనుమతులు పొందినట్టు జేసీబీలను ఉపయోగించి దర్జాగా వమ్మవరానికి మట్టి తరలించుకు రావడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షించినా మట్టి తరలింపు ఆపకపోవడం పట్ల ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. అనకాపల్లి జిల్లా పోలీస్, అధికారులు విజిలెన్స్ ఉన్నతాధికారులకు బుధవారం మరో మారు ఫిర్యాదు చేశారు. -
● కంచరపాలెం, ఎయిర్పోర్టు స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలు ● ఉదయం 7.30 నుంచి 11.30 మధ్యే చోటు చేసుకున్న వైనం
గోపాలపట్నం:విశాఖనగరంలో ఒకేరోజు గంటల వ్యవధిలో నాలుగు చోట్ల జరిగిన చైన్స్నాచింగ్లతో ప్రజలు హడలెత్తిపోయారు. కంచరపాలెం,ఎయిర్పో ర్టు పోలీ స్ స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7.30 నుంచి 11.30 మధ్య నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. మహిళల మెడల్లో ఉన్న చైన్లను తెంచు కుపోయారు. బాధితులు,పోలీసులు తెలిపిన వివరాలు.. మొదటి చోరీ.. ఉదయం 7.30 సమయంలో మర్రిపాలెం జ్యోతీనగర్ వద్ద పంచముఖి లక్ష్మి(62) కాయగూరలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. 7.45 గంటలకు తిరుగుముఖం పడుతూ ఇంటి సందులో మలుపుతిరుగుతున్న సమయంలో కాపుకాసి ఉన్న దుండగుడు వెనక నుంచి వచ్చి మెడలోని గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన లక్ష్మి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం తెంచుకుపోయాడు. లాకెట్టు, చైన్లో సగభాగం తన చేతిలో ఉండిపోయింది. సుమారు రెండున్నర తులాల వరకు దుండగుడు లాక్కెళ్లిపోయినట్లు బాధితురాలు వాపోతోంది. రెండో చోరీ : పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద ఉదయం 8.05 గంటల సమయంలో రాజీవ్నగర్కు చెందిన నిడమల రత్నకుమారి విధులకు హాజరయ్యేందుకు బస్టాప్ సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆటో కోసం నిరీక్షిస్తోంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెల తాడు, నల్లపూసల దండ తెంచుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె అప్రమత్తం కావడంతో చేతిలో పుస్తెలు, నల్లపూసల దండ కొంతభాగం ఉండిపోయింది. మిగిలిన సుమారు రెండున్నర తులాలు తెంచుకుపోయాడు. మూడో చోరీ : ఉదయం 8.15 గంటల సమయంలో కంచరపాలెం జైభారత్నగర్ వద్ద ఎస్ కోట దరి జామి వెళ్లేందుకు వర్రి అరుణ బస్టాప్కు నడుస్తూ వస్తోంది. కాపుకాసిన దుండగుడు రెండు తులాల గొలుసు, రెండు తులాల నల్లపూసల దండ లాక్కుపోయాడు. నాలుగో చోరీ : విమాన్నగర్ వద్ద అదే ప్రాంతానికి చెందిన ఎం.అచ్చయ్యమ్మ(56) ఉదయం 11.30కు నగరంలో జరిగే ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు బస్టాప్ వద్ద నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమెను సమీపించాడు. బైక్పై మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న 5 తులాల నల్లపూసల దండ, చైన్ తెంచుకుని బైక్పై వెళ్లిపోయారు. గమనించిన ఓ వ్యక్తి తన బైక్తో వెంబడించే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తిని ఢీకొట్టేందుకు యత్నించి తప్పించుకుపోయారు. కరాసా వద్ద బైక్ చోరీ : ఆ సమయంలోనే కరాసాకు చెందిన ఓ యువకుడి ద్విచ్రవాహనం చోరీకి గురైంది. కరాసా వద్ద నైట్ ఫుడ్ స్టాల్స్ ఉన్న చోట 10.30 సమయంలో పార్కింగ్ చేసిన తన బైక్ను ఎవరో దొంగిలించడంతో బాధితుడు వెంటనే వాట్సాప్ ఫిర్యాదుతో పాటు, స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు కూడా చేశాడు. తన బైక్తోనే ఈ చోరీలకు పాల్పడ్డారేమోనని బాధితు డు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఉదయం 7.30 నుంచి దొంగతనాలు జరుగుతుండటంతో ఈ వాహనం వాడి ఉండరని పోలీసులు చెప్తున్నారు. చైన్ స్నాచింగ్లపై బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు. ‘చైన్’చోరీలతో బెంబేలు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు -
గోల్డ్ హంటర్స్!
● ఉదయం 7.45 గంటలు.. జ్యోతి నగర్.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లి మొదటి సవాల్ విసిరారు. ● ఉదయం 8.05 గంటలు.. పంజాబ్ హోటల్ జంక్షన్లో మహిళ మెడలోంచి చైన్ తెంచేసి పారిపోయి హడలెత్తించారు. ● ఉదయం 8.15 గంటలు కంచరపాలెం జయభారత్నగర్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళే లక్ష్యంగా చైన్ అపహరించిన దొంగలు రెప్పపాటులో మాయమయ్యారు. ● ఉదయం 11.30 గంటలు... విమాన్నగర్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారైపోయారు. నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు మార్చిలో 7 ఏప్రిల్లో 5 మే 13 వరకూ 4 సాక్షి, విశాఖపట్నం: మహానగరంలో ‘గోల్డ్’వేట మొదలైంది. గన్ పట్టుకున్న వేటగాడు అడవిలో పొంచి ఉన్నట్టు.. బైక్ ఎక్కిన దొంగలు.. జనం మధ్యే ‘స్నాచింగ్’పంజా విసిరారు. నాలుగు గంటల వ్యవధిలో 13 తులాల బంగారాన్ని కొట్టేశారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ వీధులు ఇప్పుడు ‘గోల్డ్ హంటర్స్’దూకుడుతో ఉలిక్కిపడుతున్నాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో, నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో హంటర్స్ చేసిన హడావుడి చూస్తుంటే.. పోలీసుల నిఘా వ్యవస్థకు గట్టి సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది. టైమ్ ఫిక్స్.. టార్గెట్ గోల్డ్.! బుధవారం ఉదయం నుంచి జరిగిన చైన్స్నాచింగ్ కేసుల్లో దొంగల రూట్ మ్యాప్ చూస్తే ఎవరికై నా ఆందోళన కలగాల్సిందే. వచ్చింది ద్విచక్ర వాహనంపై.. పోయింది సుమారు 13 తులాల పసిడి. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు. అయితే.. నాలుగు చోట్లా చేసింది ఒక్కరేనా.. లేదా అంతర్రాష్ట్ర ముఠా పనా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ‘నిఘా’నేత్రాలు నిద్రపోతున్నాయా.? నగర రక్షణ కోసం సిటీలో ఏర్పాటు చేసిన ‘మూడో కన్ను(సీసీ కెమెరాలు)’అనేక చోట్ల రెప్పవాల్చిన విషయం చైన్ స్నాచింగ్ ముఠా పసిగట్టినట్లుందనే వదంతులు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీగా ఉన్న విశాఖ నగరం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గోల్డ్ హంటర్స్ సిటీగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ సిటీ పోలీస్ అధికారిక గణాంకాల ప్రకారం... నగర వ్యాప్తంగా 13,485 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారిక రికార్డులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ డేటా, ఇటీవల పోలీస్ శాఖ నిర్వహించిన అంతర్గత ఆడిట్ నివేదికల ప్రకారం.. వీటిలో పోలీస్ శాఖవే కాకుండా ‘నేను సైతం’ప్రోగ్రామ్ కింద ప్రజలు, షాపుల యజమానులు పెట్టినవి కూడా ఉన్నాయి. వీటిలో ఎన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు సిగ్నల్ పంపుతున్నాయనే లైవ్ స్టేటస్ ద్వారా దాదాపు 40 శాతం అంటే 5,394 సీసీ కెమెరాలు మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని గుర్తించారు. ఇదే.. దొంగలకు అనువుగా మారిందనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసుల యాక్షన్ ప్లాన్ షురూ..! వరుస ఘటనలతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. గతంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే నిందితులు కావడంతో.. బుధవారం జరిగిన చోరీలు కూడా వారి పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు. సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, పనిచేస్తున్న కొన్ని కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల వేటలో నిమగ్నమయ్యారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు పెరిగినప్పటి నుంచి చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా జరుగుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. వీలైనంత త్వరగా గోల్డ్ హంటర్స్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. -
నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
మహారాణిపేట(విశాఖ) : వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలుం ఇలా శుభకార్యాలతో కళకళలాడే వేళకు తాత్కాలికంగా విరామం పడింది. గురువారం నుంచి వరుసగా 36 రోజుల పాటు శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి బాజాలు మూగబోనున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడింది. వేద పండితుల ప్రకారం ఈ కాలాన్ని ‘మూఢమి’గా పరిగణిస్తారు. అందుకే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి ప్రధాన శుభకార్యాలను చాలామంది వాయిదా వేస్తున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ పెళ్లి సందడి జూన్ 19న నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో మళ్లీ శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లోనూ పలు శుభముహూర్తాలు లభించనున్నాయి. గత డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా వివాహాలు జరగడంతో పట్టణాలు, గ్రామాలు పెళ్లి వేడుకలతో కళకళలాడాయి. ఇప్పుడు మరోసారి జూన్ చివరి నుంచి అదే సందడి కనిపించనుంది. పెళ్లి రంగానికి తాత్కాలిక మందగమనం శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలకు అనుబంధంగా ఉన్న వందలాది వృత్తులు తాత్కాలికంగా మందగించనున్నాయి. కళ్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్లు, డెకరేషన్, పూల వ్యాపారులు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, హోటళ్లు, లాడ్జిలు ఇలా అనేక రంగాలపై ప్రభావం పడనుంది. అయితే జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాల సీజన్ ప్రారంభం కావడంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకోనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 19 వరకు ఆగాల్సిందే.. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు ప్రధాన శుభకార్యాలకు విరామం ఉంటుంది. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు


