Alluri Sitarama Raju District News
-
కార్పొరేట్కు మేలు చేయడమే కేంద్రం లక్ష్యం
మాకవరపాలెం: కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు జి.వామనమార్తి ఆరోపించారు. మంగళవారం మాకవరపాలెంలో ఆటో కార్మికులతో కలసి ఆయన మాట్లాడారు. 2014లో ఎన్నో హామీల్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 36 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందన్నారు. విదేశాల్లో నల్లధనాన్ని వెలికితీసి పేదల అకౌంట్లలోకి వేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని బూచిగా చూపి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిందని ఆరోపించారు. ఈ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదానీ, అంబానీ వంటి వారిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా సామాన్యులపై భారం మోపడం సరికాదన్నారు. ఆటో, మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు వీరికి భారంగా ఉన్న జీవోలను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు రవి, కృష్ణ, దేవరాజు, దేవుడు, స్థానిక ఆటో యూనియన్ సభ్యులు శేషు, సూరిబాబు, చిన్నబ్బాయి, తదితరులు పాల్గొన్నారు. -
ఆగ్రహం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాంబిల్లి(అచ్యుతాపురం): సామాన్యుల నడ్డివిరిచే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని, విచక్షణా రహితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా వైఎస్సార్సీపీ అఽఽధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో మంగళవారం రాంబిల్లి మండలం మామిడివాడలో పార్టీ కార్యాలయం నుంచి కొత్తూరు పెట్రోల్ బంక్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలోని కీలక నేతలు గత ప్రభుత్వ హయాంలో చేసిన విమర్శలను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల ప్రభావం అన్ని వర్గాలపై, అన్ని రంగాలపై పడుతుందన్నారు. నిత్యావసర ధరలు సైతం అమాంతం పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం గురించి పరితపించే నేతలు ప్రస్తుత ప్రభుత్వంలో కరువయ్యారని విమర్శించారు. మీడియా పరంగా హంగూ ఆర్భాటాలు చేసే కూటమి నేతలు ధరల పెంపుపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ వద్ద లీటర్ ధర ఎంత పెరిగిందని బంక్ ప్రతినిధులు, సామాన్యులతో ధర్మశ్రీ మాట్లాడారు. బంక్లోని ధరల పట్టికను పరిశీలించారు. పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయండి... అంతకు ముందు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నేతలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రతినిధులతో ధర్మశ్రీ సమావేశమయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నాలుగు మండలాల్లో పార్టీ, అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని ఆయా మండలాల బాధ్యులకు సూచించారు. పోరాటాల ద్వారానే ప్రజల మన్ననలు పొందగలరని ఉద్బోధించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు, రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు, ఎంపీపీ భర్త శ్రీనుబాబు, రాంబిల్లి, యలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక మండలాల అధ్యక్షులు కిశోర్, బొద్దపు ఎర్రయ్యదొర, దేశంశెట్టి శంకర్రావు, ఆడారి అచ్చింనాయుడు, నాలుగు మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. -
మత్స్యకార భరోసా నిధుల పంపిణీ
పరవాడ: కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలాఅండగా ఉంటుందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు అన్నారు. ముత్యాలమ్మపాలెంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన మత్స్యకార భరోసా నగదు ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున అందించారు. అనంతరం ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం గ్రామాల్లో సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగి మరణించిన వారికి చెరో రూ.5 లక్షలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్తో కలిసి బాధిత కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేపల వేట నిషేధ సమయంలో గంగపుత్రులను ఆదుకోనేందుకు ఈ నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మపాలెం తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో 960 మంది మత్స్యకారులకు రూ.1.92 కోట్లు, యలమంచిలి నియోజకవర్గంలో 4,352 మందికి రూ.8.7 కోట్లు, పాయకరావుపేట నియోజకవర్గంలో 8,349 మందికి రూ.16.69 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారులు విజయ్, మత్స్యకార సంస్థ డెవలప్మెంట్ అధికారి రవితేజ, పరవాడ ఇన్చార్జ్ తహసీల్దార్ అరుణ్, ముత్యాలమ్మపాలెం ప్రత్యేక అధికారి రమాదేవి, పరవాడ మాజీ జెడ్పీటీసీ పైల జగన్నాథరావు, మాజీ సర్పంచ్ చింతకాయల సుజాత, ఎంపీటీసీలు అరిజిల్లి దేవి రవి, సూరాడ బంగార్రాజు, తిక్కవానిపాలెం మాజీ సర్పంచ్ చేపల మసేను, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ బి.అప్పారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
రేడియోతో పెరిగాం.. జీవితాన్ని మలచుకున్నాం
బీచ్రోడ్డు: ‘రేడియో కేవలం వినోద మాధ్యమం కాదు.. అది విజ్ఞానం, క్రమశిక్షణ, జీవిత విలువలను అందించే గొప్ప వేదిక’ అని విశాఖ జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి పేర్కొన్నారు. 90 వసంతాల ఆకాశవాణి ఉత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన వాక్థాన్ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తాను రేడియో వింటూ పెరిగానని, రేడియో ద్వారా విజ్ఞానం, వినోదం రెండింటినీ పొందానని చెప్పారు. ‘మా అమ్మతో పాటు మా కుటుంబమంతా రేడియో అభిమానులమే. జీవితాలను ఉన్నతంగా మలచే శక్తి రేడియోకు ఉంది’ అని ఆమె అన్నారు. ఈ ప్రత్యేక వేడుకల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, రీజినల్ ఛానెల్ మేనేజర్ ఆర్. హర్షలత మాట్లాడుతూ తన 32 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆకాశవాణి 90వ వార్షికోత్సవాలను నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమాజానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన రేడియో తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. డైరెక్టర్ ఇంజనీరింగ్ జె.కృష్ణారావు, డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీరింగ్ బి.వేణు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల నాటికి మరింత నాణ్యమైన కార్యక్రమాలతో శ్రోతలకు చేరువ కావడమే లక్ష్యమన్నారు. కార్యక్రమ విభాగాధిపతి పి.వి.రాంగోపాల్ మాట్లాడుతూ విభిన్న కార్యక్రమాల రూపకల్పనతో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్నో వేలాది మంది శ్రోతల అభిమానాన్ని సంపాదించుకుందని చెప్పారు. సిరిపురంలోని ఆకాశవాణి కేంద్రం వద్ద ప్రారంభమైన వాక్థాన్ పాండురంగపురం, బీచ్రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం, రామకృష్ణ మిషన్ మీదుగా సాగి తిరిగి కేంద్రం వద్ద ముగిసింది. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ కె. ఇందిర, సంఘమిత్ర, ఎన్. సుధాకరరెడ్డి, తేతలి దిలీప్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజయ్యపేటలో వీఆర్పీ అక్రమాలపై ఫిర్యాదు
నక్కపల్లి : మండలంలో రాజయ్యపేటగ్రామంలో జరుగుతున్న ఉపాధి హమీ పథకం పనుల్లో వీఆర్పి మైలపల్లి సత్యనారాయణ బినామీ మస్తర్లు వేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడంటూ మంగళవారం గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 70 గ్రూపులు ఉన్నాయన్నారు. 70 మంది మేట్లు పనిచేస్తున్నారన్నారు. వీఆర్పి సత్యనారాయణ స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి జూమ్కాల్ద్వారా మస్తర్లు వేస్తున్నాడన్నారు. పనుల్లోకి రాని వారికి సైతం మస్తర్లు వేసి స్థానికంగా ఉన్న కూలీలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. వీఆర్వో చేస్తున్న అక్రమాల వల్ల గ్రామంలో 1400 మంది ఉపాధి కూలీలకు పనులు కల్పించడం లేదన్నారు. పనుల్లోకి రానివారిని ఆన్లైన్ విధానంలో మస్తర్లు వేసి అసలైన కూలీలకు అన్యాయం చేస్తున్నాడన్నారు. తక్షణమే వీఆర్పీ ఆక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పిక్కి కోదండరావు, బొంది గురన్న,పిక్కిచిన్నారి, పిక్కి కిరణ్ పిక్కికోటేశ్వరరావు, ఎరిపల్లి అమ్మోరియ్య, పిక్కిరమణ,కాశీరావు,తదితరులు మంగళవారం ఇన్చార్జ్ ఎంపీడీవో సీతారామరాజుకు ఫిర్యాదు అందజేశారు. -
జిల్లాలో తేలిక పాటి వర్షాలు పడే అవకాశం
అనకాపల్లి టౌన్: జిల్లాలో వచ్చే ఐదు రోజులు తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్. ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 36.8 నుంచి 37.9 డిగ్రీలుగా నమోదవుతాయన్నారు. ఈ మేరకు రైతులు చెరకు పైరుకు నీరు పెట్టాలన్నారు. చెరకులో కొరడా తెగులు ఆశిస్తే. ప్రోపికొనజోల్ 1 మి.లీ లేదా అజోక్సిస్ట్రోబిన్, టెబుకోనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలన్నారు. నీటి వసతి ఉన్న రైతులు ముందస్తు ఖరీఫ్ పంటగా నువ్వులను వేసుకోవచ్చన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో పండు ఈగ ఆశించే అవకాశం ఉందన్నారు. ఇది ఆశించి రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలని, ఈగ నివారణకు ప్లాస్టిక్ పళ్లెంలో మిథైల్ యూజినాల్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి తోటలో వేలగట్టాలన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితుల బట్టి వేసవి జల్లులు కురిసిన తర్వాత ఖాళీ పొలాల్లో వేసవి దుక్కులు దున్నుకోవాలన్నారు. పంట కోత అనంతరం ఖాళీ పొలాల్లో మట్టి నమూనాలను సేకరించి విశ్లేషణ చేసినట్లయితే రాబోయే ఖరీఫ్లో భూసారం తగినట్టుగా యాజమాన్య పద్ధతులు చేపట్టవచ్చన్నారు. సమావేశంలో డాక్టర్ ఆదిలక్ష్మి, డాక్టర్ రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మానస్ మేథస్సుకు యాపిల్ సలాం
కొమ్మాది: టెక్ దిగ్గజం యాపిల్ నిర్వహించిన స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్–2026లో విశాఖ సీతమ్మధారకు చెందన యువకుడు మానస్ మల్లా అద్భుత విజయం సాధించారు. జూన్ 9న ఆయన యాపిల్ సీఈవో టీమ్ కుక్ను కలవనున్నారు. ఈ ఛాలెంజ్ను క్రాక్ చేసిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 15 మంది విద్యార్థుల్లో ఈయన ఒకరు. ఈ 15 మంది ఎలైట్ బృందంలో స్థానం దక్కించుకున్న ఏకై క భారతీయుడు కావడం, విశాఖ యువకుడు కావడం విశేషం. విశాఖలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మల్లా మానస్ రూపొందించిన ఆఫ్లైన్ ఏఆర్ ఆధారిత పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్ స్టెమ్ క్వెస్ట్ ఆయనకు ఆపిల్ పార్కులో జరిగే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ను సందర్శించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అక్కడ ఆయన టీమ్ కుక్తో ముఖాముఖి ఇంటరాక్ట్ అవుతారు. స్టెమ్ క్వెస్ట్ విద్యార్థులకు స్నేహపూర్వక, సహాయక ట్యూటర్గా పనిచేసేలా రూపొందించబడింది. బట్టి పట్టే విధానంతో తాను పడిన ఇబ్బందులు, భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని గమనించిన మల్లా, సాధారణ క్విజ్లకు బదులుగా విద్యార్థులు భావోద్వేగాలను నేర్చుకునే విధానాలను బాగా అర్ధం చేసుకోవడానికి ఏఐ ఆధారిత కథలు చెప్పేవిధానాన్ని, ఫేషియల్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. మాతృభాషలు, ప్రాంతీయ మాండలీకాలు అందరికి అందుబాటులో ఉండే సాంకేతికతను ఉపయోగించి అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా, కలుపుకుపోయేలా, ఒత్తిడి లేకుండా చేయడం ఈ యాప్ ఉద్దేశం. ప్రధానికి వివరించిన మానస్ న్యూఢిల్లీలో జరిగిన స్టార్టప్ మహాకుంభ్లో మల్లాకు తన లెర్నింగ్ యాప్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనకు తగిన ప్రోత్సాహం లభించింది. అక్కడ ఆయన ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో స్టెమ్ క్వెస్ట్ గురించి తన విజన్ పంచుకోగా, ఆ కలను సాకారం చేసుకోవాలని ప్రధాని ఆయనను ప్రోత్సహించారు. ఫిబ్రవరిలో, యాపిల్ ఛాలెంజ్ గడువు ముగియడానికి కేవలం ఒక వారం ముందు మల్లా తన ఆలోచనలను డిజిటల్–ఫస్ట్ అప్లికేషన్గా మార్చారు. ఈ కొత్త వెర్షన్ స్టెమ్ క్వెస్ట్గా రూపాంతరం చెందింది. ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ను బోధించే యానిమేటెడ్ ట్యూటర్లతో వీడియో కాల్లాగా డిజైన్ చేయబడిన ఆఫ్లైన్ ఏఐ విధ్యా ఫ్లాట్ఫారమ్. విద్యార్థులు తమకు కావాల్సిన టాపిక్ ఎంచుకుని స్నేహపూర్వక వర్చువల్ మెంటర్తో ఇంటరాక్ట్ కావచ్చు. ఇది ఒత్తిడితో కూడిన క్లాస్రూమ్లో కూర్చోవడానికి బదులుగా ఒక స్నేహితుడుతో మాట్లాడుతున్న అనుభూతిని ఇస్తుంది. యాప్ అతి పెద్ద బలం సానుభూతితో కూడిన అభ్యాసం. ‘సాధారణ పరీక్షలు, క్విజ్లపై ఆధారపడే బదులు ఫేషియల్ ట్రాకింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్ల ద్వారా విద్యార్థి గందరగోళంగా ఉన్నాడా.. ఆసక్తిగా ఉన్నాడా.. సంతోషంగా ఉన్నాడా.. విసుగు చెందాడా అనే విషయాలను అర్ధం చేసుకోవడానికి ఈ ఫ్లాట్ఫారమ్ ప్రయత్నిస్తుందని’ మల్లా తెలిపారు. వ్యక్తిగతీకరణ అనేది దీని మరొక ముఖ్య లక్షణం. స్టెమ్ క్వెస్ట్ విద్యార్థుల హాబీలు, ఆసక్తులను ఉపయోగించి కాన్సెప్ట్లను వివరిస్తుంది. ఆన్–డివైజ్ ఏఐ జనరేటెడ్ విజువల్స్, స్టోరీ టెల్లింగ్ ద్వారా విద్యార్థులకు అభ్యాసాన్ని మరింత ఆకర్షనీయంగా, ఇంటరేక్వివ్గా, భయం లేకుండా చేస్తుందని ఆయన చెబుతున్నాడు. ఆవేదన నుంచి వచ్చిన ఆలోచన నేను అమెరికాలో చదివినప్పుడు ప్రయోగాల ద్వారా నేర్చుకునే విద్యా విధానాన్ని చూశాను. కానీ భారతదేశం తిరిగి వచ్చి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు విద్యార్థులపై ఉన్న విద్యా ఒత్తిడిని గమనించాను. ఐఐటీ ఫలితాల వల్ల నా మిత్రుడు ఆత్మహత్యకు యత్నించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటనలతో మన విద్యావ్యవస్థలో మానవతా దృక్పథం అవసరమని గుర్తించి, ఒత్తిడి లేని అభ్యాసం కోసం ‘స్టెమ్ క్వెస్ట్’ యాప్ను రూపొందించాను. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఇందులో వాయిస్ ఇంటరాక్షన్, హై–కాంట్రాస్ట్ ఫీచర్లు చేర్చాను. ఇంటర్నెట్, ఖరీదైన ఫోన్లు లేని పేద విద్యార్థుల కోసం ఇది ఆఫ్లైన్లో, తక్కువ ధర స్మార్ట్ఫోన్లలో కూడా స్థానిక భాషల్లో పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణకు గాను నాకు అమెరికాలోని యాపిల్ పార్క్ను సందర్శించి, అక్కడి ఇంజనీర్లతో చర్చించే అవకాశం, ఏడాది పాటు ఉచిత యాపిల్ డెవలపర్ మెంబర్షిప్ లభించాయి. -
గురుకుల సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ
సబ్బవరం: విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకుల విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లతోపాటు నాన్ టీచింగ్ సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం రాష్ట్రంలోనే తొలిసారిగా స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. విశాఖపట్నం–అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త(డీసీవో) జి.గ్రేస్ మాట్లాడుతూ ఇలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థుల అవసరాలు మరింత మెరుగ్గా తీర్చడంతోపాటు, పరిపాలనా విధుల్లో సమర్ధత పెంపొందించుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, విద్యాసంస్థల పరిపాలనను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. శిక్షణలో భాగంగా కార్యాలయ నిర్వహణ, ఫైల్ మెయింటెనెన్స్, ఈ ఆఫీస్ విధానం, రికార్డుల సంరక్షణ, సమయపాలన, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రభుత్వ ఉత్తర్వుల అమలు, డిజిటల్ సేవల వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రిన్సిపాళ్లు ఎస్.రామకృష్ణ, పి.శ్రీనివాసరావు, రత్నవల్లి, మృదుల ప్రియదర్శిని, ఉషారాణి, సత్యవతి, పద్మకుమారి, రాజేశ్వరి, ఎం.కోటేశ్వరరావుతోపాటు సూపరింటెండెంట్లు ఎస్. శ్రీనివాసరావు, నరేష్, రాజేష్, అనిత పాల్గొన్నారు. -
మోదమ్మా..తోడుండమ్మా!
పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, గిరిజనుల ఇలవేల్పు అయిన పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర ముగింపు వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను భారీ ఊరేగింపుతో సతకం పట్టు వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. అక్కడ మూడు రోజుల పాటు భక్తుల నుంచి అమ్మవారు విశేష పూజలందుకున్నారు. కనులపండువగా తిరుగు ప్రయాణం జాతర చివరి రోజున వేదమంత్రోచ్ఛారణలు, సన్నాయి మేళాలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ థింసా నృత్యాలు, శక్తి వేషధారణల మధ్య అమ్మవారి ఊరేగింపు కనులపండువగా సాగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మోయగా.. అమ్మవారి పాదాలను కలెక్టర్ నిశాంతి, ఘటాలను జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి, భక్తులు భుజాలపై మోస్తూ ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి చేర్చారు. దీంతో మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దర్శించుకున్న ప్రముఖులు జాతర ముగింపు రోజున పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఉదయమే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ నిశాంతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆలయ కమిటీ ప్రతినిధులు వారిని ఘనంగా సన్మానించి అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఘనంగా ముగిసిన మోదకొండమ్మ రాష్ట్ర గిరిజన జాతర తరలివచ్చిన భక్తజనం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాదాలు, ఘటాలను మోసిన కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ,పీవో ఆదిత్యవర్మ -
పాడేరు ఎమ్మెల్యేపై తప్పుడుఆరోపణలు తగదు
● దాడికి పాల్పడిన వారిని కఠినగా శిక్షించాలి ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అచ్యుత్ కొయ్యూరు: బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టడం టీడీపీ నాయకులకు అల వాటుగా మారిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. అచ్యుత్ ఆరోపించారు. పాస్టర్ అభినయ్పై జరిగిన దాడికి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు కూటమి నాయకులు ముడిపెట్టాలని చూడడం దారుణమన్నారు. ఎమ్మెల్యేనే ఈ దాడి చేయించారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మంగళవారం తెలిపారు. అభినయ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని, అవి కూటమి నాయకులకే వర్తిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో వారే అభినయ్పై శతృత్వం పెంచుకుని ఉండే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే దాడి చేయించారని ప్రచారం చేయడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అభినయ్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
కెమిస్టుల సమరభేరి
ఇ–ఫార్మసీలపై ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా ఏఐఓసీడీ పిలుపు నేడు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ ఉమ్మడి జిల్లాలో 3,400 మెడికల్ దుకాణాలు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇ–ఫార్మసీలు కృత్రిమ మేథస్సు(ఏఐ)తో నకిలీ ప్రిస్క్రిప్షన్ల సృష్టి నియంత్రణ లేని మందులతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ముప్పు తనిఖీలు లేవు.. జవాబుదారీతనం శూన్యం ప్రజల ఆరోగ్యం, రోగుల భద్రతపై ప్రభావమంటున్న అసోసియేషన్ ప్రతినిధులు సాక్షి, అనకాపల్లి : అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం (ఏఐఓసీడీ) పిలుపుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఔషధ వ్యాపారులు ఉద్యమబాట పడుతున్నారు. ఆన్లైన్ మందుల విక్రయాలు, ఈ–ఫార్మసీల ధోరణిని నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ప్రభావంతో సాధారణ మందుల కొనుగోళ్లు ఒక రోజు పాటు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అయితే ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రం తెరిచి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బంద్లో మందులు దుకాణాల సిబ్బంది, కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గోనున్నారు. మూడు జిల్లాల్లోనూ నిరసన ప్రభావం ఈ నిరసన కాక ఉమ్మడి విశాఖ జిల్లాల్లో స్పష్టంగా కనిపించనుంది. విశాఖపట్నం జిల్లాలో 1600, అనకాపల్లి జిల్లాలో 1500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 300 చొప్పున మొత్తం 3400 మందుల దుకాణాల సిబ్బంది, కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ బంద్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతున్నారు. కార్పొరేట్ శక్తుల అండతో నడుస్తున్న ఆన్లైన్ ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల స్థానిక, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న మెడికల్ షాపులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని, ఈ అసమాన పోటీని తట్టుకోలేక చిన్న వ్యాపారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ ప్రిస్క్రిప్షన్ల ముప్పు ఆన్లైన్ ఫార్మసీల వల్ల కేవలం వ్యాపారులకే కాకుండా ప్రజారోగ్యానికి కూడా తీవ్ర ముప్పు పొంచి ఉందని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండానే విచ్చలవిడిగా డ్రగ్స్ ఆన్లైన్ ద్వారా చేతులు మారుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వాడుకుని నకిలీ ప్రిస్క్రిప్షన్లను సృష్టిస్తున్నారని, తనిఖీలు లేకపోవడంతో నాసిరకం, నకిలీ మందులు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నియంత్రణ లేని యాంటీబయోటిక్స్ వాడకం వల్ల రోగులలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరిగి ప్రాణాలకే ముప్పు వస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ఉల్లంఘన.. సాధారణంగా హోల్సేలర్ మార్జిన్ 8 నుంచి 10 శాతం, రిటైల్ ఫార్మసిస్ట్ మార్జిన్ 16 నుండి 20 శాతం వరకు ఉంటే, ఈ–ఫార్మసీలు ఏకంగా 20 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తూ మార్కెట్ను శాసిస్తున్నాయి. నేషనల్ ప్రైస్ అథారిటీ నిబంధనలను పక్కనబెట్టి సాగుతున్న ఈ ధరల వ్యత్యాసాన్ని అరికట్టాలని కెమిస్టులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో మందులను డోర్ డెలివరీ చేసేందుకు ఇచ్చిన తాత్కాలిక సడలింపులను ఆసరాగా చేసుకుని ఇప్పుడు వ్యాపారాలు చేయడం సరికాదని, ఆ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని వారు కోరుతున్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే ఈ బంద్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. శాంతియుత నిరసనకు పిలుపు ఈ బంద్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలతో గానీ, అధికారులతో గానీ ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని, సోషల్ మీడియా ద్వారా పుకార్లను వ్యాప్తి చేయవద్దని అసోసియేషన్ సభ్యులకు పిలుపునిచ్చారు. అలాగే అంబులెన్సులు, అత్యవసర వైద్య సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా శాంతియుతంగా నిరసన చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ఔషధ విక్రయశాలలుఈ–ఫార్మసీని నియంత్రించాలి రోగులకు ఇబ్బంది లేకుండా ప్రధాన సెంటర్లో ఒకటి రెండు మందుల దుకాణాలు తెరిచేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆసుపత్రుల అనుబంధ మెడికల్ షాపులో ఉన్న సిబ్బంది కూడా బంద్లో పాల్గొంటారు. రోగులకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా మా నిరసనను తెలియజేస్తున్నాం. ఈ–ఫార్మసీ, ఆన్లైన్లో మందుల విక్రయాలను పూర్తిగా నియంత్రించాలనేదే మా డిమాండ్. నకిలీ మందులకు చెక్ పెడుతూ ప్రజా రోగ్యాన్ని కాపాడాలనేదే మా నిరసన. – నొదిరిపాటి సూర్య ప్రకాష్ గుప్తా, అనకాపల్లి జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షుడుఎమర్జెన్సీ రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఏఐఓసీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ కారణంగా విశాఖ నగరం, అనకాపల్లి జిల్లా, అల్లూరి జిల్లాల్లో ఎమర్జెన్సీ రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆసుపత్రి అనుబంధ మెడికల్ షాపులు తెరిచే ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నాం. రోగులకు ఇబ్బంది కలగకుండా మెడ్ప్లస్, అపోలో ఫార్మసీలను ప్రధాన సెంటర్లలో తెరిచే ఉంచాలని కోరడం జరిగింది. – రజిత, ఔషధ నియంత్రణ డిప్యూటీ డైరెక్టర్ -
నిర్వహణ నిధులుమంజూరుకాక ఇబ్బందులు
● కాఫీ రైతుల ఆవేదన అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని హెక్టాగుడ గ్రామంలోని కాఫీ రైతులతో కాఫీ బోర్డు సభ్యుడు శెట్టి రాజు సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగా కాఫీ తోటల నిర్వహణ నిధులు మంజూరు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని ఈ సందర్భంగా రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతగిరి మండలంలో వేల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నప్పటికీ, ఇక్కడ కనీసం పూర్తి స్థాయి కార్యాలయం కూడా లేకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శెట్టి రాజు స్పందిస్తూ.. త్వరలోనే కాఫీ రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలతో చర్చించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం హెక్టాగుడలోని కాఫీ నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో కాఫీ లైజన్ వర్కర్లు అప్పన్న, మొష్యా, సీతారాం, రాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
భానుడి ప్రతాపం.. ఆపై కుంభవృష్టి
పాడేరు: పాడేరు శ్రీ మోదకొండమ్మ రాష్ట్ర గిరిజన జాతర చివరి రోజున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం ఉదయం వేకువజాము నుంచే దట్టమైన మంచు కమ్ముకోగా.. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. అయితే, ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో ఏకధాటిగా సుమారు మూడు గంటల పాటు కుంభవృష్టి కురవడంతో పట్టణమంతా తడిసి ముద్దయింది. దుకాణాలు మునిగి.. జాతర ముగింపు రోజున భారీగా వ్యాపారం జరుగుతుందని ఆశించిన చిరు వ్యాపారులను ఈ అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. రోడ్డు పక్కన, మైదానాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారుల సామగ్రి అంతా తడిసిపోయింది. ఆకస్మిక వరద నీరు చేరడంతో దుకాణదారులు ఎన్నో అవస్థలు పడ్డారు. నాలుగు గంటలు అంధకారం.. భారీ ఈదురుగాలుల కారణంగా పట్టణంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు నాలుగు గంటల పాటు కరెంట్ నిలిచిపోవడంతో జాతర పరిసర ప్రాంతాలన్నీ చీకటమయమయ్యాయి. జాతర ముగింపు వేడుకలను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు కారుచీకట్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. సరైన సమయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు సాయంత్రం ఏడు గంటలకు అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాడేరులో ఈదురు గాలులతో భారీ వర్షం నాలుగు గంటలపాటు నిలిచిన విద్యుత్ సరఫరా కారుచీకట్లో మోదకొండమ్మ భక్తుల అవస్థలు -
తండ్రిని కడతేర్చిన తనయుడు
పెదబయలు: కన్న తండ్రిని ఓ కుమారుడు అతికిరాతకంగా కర్రతో తలపై కొట్టి హతమార్చిన ఘోర ఘటన మండలంలోని సీకరి పంచాయతీ వెల్లపాలెం గ్రామంలో జరిగింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వెల్లపాలెం గ్రామానికి చెందిన లకే సింహాచలం (55) ఈ నెల 18వ తేదీ సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో తన ఇంటి ముంగిట కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అతని కుమారుడు లకే రమేష్... నీకు నెలనెలా వస్తున్న వృద్ధాప్య పింఛను డబ్బులు నాకు ఎందుకు ఇవ్వడం లేదు?.. అంటూ తండ్రితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో, రమేష్ ఒక్కసారిగా ఆగ్రహంతో పక్కనే ఉన్న కర్రను తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో చెవి, ముక్కుల నుంచి తీవ్ర రక్తస్రావమై సింహాచలం అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొంతకాలంగా తండ్రీకొడుకులు ఇద్దరూ మద్యం సేవించి తరచూ గొడవ పడుతుండేవారని, సోమవారం రాత్రి కూడా అలాగే గొడవపడి తండ్రిని కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. మృతుడికి రమేష్ ఒక్కడే కుమారుడు. గతంలో భార్యను కూడా హత్య చేసిన రమేష్ నిందితుడు లకే రమేష్కు నేరచరిత్ర ఉంది. గతంలో 2018 సంవత్సరంలో గర్భవతిగా ఉన్న తన భార్య సంధ్య (21)ను కొట్టి చంపిన కేసులో ఇతను ఐదేళ్ల పాటు విశాఖపట్నం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. గత ఏడాది జైలు నుంచి విడుదలైన రమేష్.. ఇంటికి వచ్చినప్పటి నుంచి తాగి వచ్చి తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే తండ్రి పింఛను డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడి కోసం గాలింపు.. మృతుడి భార్య నీలమ్మ, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్లో ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించి, శవపరీక్ష అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, రేపటికల్లా పట్టుకుంటామని జి.మాడుగుల సీఐ ఎస్.లక్ష్మణరావు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో వెల్లపాలెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దర్యాప్తులో పెదబయలు, జి.మాడుగుల ఎస్ఐలు పి. వెంకటేష్, పోలీసు క్లూస్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధాప్య పింఛను కోసం కర్రతో దాడి మద్యం మత్తులో హతమార్చిన వైనం నిన్న భార్య.. నేడు తండ్రి.. జైలు నుంచి వచ్చినా మారని బుద్ధి పరారీలో నిందితుడు వెల్లపాలెంలో ఘటన -
జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట
అరకులోయటౌన్: జగనన్న ప్రభుత్వహయాంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసినట్టు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, నివారణ అవగాహన సదస్సును ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వైఎస్సార్సీసీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ ఫ్యామిలీడాక్టర్, విలేజ్ క్లినిక్ల ద్వారా ఉచిత పరీక్షలు, మందులు అందించారని తెలిపారు. 15 ఏళ్లు పైబడిన వారందరి హెల్త్ రిపోర్టును ఆన్లైన్ యాప్లో పొందుపరిచి, బీపీ, మధుమేహం, కిడ్నీ, గుండె జబ్బులు వంటి అసంక్రమిత వ్యాధులను ప్రాథమిక దశలో నివారించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. అనంతరం హైపర్ టెన్షన్ డేని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీపీ పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాల మేరకు మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య,ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రామ్మూర్తి, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జ్ పాంగి విజయ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, సుంకరమెట్ట పంచాయతీ అధ్యక్షుడు కొర్రా అర్జున్రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శోభారాణి, వైద్యులు రాము, బాలాజీ, పావని, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
భరోసా పార్టీ అధినేతపై దుండగుల దాడి
గూడెంకొత్తవీధి: భరోసా పార్టీ అధినేత డాక్టర్ ధార అభినయ్ దసన్పై మండలంలో మొండిగెడ్డ పంచా యతీ నీరుతోటపాలెం కాఫీ తోటల సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.కడపకు చెందిన అభినయ్ కొన్ని రోజులుగా జిల్లా లో ఉంటున్నారు. నీరుతోటపాలెంలో సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి కారులో తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అభినయ్, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి దింపి, కాఫీ తోటల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అభినయ్పై బ్లేడుతో దాడి చేశారు. తల,కాళ్లపై కోసేశారు. అభినయ్తో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి చేశారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అభినయ్ స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి, దుండ గులు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అభినయ్ను జెర్రెల ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఎవరో, ఎందుకు దాడి చేశారో తెలియడం లేదు. కడప నుంచి వచ్చిన అభినయ్కి ఇక్కడ ఎవరు శత్రువులున్నారో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. అభినయ్ కారుపై కూడా దాడి చేయడంతో కారు అద్దం పగిలిపోయింది. -
మోదమ్మ జాతరలో బ్రహ్మకుమారీస్ఆధ్యాత్మిక ప్రదర్శన
పాడేరు : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని ప్రశాంతమైన జీవితం గడపాలని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. పట్టణంలో మోదకొండమ్మ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో స్థానిక మోదకొండమ్మ ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రదర్శనను జ్యోతి ప్రజల్వన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 108 శివలింగాలను ఒకేచోట కొలవుదీర్చడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఆధ్యాత్మిక విజ్ఞాన చిత్రప్రదర్శనను ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక అకడామీ చైర్మన్ వంపూరి గంగులయ్య, పోలవరం ప్రాజెక్టు అధికారి అభిషేక్, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
చాపరాయిని సందర్శించిన పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్
డుంబ్రిగుడ: మండు వేసవిలోనూ చాపరాయి అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్ అన్నారు. సోమవారం ఆయన చాపరాయిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను పాడేరు ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహించిన సమయంలో చాపరాయి అభివృద్ధికి సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చాపరాయి జలపాతం గిరిజన ప్రాంతంలో మినీ బీచ్ లాంటిదని, మద్రాసులో మెరీనా బీచ్, విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్లుఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయో చాపరాయి జలపాతం కూడా అంతే ప్రాముఖ్యత పొందిందని చెప్పారు. అనంతరం చాపరాయి ఉద్యోగులు, వ్యాపారులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. -
పెట్రో బాదుడుపై
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాడేరు, అరకులోయలలో ఆ పార్టీ నాయకులు, ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వ్యాన్కు తాడుకట్టి లాగుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జి.మాడుగుల జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, పార్టీ నాయకులుపాడేరు/ జి.మాడుగుల: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం రూ.3,200కోట్లు భారం మోపిందని, దీంతో సామాన్యుడి మనుగడ ప్రశార్థకరంగా మారిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. వైఎస్సార్సీపీ అధి ష్టానం పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రం జి.మాడుగులలో జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. ఇన్చార్జీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలు పెట్రోల్,డీజిల్ ధరలు పెంచబోమని చెప్పి, ఇప్పుడు ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు, మాజీ ఎంపీపీ మత్స్య రాస వెంకటగంగరాజు, ఎంపీటీసీ మత్స్యరాస విజయకుమారి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, తాజా మాజీ సర్పంచ్లు మాల్లన్న, ఐసరం హనుమంతరావు, సీదరి కొండబాబు, నియోజకవర్గ వలంటీర్ల విభాగం అధ్యక్షుడు కూర్మరాజు, పార్టీ క్రిస్టియన్, మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వంతాల కృష్ణారావు, మాజీ ఎంపీటీసీ బ్రహ్మలింగం, మండల మహిళ అధ్యక్షురాలు నీలమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు సిర్మా పండన్న, రామకృష్ణ్ణ, మన్మధరావు, పెదబాలన్న, చిట్టిబాబు, బంగార్రాజు, రమణ, లింగమూర్తి, కొండబాబు, సన్యాసిరావు, చంటిబాబు తదితరుల పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న కూటమి సర్కార్ : ఎమ్మెల్యే మత్స్యలింగం అరకులోయటౌన్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, రాష్ట్ర ప్రజల్ని కూటమి ప్రభుత్వం దోచుకుంటోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం అరకులోయలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముందుగా అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ నుంచి వ్యాన్కు తాడుకట్టి తహసీల్దార్ కార్యాలయం వరకూ లాగుతూ తీసుకువెళ్లారు. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, చేతకాని కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సివేరి సురేష్కుమార్కు వినతి పత్రం అందజేవారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల ఏడాదికి ప్రజలపై రూ. 3 వేల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఆరు నెలల నుంచే దోపిడీ : జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల నుంచే దోపిడీ ప్రారంభించిందన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె, ఇతర నిత్యావసరాల ధరలు పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. పక్క రాష్ట్రంలో పెట్రోల్కు లీటర్కు రూ.3, డీజిల్కు రూ.2 పెంచితే మన రాష్ట్రంలో పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3.50 పెంచడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, ఎంపీపీలు బాక ఈశ్వరి, మిథుల, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, రామచందర్, జయ వర్ధిని, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల అధ్యక్షులు రామ్మూర్తి, కొర్రా సూర్యనారాయణ, పాంగి పరశురామ్, అనిల్, పద్మారావు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్, మండల ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జీ పాంగి విజయ్, నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, మాజీ సర్పంచ్లు పాగి అప్పారావు, సమిడ వెంకట పూర్ణిమ, గుమ్మ నాగేశ్వరరావు, కొర్రా సింహాద్రి, అర్జున్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అరకులోయ డిప్యూటీ తహసీల్దార్ సురేష్కుమార్కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, నాయకులు జి.మాడుగులలో ఇన్చార్జి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేస్తున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు -
సరిహద్దులో సారాకాసి
● యథేచ్ఛగా తయారీ, విక్రయాలు ● పూటుగా తాగి అనారోగ్యం బారిన పడుతున్న గిరిజనులు ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గిరిజన, అటవీ ప్రాంతాల్లో ప్రాంతంలో సారా ఏరులైపారుతోంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. వారపు సంతల్లో, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పంచాయతీల్లో జోరుగా సారా అమ్మకాలు జరుగుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో సారాను తయారు చేసి, మండలంలో అన్ని గ్రామాలకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. సారా తయారు చేసేందుకు ఒడిశా ప్రాంతం నుంచి అవసరమైన నల్లబెల్లాన్ని గుట్టుచప్పుడుగా ఆంధ్రకు తీసుకొస్తున్నారు. జోలాపుట్టు,ముంచంగిపుట్టు,కుమడ,బూసిపుట్టు,లక్ష్మీపురం గ్రామాల్లో నల్లబెల్లం నిల్వ చేసేందుకు ప్రత్యేక గోదాములు ఏర్పాటు చేశారు. ఆ గోదాముల నుంచే అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా సరిహద్దులో పండగలు, జాతర్లు జరుగుతుండడంతో సారాకు డిమాండ్ పెరిగింది. మారుమూల గ్రామాలతో పాటు మండల కేంద్రం ముంచంగిపుట్టులో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాల సమీపంలో సారా బట్టీలను సైతం ఏర్పాటు చేసి, భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. సారాను అరి కట్టేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్లు కృషి చేశారు. గ్రామాల్లో వెళ్లి అవగాహన కలిపించడం, సారా వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ లేక పోవడంతో ఎక్సైజ్ అధికారులు అటువైపు దృష్టి సారించకపోవడంతో సారా తయారీ,అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ‘సారా’సమైన ధరకే... వారపు సంతల్లో ప్యాకెట్ రూ.10 చొప్పున్న విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే సారా ప్యాకెట్ దొరుకుతుండడంతో పూటగా సేవించి,మందు బాబులు ఎక్కడబడితే అక్కడ రోడ్ల మీద పడిపోవడంతో పాటు గొడవలు పడుతున్నారు. ఆ మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు బారిన పడుతున్నారు. రోజూ సారా మత్తులో గడుపుతుండడంతో పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆరోగ్యం క్షీణించి తమ వారు మరణించే ప్రమాదం ఉందని గిరిజన మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఎకై ్సజ్ అధికారులు,పోలీసులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని, సారా వల్ల ఇబ్బందులు పడుతున్న గృహిణులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఎకై ్సజ్ అధికారులు,పోలీసులు సారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సరిహద్దు ప్రాంత వాసులు కోరుతున్నారు. గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం సారా వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. సారా అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సారా లేని గ్రామాలే లక్ష్యాంగా పనిచేస్తున్నాం. వారపు సంతల్లో, సారా అమ్ముతున్న గ్రామాల్లో దాడులు నిర్వహిస్తాం. సారా అమ్మకాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులోస్తే వెంటనే చర్యలు చేపడతాం. – పి.నాని, ఎస్ఐ, ముంచంగిపుట్టు నాటుసారా అమ్మకాలుఅరికట్టాలి రాత్రీపగలు తేడా లేకుండా సారాను తాగుతూ గొడవలకు దిగుతున్నారు. ఎవరు చెప్పిన పట్టించుకోవడం లేదు. మత్తులో రోడ్లపై తూలుతూ ఎక్కడ పడితే అక్కడ పడి పోతున్నారు. అధికారులు స్పందించి సారా తయారీ, విక్రయాలను కట్టడి చేయాలి. కె.త్రినాఽథ్, సీపీఎం మండల కార్యదర్శి, ముంచంగిపుట్టు -
చేతిలో అర్జీ నెత్తిపై ఎండ
తుమ్మపాల: తమ సమస్యలు పరిష్కారమవుతాయని గంపెడాశతో వస్తున్న అర్జీదారులు కలెక్టరేట్లో తీవ్ర అసౌకర్యానికి గురై అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. దీనికితోడు మండుటెండలో గంటల తరబడి క్యూలో నిలబడి, నీడ లేక చెట్ల కిందే అర్జీలు రాసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండుటెండలో వస్తే, ఇక్కడ గుక్కెడు తాగునీరు లేక విలవిల్లాడుతున్నారు. ప్రజల కష్టాలను తీర్చాల్సిన పీజీఆర్ఎస్ తమ సహనాన్ని పరీక్షించే కేంద్రంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు గంటల కొద్దీ క్యూలో నిల్చున్నారు. వీరి కోసం ఏర్పాటు చేసిన తాగునీటి డబ్బాలో చుక్క నీరు లేకపోవడం గమనార్హం. దాంతో మంచినీటి కోసం వెతలు పడ్డారు. రెండు వారాల క్రితం పెట్టిన చలివేంద్రం జాడ కూడా లేకపోవడంతో తీవ్ర ఎండలో అర్జీదారులు చెమటలు కక్కుకున్నారు. 278 అర్జీల నమోదు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చే ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరిస్తామన్న భరోసా కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆమెతోపాటు డీఆర్వో సత్యనారాయణ, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించడం కారణంగానే రీఓపెన్ అవుతున్నాయన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కార మార్గాలను తెలియజేయాలన్నారు. ఈ వారం మొత్తం 278 అర్జీలు నమోదయ్యాయన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా అఽఽధికారులు పాల్గొన్నారు. -
ఏపీ లాసెట్లో 123వ ర్యాంకు
కోటవురట్ల: మట్టిలో మాణిక్యం ప్రతిభతో మెరిసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సీఈసీ విద్యార్ధిని గొట్టివాడకు చెందిన వాకాడ అంజలి ఏపీ లాసెట్లో ప్రతిభ చాటింది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో అంజలి 123వ ర్యాంకు సాధించి మిగతా విద్యార్ధుకు స్పూర్తిధాయకంగా నిలిచింది. ఇటీవల వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో కూడా అంజలి 902 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎఆర్టి సుజాత, లెక్చరర్లు, గ్రామస్తులు అంజలికి అభినందనలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. న్యాయ రంగంలో ఉన్నతంగా ఎదిగి పేదలకు అండగా ఉంటూ సమాజాభివృద్ధికి పాటుపడతానని అంజలి తెలిపింది. -
టీడీపీ మండలాధ్యక్షుడి ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
అధికారులతో సభలు, సమావేశాల నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు చేస్తూ రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను కాలరాస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్దం, అతనికి సహకరిస్తున్న అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ ఎస్.రాయవరం జెడ్పీటీసీ కాకర దేవి, ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి పీజీఆర్ఎస్లో జెడ్పీ సీఈవో నారాయణమూర్తికి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడి, గౌరవ పదవుల్లో ఉన్న తమను కాదని, మండల పరిషత్ కార్యాలయంలోనే ప్రభుత్వ పథకాలు, అధికార కార్యక్రమాలను చేపడుతున్నారని, ఎస్సీ, బీసీ మహిళలుగా ఉన్న తమపై చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. అతని ఆగడాలపై విచారించి తమ నిర్ణయాలు అమలు చేసే విధంగా అధికారులు సహకరించాలని కోరారు. -
ఉపాధి కూలీకి అస్వస్థత
రావికమతం: మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఎండ దెబ్బకు తాళలేక అస్వస్థతకు గురవుతున్నారు. ఉపాధి పనులు ప్రదేశంలో మెడికల్ కిట్లు, టెంట్లు, తాగునీరు ఉండటం లేదు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఉపాధి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 9 గంటల నుంచి ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. వడగాల్పులకు ఇంటిలోంచి బయటికి రావడానికి జనం భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీస వసతులు లేక ఉపాధి కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా మండలంలోని వమ్మవరం పంచాయతీలో అడవిరాజుల బాబు కొండపై నీటి నిల్వ కోసం కందకాల పనులు చేస్తున్నారు. ఇక్కడ గ్రామానికి చెఽందిన చేబులు గంగునాయుడు (50) సోమవారం ఉపాధి పనులు చేస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని తక్షణమే ఫీల్డ్ అస్టిసెంట్ నీటిపల్లి రామకృష్ణ, తోటి కూలీలు కొత్తకోట పీహెచ్సీకి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి పనుల ప్రదేశంలో ప్రభుత్వం తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. -
పేకాట స్థావరాలపై దాడి
కోటవురట్ల: పేకాట, కోడి పందాల స్ధావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను ఆరెస్టు చేశారు. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలివి..ముందస్తు సమాచారంతో బోడపాలెం శివార్లలో ఆదివారం రాత్రి దాడి జరిపి పేకాడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.25,200, కోడి పందాలు ఆడుతున్న ఇద్దరిని ఆరెస్టు చేసి వారి నుంచి రూ.2,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, పేకాట, కోడి పందాలు, డైస్, కాయిన్ గేమ్ వంటి జూదం నిర్వహించిన ఏపీ గేమింగ్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విజయ్కుమార్ హెచ్చరించారు. -
ఆ సాగు భూమిని ఆదివాసీలకు పంచాలి
సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్రకార్యదర్శి బుగతా బంగార్రాజు డిమాండ్ రోలుగుంట: కె.అడ్డసరంలో వారసులు లేని భూమిని దీర్ఘకాలంగా సాగుచేసుకుంటున్న ఆదివాసీలకు పంచి, ఫోర్జరీ సంతకాలతో ధ్రువపత్రాలు పొంది వారసుడిగా చెప్పుకుంటున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శిఽ బుగతా బంగర్రాజులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కె.అడ్డసరం రెవెన్యూలో భూమి పంతులమ్మదని, ఈమెకు వారసులు లేరన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువపత్రాలు పొంది తానే వారసుడిగా చెప్పుకుంటున్న చంద్రశేఖర్పై నర్సీపట్నం, యలమంచిలిలో కేసులు కూడా ఉన్నాయన్నారు. ఈ భూమికి చంద్రశేఖర్కి సంబంధం లేదని ఆర్డీవో చెప్పడంతో జేసీ కోర్టులో కేసు పెండింగు ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని సమగ్ర విచారణ చేసి సాగులో ఉన్న ఆదివాసీల పేర్లు నంబర్ –3 అడంగల్లో నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ డిజిటల్ సైన్ తొలగిస్తేనే దీక్షలు విరమిస్తామని 48 మంది ఆదివాసీలు తెలిపారు. లేకుంటే జిల్లాలో అన్ని మండలాల్లో విస్తరింపజేస్తామని ఆదివాసీ సంఘ నాయకులు కోసూరు రాజు, రావి నూకరాజు హెచ్చరించారు. -
సోలార్ ప్లాంట్కు భూములివ్వబోమని ధర్నా
చీడికాడ: సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో నాలుగు గ్రామాల రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, జీఎంపీఎస్ జిల్లా చైర్మన్ గంటా శ్రీరాం, సీఐటీయూ మండల కార్యదర్శి ఆర్.దేముడునాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత గ్రామాలైన బైలపూడి, చినగోగాడ, జి.కొత్తపల్లి, అడవి అగ్రహారం గ్రామాల రైతులతో బైలపూడిలో మహాధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ నాలుగు గ్రామాల్లో భూ సేకరణను వ్యతిరేకిస్తూ అధికారులు జారీ చేసిన నోటీసులకు సమాధానం చెప్పినా సరే తహసీల్దార్ బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. అవి ప్రభుత్వ భూములని పోలీసుల సహకారంతో సేకరిస్తామని బెదిరించడం తగదన్నారు. నాలుగు గ్రామాల్లో 262 ఎకరాలకు 40 ఏళ్ల క్రితమే సాగు హక్కు పత్రాలు మంజూరు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్ ద్వారా 57.97 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మంచనున్నట్లు ప్రకటించిందన్నారు. ఈ భూముల్లో వందలాది మంది రైతులు పామాయిల్, నువ్వులు, వేరుశనగ, తదితర పంటలతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ పేరిట ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. గ్రామసభల్లోనే భూములు ఇవ్వబోమని చెప్పినా పట్టించుకోకుండా సేకరణ పేరిట ముందుకు వెళ్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ఎ.అగ్రహారం మాజీ సర్పంచ్ సలాది గంగశేషు, మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, గంటా మత్స్యరాజు, జాజిమొగ్గల రమేష్, సిహెచ్ శ్రీను, సన్యాసిరావు, సిరికి రాము, అప్పలనాయుడు, మహాలక్ష్మి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. -
చలివేంద్రాలకు ‘నీరు’సం
నర్సీపట్నం: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు పట్టణ ప్రధాన కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మండుతున్న వేసవి తాపానికి దాహార్తిని తీర్చుకునేందుకు పాదచారులు, వాహనదారులు చలివేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. సిబ్బంది పర్యవేక్షణ కొరవడటంతో చలివేంద్రాల్లో నీళ్లు మధ్యాహ్నానికే నిండుకుంటున్నాయి. సోమవారం ఎల్ఐసీ భవనానికి ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రంలో నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. చలివేంద్రంలో మూడు వాటర్ క్యాన్లు ఉన్నప్పటికీ చుక్కనీరు లేదు. దీంతో పాదచారులు వెనుతిరిగారు. కొంత మంది విద్యార్థుల షాన్షాపులో నిమ్మ సోడాలు కొనుకోని దాహార్తిని తీర్చుకున్నారు. చలివేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వారం రోజుల్లో అర్జీలకు పరిష్కారం : ఎస్పీ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 65 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య వేధింపులు, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సీఐ సేనం రమేష్ పాల్గొన్నారు. -
అనుకోని ప్రమాదం.. మంచానికే పరిమితం!
మాకవరపాలెం: అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆ ఆటో డ్రైవర్ను మంచానికే పరిమితం చేసింది. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో కుటుంబ పోషణ కష్టమై ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన పట్నాల శ్రీను(33) ఆటో నడుపుకొంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే 2024 మార్చి 3వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుకొని ఇంటికి వస్తుండగా రాచపల్లి గ్రామం దగ్గరలో మలుపు వద్ద కారును తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో సుమారు 5 గంటలపాటు మెడపైన ఉండిపోయింది. దీంతో మెడ భాగం దెబ్బతినగా ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఒక వైపు భాగం మొత్తం చేయి, కాలు, శరీరంలో చలనం లేకపోవడంతో శ్రీను రెండేళ్లుగా మంచానికే పరిమితం అయ్యాడు. శ్రీనుకు భార్య జయ, కుమార్తెలు నవ్యశ్రీ(8), రోహిత(7), కుమారుడు పార్థు(5) ఉన్నారు. మంచంపైనే ఉండడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని వాపోతున్నాడు. కనీసం పెన్షన్ అయినా ఇప్పించాలని వేడుకుంటున్నాడు. చాపలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులే తమకు ఆధారంగా ఉన్నారని శ్రీను తెలిపాడు. ఆపరేషన్కు రూ.24 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారని, అంత నగదు లేక మంచానికే పరిమితం అయ్యాయని వాపోయాడు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నాడు. తల్లిదండ్రులపైనే ఆధారం -
ఇంధన కొరత లేకుండా చూడాలి
తుమ్మపాల: జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం జరిగిన దిశా (జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మానటరింగ్ కమిటీ) సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్బాబు, బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ, కె.ఎస్.ఎన్.ఎస్. రాజులతో కలిసి వారు వివిధ అంశాలపై సమీక్షించారు. జలజీవన్ మిషన్ ద్వారా జిల్లాల చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 68 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రహదారికి ఇరువైపులా సోలార్ లైటింగ్ ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు. నాలుగైదు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలను రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలతో పూర్తయ్యే వాటికి నిధులు మంజూరు చేయాలని జెడ్పీ సీఈవో సత్యనారాయణమూర్తిని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మళ్ల సురేంద్ర, బత్తుల తాతయ్యబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
సత్యసాయి సేవా మార్గం అనుసరణీయం
దేవరాపల్లి: భగవాన్ సత్యసాయి బాబా చూపిన ఆధ్యాత్మిక, ప్రేమ, సేవా మార్గం అనుసరణీయమని సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త తోట అరుణ తెలిపారు. మండలంలోని చిననందిపల్లిలో భగవాన్ సత్యసాయి నామస్మరణం మారుమోగింది. సోమవారం ఇక్కడ నిర్వహించిన 101 పాటల భజన కార్యక్రమంతో ఆధ్యాత్మిక శోభ సంతరించరించుకుంది. సత్యసాయి భజన మండలి జోన్–6 ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త తోట అరుణ చేసిన ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులను పులకరింపజేసింది. ఈ కార్యక్రమంలో జోన్ ఇంచార్జ్ సిహెచ్వి. రవిశంకర్, నౌడు అప్పారావు మాష్టారు, కొటాన శ్రీను, పద్మ దంపతులు, భవాని, సూర్య, భాస్కరరావు, కృష్ణ, అప్పారావు, కొరుకొండ పెంటారావు, స్వామినాయుడు, రామకృష్ణ, రమణమూర్తి, రమామణి తదితర మహిళా సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త తోట అరుణ -
గడ్డిమందు తాగిన మహిళ మృతి
మునగపాక: అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగిన మహిళ సోమవారం మృతి చెందినట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మరాజుపేటకు చెందిన దొడ్డి వనజ (47) కొంత కాలంగా అనారోగ్య సమస్యతో మానసిక ఆవేదనకు గురై ఈ నెల 17న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి చెల్లెలు బొడ్డేడ విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. -
ఎక్కువ మంది పిల్లలనుకనమనడం తగదు
డుంబ్రిగుడ: మహిళలు ఎ క్కువ మంది పిల్లల్ని కనాల ని ముఖ్యమంత్రి చంద్రబా బు చెప్పడం తగదని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ఎంపీపీ శెట్టి ఆనంద్రావు మండిపడ్డారు. సోమవారం వారు మాట్లాడుతూ మీరు మాత్రం ఒక్క లోకేష్, మీ కుమారుడు ఒక్క దేవాన్ష్నే కంటారు, ప్రజలకు మాత్రం ఉపన్యాసాలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్య, కుటుంబ పోషణ భారం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాజీ ఎంపీటీసీ తాంగుల రాందాసు, తుమ్నాథ్ పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో నూతన భవనాలు ప్రారంభం
అనకాపల్లి: ఎన్టీఆర్ ఆస్పత్రిలో జిల్లా ఆర్హెచ్ఐ మ్యాగ్నిటిక్ సంస్థకు చెందిన సీఎస్ఆర్ రూ.1.50కోట్ల నిధులతో నిర్మించిన నూతన భవనాలను ఎంపీ సీఎం.రమేష్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ , ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్హెచ్ఐ సీఎస్ఆర్ నిధులతో ఆస్పత్రి ఆవరణలో రోగులకు కావలసిన మౌలిక సదుపాయలు నిమిత్తం నూతన భవనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రూ.6లక్షల ఎంపీ నిధులతో మాత శిశువు వార్డు వద్ద పరిశుభ్రమైన ఆర్ఓ ప్లాంట్ను నిర్మించామన్నారు. ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సుమారుగా రూ.5 నుంచి 6 కోట్ల నిధులతో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్హెచ్ఐ సంస్థ సీఈవో అభిషేక్ శర్మ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, డీఎంహెచ్వో శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ పాల్గొన్నారు. -
ఆర్టీసీలో విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణ ఆపాలి
విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలని, ప్రైవేటీకరణ అంశాన్ని ఆపాలని, సీ్త్ర శక్తి పథకం ద్వారా పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచాలని, నూతన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగులను భర్తీ చేయాలంటూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ డీఎన్ మూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలన్నారు. పదవీ విరమణ, మరణించిన ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ వాసు, జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వై.వి.ఎస్. కుమార్, డిపో కమిటీ ట్రెజరర్ పి.సతీష్ పాల్గొన్నారు. -
భక్తులకు మజ్జిగ,మంచినీరు పంపిణీ
పాడేరు రూరల్: మోదకొండమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా గిరి కై లాస క్షేత్రం శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ రాజేశ్వరి అమ్మవారి దేవాలయ ఆధ్యాత్మిక సేవా బృందం ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తాగునీరు, మజ్జిగ, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరి కై లాస క్షేత్రం ఆలయ చైర్మన్, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ నర్సింగరావు దంపతులు హాజరై పంపిణీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... దైవ మార్గంతోనే మానసిక ప్రశాంతత, ముక్తి కలుగుతాయని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గిరి కై లాస క్షేత్ర ధర్మకర్తల మండలి సభ్యురాలు రమాదేవి, ప్రధాన అర్చకులు ఉప్పల సీతారామశాస్త్రి, నిర్వాహకులు రామారావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెదబయలులో 24 నుంచి మోదమ్మ ఉత్సవాలు
పెదబయలు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర ఉత్సవాల గోడపత్రికలను ఆదివారం ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహం, అమ్మవారి పాదాలు, ఘటాలతో ఊరేగింపుగా వెళ్లి శతకంపట్టు వద్ద కొలువు దీరుస్తారు. అక్కడ మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఉత్సవాల చివరి రోజైన 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం నుంచి అమ్మవారి విగ్రహంతో భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, అదే రోజు భక్తులు ఆలయంలో తమ మొక్కులు తీర్చుకుంటారని కమిటీ సభ్యులు వివరించారు. పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ముగిసిన తర్వాత వారంలో పెదబయలు ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితిగా వస్తోందని వారు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు రాత్రి వేళల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు భక్తులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మండల ప్రజలు పూర్తి సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కిమంకరి బొంజుబాబు, కమిటీ గౌరవ పెద్దలు గంపరాయి సూరయ్య, దడియా రాంబాబు, పలాసి కొండబాబు, శశిధర్, చంద్రమౌళి, పలాసి తిరుపతిరావు, పాంగి పాల్గుణ, సమరెడ్డి పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పోస్టర్లు ఆవిష్కరణ -
నిండు గర్భిణికి నరకయాతన
పెదబయలు : మన్యం ప్రాంతంలో డోలీ మోతలు లేకుండా చేస్తాం.. ప్రతి గ్రామానికీ రోడ్డు సదుపాయం కల్పిస్తాం అని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పెదబయలు మండలం గోమంగి పీహెచ్సీ పరిధిలోని బొంగరం పంచాయతీ వెదురుగొయ్యి గ్రామంలో ఆదివారం ఒక గర్భిణి పడిన అవస్థలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి. ప్రసవ వేదనతో.. వెదురుగొయ్యి గ్రామానికి చెందిన చిక్కుడు సిమ్మలి అనే మహిళకు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు భర్త చిక్కుడు చిక్కన్న, ఆశా కార్యకర్త విజయకుమారి, బంధువులు ఇబ్బందులు పడ్డారు. గర్భిణిని సుమారు రెండు కిలోమీటర్ల దూరం కొండల మధ్య కాలినడకన వంచుర్భ గ్రామం రోడ్డు పాయింట్ వరకు నడిపించాల్సి వచ్చింది. అక్కడికి చేరుకున్నాక గోమంగి పీహెచ్సీ అంబులెన్స్కు సమాచారం అందించగా, వాహనం వచ్చిన తర్వాత ఆమెను పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తరలింపు.. సిమ్మలికి ఇది రెండో కాన్పు. గోమంగి పీహెచ్సీలో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ప్రసవ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడం, శరీరంలో రక్తం శాతం తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి చైతన్య తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని, తల్లికి అవసరమైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి తమ గ్రామానికి వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు మాధవరావుతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేశారు. లింగేటి పంచాయతీ లింగేరిపుట్టు నుండి వెదురుగొయ్యి గ్రామానికి, అలాగే వంచుర్భ నుండి వెదురుగొయ్యికి రోడ్లు వేయాలని కోరారు. రోడ్డు లేకపోవడం వల్ల అత్యవసర వైద్య సేవలు అందడం లేదని, చివరికి పీఎం జన్మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణ సామగ్రిని కూడా గ్రామానికి తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు కిలోమీటర్లు నడవడంతోరక్తస్రావం వంచుర్బ నుంచి గోమంగి పీహెచ్సీకి అంబులెన్స్లో తరలింపు ముంచంగిపుట్టు ఆస్పత్రిలో కాన్పు తల్లీబిడ్డ క్షేమం -
జి.మాడుగులలో భారీ వర్షం
జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదుర గాలులు, పిడుగులతో భారీ వర్సం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. జి.మాడుగుల– లంబసింగి జాతీయ రహదారి మార్గంలో మట్టిరోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించేందుక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డుంబ్రిగుడ: డుంబ్రిగుడలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కురవడంతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. వర్షం వల్ల వేరుశనగ, అల్లం పైరుకు మేలు చేకూరుతుందని రైతులు తెలిపారు. -
శివపురంలో బంగారు ఆభరణాలు చోరీ
నర్సీపట్నం: పట్టణంలోని శివపురంలో నివాసం ఉంటున్న మద్దికొండ సిరిల్పాల్ ఇంట్లో ఈ నెల 15వ తేదీ రాత్రి చోరీ జరిగినట్టు టౌన్ సీఐ ఎస్.కె.గఫూర్ తెలిపారు. సిరిల్పాల్ కుటుంబ సభ్యులతో కలిసి వేరే ఊరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఎవరైనా ఇతర ఊళ్లకు వెళ్లే సమయంలో తమ విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలని, లేదా తమ వెంట తీసుకువెళ్లాలని సీఐ సూచించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్: మునిపాలిటీ పరిధి సోమలింగపాలెం సమీపంలో గోకివాడ ఆనకట్ట వద్ద శారదానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.ఇక్కడ నదిలో తేలుతూ ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రమాదవశాత్తు నదిలో జారిపడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహం స్థితిని బట్టి ప్రమాదం జరిగి ఒకరోజు కావచ్చని ఎస్ఐ తెలిపారు.మృతదేహాన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని,మృతుని చిరునామా,ఇతర వివరాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9440796104 నంబరులో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
వేధింపుల పర్వం
ఏయూలో దళిత పరిశోధకుడిపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఈ దారుణ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ ఎస్సీ కమిషన్.. ఏడు రోజుల్లోగా పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని వీసీ రాజశేఖర్కు కస్టమ్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ వర్సిటీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. కమిషన్ తాజాగా ‘అత్యవసర’ రిమైండర్ను పంపింది. ఇంకా నిర్లక్ష్యం వహిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం కమిషన్కు ఉన్న సివిల్ కోర్టు సమానమైన అధికారాలను ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. మద్దిలపాలెం: జాతీయ స్థాయిలో ఘన చరిత కలిగిన విశ్వవిద్యాలయంగా వెలుగొందుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వర్సిటీ ఉన్నతాధికారుల అనుచిత వైఖరి, మొండితనం కారణంగా జాతీయ స్థాయిలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేడ్కర్ పేరుతో నడుస్తున్న ప్రతిష్టాత్మక పీఠం(చైర్)లోనే ఒక దళిత పరిశోధక విద్యార్థికి ఘోర అవమానం ఎదురైంది. ‘జాతీయ ఎస్సీ కమిషన్’ఆదేశాలను సైతం వర్సిటీ ఉన్నతాధికారులు బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖతో పాటు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కుతూ ఒక మేధావిని మానసికంగా కుంగదీస్తున్న వైనంపై జాతీయ కమిషన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఫెలోషిప్ నిలిపివేత.. వీసీ, డీన్లపై వేధింపుల ఆరోపణలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పీఠం కింద డాక్టరల్ ఫెలోగా అత్యున్నత పరిశోధన చేస్తున్న యాడాల ప్రవీణ్కుమార్ ఏడాది కాలంగా నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితుడు జాతీయ ఎస్సీ కమిషన్కు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ప్రకారం.. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఆర్ అండ్ డీ డీన్లు తనను పదేపదే వివక్షకు గురిచేస్తున్నారు. పరిశోధనకు సంబంధించిన ఫెలోషిప్ సొమ్మును ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తూ, ఆర్థికంగా దెబ్బతీస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. కన్నతల్లిని కోల్పోయినా కరగని మానవత్వం తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకునేందుకు వీసీ కార్యాలయానికి పదేపదే తిరిగినా ప్రవీణ్ను కనీసం గదిలోకి కూడా రానివ్వలేదు. చివరకు వీసీ కారు ఎక్కి వెళ్తుండగా.. పరుగున వెళ్లి వేడుకున్నా కనీస మానవతా దృక్పథం చూపకపోగా, ‘అంబేడ్కర్ చైర్ను మూసేస్తాం, నిన్ను యూనివర్సిటీలో లేకుండా చేస్తాం’అంటూ చిన్నచూపు చూస్తూ మాట్లాడారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారుల మనసు కరగలేదు. చివరకు వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేదనను భరిస్తూనే, తల్లికి సరైన వైద్యం అందించలేక ప్రవీణ్కుమార్ తన తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. సీపీకి ఎస్సీ కమిషన్ లేఖ మరోవైపు ఈ ఘటనపై అట్రాసిటీల నిరోధక చట్టం కింద తక్షణమే కేసు నమోదు చేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్కు జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో నగర పోలీసులు రంగంలోకి దిగి, ఈ వేధింపుల ఆరోపణలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించడంతో ఏయూ వర్గాల్లో వణుకు మొదలైంది. బాబాసాహెబ్ సందేశమే నన్ను బతికించింది: ప్రవీణ్ కుమార్ ‘వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేధింపులను తట్టుకోలేక, ఒక దశలో ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ హక్కుల కోసం పోరాడాలి, ఉద్యమించాలి అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ సందేశం నన్ను బతికించింది. ధైర్యాన్ని కూడగట్టుకుని, అన్ని ఆధారాలతో జాతీయ కమిషన్ను ఆశ్రయించాను’అని ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. -
కేంద్ర గిరిజన మంత్రి దృష్టికి ఆదివాసీల సమస్యలు
పాడేరు రూరల్: ఆదివాసీ ప్రాంతాల్లో నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, ఆదివాసీ హక్కుల చట్టాల పరిరక్షణపై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలోని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఒరామ్ను ఆయన అధికార నివాసంలో ఏఏఆర్ఎం నేషనల్ చైర్మన్ జితేంద్ర చౌదరి, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకారత్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్లతో కలిసి ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం అప్పలనర్స కేంద్ర మంత్రికి సమర్పించిన వినతిపత్రంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. ఐదో షెడ్యూల్ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో అన్ని రకాల హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నూరు శాతం అమలు చేయాలని, ప్రస్తుతం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. అలాగే పీఎం జన్మన్ బకాయి సొమ్మును వెంటనే విడుదల చేయాలన్నారు. గ్రామసభల ఆమోదం లేకుండా గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తున్న హైడ్రోపవర్ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలన్నారు. ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2026 నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరామన్నారు. గతంలో ఉన్న జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను తీసుకురావాలని విన్నవించామన్నారు. గత 50 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నాన్–షెడ్యూల్ ఆదివాసీ గ్రామాలన్నింటినీ 5వ షెడ్యూల్ ప్రాంతాలలో విలీనం చేస్తూ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పీఎం జన్మన్ పథకం కింద ఇచ్చే ఇంటి యూనిట్ విలువను ప్రస్తుతం ఉన్న రూ. 3.39 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కోరామన్నారు. ఆదివాసీ మాతృభాషా వలంటీర్లతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో సానుకూలంగా చర్చించినట్లు అప్పలనర్స తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స -
ముగిసిన రాష్ట్ర స్థాయివాలీబాల్ పోటీలు
పాడేరు రూరల్: పట్టణంలోని తలారిసింగి బాలుర పాఠశాల మైదానంలో ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈటోర్నిలో సుమారు 40 జట్లు తలపడ్డాయి. ప్రథమ స్థానం హకుంపేట. ద్వితీయస్థానం పాడేరు మండలం చీడిమెట్ట జట్లు సాధించాయి. వీటికి అమ్మవారి జాతర ముగింపు రోజు ఈనెల 19న నగదు బహుమతులు అందజేస్తామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. మహేష్, కృష్ణ, పీడీలు మహేష్బాబు, మన్మథరావు, సింహాచలం, వినోద్ పాల్గొన్నారు. -
భక్తజన ప్రమోదంగా..
పాడేరు: గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వేశ్వరరాజు, కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవంగా అమ్మవారి ఊరేగింపు ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలుత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తలపై ఎత్తుకోగా, అమ్మవారి పాదాలను, ఘటాలను కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి కొద్దిసేపు తమ తలపై మోశారు. అనంతరం అమ్మవారి ఆలయం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న సతకం పట్టు వరకు ఊరేగింపు సాగింది. వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, నేలవేషాలు, వివిధ రకాల సంప్రదాయ నృత్యాల నడుమ ఈ ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. ● అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను తాకి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పోటీ పడ్డారు. ఊరేగింపు అనంతరం సతకం పట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఉత్సవ విగ్రహం, ఘటాలు, పాదాలను అక్కడ ప్రతిష్టించారు. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పాడేరు నుంచి అన్ని ప్రధాన మార్గాల్లో 100 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా పట్టణంలో ట్రాఫిక్ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు జాతర తొలిరోజు సందర్భంగా పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లతో పాటు, ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అధికారులు భారీ ఎత్తున ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జాతర తొలిరోజు వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టాళ్లు ప్రారంభించిన కలెక్టర్ నిశాంతి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ప్రారంభించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో కాఫీ ప్రాజెక్టు, సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ఐసీడీఎస్, గ్రామీణాభివృద్ధిపై డీఆర్డీఏ, జీసీసీ, బాల్యవివాహాల నిర్మూలనపై సీడ్ ఆర్గనైజేషన్, ఉద్యానవన శాఖ, సుగంధ ద్రవ్యాల బోర్డు తదితర ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన వైద్యారోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అధికారికంగా ఏర్పాటు చేసిన స్టేజీపై సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి అభిషేక్, రాష్ట్ర సృజనాత్మక, జానపద కళాల అకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లలో ‘కూటమి’ వైఫల్యం ఘనంగా పాడేరు మోదకొండమ్మ జాతర ప్రారంభం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయకమిటీ చైర్మన్ విశ్వేశ్వరరాజు దర్శించుకున్న కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ ఆలయం నుంచి సతకంపట్టు వరకు భారీగా ఊరేగింపు ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ కట్టుదిట్టమైన పోలీసు భద్రత పాడేరు: రాష్ట్ర గిరిజన జాతరగా వైభవంగా సాగాల్సిన పాడేరు శ్రీ మోదకొండమ్మ ఉత్సవాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అట్టహాసంగా ప్రచారం చేసుకున్న అధికార యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో భక్తులు, ప్రభుత్వ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. జాతర తొలి రోజైన ఆదివారం అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాల ఊరేగింపును తిలకించేందుకు ఆలయం నుంచి సతకం పట్టు వరకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. అయితే, ఎండ తీవ్రతకు అల్లాడిపోయిన భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అధికారులు కల్పించలేకపోయారు. ఆహార పొట్లాలు ఐటీడీఏకే పరిమితం.. సాయంత్రం జాతరకు వచ్చే భక్తులకు ఉచితంగా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకున్న నిర్వాహకులు.. తీరా చూస్తే కేవలం ఒక్క ఐటీడీఏ ఆవరణ రహదారి వద్ద మాత్రమే ఆ ప్రక్రియను ముగించారు. దీంతో కొద్దిమందికి తప్ప మెజార్టీ భక్తులకు ఆహార పొట్లాలు అందలేదు. ఇక జాతరకు పోటెత్తిన మహిళా భక్తులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో వారు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. విధుల్లో ఉన్న సిబ్బందికి ‘సొంత’ ఖర్చులు! మరోవైపు, జాతర పర్యవేక్షణ కోసం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి 24 గంటల పాటు విధుల్లో ఉండాలని 17 మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. వీరికి ఆహారం సంగతి దేవుడెరుగు.. కనీసం గుక్కెడు మంచినీరు కూడా అందించే నాథుడు కరువయ్యాడు. రాత్రింబవళ్లు విధుల్లో ఉండే తమను కనీసం పట్టించుకోకపోగా.. మీ సొంత డబ్బులతోనే ఆహారం ఏర్పాటు చేసుకోండి అని నిర్వాహకులు ఉచిత సలహా ఇవ్వడంపై సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై భక్తులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా మిగిలిన రెండు రోజులైనా అన్ని సౌకర్యాలు సక్రమంగా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తులకు కరువైన తాగునీరు మహిళలకు తప్పని మరుగుదొడ్ల తిప్పలు కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి గుక్కెడు నీరివ్వని నిర్వాహకులు -
రెండు లారీలు ఢీ
మాకవరపాలెం: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మండలంలోని శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున తాళ్లపాలెంవైపు నుంచి రాచపల్లి వద్దగల పయినీర్ కంపెనీకి బొగ్గులోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ప్రమదంలో బొగ్గులారీ డ్రైవర్ గాయపడడంతో వెంటనే విశాఖ తరలించినట్టు స్థానికులు తెలిపారు. బొగ్గు లారీ ముందు భాగం బాగా దెబ్బతినడంతో సాయంత్రం వరకు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం స్థానిక పోలీసులు దగ్గరుండి లారీని పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.డ్రైవర్కు గాయాలు -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు పెదకోరాడలో ఉరి వేసుకుని ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా నారిపల్లి మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల హనుమంతురెడ్డి పెదకోరాడ గ్రామానికి చెందిన చీపిరి కృష్ణవేణిని సుమారు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. పెదకోరాడలో ఈ నెల 12న జరిగిన పండగకు భార్య, తల్లితో కలిసి హనుమంతురెడ్డి వచ్చాడు. భార్యాభర్తల మధ్య శనివారం చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తాను ఇంటికి వెళ్తానని చెప్పి హనుమంతురెడ్డి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు. సాయంత్రం పశువుల పాకలో ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.మృతుడు అనంతపురం జిల్లా వాసి -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ఆలయ ఏఈవో పిల్లా శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. -
చెరువులో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు
యలమంచిలి రూరల్: మండలంలోని జంపపాలెం సమీపంలో మొండి గెడ్డ చెరువులో ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పొక్లెయిన్తో మట్టి తవ్వకాలు చేపట్టడంపై ఆ గ్రామానికి చెంది దాడి జగ్గ అప్పలనాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు.కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారని ఫిర్యాదుచేయడంతో పాటు అందుకు సంబంధించిన వీడియోలు,ఫొటోలను రెవెన్యూ అధికారులకు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టు చేశారు. తహసీల్దార్ వరహాలు స్పందించి అక్కడకు వెళ్లాల్సిందిగా వీఆర్వో నూకరాజు,వీఆర్ఏలు రమాదేవి,అప్పారావులను ఆదేశించారు.వాళ్లు అక్కడకు వెళ్లేసరికే అక్రమ తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులు వాహనాలతో పరారయ్యారు.అయితే అప్పటికే కొంత మట్టిని తరలించుకుపోయారు.తాను ఆరు నెలల క్రితమే మొండి గెడ్డలో పూడిక తీయిస్తానని జలవనరుల శాఖ అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చానని,కానీ తనకు అనుమతి ఇవ్వకపోగా ఇప్పుడు అక్రమార్కులు దర్జాగా మట్టి తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని అప్పలనాయుడు ప్రశ్నించారు.అదేవిధంగా చెరువు గట్టుపై యూకలిప్టస్ చెట్లను కొందరు నరికి పట్టుకుపోయారన్నారు.అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
‘రాపెప్’ శిక్షణలో రాటు దేలుతున్న అగ్రి విద్యార్థులు
● ఉపయుక్తంగా గ్రామీణ వ్యవసాయ పని అనుభవ (రాపెప్) కార్యక్రమం ● వ్యవసాయ విద్యార్థులకు గ్రామాల్లో ప్రత్యేక శిక్షణఅనకాపల్లి: అధునిక యుగంలో అగ్రికల్చర్ డిగ్రీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. శ్రీకాకుళం జిల్లా నైరా అగ్రికల్చర్ నాలుగో ఏడాదికి కళాశాల 38 మంది విద్యార్థులు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిధిలో ఫిల్డ్ విజిట్లో భాగంగా శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో 38 మంది విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి ఒక విభాగంలో 18 మంది, మరో విభాగంలో 20 విద్యార్థులుగా ఒక్కో బృందానికి రైతులను అప్పగించి, గ్రామాల్లో రైతులు పండిస్తున్న పంటలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అధికారిగా ఆర్ఏఆర్ఎస్లో వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త దాడి ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఒక హోస్ట్ రైతును కేటాయించి, ఆయా రైతుల కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ భూముల వివరాలు, పంటల సాగు విధానాలు తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు గ్రామాల్లో రైతులతో ప్రత్యక్షంగా మమేకమై, గ్రామ సచివాలయం ద్వారా గ్రామానికి సంబంధించిన వివిధ వివరాలను సేకరిస్తున్నారు. రైతుల పొలాలను సందర్శించి పంటలలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి తగిన శాసీ్త్రయ సూచనలు అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ సమాచార కేంద్రం ఏర్పాటు చేసి, పంటలలో వచ్చే చీడపీడలు, వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ, సాంకేతికతలు, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రామ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారాన్ని నిరంతరం చేరవేసే పనిలో అగ్రికల్చర్ విద్యార్థులు చేస్తున్నారు. రాపెప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మట్టి నమూనాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించి, మట్టి పరీక్షల ప్రాముఖ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులతో సమూహ చర్చలు నిర్వహించి, పొలాల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. రైతులను నూతన సాంకేతికతలు, ఆధునిక వ్యవసాయ ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నారు. గ్రామ ప్రజల అభిప్రాయాలు, అవసరాలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పరిస్థితులపై సమగ్ర అవగాహన విద్యార్థులతో పాటు రైతులు పొందుతున్నారు. నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కొత్త వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు పొలాల్లో మెథడ్ డిమానిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను ప్రదర్శిస్తూ మెరుగైన దిగుబడులు సాధించే మార్గాలను తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రైతులు అనుసరిస్తున్న పద్ధతులు, శాసీ్త్రయ సిఫార్సుల మధ్య ఉన్న తేడాలను గుర్తిస్తూ ‘గ్యాప్ అనాలిసిస్’నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి, పంటలలో మెరుగైన దిగుబడుల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించి అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయంపై ప్రత్యక్ష అనుభవం లభించడంతో పాటు రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెరుగుతోంది. -
మట్టి వ్యాపారం ‘పచ్చ’గా...
● చెరువులు గుల్ల చేస్తున్న టీడీపీ నేతలు ● ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు ● పట్టించుకోని అధికారులు కోటవురట్ల : అడ్డదారులు తొక్కేందుకు పచ్చనేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అక్రమాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. మనల్ని ఆపేదెవడు అంటూ పేట్రేగిపోతున్నారు. వరాహనది నుంచి ఇసుక, కొండలను తవ్వేసి గ్రావెల్ తరలించుకుపోతుండగా ప్రస్తుతం పలువురి టీడీపీ నేతల దృష్టి మట్టిపై పడింది. చెరువులను జంకూ గొంకూ లేకుండా తవ్వేసి మట్టిని తరలించుకుపోతున్నారు. పెట్టుబడి లేకుండా మట్టి వ్యాపారం రూ.లక్షలు తెచ్చిపెడుతుండడంతో మండలంలోని పలువురి టీడీపీ నేతల కన్ను చెరువులపై పడింది. దీనికి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు తమకేమీ తెలియనట్టు మిన్నకుండిపోవడంతో మట్టిని ఇష్టానుసారం తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు మట్టి రూ.2500లకు విక్రయించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. బి.కె.పల్లి, రామచంద్రపాలెం రెవెన్యూ పరిధిలోని చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చీకటి పడితే చాలు పచ్చనేతలు పొక్లెయిన్, ట్రాక్టర్లతో చెరువులో వాలిపోతున్నారు. అడ్డేవారు లేకపోవడంతో తెల్లవార్లూ మట్టిని తవ్వేసి తరలించుకుపోతున్నారు. ఆదివారం రాత్రి రామచంద్రపాలెంలోని ఎర్ర చెరువులో గ్రామానికి చెందిన టీడీపీ నేత నేరుగా పొక్లెయిన్తో మటి తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండడంతో తాజా మాజీ సర్పంచ్ పరదేశమ్మ భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు తమరాన కన్నంనాయుడు అడ్డగించారు. చెరువులో నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డుగా ద్విచక్ర వాహనాన్ని నిలిపి అడ్డగించారు. దాంతో టీడీపీ నాయకుడు వాగ్వాదానికి దిగినట్టు కన్నబాబు తెలిపారు. కన్నబాబు మాట్లాడుతూ చెరువులో పొక్లెయిన్తో మట్టిని తవ్వి 5 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం తవ్వగా అడ్డుకున్నామని, తిరిగి ఆదివారం కూడా తవ్వకాలు జరపడంతో అడ్డుకుని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫోన్ చేసినట్టు తెలిపారు. అయితే అధికారులు స్పందించలేదని ఆరోపించారు. -
మోదమ్మ జాతరలో కూటమి రాజకీయం
● పండగ తేదీల మార్పు.. గిరిజన సంప్రదాయాలపై దాడే! ● వైఎస్సార్సీపీ నేతల మండిపాటు డుంబ్రిగుడ: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ తల్లి రాష్ట్ర గిరిజన జాతరను సైతం కూటమి ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు వేదికగా మార్చుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్రావు మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం క్యాంపు కార్యాలయంలో డుంబ్రిగుడ మండల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు, గిరిజన సంఘాలతో పాటు అన్ని పక్షాలు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన మోదకొండమ్మ జాతర తేదీలను.. కూటమి నేతలు తమ వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం మార్చడం గిరిజన సంప్రదాయాలపై దాడి చేయడమేనని విమర్శించారు. టీడీపీ నేత వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో.. ఆయన పర్యటనకు వీలుగా ఇన్చార్జ్ మంత్రి సంధ్యారాణి, టీడీపీ పాడేరు ఇన్చారిర్జ గిడ్డి ఈశ్వరి కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడి తెచ్చి, జాతర తేదీలను ఏకపక్షంగా మార్పించారని ఆరోపించారు. పోస్టర్లలో ప్రొటోకాల్ ఎక్కడ? ఇంతటితో ఆగకుండా జాతరకు సంబంధించిన అధికారిక, సాంస్కృతిక పోస్టర్లలో కూడా కూటమి నాయకులు రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగారని నాయకులు ధ్వజమెత్తారు. పాడేరులో స్థానిక ఎమ్మెల్యేనే ఆలయ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారని, ఆ హోదాలో ఉన్న ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఫొటోతో పాటు జిల్లాలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పొటోలను ప్రొటోకాల్ ప్రకారం పోస్టర్లలో ముద్రించడం ఆనవాయితీ అని గుర్తుచేశారు. కానీ, గిడ్డి ఈశ్వరి రాజకీయ ద్వేషంతో ప్రస్తుత ఎమ్మెల్యే, జిల్లా ప్రజాప్రతినిధుల ఫొటోలు ఎక్కడా లేకుండా చేసి.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, సంధ్యారాణి ఫొటోలతో పాటు తన పొటోను పెద్దదిగా ముద్రించుకున్నారని విమర్శించారు. ఇది రాష్ట్ర గిరిజన జాతరలా ఉందా? లేక టీడీపీ కూటమి జాతరలా ఉందా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు చేస్తున్న కుట్రలను మన్యం ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో గుంటసీమ, లైగండ ఎంపీటీసీలు గోపాల్ రావు, బి. రామరావు, తుమ్నాథ్, అర్జున్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముత్యాలమ్మతల్లి హుండీ ఆదాయం లెక్కింపు
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న కమిటీ సభ్యులు చింతపల్లి: స్థానిక శ్రీ ముత్యాలమ్మ తల్లి మూలవిరాట్ హుండీ ఆదాయం రూ. 68,600 వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవాలు గత నెల 14వ నుంచి 17 వరకు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ జాతర సందర్భంగా భక్తులు హుండీలో వేసిన విరాళాలను శనివారం కమిటీ పెద్దల సమక్షంలో ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సుర్ల అప్పారావు, సుర్ల వీరేంద్ర, కమిటీ సభ్యులు మాదల తిరుపతి, పెదిరెడ్ల బేతాళుడు, మాజీ వైస్ సర్పంచ్లు గంజారి రమణ, బండారు అప్పలనాయుడు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. -
700 మందితో భారీ బందోబస్తు: ఎస్పీ అమిత్బర్దర్
జాతర సందర్భంగా మూడు రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాడేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర రద్దీ దృష్ట్యా ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి పట్టణంలోకి భారీ వాహనాల అనుమతిని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 700 మంది సిబ్బందితో పాటు రెండు శక్తి బృందాలు, మూడు డ్రోన్ కెమెరాలు, క్రైమ్ పార్టీ సిబ్బందిని రంగంలోకి దించామన్నారు. విశాఖపట్నం వైపు నుంచి పాడేరు వచ్చి పోయే వాహనాలు వంతాడపల్లి చెక్పోస్టు నుంచి తుంపాడ, సన్యాసమ్మపాలెం మీదుగా చింతలవీధి మార్గం మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. అరకు, ముంచంగిపుట్టు మార్గాల నుంచి వచ్చే వాహనాలు కూడా చింతలవీధి వరకే అనుమతి ఉందన్నారు. జి. మాడుగుల ప్రాంతం నుంచి విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వచ్చేపోయే వాహనాలు గొందూరు సెయింటాన్స్ పాఠశాల జంక్షన్ నుంచి లగిసిపల్లి, నక్కలపుట్టు మీదుగా వెళ్లాలని ఎస్పీ సూచించారు. -
ఆర్గానిక్ జిల్లాగా తీర్చిదిద్దుతాం
పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణే ధ్యేయంగా ‘గ్రీన్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఆంధ్ర’ విభాగాలను మరింత బలోపేతం చేయనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. పాడేరు మండలంలోని కిండంగి పంచాయతీ కేంద్రంలో ఉన్న తడి, పొడి చెత్త ద్వారా సంపద సృష్టి కేంద్రాన్ని శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన పరిశ్రమలకు ప్రాధాన్యం ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ.. పరిశుభ్రమైన, హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో జిల్లాలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాను వంద శాతం ఆర్గానిక్ (సేంద్రియ) జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని పునరుత్పాదక ఇంధన వనరుల వాడకానికి, అలాగే వ్యర్థాలను పునర్వినియోగం చేసే గ్రీన్ ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలకు జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. స్వచ్ఛతపై నిరంతర నిఘా ఉంచుతూ.. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన, వ్యర్థాల నిర్మూలనకు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లాలో సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులకు, క్లాప్ మిత్రలకు వారి రక్షణ కొరకు చేతి తొడుగులు, గం బూట్లు, యూనిఫాం, శానిటేషన్ పరికరాలు, టోపీలు, మాస్క్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, సీపీఆర్ కమిషన్ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో చంద్రశేఖర్, స్థానిక అధికారులు, గ్రామసచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
చెత్తమయం
జిల్లా కేంద్రం..పాడేరు రూరల్: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో పంచాయతీ పాలన పూర్తిగా పడకేసింది. పురవీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోవడమే కాకుండా, కల్వర్టులు, డ్రైనేజీలు పూడికతీతకు నోచుకోక అస్తవ్యస్తంగా మారాయి. ● ముఖ్యంగా ప్రభుత్వ పాత ఆసుపత్రి, కోర్టు భవనాల సమీపంలో, ఐటీడీఏ కార్యాలయం వెనుక వైపు, జీసీసీ చైర్మన్ క్యాంపు కార్యాలయం ఎదురుగా, అలాగే కింద బజార్లోని మాంసం దుకాణాల సెంటర్ వద్ద పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి, ఈగలు, దోమల బెడద తీవ్రమైంది. ● పలు వీధుల్లో మురుగు కాలువలు మురిగిపోయి విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో వీధుల్లో పిల్లలను ఆటలాడించాలన్నా ఎక్కడ వ్యాధులు ప్రబలుతాయోనని తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రతకు కేరాఫ్.. పాడేరు పట్టణం పేరుకే జిల్లా కేంద్రంగా చలామణి అవుతోంది కానీ, క్షేత్రస్థాయిలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు పలు వీధుల్లో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పురవీధుల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ● గత కొన్నాళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండటంతో పారిశుధ్య నిర్వహణ మరింత అధ్వాన్నంగా తయారైందని, ఈ సమస్యపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నామని స్థానికులు వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పండగ వేళల్లోనూ పట్టించుకోరా? ఈ నెలలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మోదకొండమ్మ తల్లి రాష్ట్ర జాతర వేడుకలు జరగనున్నాయి. ఇంతటి పెద్ద పండగ వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాపాలనను గాడికి వదిలేసి, కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. మంచినీటికీ ఇబ్బందే! గత కొద్దిరోజులుగా కురుస్తున్న వరుస వర్షాలకు డ్రైనేజీలు వ్యర్థాలతో పూర్తిగా పూడుకుపోయాయి. పట్టణంలో ఇప్పటికే డెంగ్యూ, మలేరియా వంటి కేసులు నమోదవుతున్నాయని, ఇప్పటికై నా అధికారులు తేరుకుంటారా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు వీధుల్లో వచ్చే రక్షిత మంచినీటి పైప్లైన్ సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంటోందని, పర్యవేక్షణ లోపంతో ప్రజా సేవలు పూర్తిగా కుంటుపడ్డాయని స్థానికులు మండిపడుతున్నారు. పాడేరులో అధ్వానంగా పారిశుధ్యం పేరుకుపోయిన వ్యర్థాలు దోమలు, ఈగలతో వ్యాధుల భయం జాతర వేళ కూడా పట్టించుకోని అధికార యంత్రాంగం స్థానికుల ఆగ్రహం -
పులి సంచారంతో గుబులు
కొయ్యూరు: రాజవొమ్మంగి–కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం అటు అటవీ అధికారులను కలవరానికి గురిచేస్తుంటే, ఇటు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. సరిహద్దుల్లోని కొమ్మిక, రాజులపాలెం, చిన్నరెల్లలపాలెం, బరతనపల్లి గ్రామాల మధ్య ఉన్న యూకలిప్టస్ తోటల్లో పులి సంచరిస్తున్నట్టు శనివారం అటవీ అధికారులు గుర్తించారు. పులి రోజుకు చాలా తక్కువ దూరం మాత్రమే కదులుతుండటంతో.. ఒకటి లేదా రెండు రోజుల క్రితమే అది ఏదైనా వన్యప్రాణిని లేదా పశువును వేటాడి తిని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పులి వెళ్లేందుకు మూడు మార్గాలు.. ప్రస్తుతం పులి ఉన్న ప్రాంతం నుంచి ముందుకు వెళ్లేందుకు మూడు మార్గాలు ఉన్నాయని అటవీ సిబ్బంది చెబుతున్నారు. బకులూరు మీదుగా తాండవ జలాశయం వైపు వెళ్లడం లేదా ఇటు నుంచి మంప వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు అది వచ్చిన మార్గంలోనే వెనక్కి వెళ్లే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భయపడొద్దు.. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు, తోటల్లో పనులు చేసుకునే రైతులు అప్రమత్తంగా ఉండాలని పెదవలస రేంజ్ అధికారి (రేంజర్) ప్రశాంతికుమారి, ఎఫ్ఎస్వో శ్రీరాములు సూచించారు. కొమ్మిక, మంప పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. పులి కదలికలను రేడియో కాలర్ ట్రాకింగ్ సాంకేతికత ద్వారా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఒకవేళ పులి దాడిలో పశువులు మృతి చెందితే రైతులకు తక్షణమే ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. భయం గుప్పిట్లో గిరిజనం అప్రమత్తమైన అటవీశాఖ యూకలిప్టస్ తోటల్లో ఆనవాళ్ల గుర్తింపు రేడియో కాలర్ ట్రాకింగ్తో కదలికలపై నిఘా కూలీలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక -
మా వీధిలో అన్నీ సమస్యలే
మా వీధిలో అన్నీ సమస్యలే ప్రబలుతున్నాయి. సక్రమంగా తాగునీరు అందడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ అస్సలు లేదు. దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – కె.జ్యోతి, బక్కలపనుకు, పాడేరు పేరుకే జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలో అన్ని రకాల సమస్యలు పేరుకుపోయాయి. మా వీధిలో ఎప్పటి నుంచో డ్రైనేజీ సమస్య వేధిస్తోంది. మురుగునీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలు మరింత ప్రబలుతున్నాయి. – బొండ కనకరత్నం, సుండ్రుపుట్టు, పాడేరు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగిస్తాం. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు, డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – రమేష్, ఈవో (ప్రత్యేకాధికారి), పాడేరు -
జిల్లా కేంద్రం.. చెత్తమయం
జిల్లాకు గుండెకాయ లాంటి ప్రధాన పట్టణం.. ఐటీడీఏ సహా కీలక ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొలువై ఉన్న కేంద్ర స్థానం.. కానీ క్షేత్రస్థాయికి వెళ్తే పారిశుధ్యం పడకేసి మురుగు నిలయంగా దర్శనమిస్తోంది. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో పంచాయతీ పాలన పూర్తిగా నిర్వీర్యమవడంతో పురవీధులన్నీ నరకకూపాలుగా మారాయి. డ్రైనేజీలు పూడికతీతకు నోచుకోక, వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీనికితోడు ఇటీవల కురుస్తున్న వర్షాలు తోడవడంతో ఈగలు, దోమల బెడద తీవ్రమై, పట్టణ ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధుల భయంతో అల్లాడిపోతున్నారు. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
చింతపల్లి: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండగలరని ఎంపీడీవో సీతామహాలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగి పంచాయతీ కేంద్రంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని పురవీధుల్లో పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జి.మాడుగుల: మండలంలోని అన్ని గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్లలో ఉద్భవించే తడి, పొడి చెత్తను విడివిడిగా వేరు చేసి పంచాయతీ వాహనాలకు అందించాలని ఎంపీడీవో డేవిడ్రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని అన్ని పంచాయతీ కేంద్రాల్లో పంచాయతీ అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జి.మాడుగుల కేంద్రంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో పురవీధుల్లో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక ప్రధాన కూడలిలో (సెంటర్లో) భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను రోడ్లపై వేయకుండా, పంచాయతీ స్వచ్ఛరథం వాహనాలకు మాత్రమే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, పీఆర్ ఏఈ మాణిక్యాలరావు, ఏపీఎం రుద్రరావు, ఏపీవో కొండబాబు, వెలుగు స్వయం సహాయక సంఘాల మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కొయ్యూరు: రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మర్రిపాలెం మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కె.సుధా పిలుపునిచ్చారు. శనివారం కళాశాల ఆవరణలో ’స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజాన్ని ప్లాస్టిక్ రహితంగా నిర్మించడంలో భాగంగా మన పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలన్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలంతా పర్యావరణ హితమైన అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వీకేటీ మహాలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ మహమ్మారి ప్రకృతి సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒక్కసారి మాత్రమే వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ను పూర్తిగా నిలిపివేయడం ఎంతో మంచిదన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజుబాబు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల నేల, నీరు, వాతావరణం పూర్తిగా కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ను వాడబోమంటూ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. డుంబ్రిగుడ: మండల కేంద్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు, ప్రజలు అటవీశాఖ, పంచాయతీ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఎంపీడీవో విశ్వనాథ్ కోరారు. మండల కేంద్రంలో మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రకార్యక్రమంలో భాగంగా.. స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సముదాయాల వద్ద ప్లాస్టిక్ నిషేధంపై శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రస్తుతం కిరాణా దుకాణాలు, హోటళ్లు, చికెన్ సెంటర్ల వద్ద ప్లాస్టిక్ కవర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై పారేసే ప్లాస్టిక్ కవర్లను ఆహారంగా భావించి తింటున్న మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్ మహమ్మారిని నివారించడమే ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, ప్రజలు కూడా ఇళ్ల నుంచి వచ్చేటప్పుడే గుడ్డ సంచులను తెచ్చుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు విజయ్, గౌతమి పాల్గొన్నారు. -
పాలపొంగు
గిరి క్షేత్రంలో..ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో విస్తారంగా బత్తిరి సాగు దుంప నుంచి పాలు సేకరణ ● ఎండబెట్టి గుండ తయారీ ప్రకృతి వనరులతో పండిస్తున్న గిరి రైతులు ● సిరులు కురిపిస్తున్న పైరు కిలో రూ.300 నుంచి రూ.350 వరకు ఆదాయంమన్యంలో సాంప్రదాయ పంటల వైభవం మళ్లీ సంతరించుకుంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గిరిజన ప్రాంతాలైన ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు సరిహద్దు ఒడిశా పరిధిలో పాలగుండ (బత్తిరి) సాగు విస్తారంగా సాగుతోంది. పూర్వకాలం నుంచి గిరిజనుల జీవన విధానంలో, ఆహార అలవాట్లలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ పంటకు ప్రస్తుత వేసవి సీజన్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రసాయనాలకు దూరంగా, పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండే ఈ పాలగుండను కొనుగోలు చేసేందుకు మైదాన ప్రాంతాల ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్థానిక వారపు సంతల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది.ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన ముంచంగిపుట్టు, పెదబయలుతో పాటు ఒడిశాలోని లంతాపుట్టు, మాచ్ఖండ్, ఒనకడిల్లీ ప్రాంతాల్లో పాలపిండి (బత్తిరి) సాగు విస్తారంగా జరుగుతోంది. పూర్వకాలం నుంచి గిరిజన ప్రాంతాల్లో ఈ పంటకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం వేసవి కావడంతో మార్కెట్లో దీని ధర ఒక్కసారిగా పెరిగింది. ముంచంగిపుట్టు మండలంలో కరిముఖిపుట్టు, కించయిపుట్టు, సుజనకోట, బంగారుమెట్ట, పెదబయలు మండలంలో పన్నెడ, గోమంగి, గంపరాయి, గలగండ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో విరివిగా సాగుచేస్తున్నారు. శాసీ్త్రయ నేపథ్యం.. ఈ మొక్కను శాసీ్త్రయంగా కర్క్యుమా ఆంగుస్టిఫోలియా అని పిలుస్తారు. దీనినే ’ఈస్ట్ ఇండియన్ యారోరూట్’ అని కూడా అంటారు. ఇది ఉష్ణమండల పంట. వేడి, తేమతో కూడిన వాతావరణం ఈ సాగుకు చాలా అనుకూలం.నీరు నిల్వ ఉండని, సారవంతమైన ఇసుకతో కూడిన లోమ్ నేలల్లో మంచి దిగుబడి వస్తుంది. పైరు పసుపు మొక్కను పోలి ఉంటుంది. ● వర్షాకాలం ప్రారంభమయ్యే జూన్ మొదటి వారంలో తల్లి దుంపలను లేదా చిన్న చిన్న దుంప ముక్కలను విత్తనంగా వాడి నాటుకుంటారు. ● వరుసల మధ్య 30–45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15–20 సెంటీమీటర్ల దూరం ఉండేలా 5–7 సెంటీమీటర్ల లోతున నాటాలి. ● ఎకరాకు 8–10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువులే ఈ పంటకు మేలు చేస్తాయి. ● ఇది ఏడు నుంచి తొమ్మిది నెలల పంట. ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నప్పుడు (జనవరి–ఫిబ్రవరిలో) పంట కోతకు వస్తుంది. ఎకరాకు సుమారు 10–15 టన్నుల పచ్చి దుంపల దిగుబడి వస్తుంది. తయారీ.. శ్రమతో కూడిన ప్రక్రియ దుంపల నుంచి పిండిని సేకరించడం ఎంతో ఓపికతో కూడిన పని. మొదట దుంపలను సేకరించి శుభ్రం చేస్తారు. వాటిని జల్లెడపై గంటల తరబడి రుద్ది, పిప్పి నుంచి రసాన్ని సేకరిస్తారు. దీనినే బత్తిరి పాలు అంటారు. ఈ రసాన్ని రాత్రంతా నిల్వ ఉంచి (ఊరబెట్టి), మరుసటి రోజు ఉదయం చాపలపై లేదా పాత్రల్లో పోసి ఎండబెడతారు. సుమారు వారం రోజుల తర్వాత అది గట్టిగా కేకు ఆకారంలో మారుతుంది. అప్పుడు చిన్న ముక్కలుగా కోసి భద్రపరుస్తారు. ● గిరిజన రైతులు వారపు సంతల్లో కిలో రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో దీని ధర కిలో రూ.500 పైనే పలుకుతోంది. పాలపిండి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నీరసంగా ఉన్నవారికి, చిన్నారులకు ఇది మంచి శక్తినిచ్చే ఆహారమని గిరిజనులు చెబుతున్నారు.మైదాన ప్రాంతంలో గిరాకీ పాలగుండ నీటిని తాగడం వల్ల చలువ చేస్తుంది. ఎటువంటి ర సాయనాలు వినియోగించకుండా ప్రకృతి వనరు లతో పండించిన దుంపల నుంచి పాలపిండిని సేకరిస్తాం. ఇంట్లో నిల్వ ఉంచుకుంటాం. వారపు సంతల్లో, మండల కేంద్రాలకు తీసుకువెళ్లి విక్రయిస్తాం. మైదాన ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – కిల్లో బుద్రి, దొరగూడ, ముంచంగిపుట్టు మండలంసాగును ప్రోత్సహించాలి పాలపిండి సాగును ఐటీడీఏ ప్రోత్సహించాలి. రాయితీపై దుంపను రైతులకు అందించాలి. పెట్టుబడి సాయం అందిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. డిమాండ్ ఉన్న పాలపిండిని పండిస్తేనే ఆర్థికంగా మేలు కలుగుతుంది. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు బత్తిరి సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. – పాంగి రాంబాబు, కిందుగూడ, ముంచంగిపుట్టు మండలం -
నేటి నుంచి మోదకొండమ్మ జాతర
పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఈనెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని అన్ని వర్గాల ప్రజలు, భక్తులు నిర్ణయించారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల భద్రత కారణాలను సాకుగా చూపిస్తూ, భక్తుల మనోభావాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం ఈ ఉత్సవాల తేదీలను ఈనెల 17, 18, 19 తేదీలకు మార్చింది. ఈ సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల కోసం 100 ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మూడు రోజుల పాటు పాడేరు నుంచి వివిధ మార్గాల్లో సుమారు 100 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు తెలిపారు. రోజువారీ సర్వీసులు యథావిధిగా సాగుతూనే.. ఈ ప్రత్యేక బస్సులు 24 గంటల పాటు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయన్నారు. మద్యం దుకాణాలు మూసివేత జాతర ఉత్సవాలు ముగిసే వరకు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు పాడేరు పట్టణంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఆచారి తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా, నాటుసారా, ఇతర మత్తు పదార్థాలు రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.పాడేరులో మూడు రోజులు నిర్వహణ -
కృష్ణాపురంలో మార్మోగిన రామనామం
రామనామం జపిస్తున్న భక్తులు జి.మాడుగుల: చింతపల్లి మండలం కృష్ణాపురంలోని శ్రీ పాకలపాటి గురుదేవుల ఆశ్రమంలో జరుగుతున్న అఖండ రామనామ జప యజ్ఞానికి మద్దతుగా.. జి.మాడుగులలో శ్రీరామ ఆలయ సన్నిధిలో సోమవారం 24 గంటల అఖండ రామనామ జప యజ్ఞం ప్రారంభమైంది. శ్రీ పాకలపాటి గురుదేవుల భక్తుల సంఘం ఆధ్వర్యంలో భక్తులంతా ఏకమై శ్రీరామ జయరామ జయ జయ రామ నామ జపాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సంఘం అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ అఖండ రామనామ స్మరణ మంగళవారం ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు సాగుతుందని వెల్లడించారు. లోకకల్యాణార్థం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీరామాలయం పూజారి నాగేశ్వరరావు, శ్రీ మత్స్య మాడుగులమ్మ ఆలయం పూజారి సన్యాసిరావు, పాకలపాటి గురుదేవుల భక్త బృందం సభ్యులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అతిగా మద్యం తాగి యువకుడు మృతి
అచ్యుతాపురం రూరల్ : అతిగా మద్యం తాగి వికాష్ కుష్వా (26) అనే యువకుడు మృతి చెందిన ఘటన చీమలాపల్లి రెవెన్యూ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలి ఇలా ఉన్నాయి. వికాష్ కుష్వా మడుతూరు కూడలిలో ఉన్న మై చాయిస్ ఐస్ క్రీమ్ కంపెనీలో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 11 తేదీన విధులు ముగించుకుని దగ్గర్లో ఉన్న మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి, అతిగా మద్యం తాగాడు. శివ ప్రియా గార్డెన్స్ వద్ద మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం వెళ్లి పరిశీంచి, మృతి చెందిన వ్యక్తి వికాష్ కుష్వాగా గుర్తించారు. ఎక్కువగా మద్యం తాగడం వల్లే మృతి చెంది ఉంటాడని ఎస్ఐ వెంకటరావు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ చంద్ర శేఖర్ రావు తెలిపారు. -
అప్పన్న సాక్షిగా ట్రస్ట్ కోల్పోయిన కూటమి
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యుల నియామకంలో పారదర్శకత లోపించిందని కూటమి నాయకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పదవుల కోసం ఆశగా ఎదురుచూసిన సొంత పార్టీల నేతలకు మొండిచేయి ఎదురైంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని పక్కనపెట్టి, కూటమితో ఏమాత్రం సంబంధం లేని వారికి, స్థానికేతరులకు బోర్డులో చోటు కల్పించడంపై ఆశావాహులు మండిపడుతున్నారు. జగన్ హయాంలో పారదర్శకత సింహాచలం దేవస్థానానికి 2005 నుంచి 2019 వరకు ట్రస్ట్బోర్డు నియామకం జరగలేదు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2020 మార్చిలో, మళ్లీ 2022 ఏప్రిల్లో ట్రస్ట్బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పట్లో స్థానికులకు, ఆలయ విశిష్టతను కాపాడే వారికి పెద్దపీట వేయడంతో పాటు మహిళలకు 50 శాతం అవకాశం కల్పించారు. అయితే 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాటు బోర్డును నియమించకపోవడం సొంత నేతల్లోనే అసంతృప్తికి దారితీసింది. ఎట్టకేలకు శుక్రవారం 17 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ పార్టీ శ్రేణులకు కనీస సమాచారం లేకుండా ఆగమేఘాల మీద ఈ జాబితాను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలో అనర్హులకు పెద్దపీట ప్రకటించిన జాబితాలో అనర్హులకు పెద్దపీట వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఒక హోటల్ సీఈవో గుత్తికొండ శ్రీలతకు టీడీపీ కోటాలో బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. ఆమె అసలు పార్టీ కోసమే పనిచేయలేదని టీడీపీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. అలాగే టీడీపీ సానుభూతిపరుడైన మధుపాడ సన్యాసిరావును బీజేపీ ప్రతినిధిగా చూపించి నియామకం చేపట్టడంపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పేరుతో లబ్ధి పొందుతూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకు కూడా తగిన ప్రాధాన్యం దక్కలే దని జనసేన నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పట్టించుకోని ఎమ్మెల్యే సిఫార్సులు నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలను నమ్ముకుని పదవుల కోసం ఆశించిన వారికి తీవ్ర భంగపాటు ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులను అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు సూచించిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వీటన్నింటికీ మించి, సింహాచలం దేవస్థానంతో నేరుగా ముడిపడి ఉన్న అడవివరం గ్రామానికి చెందిన వారికి కూడా బోర్డులో కనీస అవకాశం కల్పించకపోవడం పట్ల స్థానికులు, కూటమి నేతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి అవమానం ఏపీలో బీజేపీ పూర్తిగా టీడీపీమయమైపోయింది. సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలపై అవగాహన లేని వారిని నియమించి అపప్రధ పాలవుతోంది. కూటమి వల్ల లబ్ధి పొందుతూనే బీజేపీని ప్రతి విషయంలోనూ చిన్నచూపు చూస్తోంది. కనీసం బీజేపీ నగర, రాష్ట్ర అధ్యక్షులకు తెలియకుండానే, తమకు అనుకూలంగా ఉండేవారిని బీజేపీ కోటాలో నియమించుకోవడం పార్టీని దెబ్బతీయడమే. గత ప్రభుత్వం 80 శాతం వరకు భక్తులకు ప్రాధాన్యం ఇస్తే, ప్రస్తుత బోర్డు మాత్రం దేవస్థానం భూముల అన్యాక్రాంతంపై నోరు మెదపని వారి కోసం వేసినట్లుగా ఉంది. –విజయశంకర్ ఫణీంద్ర, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ -
జిల్లాలో 89 లక్షల మొక్కల పెంపకం
కె.కోటపాడు: సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని 80 వన నర్సరీల్లో వివిధ రకాలకు చెందిన 89 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు సోషల్ ఫారెస్ట్ అధికారి(డీఎఫ్వో) ఎం.సోమసుందరం తెలిపారు. కె.కోటపాడు మండలం కొత్తూరు, ఎ.కోడూరు, సింగన్నదొరపాలెం, రామచంద్రపురం, పొడుగుపాలెం, బత్తివానిపాలెం గ్రామాల్లో వన నర్సరీలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవి ఉష్ణోగ్రత్తలు ఎక్కువగా ఉండడం వల్ల నర్సరీల్లో మొక్కలకు నీటి తడులను తరచూగా ఇవ్వాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి జిల్లా ఫారెస్ట్ కమిటీ సమావేశం అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. ఏయే మొక్కలు రైతులకు, ప్రభుత్వ అవసరాలకు ఉచితంగా ఇవ్వాలనేది కమిటీ నిర్ణయిస్తుందన్నారు. పరిశ్రమలకు నిర్దేశించిన ధరలకు ఈ మొక్కలను అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెంచుతున్న మొక్కల్లో 70 లక్షల సరుగుడు మొక్కలతోపాటు మిగిలిన 19 లక్షలు జీడి, మహగణి, ఎర్రచందనం, ఏగిస, యూకలిప్టస్, నేరేడు, రోజ్వుడ్, కందంబ, ఫెల్టోఫారం తదితర మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. గతేడాది రోడ్లకిరువైపులా రహదారి వనాల కార్యక్రమంలో బాగంగా మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు బ్లాక్ ఫ్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటామన్నారు. ఈ ఏడాది ఎన్టీపీసీ(సింహాద్రి) నిధులతో రహదారి వనాలు, బ్లాక్ ప్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వన నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వీబీ జీ రాంజీ, ఎన్టీపీసీ, ఆగ్రో ఫారెస్ట్రీ, కాంపా నిధులతో పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శివరంజిని, డిప్యూటీ రేంజ్ అధికారి నూకరాజు, వన సేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు. -
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
● నిర్లక్ష్యం చేస్తే చర్యలు ● కలెక్టర్ నిశాంతి హెచ్చరిక ● పాడేరు ఐటీడీఏలో పీజీఆర్ఎస్ నిర్వహణపాడేరు: పీజీఆర్ఎస్లో స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇంచార్జీ డీఆర్వో లోకేశ్వరరావు పలు సమస్యలపై 62, రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 41 వినతులను స్వీకరించారు. ఫిర్యాదులను ఎంత గడువులోగా పరిష్కారిస్తారో అర్జీదారులకు వివరించాలన్నారు. ప్రతి శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించే పీజీఆర్ఎస్కు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని, కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అధికారులు ఉండాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమం తప్పకుండా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో, ప్రతి రోజు గ్రామ స్థాయిలో ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కారించాలని సూచించారు. ఫిర్యాదుదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విద్యసాగర్, డీఆర్డీఏ పీడీ మురళి, టీడబ్ల్యూ డీడీ పరిమళ, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, డీపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
● ఇద్దరి అరెస్టు
నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని నర్సీపట్నం రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముందుస్తుగా వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్ఐ రాజారావు, సిబ్బందితో చింతపల్లి రూట్లో నెల్లిమెట్ట జంక్షన్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన చల్లా గోపి(25), ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా కలిమెల మండలం పపులర్ పంచాయతీకి చెందిన మహాదేబ్ ఖిలా(23)ను అరెస్ట్ చేసినట్ట సీఐ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.12.70 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రెండు సెల్ఫోన్లు, రూ.1000 నగదు సీజ్ చేసినట్టు సీఐ చెప్పారు. -
దైవ దర్శనానికి వెళ్లి వృద్ధుడు అదృశ్యం
మాడుగుల రూరల్: తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వృద్ధుడు 12 రోజులైనా తిరిగి ఇంటికి చేరలేదు. మండలంలోని వీరనారాయణం గ్రామానికి చెందిన కోరుకొండ కళ్యాణం అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దాడి పెంటయ్యతోపాటు అతడు ఈ నెల 1న వృద్ధాప్య పింఛను తీసుకుని 4వ తేదీన అనకాపల్లిలో తిరుమల రైలు ఎక్కి 5వ తేదీన తిరుపతికి చేరుకున్నారు. అక్కడ దర్శనం చేసుకుని వెంగమాంబ భోజన శాల వద్ద భోజనాలు చేశారు. పెంటయ్య తన బ్యాగ్ను కళ్యాణంకు ఇచ్చి చేతులు కడుక్కోని వచ్చేలోగా కనిపించలేదు. బ్యాగ్లో నగదు, బట్టలు ఉండటంతో పెంటయ్య ఆందోళనకు గురయ్యాడు. అక్కడ మైక్లో అనౌన్స్ చేసినా ఆచూకీ తెలియరాలేదు. తర్వాత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి గాలించినా సరే జాడలేదు. దీంతో పెంటయ్య కట్టుబట్టలతో తిరిగి ఈ నెల 14వ తేదీన స్వగ్రామం వీరనారాయణం చేరుకున్నాడు. ఈ విషయం కళ్యాణం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు. -
భలే రుచి!
కొండమామిడి తాండ్రపుల్లపుల్లగా.. తియ్యతియ్యగా.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మన్యం మామిడి తాండ్రకు మళ్లీ టైం వచ్చింది. ఎటువంటి రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన రుచి కావాలంటే.. గిరిజన పల్లెల్లో తయారయ్యే తాండ్రను రుచి తినాల్సిందే. ప్రస్తుతం మన్యంలో ఎటు చూసినా కొండ మామిడి పండ్ల గుజ్జుతో తాండ్రను తయారు చేసే పనుల్లో గిరిజన మహిళలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక్కడి సంప్రదాయ రుచికి మార్కెట్లో డిమాండ్ మామూలుగా లేదు. ముంచంగిపుట్టు: మన్యంలోని కొండ కోనల్లో, అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర రుచి చూడాలే కానీ, మరెక్కడా దొరకదు. మన్యంలోని గిరిజన గ్రామాల్లో ప్రస్తుతం ఎటు చూసినా తాండ్ర తయారీ పనులే కనిపిస్తున్నాయి. ఎటువంటి రసాయనాలు కలపకుండా, కేవలం ఎండను నమ్ముకుని గిరిజన మహిళలు ఈ తాండ్రను తయారు చేస్తున్నారు. సంతల్లో జోరుగా అమ్మకాలు గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తున్న ఈ తాండ్రకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. స్థానిక వారపు సంతల్లో కిలో రూ.100 నుంచి రూ.120 వరకు ధర పలుకుతున్నా, వినియోగదారులు ఆ రుచికి ఫిదా అయి ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మామిడి పండ్ల సీజన్ అయిపోయినప్పటికీ, ఈ తాండ్రను ఎక్కువ కాలం భద్రపరుచుకుని తినే వీలుండటంతో దీనికి డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తయారీ విధానం.. మన్యం తాండ్ర తయారీలో గిరిజన కుటుంబాలు పడే శ్రమ ఎంతో ఉంటుంది. కొండ ప్రాంతాల్లోని అడవి మామిడి చెట్ల నుంచి రాలిపడిన పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి సేకరిస్తారు.వీటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు లేదా బిందెల్లో వేస్తారు. రోకలితో దంచి మామిడి రసాన్ని వేరు చేస్తారు. తీసిన రసాన్ని చాపలు, చేటలు లేదా స్టీలు ప్లేట్లలో పలుచని పొరలుగా పోస్తారు.ఒక పొర ఆరిన తర్వాత మళ్లీ దానిపై మరో పొర వేస్తూ, ఇలా వారం నుంచి పది రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. ఏ రకమైన రసాయనాలు లేదా కృత్రిమ రంగులు కలపకపోవడమే ఈ తాండ్ర విశిష్టత. పది పొరలు ఆరిన తరువాత వచ్చే తాండ్ర తింటే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండి జిహ్వకు అమృతప్రాయంగా అనిపిస్తుంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించిన గిరిజన మహిళలు, తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి తాండ్ర ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తున్నారు.ప్రకృతి సిద్ధమైన ఆహారం జిహ్వకు అమృతప్రాయం మార్కెట్లో మంచి డిమాండ్ గిరిజన పల్లెల్లో సందడి -
అప్పన్న కొండపై తవ్వకాలు అపచారం
డాబాగార్డెన్స్ (విశాఖ): హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న సింహాచలం కొండను చంద్రబాబు ప్రభుత్వం బోడిగుండు చేస్తోందని సీపీఎం నాయకుడు గంగారావు ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల కొండ ప్రాంతంలో డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. నరసింహ స్వామి కొలువై ఉన్న పవిత్ర కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యలను భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాగే సింహాచలం కొండ నుంచి వచ్చే వర్షపు నీరు ముడసర్లోవకు చేరే సహజ ప్రవాహ వ్యవస్థ దెబ్బతింటుందని, కొండను తవ్వడం వల్ల నీటి ప్రవాహానికి అంతరాయం కలిగే ప్రమాదం ఉందని గంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. -
కేకే లైన్తో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలి
సీతంపేట: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కె.కె. లైన్ను చేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంపీ శ్రీభరత్ బీచ్ రోడ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం అందజేయనున్నట్లు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జె.టి. రామారావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘కె.కె. లైన్తో ఉన్న రైల్వే జోన్ – భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రధాన ఆస్తులు, ఆదాయ మార్గాలను ఇతర జోన్లకు అప్పగించి విశాఖకు కేవలం పేరు మాత్రమే ఇవ్వడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కె.కె. లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ అసంపూర్ణమని, దీని సాధన కోసం పాదయాత్రలు, ర్యాలీలు, ‘చలో ఢిల్లీ’ వంటి కార్యక్రమాలతో దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇప్పటికై నా గళమెత్తాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు అడారి కిషోర్ కుమార్, కస్తూరి వెంకట్రావు, గొలగాని రాము, ఎం.ఎల్.ఎన్. పట్నాయక్ , పలు మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్నేహితుడి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..
బుచ్చెయ్యపేట: మండలంలో కశింకోట– బంగారుమెట్ట(కేబీ) రోడ్డులో నీలకంఠాపురం వద్ద విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి అనకాపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు స్నేహితులు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నారు. రాజాం గ్రామానికి చెందిన మరిసా శివ పని మీద అనకాపల్లి వెళ్లాడు. అర్ధరాత్రి వాహనాలు లేకపోవడంతో తన స్నేహితులైన మరిసా సాయి, పడాల శివకు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకెళ్లడానికి రావాలని కోరాడు. స్నేహితుడిని తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై మరిసా సాయి, పడాల శివ అనకాపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు వస్తుండగా, రాత్రి 2 గంటల ప్రాంతంలో నీలకంఠాపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. 108 వాహనంలో పడాల శివ, మరిసా శివలను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన స్నేహితుడి కారులో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి వెళ్తున్న మరిసా సాయి(20) జంగాలపాలెం గ్రామ దగ్గర ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంలో పడాల శివ కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. మరిసా శివ అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివాహమైన ఏడాదికే.. మరిసా సాయి తురకలపూడికి చెందిన మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 8వ తేదీన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయి తన గ్రామంలో పొలం అమ్మడానికి 20 రోజుల క్రితం భార్యతో కలిసి రాజాం వచ్చాడు. రెండు రోజుల క్రితం భూమి రిజిస్ట్రేషన్ అయింది. మళ్లీ హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. తన స్నేహితుడు అనకాపల్లిలో ఉండిపోవడంతో అర్ధరాత్రి తీసుకురావడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య మాధవి ప్రస్తుతం ఆరో నెల గర్భిణి. భర్త మృతితో ఆమె రోదిస్తున్న తీరును చూసి పలువురు చలించిపోయారు. సాయి తల్లి లచ్చమ్మ అనారోగ్యంతో మంచాన ఉండగా, తండ్రి సన్యాసినాయుడు కుమారుడు మృతితో భోరున విలపిస్తున్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శ్రీనివాసరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. సాయి మృతదేహానికి పోస్టుమార్టం జరిపి, సాయంత్రం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. కేబీ రోడ్డును ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని మార్చాలని ఫిర్యాదులు చేస్తున్నా ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎంపీ నిధులతో వీధి లైట్ల పంపిణీ
వీధిలైట్లు పంపిణీ చేస్తున్న ఎంపీపీ తదితరులు కొయ్యూరు: అరకు ఎంపీ తనూజరాణి ఎంపీ లాడ్స్ నిధులతో కొనుగోలు చేసిన వీధిలైట్లను శుక్రవారం ఎంపీపీ బడుగు రమేష్, వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు,డౌనూరు ఎంపీటీసీ బి. అప్పారావు పంపిణీ చేశారు. మండలానికి వీధిలైట్లు కేటాయించడంపై వారంతా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. మండలానికి మరిన్ని నిధులను కేటాయించాలని వారు ఎంపీని కోరారు. కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.నేడు కంటి వైద్య శిబిరం పెదబయలు: మండలంలోని గోమంగి పీహెచ్సీలో ఈ నెల 16 తేదీన కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారి చైతన్య తెలిపారు.ఈ శిబిరాన్ని విజయనగరం పుష్పగిరి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. దృష్టిలోపం ఉన్న వారు శిబిరానికి హాజరు కావాలని కోరారు.అవసరమైన వారికి శస్త్ర చికిత్స చేసేందుకు రిఫర్ చేస్తామన్నారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
గంజాయి రవాణా కేసులో నిందితుడికి జైలు
అనకాపల్లి: జిల్లాలో మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి రవాణా కేసులో నిందితుడికి 2 సంవత్సరాల 7 నెలల జైలుశిక్ష విధిస్తూ విశాఖ 1వ అదనపు న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించారని, జరిమానా చెల్లించని పక్షంలో ఒక నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా విల్లవంకోడ్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ 2023 నవంబర్ 8న ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడుకు ఏడు కిలోల గంజాయిని తరలిస్తుండగా అప్పటి మాకవరంపాలెం ఎస్ఐ పి.రామకృష్ణ పట్టుకున్నట్టు ఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాలు అనంతరం జైలు శిక్షణ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు తెలిపారు. కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్ బలమైన వాదనలు వినిపించారని చెప్పారు. -
ఉత్సవ పోస్టర్లలోనూ రాజకీయమా?
పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర సందర్భంగా ముద్రించిన సాంస్కృతిక పోస్టర్లు ఇప్పుడు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ప్రొటోకాల్ను తుంగలో తొక్కి, ఏకపక్షంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ, బీజేపీ శ్రేణులతో పాటు సామాన్య భక్తులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై విమర్శలు సాధారణంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఉంటే వారే అమ్మవారి ఆలయానికి ఐదేళ్ల పాటు చైర్మన్గా వ్యవహరిస్తారు. జాతర ఉత్సవాల గోడ పత్రికలలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ ఫొటోను ముద్రించడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది ఉత్సవ కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న గిడ్డి ఈశ్వరి.. రాజకీయ కక్షతో ప్రస్తుత ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఫొటోను ముద్రించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, సంధ్యారాణిల ఫొటోలతో పాటు తన ఫోటోను పెద్దదిగా ముద్రించి, స్థానిక ఎమ్మెల్యేను విస్మరించడంపై భక్తులు తప్పుపడుతున్నారు. పోస్టర్లలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతికుమారి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు తీవ్రంగా స్పందించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములమనే విషయాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు మరచిపోయారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రుల ఫొటోలు ముద్రించి.. ప్రధాని నరేంద్ర మోదీ, స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఫొటోలను విస్మరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని నిలదీశారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల జాతరను ప్రశాంతంగా నిర్వహించలేరని హితవు పలికారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రవికుమార్, పాపిడిరాజు, సల్లా రామకృష్ణ, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వేశ్వరరాజుకు దక్కని గౌరవం కనిపించని ఫొటో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ నేతల అభ్యంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ఏకపక్ష నిర్ణయం ఆమె తీరుపై భక్తుల మండిపాటు -
బైక్ల దొంగ అరెస్టు
రూ.12.70 లక్షల గంజాయి స్వాధీనం నాతవరం: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం తెలిపారు. రోడ్డుపై పలు కార్యాలయాలు, దుకాణాలు వద్ద నిలిపి ఉంచిన వాహనాలు చోరీకి గురైనట్టు చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇటీవల తాండవ జంక్షన్లో జరిగిన చోరీ కేసులో అనుమానితులపై ప్రత్యేంగా నిఘా పెట్టామన్నారు. శుక్రవారం వల్సంపేట జంక్షన్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఆ సమయంలో వచ్చిన నిందితుడు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన కె.దుర్గాప్రసాద్ను పట్టుకుని, చోరీ చేసిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించాలమని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో సహకరించిన మైత్రి బృందానికి ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు. -
● మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు ● పక్కా ప్లాన్తోనే హత్య ● హైదరాబాద్ పారిపోతుండగా నిందితుడి అరెస్టు ● 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
అద్దె అడిగితే గొంతు కోశాడుఅల్లిపురం(విశాఖ): అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమైపె కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధు రి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
నిధుల గండం
పల్లెకుపన్నులు వసూలుకాక కునారిల్లుతున్న గ్రామ పంచాయతీలు కొయ్యూరు: జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు, ప్రస్తుత ఏడాది పన్నులు కలిపి మొత్తం రూ. 7.73 కోట్లకు చేరుకున్నాయి. గ్రామ పంచాయతీల మనుగడకు ప్రధాన వనరుగా ఉన్న ఇంటి పన్నుల వసూలు మందగించడంతో, స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. జనగణన బాధ్యతలతో.. సాధారణంగా ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను పర్యవేక్షించాల్సిన సచివాలయ సిబ్బందికి ప్రస్తుతం జనగణన పనులను అప్పగించడమే ఈ మందగింపునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ● గతంలో ప్రతి జనగణన ప్రక్రియకు ఉపాధ్యాయులను నియమించేవారు. అయితే, ఈసారి వారిని మినహాయించి కేవలం సచివాలయ సిబ్బందిని మాత్రమే వినియోగించడంతో, వారిపై పనిభారం పెరిగి పన్నుల వసూలు కుంటుపడింది. ● జిల్లాలోని ఏ ఒక్క మండలంలో కూడా కనీసం 5 శాతం వసూళ్లు కూడా సాధించలేకపోవడం గమనార్హం. పాలనపై తీవ్ర ప్రభావం గ్రామ పంచాయతీలు తమ దైనందిన కార్యకలాపాలకు, ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణకు ఇంటి పన్నుల నుంచి వచ్చే ఆదాయంపై అధికంగా ఆధారపడి ఉంటాయి. ● గ్రామాలలోని చెత్తను సేకరించి, శుభ్రం చేసే ‘క్లాప్ మిత్రల’కు వేతనాల చెల్లింపులు ఈ పన్నుల ఆదాయం నుంచే జరుగుతాయి. ● వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇతర అత్యవసర గ్రామాభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ● కొయ్యూరు మండలంలో పన్నుల వసూలును వేగవంతం చేసేందుకు అధికారులు కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదు. గతంలో ప్రజలు నగదు చెల్లించడానికి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా వాట్సాప్ ద్వారా గానీ, సచివాలయాల్లో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా గానీ సులభంగా పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. గడువు విధించినా.. జనగణన పనులలో కొందరు సిబ్బంది నిమగ్నమైనప్పటికీ, మిగిలిన సిబ్బంది ద్వారా ఇంటింటికీ డిమాండ్ నోటీసులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు పన్నులు చెల్లించాలని గడువు విధిస్తున్నారు. దృష్టిపెట్టకుంటే కష్టమే.. ఆర్థిక సంవత్సరం ముగిసిన తరుణంలో, కనీసం సగం మొత్తమైనా వసూలు కాకపోతే పంచాయతీల మనుగడ కష్టం కానుంది. జనగణన పనులతో పాటు పన్నుల వసూలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డిజిటల్ చెల్లింపుల విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని పలువురు సూచిస్తున్నారు. -
మోదమ్మ ఉత్సవాల సాక్షిగా కూటమి కుట్ర
పాడేరు: గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల విషయంలో కూటమి నాయకులు కుట్రలకు తెరలేపారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో పాడేరు, అరకు మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, గిరిజన సంఘాలు, అన్ని పక్షాల ఏకగ్రీవ నిర్ణయం మేరకు ఈ నెల 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహించాలని అనుకున్నాం. కానీ, కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఇంచార్జ్ మంత్రి సంధ్యారాణి, గిడ్డి ఈశ్వరి రాజకీయ జోక్యంతో ఉత్సవాల తేదీలను ఏకపక్షంగా మార్చేశారన్నారు. ఎన్నికల దృష్ట్యా పోలీసు బందోబస్తు ఇవ్వలేమని, అందుకే ఉత్సవాలు నిర్వహించలేమని అప్పట్లో సాకులు చెప్పారన్నారు. మరి ఇదే నెల 13న పాడేరులో జరిగిన జీసీసీ చైర్మన్ శ్రవణ్ కుమార్ వివాహానికి, మంత్రి లోకేష్ పర్యటనకు ఐదు రోజుల ముందు నుంచే వందల సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. బెదిరింపులతో జనసమీకరణ చేపట్టారని ధ్వజమెత్తారు. కిడారి శ్రవణ్ కుమార్ వివాహానికి 64 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, మంత్రి లోకేష్ సమావేశానికి రాకపోతే పెన్షన్లు, రేషన్ కార్డులు, జాబ్ కార్డులు తొలగిస్తామని గిరిజనులను బెదిరించి తరలించారని ఆరోపించారు. తరలించిన ప్రజలకు కనీసం మంచినీరు, ఆహారం కూడా అందించకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. మంత్రి పర్యటన, టీడీపీ నేత వివాహం కారణంగా పట్టణంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయిందని, కనీసం అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వలేదని విమర్శించారు. అసలు మంత్రి లోకేష్ వచ్చింది ప్రభుత్వ కార్యక్రమానికా లేక ప్రైవేట్ కార్యక్రమానికా అని ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశీరాణి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు రామసత్యవతి, ఎంపీటీసీ రాజేశ్వరి, మాజీ సర్పంచ్లు వంతాల రాంబాబు, పాంగి నాగరాజు, నాయకులు మోద బాబురావు, పలాసి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
చీడికాడ: మండలంలోని జి.కొత్తపల్లి శివారు చినగోగాడకు చెందిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ తాటిచెట్టుపై నుంచి జారి పడి మృతి చెందినట్లు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కోన నారాయణమూర్తి(43)గురువారం మధ్యాహ్నం తమ కల్లం సమీపంలో తాటికాయలు కోసేందుకు తాటిచెట్టు ఎక్కాడన్నారు. ప్రమాదవశాత్తూ కాలుజారి చెట్టు పైనుంచి కిందికి పడిపోవడంతో తలకు,శరీరంపై బలమైన గాయాలై మృతి చెందాడన్నారు. ఘటనపై మృతుని భార్య వెంకట వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. -
కాఫీ రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యం
1అరకులోయ టౌన్: గిరిజనుల జీవితాల్లో ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం గొప్ప మార్పును తీసుకువచ్చిందని కాఫీ బోర్డు రాష్ట్ర కార్యదర్శి కూర్మరావు అన్నారు. గురువారం కేంద్ర కాఫీ బోర్డు ఆధ్వర్యంలో స్థానిక పున్నమి హరిత వ్యాలీ రిసార్ట్స్లోని గోష్టి సమావేశ మందిరంలో ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 15 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్న కాఫీ ఉత్పత్తిని 50 వేల మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 2.15 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని 4 లక్షల ఎకరాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సేంద్రియ జిల్లాగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ నిశాంతి కాఫీతో పాటు హార్టికల్చర్ సాగును కూడా ప్రోత్సహిస్తామని, జిల్లాను పూర్తిస్థాయి సేంద్రియ వ్యవసాయ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ టి.నిశాంతి ప్రకటించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని, ఇక్కడి నమూనాను స్ఫూర్తిగా తీసుకుని ఒడిశాలోని మరో 8 జిల్లాల్లో కాఫీ సాగుకు అక్కడి అధికారులు ఆసక్తి చూపుతున్నారని ఆమె తెలిపారు. మొదటి స్థానమే లక్ష్యం: కాఫీ బోర్డు డైరెక్టర్ భార్గవి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అరకు కాఫీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేక వెనుకబడిందని కాఫీ బోర్డు డైరెక్టర్ భార్గవి అభిప్రాయపడ్డారు. దేశంలో కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని.. భవిష్యత్తులో మన రాష్ట్రం ప్రథమ స్థానానికి చేరుకోవాలంటే అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. లోగో ఆవిష్కరణ ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకల లోగో, థీమ్ను అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు డైరెక్టర్ చందుల్ కుమార్, బెంగళూరు ఐహెచ్ఆర్ డైరెక్టర్ తుషార్ కాంతి బెహరా, కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్, జీసీసీ ఎండీ శేఖర్ బాబు, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధిక సంఖ్యలో కాఫీ రైతులు పాల్గొన్నారు. -
కానరాని పర్యాటక సందడి
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో సందర్శకుల తాకిడి గణనీయంగా తగ్గింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అరకులోని పర్యాటక ప్రాంతాలన్నీ గత కొన్ని రోజులుగా పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి.ఈ పరిస్థితికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పర్యాటకుల రాకపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం పర్యాటక రంగంపై కనిపిస్తోంది.రవాణా ఖర్చులు పెరగడం, ఇంధన కొరత కూడా పర్యాటకులు తగ్గడానికి ఒక కారణమని పర్యాటక ప్రాంతాల్లో నిర్వాహఖులు భావిస్తున్నారు. వీకెండ్లో అంతంత మాత్రంగా.. సాధారణ రోజుల్లో పర్యాటకుల తాకిడి అసలు కనిపించడం లేదని, కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో వస్తున్నారని స్థానిక వ్యాపారులు, పర్యాటక కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్యాటక రంగంపై ఆధారపడిన స్థానిక గిరిజనులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణనీయంగా తగ్గిన సందర్శకుల సంఖ్య -
మహిళ దారుణ హత్య
● బంగారు నగల కోసమే ఘాతుకం ● అక్కయ్యపాలెంలో ఘటనపార్వతి మృతదేహంతాటిచెట్లపాలెం: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్లోని పీఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న పార్వతి (53)ని దుండగులు హతమార్చారు. మృతురాలి భర్త దొండపర్తిలో పాన్షాప్ నిర్వహిస్తుండగా, ఆయన గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తన దుకాణానికి వెళ్లాడు. తిరిగి రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి చేరుకునేసరికి పార్వతి విగతజీవిగా పడి ఉండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు లోపలికి ప్రవేశించి, కాళ్లు చేతులు బంధించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మంగళసూత్రం, నల్లపూసల తాడు, చెవి రింగులు, చేతి గాజులను దోచుకుని అక్కడ నుంచి పరారయ్యారు. నేరం జరిగిన ప్రదేశంలో క్లూస్ దొరకకుండా ఉండేందుకు దుండగులు కారంపొడి చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి మెడపై గాయాలు ఉండటాన్ని బట్టి, నిందితులతో ఆమె తీవ్రంగా పెనుగులాడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పార్వతి సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో తన పిల్లలతో ఫోన్లో మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. దీనిని బట్టి ఆ తర్వాతే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న ఫోర్త్టౌన్ క్రైం పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. క్రైం డీసీపీ, ఏసీపీలతో పాటు లా అండ్ ఆర్డర్ ఏసీపీలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మాయమాటలతో పసిబిడ్డ అపహరణ
పాడేరు: వైద్య చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చిన నెలన్నర బాబును ఓ గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి అపహరించిన ఘటనను పోలీసులు అత్యంత చాకచక్యంగా గంటల వ్యవధిలోనే ఛేదించారు. పాడేరు సీఐ డి. దీనబంధు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం, సలుగు పంచాయతీ, బూరుగుచెట్టు గ్రామానికి చెందిన పాంగి రామారావు, కాంతమ్మ దంపతుల నెలన్నర బాబు అనారోగ్యానికి గురవ్వడంతో, గురువారం వారు పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఓ గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి, బాబును ఎత్తుకుంటానని వారిని నమ్మించింది. వారిని మాటల్లో పెట్టి, అదును చూసి బాబుతో సహా అక్కడి నుంచి పరారైంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బాబు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పాడేరు సీఐ దీనబంధు, హుకుంపేట సీఐ విజయ్కుమార్, ఎస్ఐ విజయ్కుమార్ తమ సిబ్బందితో కలిసి రెండు బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లా ఆసుపత్రితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సదరు మహిళ బిడ్డను ఎత్తుకొని హుకుంపేట మార్గంలో వెళ్తున్నట్లు గుర్తించారు. కొంతిలి సమీపంలో నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాబును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో తల్లిదండ్రులకు బాబును అప్పగించారు. బాబును అపహరించిన మహిళ హుకుంపేట మండలం, ఉప్ప గ్రామానికి చెందిన సంతరి కృష్ణవేణి (భర్త దామోదర్) గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ దీనబంధు తెలిపారు. తమ బిడ్డను గంటల వ్యవధిలోనే ప్రాణాలతో తిరిగి అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. -
పెళ్లింట పెను విషాదం
అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ హృదయవిదారక ఘటన అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్. ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి తీవ్ర గాయాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతుంది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు కూడా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరు మున్నీరవుతున్న బంధువులు అత్తారింట్లో అడుగుపెట్టి ఆనందంగా ఉండాల్సిన వధువు ప్రమాదంలో తీరనిలోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. పెళ్లి వేడుక ముగిసి 24 గంటలు కూడా కాకముందే పెళ్లికూతురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
యలమంచిలి రూరల్ : పార్క్ చేసి ఉంచిన ద్విచక్రవాహనాలను చాకచక్యంగా చోరీ చేస్తున్న వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీన పర్చుకున్నామన్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లికి కోడిగుడ్డు సన్యాసిరావు ద్విచక్రవాహనాలను చోరీ చేసి వాటిని తెలిసిన వారి వద్ద తాకట్టు పెట్టి డబ్బుతో తన అవసరాలు తీర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. యలమంచిలి పట్టణ ఠాణాలో 2023లో రెండు, 2024 నాగుల చవితి జాతర రోజు ఒకటి మొత్తం మూడు ద్విచక్ర వాహనాలను నిందితుడు అపహరించాడు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న మూడు కేసుల్లో నిందితుడిగా సన్యాసిరావును పోలీసులు నిర్థారించుకున్నారు. గురువారం 16వ నెంబర్ జాతీయ రహదారిపై పెదపల్లి కూడలి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా చోరీకి గురైన మూడు వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. -
జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం
అనకాపల్లి: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, యువత భవిష్యత్తో అడుకుంటున్న నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తుహిన్ సిన్హా గురవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం అసాంఘిక కార్యక్రలాపాలకర పాల్పడుతున్న, గంజాయి స్మగ్లర్పై ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉత్తర్హులు మేరకు పీటీ ఎన్డీపీఎస్ యాక్టును ప్రయోగించి జైలుకు తరలించడం జరుగుతుందన్నారు. రోలుగుంట మండలం, బెన్నభూపాలపట్నం గ్రామానికి చెందిన చిన్నికృష్ణ(35) కొంతకాలంగా వరుసగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడుతున్నాడని, ఇతనిపై జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లో ఐదుకు పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ సమాజానికి ముప్పుగా మారిన చిన్ని కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని, దీనిపై పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈనెల 11న పీటీ యాక్టు అమలు చేయాలని ఆదేశించినట్టు ఎస్పీ చెప్పారు. కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్ఐ పి.రామకృష్ణారావు చిన్నికృష్ణను అదుపులోనికి తీసుకుని, విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. ఈ చట్టం కింద అరెస్టుయిన వ్యక్తికి ఏడాది వరకూ బెయిల్ వచ్చే అవకాశం ఉండదన్నారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. సాదారణ సెక్షన్లతో పాటు పీటీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. -
పిడుగుపాటుకు మూడు ఆవుల మృతి
జి.మాడుగుల: మండలంలోని సింగర్భ పంచాయతీ కంబాలుబయలు గ్రామంలో గురువారం సాయంత్రం ప్రకృతి ప్రకోపం చోటుచేసుకుంది. ఉరుములు, మెరుపులు, భీకర శబ్దాలతో కూడిన పిడుగుపాటుకు ఇద్దరు గిరిజన రైతులకు చెందిన మూడు ఆవులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంబాలుబయలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి పశువులను మేత కోసం తోలుకెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. ఈ ప్రమాదంలో మేత మేస్తున్న పశువులపై పిడుగు పడటంతో కిముడు బొజ్జాచారికి చెందిన రెండు ఆవులు, కొమ్మంగి మత్స్యలింగంకు చెందిన ఒక ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. మృతి చెందిన ఆవుల విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశువులే తమకు జీవనాధారమని, పిడుగుపాటుతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి, తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత గిరిజన రైతులు వేడుకుంటున్నారు. -
భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తాం
అనకాపల్లి: జిల్లాలో పెండింగ్లో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తెలిపారు. గురువారం స్థానిక గాంధీనగరంలోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లాలోని ఎస్సీ సంక్షేమ భూములకు సంబంధించిన భూ కబ్జా, సర్వే కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కార మార్గాలపై సంబంధిత అధికారులకు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ద్వారా తదుపరి చర్యల కోసం లేఖలు పంపించామన్నారు. 54 మంది ఫిర్యాదులు చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, సోషల్ వెల్ఫేర్ డీడీ బి.రామానందం, డీవీఎంసీ సభ్యులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూ వివాదంపై విచారణ దేవరాపల్లి: మండలంలోని ముషిడిపల్లిలో రెవెన్యూ పరిధిలో దళితులు, కల్లుగీత కార్మికులు మధ్య నెలకొన్న భూ వివాదంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం గురువారం విచారణ చేపట్టారు. మండలంలోని కె.ఎం.పాలెం గ్రామానికి చెందిన కణితి అర్జున్ ముషిడిపల్లిలోని తన భూ సమస్యపై రాష్ట్ర ఎస్సీ కమీషన్ను ఆశ్రయించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ సూచనల మేరకు సదరు వివాదాస్పద స్థలాన్ని స్థానిక తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, ఎస్ఐ వి. సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం సదరు స్థలానికి సంబంధించి ఇరువురి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించారు. ఇరువర్గాల వారి వాదనలను వినడంతో పాటు స్థానిక పెద్దలను, అధికారులను సైతం భూమికి సంబంధించిన పూర్వపరాలపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల వారు పరస్పర వాదోపవాదనలకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించారు. -
18 కిలోల గంజాయితో ముగ్గురు అరెస్టు
చీడికాడ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు, ఒక మైనర్ను అదుపులోకి తీసుకుని వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. ఆయన గురువారం అందించిన వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని అప్పలరాజుపురం లలితా దేవి మెట్ట వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు స్కూటీలపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా ఆపి తనిఖీ చేయగా రెండు వాహనాల్లో 18 కిలోల గంజాయిని గోనె సంచిల్లో గుర్తించామన్నారు. దీంతో విజయవాడ ప్రాంతానికి చెందిన ఎం.యువనాగ సాయి సుధర్, వాసి గోపితో పాటు 17 సంవత్సరాల మైనర్ బాలుడిని పట్టుకున్నామన్నారు. వీరు అల్లురి జిల్లా పాడేరు ఏజేన్సీకి చెందిన గుంత నర్సు, నారీస్ పాంగి వద్ద నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు తరలిస్తున్నట్టు విచారణలో తెలిపారన్నారు. వారి వద్ద రెండు స్కూటీలు, గంజాయిని, మూడు సెల్ఫోన్లను స్వాధినం చేసుకుని కోర్టుకు తరలించామని తెలిపారు. గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ బుచ్చెయ్యపేట : గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకుని కోర్టుకి అప్పగించినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన బుచ్చెయ్యపేట వద్ద 194 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న చీడికాడ మండలం బైలపూడికి చెందిన గొల్లవిల్లి గోపిని వడ్డాదిలో వాహనాల తనిఖీల్లో భాగంగా గురువారం పట్టుకున్నామన్నారు. గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిగా గుర్తించి సీఐ కోటేశ్వరరావు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారన్నారు. పట్టుబడిన గంజాయి నిందితులతో ఎస్ఐ సతీష్ బుచ్చెయ్యపేటలో పట్టుకున్న వ్యక్తితో సీఐ, ఎస్ఐ -
మ్యూజియం పనులు మరింత వేగవంతం
చింతపల్లి: మండలంలోని తాజంగిలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సుధాభార్గవి ఆదేశించారు. గురువారం ఆమె మ్యూజియం నిర్మాణ ప్రాంతాలను సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్ష మ్యూజియంలోని బ్లాక్–1, బ్లాక్–2లలో జరుగుతున్న నిర్మాణ పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి ఆమె సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల ప్రస్తుత స్థితిగతులను, నిర్మాణ నాణ్యతను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఈ సందర్భంగా సుధాభార్గవి మాట్లాడుతూ.. మ్యూజియం నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన గిరిజన వీరుల చరిత్రను భావితరాలకు అందించడమే ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగం గిరిజన వీరుల పోరాట పటిమను నేటి తరానికి వివరించేలా అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ, ఆడియో విజువల్స్ ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసే ప్రతి శిల్పం, ప్రతి చిత్రం వారి పోరాట స్ఫూర్తిని రగిలించేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ, చీఫ్ ఇంజనీర్ వసంత, టీఆర్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రాణి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, ఈఈ డేవిడ్రాజ్, డీఈ రఘునాథ్నాయుడు, జేఈ యాదకిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలి
కశింకోట: జిల్లాలోని ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని విశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు బి. విజయకుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక సెయింట్ జాన్స్ స్కూలులో జిల్లా స్థాయిలో మండల విద్యా శాఖ అధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, హైస్కూలు ప్లస్ ప్రధానోపాధ్యాయులకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంపొందిస్తూ బలోపేతం చేయాలన్నారు. జిల్లా విద్యా పరంగా అన్ని అంశాల్లో ముందుండాలన్నారు. పదో తరగతి పునశ్చరణ తరగతులు నిర్వహించి మార్చిలో ఉత్తీర్ణులు కాని వారందరిని అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ కావడానికి ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు, రాష్ట్ర పరిశీలకుడు నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
మాకవరపాలెం: మండలంలోని వజ్రగడ శివారు తమ్మయ్యపాలెంలో గురువారం మధ్యాహ్నం బొడ్డు అప్పలనాయుడు(50) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరి కొందరితో మంగళవారం హనుమాన్ జయంతి రోజున నిర్వహించిన అన్నసమారాధనలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పలనాయుడుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు తమ్మయ్యపాలెం వెళ్లగా, అతడు భయంతో మనస్తాపానికి గురై తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. దీనిపై మృతుడు భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
లారీ బోల్తా.. తప్పిన ప్రాణాపాయం
కొయ్యూరు: జాతీయ రహదారి 516–ఈ విస్తరణ పనుల్లో భాగంగా సరకు చేరవేస్తున్న ఒక లారీ గురువారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. రంపుల ప్రాంతానికి సరకు అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా, నడింపాలెం మలుపు వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనా స్థలంలో ఉన్న వారు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ మలుపు వద్ద లారీని వేగంగా పోనివ్వడంతో అదుపు తప్పి ఎడమవైపునకు పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులందరూ భయాందోళనతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ ఎడమవైపునకు బోల్తా పడటంతో డ్రైవర్ సీటు వైపు ఖాళీ ఉండటంతో డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
మేలురకం కాఫీ మొక్కలు సరఫరా చేయాలి
గూడెంకొత్తవీధి: రైతులకు అధిక దిగుబడినిచ్చే మేలురకపు కాఫీ మొక్కలను సరఫరా చేయాలని కోరుతూ అరకులో గురువారం కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్, సీఈవో ఎం. కూర్మారావులకు కాఫీ రైతుల సంఘం వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో కాఫీ రైతుల సంఘం అధ్యక్షులు అడపా విష్ణుమూర్తి, అభ్యుదయ కాఫీ రైతు అడపా లక్ష్మి పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, అధునాతన పద్ధతుల్లో సాగు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అందించాలని కోరినట్టు వారు తెలిపారు. అలాగే ఆధునిక కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రైయింగ్ యార్డులు, నిల్వ గోదాములు, విలువ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలను మంజూరు చేయాలని విన్నవించామని వారు పేర్కొన్నారు. మార్కెటింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైతు ఉత్పత్తి గ్రూపులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరారు. కాఫీ ధరల్లో స్థిరత్వం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సేంద్రియ సాగును ప్రోత్సహించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్స వేడుకలను జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వీటిపై కాఫీ బోర్డు చైర్మన్, సీఈవో సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని అడపా విష్ణుమూర్తి తెలిపారు. కాఫీ బోర్డుకు గిరి రైతుల విన్నపం -
భూ సమస్యలపై ఆదివాసీల రిలే దీక్షలు
రోలుగుంట: మండలంలోని కె.అడ్డసరం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే దీక్షలు గురువారం చేపట్టారు. గతంలో కె.అడ్డసరం రెవెన్యూ గ్రామంలో ఖాతా నెంబర్ 559లో భూములను ఫోర్జరీ వారసత్వ ధ్రువపత్రంతో రాయివరపు చంద్రశేఖరరావు పేరున మార్చారు. తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఆన్లైన్లో నమోదు కావడంతో సాగుదారులైన గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టి తహసీల్దార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చంద్రశేఖరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. భూముల హక్కు పత్రాలపై తహసీల్దార్ డిజిటల్ సంతకం రద్దు చేసే వరకూ రిలే దీక్షలు కొనసాగుతాయని కె.అడ్డసరం ఆదివాసీలు, కొంతలం ఓబీసీ రైతులు తేల్చిచెప్పారు. జాయింటు కలెక్టర్ కోర్టులో ఆర్వోఆర్ అపీల్పై ఆర్డరు వచ్చేంత వరకూ తమ జోలికి రావ్వొద్దని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం జిల్లా కార్యదర్శి మూసూరి రాజు, కేదారి దేవి, వెంగళరావు సత్య, తుర్రి నూకరాజు, అర్జున్ పాల్గొన్నారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
దేవరాపల్లి: అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి ఓ కుమార్తె తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంది. పలువుర్ని కంటతడి పెట్టించిన ఈ ఘటన మండలంలోని పెదనందిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పెదనందిపల్లి గ్రామానికి చెందిన వేచలపు గోవింద అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆర్టీసీ కండక్టర్గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన గోవిందకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలకు వివాహం అయింది. కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె అంజలి తల కొరివి పెట్టడానికి ముందుకు వచ్చింది. కుండ పట్టుకుని తండ్రి అంతిమ యాత్రలో పాల్గొని, దహన సంస్కారాలు పూర్తిచేసింది. అంజలి విశాఖపట్నంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తోంది. తండ్రికి కుతూరు తల కొరివి పెట్టిన దృశ్యాని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో పెదనందిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
డివైడర్ను ఢీకొన్న కారు... ఒకరు మృతి
పాయకరావుపేట : జాతీయ రహదారి పై విశాఖపట్నం వైపునకు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్ఐ ఆలీ తెలిపారు. నామవరం గ్రామం వద్ద మంగళవారం రాత్రి కారు ముందు ప్రయాణిస్తున్న మోటార్ బైక్ హఠత్తుగా బ్రేక్ వేయడం వల్ల అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇద్దరు వ్యాపారం నిమిత్తం శ్రీకాకుళం వెళ్తున్నారు. కారు డివైడర్ను ఢీ కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రాధా ఆలీసామను తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. కారులో వున్న మరో వ్యక్తి సోమ మహామ్మద్ అనే వ్యక్తి గాయపడడంతో తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి గుజరాత్కు చెందిన వ్యక్తి అని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వేసవి శిక్షణ విజ్ఞానదాయకం
మాట్లాడుతున్న ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ జోగారావు మునగపాక : వేసవి సెలవులను వృఽథా చేయకుండా విజ్ఞానాన్ని అందించే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ మళ్ల జోగారావు కోరారు. మునగపాక గ్రామీణ యువజన మందిరం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. లక్ష్యం కోసం చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. కర్ర సాము, చెస్, క్యారమ్, గీత శ్లోకాలపై శిక్షణ పెంచుకోవాలన్నారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మందిర సభ్యులు ఆడారి లక్ష్మణరావు, ఆడారి సూర్య చంద్రరావు, వెలగా ప్రవీణ పాల్గొన్నారు. -
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకన్న
దేవరాపల్లి: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దేవరాపల్లికి చెందిన డి.వెంకన్న ఎన్నికయ్యారు. అమలాపురంలో ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు వెంకన్న బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, వృత్తిదార్లు, సన్న,చిన్నకారు రైతులు పాల్గొన్న ఈ మహాసభలో పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు తీర్మానాలు చేశామన్నారు. దళితులపై దాడులు, కుల వివక్షను అరికట్టాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినట్టు చెప్పారు. దళితులు, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని వెంకన్న విమర్శించారు. క్రైస్తవ మతం తీసుకున్న దళితులను ఎస్సీలు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని వారి సర్టిఫికెట్లను రద్దు చేయించాలని చూస్తుండటాన్ని మహాసభలో తీవ్రంగా ఖండించినట్టు చెప్పారు.ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందాలి
విద్యార్థులకు క్రీడా సామాగ్రి కిట్లను పంపిణీ చేసిన కలెక్టర్ విజయ్ కృష్ణన్ తుమ్మపాల : విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సమ్మర్ క్యాంప్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి కలెక్టరేట్లో బుధవారం క్రీడా సామాగ్రి కిట్లను ఆమె విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ నెల 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్లను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పి.శైలజ, కోచ్ సిహెచ్ సూరి అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆగని మట్టి అక్రమ తరలింపు
మంగళవారం రాత్రి తరలించుకు వచ్చిన చెరువు మట్టి ఎస్.రాయవరం : ఇటుక బట్టీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసినా, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా తమ బట్టీలకు అక్రమ మట్టి రవాణా ఆపబోమని ఇటుక బట్టీల యజమానులు యధావిధిగా మంగళవారం రాత్రి వమ్మవరం గ్రామంలో బట్టీల వద్దకు మట్టిని తరలించారు. యలమంచిలి కృష్ణాపురం చెరువులో అనుమతులు పొందినట్టు జేసీబీలను ఉపయోగించి దర్జాగా వమ్మవరానికి మట్టి తరలించుకు రావడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షించినా మట్టి తరలింపు ఆపకపోవడం పట్ల ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. అనకాపల్లి జిల్లా పోలీస్, అధికారులు విజిలెన్స్ ఉన్నతాధికారులకు బుధవారం మరో మారు ఫిర్యాదు చేశారు. -
● కంచరపాలెం, ఎయిర్పోర్టు స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలు ● ఉదయం 7.30 నుంచి 11.30 మధ్యే చోటు చేసుకున్న వైనం
గోపాలపట్నం:విశాఖనగరంలో ఒకేరోజు గంటల వ్యవధిలో నాలుగు చోట్ల జరిగిన చైన్స్నాచింగ్లతో ప్రజలు హడలెత్తిపోయారు. కంచరపాలెం,ఎయిర్పో ర్టు పోలీ స్ స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7.30 నుంచి 11.30 మధ్య నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. మహిళల మెడల్లో ఉన్న చైన్లను తెంచు కుపోయారు. బాధితులు,పోలీసులు తెలిపిన వివరాలు.. మొదటి చోరీ.. ఉదయం 7.30 సమయంలో మర్రిపాలెం జ్యోతీనగర్ వద్ద పంచముఖి లక్ష్మి(62) కాయగూరలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. 7.45 గంటలకు తిరుగుముఖం పడుతూ ఇంటి సందులో మలుపుతిరుగుతున్న సమయంలో కాపుకాసి ఉన్న దుండగుడు వెనక నుంచి వచ్చి మెడలోని గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన లక్ష్మి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం తెంచుకుపోయాడు. లాకెట్టు, చైన్లో సగభాగం తన చేతిలో ఉండిపోయింది. సుమారు రెండున్నర తులాల వరకు దుండగుడు లాక్కెళ్లిపోయినట్లు బాధితురాలు వాపోతోంది. రెండో చోరీ : పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద ఉదయం 8.05 గంటల సమయంలో రాజీవ్నగర్కు చెందిన నిడమల రత్నకుమారి విధులకు హాజరయ్యేందుకు బస్టాప్ సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆటో కోసం నిరీక్షిస్తోంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెల తాడు, నల్లపూసల దండ తెంచుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె అప్రమత్తం కావడంతో చేతిలో పుస్తెలు, నల్లపూసల దండ కొంతభాగం ఉండిపోయింది. మిగిలిన సుమారు రెండున్నర తులాలు తెంచుకుపోయాడు. మూడో చోరీ : ఉదయం 8.15 గంటల సమయంలో కంచరపాలెం జైభారత్నగర్ వద్ద ఎస్ కోట దరి జామి వెళ్లేందుకు వర్రి అరుణ బస్టాప్కు నడుస్తూ వస్తోంది. కాపుకాసిన దుండగుడు రెండు తులాల గొలుసు, రెండు తులాల నల్లపూసల దండ లాక్కుపోయాడు. నాలుగో చోరీ : విమాన్నగర్ వద్ద అదే ప్రాంతానికి చెందిన ఎం.అచ్చయ్యమ్మ(56) ఉదయం 11.30కు నగరంలో జరిగే ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు బస్టాప్ వద్ద నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమెను సమీపించాడు. బైక్పై మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న 5 తులాల నల్లపూసల దండ, చైన్ తెంచుకుని బైక్పై వెళ్లిపోయారు. గమనించిన ఓ వ్యక్తి తన బైక్తో వెంబడించే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తిని ఢీకొట్టేందుకు యత్నించి తప్పించుకుపోయారు. కరాసా వద్ద బైక్ చోరీ : ఆ సమయంలోనే కరాసాకు చెందిన ఓ యువకుడి ద్విచ్రవాహనం చోరీకి గురైంది. కరాసా వద్ద నైట్ ఫుడ్ స్టాల్స్ ఉన్న చోట 10.30 సమయంలో పార్కింగ్ చేసిన తన బైక్ను ఎవరో దొంగిలించడంతో బాధితుడు వెంటనే వాట్సాప్ ఫిర్యాదుతో పాటు, స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు కూడా చేశాడు. తన బైక్తోనే ఈ చోరీలకు పాల్పడ్డారేమోనని బాధితు డు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఉదయం 7.30 నుంచి దొంగతనాలు జరుగుతుండటంతో ఈ వాహనం వాడి ఉండరని పోలీసులు చెప్తున్నారు. చైన్ స్నాచింగ్లపై బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు. ‘చైన్’చోరీలతో బెంబేలు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు -
గోల్డ్ హంటర్స్!
● ఉదయం 7.45 గంటలు.. జ్యోతి నగర్.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లి మొదటి సవాల్ విసిరారు. ● ఉదయం 8.05 గంటలు.. పంజాబ్ హోటల్ జంక్షన్లో మహిళ మెడలోంచి చైన్ తెంచేసి పారిపోయి హడలెత్తించారు. ● ఉదయం 8.15 గంటలు కంచరపాలెం జయభారత్నగర్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళే లక్ష్యంగా చైన్ అపహరించిన దొంగలు రెప్పపాటులో మాయమయ్యారు. ● ఉదయం 11.30 గంటలు... విమాన్నగర్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారైపోయారు. నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు మార్చిలో 7 ఏప్రిల్లో 5 మే 13 వరకూ 4 సాక్షి, విశాఖపట్నం: మహానగరంలో ‘గోల్డ్’వేట మొదలైంది. గన్ పట్టుకున్న వేటగాడు అడవిలో పొంచి ఉన్నట్టు.. బైక్ ఎక్కిన దొంగలు.. జనం మధ్యే ‘స్నాచింగ్’పంజా విసిరారు. నాలుగు గంటల వ్యవధిలో 13 తులాల బంగారాన్ని కొట్టేశారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ వీధులు ఇప్పుడు ‘గోల్డ్ హంటర్స్’దూకుడుతో ఉలిక్కిపడుతున్నాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో, నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో హంటర్స్ చేసిన హడావుడి చూస్తుంటే.. పోలీసుల నిఘా వ్యవస్థకు గట్టి సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది. టైమ్ ఫిక్స్.. టార్గెట్ గోల్డ్.! బుధవారం ఉదయం నుంచి జరిగిన చైన్స్నాచింగ్ కేసుల్లో దొంగల రూట్ మ్యాప్ చూస్తే ఎవరికై నా ఆందోళన కలగాల్సిందే. వచ్చింది ద్విచక్ర వాహనంపై.. పోయింది సుమారు 13 తులాల పసిడి. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు. అయితే.. నాలుగు చోట్లా చేసింది ఒక్కరేనా.. లేదా అంతర్రాష్ట్ర ముఠా పనా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ‘నిఘా’నేత్రాలు నిద్రపోతున్నాయా.? నగర రక్షణ కోసం సిటీలో ఏర్పాటు చేసిన ‘మూడో కన్ను(సీసీ కెమెరాలు)’అనేక చోట్ల రెప్పవాల్చిన విషయం చైన్ స్నాచింగ్ ముఠా పసిగట్టినట్లుందనే వదంతులు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీగా ఉన్న విశాఖ నగరం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గోల్డ్ హంటర్స్ సిటీగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ సిటీ పోలీస్ అధికారిక గణాంకాల ప్రకారం... నగర వ్యాప్తంగా 13,485 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారిక రికార్డులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ డేటా, ఇటీవల పోలీస్ శాఖ నిర్వహించిన అంతర్గత ఆడిట్ నివేదికల ప్రకారం.. వీటిలో పోలీస్ శాఖవే కాకుండా ‘నేను సైతం’ప్రోగ్రామ్ కింద ప్రజలు, షాపుల యజమానులు పెట్టినవి కూడా ఉన్నాయి. వీటిలో ఎన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు సిగ్నల్ పంపుతున్నాయనే లైవ్ స్టేటస్ ద్వారా దాదాపు 40 శాతం అంటే 5,394 సీసీ కెమెరాలు మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని గుర్తించారు. ఇదే.. దొంగలకు అనువుగా మారిందనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసుల యాక్షన్ ప్లాన్ షురూ..! వరుస ఘటనలతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. గతంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే నిందితులు కావడంతో.. బుధవారం జరిగిన చోరీలు కూడా వారి పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు. సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, పనిచేస్తున్న కొన్ని కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల వేటలో నిమగ్నమయ్యారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు పెరిగినప్పటి నుంచి చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా జరుగుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. వీలైనంత త్వరగా గోల్డ్ హంటర్స్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. -
నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
మహారాణిపేట(విశాఖ) : వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలుం ఇలా శుభకార్యాలతో కళకళలాడే వేళకు తాత్కాలికంగా విరామం పడింది. గురువారం నుంచి వరుసగా 36 రోజుల పాటు శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి బాజాలు మూగబోనున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడింది. వేద పండితుల ప్రకారం ఈ కాలాన్ని ‘మూఢమి’గా పరిగణిస్తారు. అందుకే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి ప్రధాన శుభకార్యాలను చాలామంది వాయిదా వేస్తున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ పెళ్లి సందడి జూన్ 19న నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో మళ్లీ శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లోనూ పలు శుభముహూర్తాలు లభించనున్నాయి. గత డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా వివాహాలు జరగడంతో పట్టణాలు, గ్రామాలు పెళ్లి వేడుకలతో కళకళలాడాయి. ఇప్పుడు మరోసారి జూన్ చివరి నుంచి అదే సందడి కనిపించనుంది. పెళ్లి రంగానికి తాత్కాలిక మందగమనం శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలకు అనుబంధంగా ఉన్న వందలాది వృత్తులు తాత్కాలికంగా మందగించనున్నాయి. కళ్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్లు, డెకరేషన్, పూల వ్యాపారులు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, హోటళ్లు, లాడ్జిలు ఇలా అనేక రంగాలపై ప్రభావం పడనుంది. అయితే జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాల సీజన్ ప్రారంభం కావడంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకోనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 19 వరకు ఆగాల్సిందే.. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు ప్రధాన శుభకార్యాలకు విరామం ఉంటుంది. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు -
‘పాలిటెక్నిక్’ దరఖాస్తుల విక్రయం ప్రారంభం
దరఖాస్తుల విక్రయాన్ని ప్రారంభిస్తున్న ఎండీ ప్రసాద్ కశింకోట: స్థానిక ఆర్ఈసీఎస్లోని రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ వినియోగదారుల కోటా కింద ప్రవేశానికి దరఖాస్తుల విక్రయం బుధవారం ప్రారంభమైంది. దరఖాస్తుల విక్రయాన్ని ఎమ్డి జి.ప్రసాద్ ప్రారంభించారు. ఈ నెల 30 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కళాశాలలో దరఖాస్తులను పొందవచ్చు. ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ కె. శివ, విభాగాధిపతులు గణేష్, రమణ కుమార్, ఆఫీస్ సూపరింటిండెంట్ కె. శివరాం తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గృహోపకరణాలు దగ్ధం
చోడవరం: పట్టణ శివారు అన్నవరం ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ప్రధాన విద్యుత్ వైర్లపై చెట్లకొమ్మలు పడి షార్ట్ సర్క్యూట్ జరగడంతో పలు ఇళ్లలో గృహోపకరణాలు దగ్ధమై సుమారు రూ.10 లక్షల నష్టం జరిగింది. 40 ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్లు, ఇతర గృహోపకరణాలు కాలిపోవడంతో పాటు, ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం విద్యుత్ శాఖ ఏఈ రాజుతోపాటు సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఏఈని చుట్టుముట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన విద్యుత్లైన్లపై పలుచోట్ల చెట్ల కొమ్మలు తాకుతున్నాయని, దీనివల్ల సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా వైర్లపై కొమ్మలు పడి షార్ట్సర్క్యూట్తో తమ ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్లు, ఇతర గృహోపకరణాలు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి చూసి పోవడమే తప్ప ఏ పనీ సక్రమంగా చేయడంలేదని ఆరోపించారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఏఈ నిర్లక్ష్యం వల్లే... అన్నవరం సబ్స్టేషన్ పరిధిలో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమై తరుచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్శాఖ ఏఈ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా గతంలో అనేక ఫిర్యాదులు కూడా వెళ్లాయి. మండల సమావేశాల్లో సైతం ఎంపీటీసీలు, వార్డుమెంబర్లు ఇక్కడ ఏఈపై ధ్వజమెత్తినా మార్పురాకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్యలుతీసుకుని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని చోడవరం పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
మేలైన యాజమాన్యంతో అధిక దిగుబడి
పాడేరు రూరల్: పసుపు పంటలో అధిక దిగుబడి సాధించాలంటే రైతులకు సాగు పద్ధతులపై పూర్తి అవగాహన ఉండాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని వంట్లమామిడి పంచాయతీ చోడిపల్లి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పసుపు విత్తనాలు నాటే ముందే నాణ్యతను పరిశీలించుకోవాలని సూచించారు. మొక్కలకు వచ్చే వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువుల వినియోగానికే రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. నూతన సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని, కొత్త రకం వంగడాలను సాగు చేయాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డ్ ఫీల్డ్ అధికారి కళ్యాణి, ఉద్యాన అధికారి శరణ్య మాధురి, రైతులు పాల్గొన్నారు. పసుపు రైతులకు ఏరువాక శాస్త్రవేత్త ప్రదీప్ కుమార్ సూచన -
పరిశోధనలే ఊపిరిగా..
మన్యం కాఫీకి ప్రాణం పోసి, ఐదు దశాబ్దాలుగా రైతులకు దిశానిర్దేశం చేస్తున్న ఆర్వీనగర్ కాఫీ పరిశోధనా కేంద్రం నేడు స్వర్ణోత్సవ మైలురాయిని చేరుకుంది. ఒక చిన్న మొక్కతో ప్రారంభమై వేలాది ఎకరాల తోటలకు విస్తరించిన ఈ కేంద్రం, మన్యం కాఫీ సాగు చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. స్వర్ణోత్సవ వేడుకల వేళ.. సరికొత్త సాగు విజ్ఞానంతో మన్యం కాఫీ కీర్తిని దశదిశలా చాటేందుకు ఈ పరిశోధనా కేంద్రం సిద్ధమైంది. గిరి రైతుకు తోడుగా..గూడెంకొత్తవీధి: ఒకప్పుడు కేవలం అడవి బిడ్డల జీవనాధారంగా మొదలైన కాఫీ సాగు, నేడు మన్యం ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపింది. అరకు కాఫీ బ్రాండ్ పేరు వింటేనే అంతర్జాతీయ మార్కెట్ పులకించిపోయే స్థాయికి చేరిందంటే దానికి కారణం దశాబ్దాల కష్టం.. శాసీ్త్రయ పరిశోధనలే. సరిగ్గా ఇదే తరుణంలో, మన్యం కాఫీ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానం యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం. 50 ఏళ్ల ప్రస్థానమిలా.. ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానాన్ని కేంద్ర కాఫీ బోర్డు ఉన్నతాధికారులు బుధవారం సందర్శించారు. బోర్డు సీఈవో ఎం. కూర్మారావు, చైర్మన్ డాక్టర్ దినేష్ కుమార్తో కలిసి క్షేత్రస్థాయిలో సాగువుతున్న మేలు రకపు వంగడాలను పరిశీలించారు. ఆర్వీనగర్ కేంద్రం ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా (గోల్డెన్ జూబ్లీ), ఇక్కడ జరిగిన పరిశోధనలు రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాయో ఇన్చార్జి సునీల్బాబు నుంచి తెలుసుకున్నారు. నేడు ప్రత్యేక సదస్సు ఈ స్వర్ణోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురువారం అరకులోయలో ఒక భారీ సదస్సును నిర్వహిస్తున్నారు. దీని గురించి సీఈవో కూర్మారావు మాట్లాడుతూ..ఈ సదస్సు కేవలం వేడుక మాత్రమే కాదు, భవిష్యత్తు కాఫీ సాగుకు ఒక దిశానిర్దేశం. కాఫీ సాగులో అద్భుత ఫలితాలు సాధించిన రైతులు, శాస్త్రవేత్తలు,అధికారులను ఒకే వేదికపైకి తెస్తున్నాం. వారి అనుభవాలు, సూచనల ఆధారంగా రాబోయే రోజుల్లో కాఫీ దిగుబడిని, నాణ్యతను మరింత పెంచేలా కార్యాచరణ సిద్ధం చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. గిరిజన జీవితాల్లో కాఫీ విప్లవం మన్యంలో కాఫీ కేవలం ఒక పంట కాదు, అదొక జీవనశైలి. గూడెంకొత్తవీధి, చింతపల్లి, అరకు ప్రాంతాల్లోని వేలాది గిరిజన కుటుంబాలు నేడు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయంటే దానికి కాఫీ సాగే ప్రధాన కారణం. అరకు కాఫీలో ఉండే ప్రత్యేకమైన రుచి, సువాసన అంతర్జాతీయ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఆర్వీనగర్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన మేలురకపు మొక్కలు, తెగుళ్లను తట్టుకునే శక్తి గల వంగడాలు రైతులకు వరంగా మారాయి. భవిష్యత్తులో కాఫీ సాగును మరిన్ని గ్రామాలకు విస్తరించడమే లక్ష్యంగా బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. వేడుకల ఏర్పాట్లలో కాఫీ బోర్డు ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ స్వామి, ఆఫీస్ ఇన్చార్జి సునీల్ బాబు, ఏడీ బొంజు బాబు, హెచ్వో అరుణకుమారి, జేఎల్వో నాగేశ్వరరావు నాయక్ నిమగ్నమయ్యారు.వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అరకులోయ టౌన్: స్థానిక పున్నమి హరిత వ్యాలీ రిసార్ట్స్లోని గోస్టి సమావేశ మందిరంలో గురువారం కేంద్ర కాఫీ బోర్డు ఆధ్వర్యంలో ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్టు కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ హెచ్ఆర్ మురళీధర్, అరకులోయ జేఎల్వో వీవీకేఎం లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వేడుకలకు కలెక్టర్ నిశాంతి , ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జీసీసీ,కాఫీ బోర్డు ఉన్నతాధికారులతో పాటు కాఫీ రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ఆర్వీ నగర్ కాఫీ పరిశోధనా కేంద్రం విశేష కృషి ఆధునిక వంగడాల సాగులో కీలకపాత్ర గిరి రైతుల ఆర్థిక స్థితిగతుల మెరుగే లక్ష్యంగా సేవలు వేలాది కుటుంబాలకు జీవనోపాధి నేడు అరకులోయలో స్వర్ణోత్సవ వేడుకలు -
ఇంటర్ సీబీఎస్ఈ ఫలితాల్లో తన్విత ప్రతిభ
● 90.2 శాతం మార్కుల సాధన చింతపల్లి: స్థానిక ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ (సీబీఎస్ఈ – బైపీసీ) చదువుతున్న పాంగి తన్విత అద్భుత ప్రతిభ కనబరిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆమె 500 మార్కులకు గాను 451 (90.2శాతం) మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన పాంగి సురేష్ కుమార్ దంపతుల కుమార్తె తన్విత సాధించిన ఈ విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన్వితతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇదే పాఠశాలకు చెందిన లక్ష్మీ దుర్గా ప్రసన్న 450 మార్కులతో ద్వితీయ స్థానం, గౌరీ శంకర్ 447 మార్కులతో తృతీయ స్థానం, శెట్టి రాహిత్య హ్యుమానిటీస్ విభాగంలో 435 మార్కులు సాధించారు. తన్విత సాధించిన విజయంతో ఆమె కుటుంబంలో పండగ వాతా వరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. గిరిజన ప్రాంత విద్యార్థులకు తన్విత విజయం ఎంతో స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. -
అక్రమ అరెస్టులు, వేధింపులు ఆపాలి
జి.మాడుగుల: వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు సిటీ అధ్యక్షుడు బాలుపై జరుగుతున్న అక్రమ అరెస్టులు, పోలీసు వేధింపులను నిరసిస్తూ బుధవారం జి.మాడుగులలో మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, పోలీసు వేధింపులతో ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు త్రీటౌన్ పోలీసులు బాలును నిరంతరం వేధిస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు ఎస్.మహేష్, బి.రవి, జి.శ్రీను పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ యువజన విభాగం డిమాండ్ -
బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా– ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం ఒడిశాలోని ఒనకడిల్లీ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాలు 2025– 2026 నీటి సంవత్సరంలో బలిమెల జలాశయం నుంచి ఎంతెంత వాడుకున్నారో లెక్కించారు. ఈ నీటి సంవత్సరంలో ఏప్రిల్ 2026 నాటికి ఒడిశా 77.3178 టీఎంసీలు, ఆంధ్రా తన వాటాగా ఏప్రిల్ 2026 నాటికి 57.7851 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు గుర్తించారు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఒడిశా ఆంధ్రా కంటే 14.6480 టీఎంసీల నీటిని అధికంగా వాడుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బలిమెలలో 37.27 టీఎంసీలు, జోలాపుట్టులో 6,6312 టీఎంసీలు నిల్వలు ఉన్నాయని, ఈ నెలాఖరు నాటికి బలిమెలకు నదీ పరివాహక ప్రాంతం నుంచి ఒక టీఎంసీ నీటి నిల్వలు చేకూరుతాయని వెల్లడించారు. జోలాపుట్టులో 0.90 టీఎంసీల నీటి నిల్వలు వచ్చి చేరుతాయని, కలిపి బలిమెల, జోలాపుట్టులో మొత్తంగా 45.8012 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు లెక్కలు కట్టారు. ఇందులో ఏపీ వాటాగా 32.66695 టీఎంసీలు, ఒడిశా వాటాగా 13.13425 టీఎంసీలు పంపకాలు జరిపారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్, ఇరిగేషన్ అవసరాల నిమిత్తంగా ఆంధ్రాకు ఆరు వేల క్యూసెక్కులు, ఒడిశాకు 3100 క్యూసెక్కుల నీటిని వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఒడిశా అధికారులు, సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్, ఈఈ టి.అప్పలనాయుడు పాల్గొన్నారు. -
నాణ్యమైన కాఫీ దిగుబడులకు పూర్తి సహకారం
చింతపల్లి: మన్యంలో నాణ్యమైన కాఫీ దిగుబడులు సాధించడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర కాఫీ బోర్డు పూర్తి సహకారం అందిస్తుందని బోర్డు సీఈఓ ఎం. కూర్మారావు అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలో కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్తో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా పెంటపాడు గ్రామంలోని మాతోట రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహిస్తున్న కాఫీ పల్పింగ్ యూనిట్ను అధికారులు పరిశీలించారు. గంతన్నదొర రైతు ఉత్పత్తిదారుల సంఘం కేంద్ర కాఫీ బోర్డు సహకారంతో నిర్మించిన సోలార్ టన్నల్ డ్రయర్ను వారు ప్రారంభించారు. గంతన్నదొర ఎఫ్పీవోకు సోలార్ టన్నల్ ఏర్పాటు కోసం కాఫీ బోర్డు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించిందని సీఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతోట, గంతన్నదొర రైతు సంఘాల పరిధిలోని గిరిజన రైతులు పండిస్తున్న కాఫీని శాసీ్త్రయంగా ప్రాసెస్ చేయడం ద్వారా నాణ్యమైన దిగుబడి వస్తుందని, దీనివల్ల మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చేపడుతున్న అధునాతన ప్రాసెసింగ్ పద్ధతులను సామాన్య రైతులందరూ అనుసరించాలని ఆయన కోరారు. అనంతరం ఐటీడీఏ, మాక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ను పరిశీలించి, రైతులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సెంథిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ శివకుమార్, పాడేరు హెచ్ఆర్ మురళీధర్, ఆర్సీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సునీల్ బాబు, జేఎల్ఓ రవికుమార్, కాఫీ ఏడీ బొంజుబాబు, గిరిజన వికాస సంస్థ సీఈఓ ఎన్. సత్యనారాయణ, మాతోట సీఈఓ చిన్నారావు పాల్గొన్నారు. కాఫీ బోర్డు సీఈవో కూర్మారావు -
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
● కలెక్టర్ నిశాంతి ● మోదమ్మ జాతర నిర్వహణపై సమీక్ష పాడేరు : పాడేరు మోదకొండమ్మ జాతర ఉత్సవాలను ఈనెల 17,18,19 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ టి. నిషాంతి ఆదేశించారు. జాతర ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అత్యంత పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. పారిశుధ్యం, తాగునీటి సమస్య తలెత్తకుండా నిత్యం తాగునీరు సరఫరా చేయాలని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాయిలెట్లతో పాటు మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తేవాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వంద ప్రత్యేక బస్సు సర్వీసులను 24/7 పాటు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జాతర మూడు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిభిరాలు నిర్వహించాలని, పూర్తి స్థాయిలో మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని ఆశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ పథకాల స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అడవికి నిప్పుతో జీవకోటికి ముప్పు
● ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ ముంచంగిపుట్టు: అడవులకు నిప్పు పెట్టడం వల్ల విలువైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ముంచంగిపుట్టు ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని భూసిపుట్టు పంచాయతీ కేంద్రం, సరియాపల్లి గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ’అడవిలో నిప్పు.. మానవాళి మనుగడకే ముప్పు’ అనే అవగాహన కార్యక్రమం, ర్యాలీ చేపట్టారు. అనంతరం రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. వేసవిలో ఎండుటాకులు, ఎండిన చెట్ల కారణంగా చిన్న నిప్పు రవ్వ పడినా అది దావానలంలా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. దీనివల్ల వేలాది ఎకరాల్లోని వృక్షసంపద బూడిదవ్వడమే కాకుండా, అడవిలోని జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతాయన్నారు. మంటలు, పొగ వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. అడవులకు నిప్పు పెట్టడం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవులను కాపాడుకోవడం ద్వారానే వన్యప్రాణులను, పర్యావరణాన్ని రక్షించుకోగలమని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు కార్తీక్, వెంకటరాజు, శ్రీను పాల్గొన్నారు. -
జన సమీకరణ తుస్సు..
● జీసీసీ చైర్మన్ శ్రవణ్కుమార్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్ ● వెలవెలబోయిన పర్యటన ● బెడిసికొట్టిన పచ్చనేతల ప్రయత్నాలు పాడేరు: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాడేరు పర్యటన ఆశించిన స్థాయిలో సాగలేదు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్ వివాహ వేడుకకు బుధవారం హాజరైన మంత్రికి స్వాగతం పలికేందుకు జనం కరువయ్యారు. మంత్రి మెప్పు పొందేందుకు స్థానిక టీడీపీ నేతలు చేసిన జనసమీకరణ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బస్సులు ఉన్నా.. జనం లేరు! పట్టణ శివారులోని తుమ్మరమెట్ట వద్ద జరిగిన ఈ వివాహ వేడుకకు లోకేశ్ వస్తున్నారని తెలియడంతో, ఎలాగైనా భారీ జనసమీకరణ చూపాలని పచ్చనేతలు భావించారు. హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు జనం లేకపోతే అబాసుపాలవుతామని భయపడి, మైదాన ప్రాంతాలతో పాటు పాడేరు డిపో నుంచి ఏకంగా 64 ఆర్టీసీ బస్సులను సమకూర్చుకున్నారు. సాధారణంగా వివాహ వేడుకలకు అభిమానంతో జనం రావాలి.. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. పాడేరు, హుకుంపేట మండలాల్లో తిప్పిన ఈ బస్సుల్లో జనం రాక సీట్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. లోకేష్ అసంతృప్తి చెందుతారనే భయంతో అక్కడక్కడ ఉన్న కొద్దిమందిని హెలీప్యాడ్ వద్ద అటు ఇటుగా నిలబెట్టి హడావుడి చేశారు. మంత్రి పర్యటన కోసం బస్సుల్లో వచ్చిన కొద్దిమందికి, వివాహానికి వచ్చిన అతిథులకు సరైన భోజన సదుపాయాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. దీంతో అసంతృప్తితో వెనుదిరిగారు. మరోవైపు, వర్తనాపల్లి గ్రామంలో కొంతమంది యువకులు మంత్రి లోకేష్ను కలిసి జీవో నంబరు3ను పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు. స్తంభించిన ట్రాఫిక్.. లోకేష్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించినప్పటికీ, ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేశారు. వాహనాల రద్దీ పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అట్టహాసంగా ప్రచారం చేసుకున్న లోకేష్ పర్యటన, జన సమీకరణ వైఫల్యంతో చప్పగా ముగిసింది. -
అందుబాటులో జనుము విత్తనాలు
అనకాపల్లి: చెరకు, కూరగాయ పంటలకు అవసరం మేరకు నీటి సదుపాయం కల్పించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి ఏడీఆర్ టి.శ్రీలత తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు, సలహాలు అందించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పంటలను బెట్ట నుంచి కాపాడటానికి పంట వ్యర్థాలతో మల్పింగ్ చేయాలి. ఖరీఫ్కు ముందు పచ్చిరొట్ట పైరు వేసుకోవాలి. వర్షాలు పడగానే విత్తుకోవడానికి వీలుగా విత్తనాలను ముందుగా సేకరించుకోవాలి. పరిశోధన స్థానంలో జనము విత్తనాలు ఎస్యూఐఎన్.037, జేఆర్జే 610 రకాలు కిలో రూ.130 చొప్పున అందుబాటులో ఉన్నాయి. విత్తనాల కోసం రైతులు సంప్రదించాలని సూచించారు. చెరకు మొక్క, కార్శి తోటలలో వరుసల మధ్య అంతర కృషి చేపట్టాలి. చెరకులో కొరడా తెగులు ఆశిస్తే ప్రొపికొనజోల్ 1 మి.లీ లేదా అజోక్సిస్ట్రోబిన్, టెబుకోనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పీక పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే క్లొరాంట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్ పంటగా నువ్వులు వేసుకోవడానికి నేలను తయారు చేసుకుని అధిక దిగుబడినిచ్చే వైఎల్ఎం. 66, 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కూరగాయల్లో బొగ్గు కుళ్లు తెగులు ఆశించవచ్చని, నివారణకు లీటరుకు 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ను మొక్కమొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. మామిడిలో పండు ఈగ నివారణకు 2 మి.లీ మిథైల్ యూజినాల్, 3 గ్రా, కార్బోప్యూరాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్ సీపాలో పోసి తోటలో అక్కడక్కడా చెట్ల కొమ్మలకు వేలాడ దీయాలి. ఖాళీ పొలాల్లో వేసవిలోతు దుక్కులు దున్నుకోవాలని ఆమె చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కె.వి.రమణమూర్తి, వి.గౌరీ, ఆర్.సరిత, వి.చంద్రశేఖర్, ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ రవిబాబు దంపతులకు సత్కారం
సాక్షి,పాడేరు: పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు దంపతులను, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ నర్సింగరావు దంపతులు ఘనంగా సన్మానించారు.అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్,అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, కరణం ధర్మశ్రీ, వెంకట్రామయ్య, మాజీ జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, వడ్డాది జెడ్పీటీసీ దొండా రాంబాబు, చింతపల్లి ఎంపీపీ అనుషాదేవి తదితర నేతలకు భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. -
మహిళా భద్రతకు పాటుపడాలి
నర్సీపట్నం : మహిళా భద్రతపై మహిళా పోలీసు సిబ్బంది దృష్టిసారించాలని, మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు మహిళా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ, నర్సీపట్నం ఇన్ఛార్జీ డీఎప్పీ ఈ.శ్రీనివాసులు సూచించారు. స్థానిక ప్రవేటు కళ్యాణమండపంలో డివిజన్లోని మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను ఆరికట్టేందుకు కృషి చేయాలని, మహిళల రక్షణపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రచార రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ అవశ్యకతను మహిళలు, బాలికలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్, రూరల్ సీఐలు గపూర్, రేవతమ్మ, పాయకరావుపేట సీఐ శంకర్రావు, డివిజన్ పరిధిలో మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వందో రోజు కొనసాగిన దళిత రైతుల దీక్షలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్ల దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం వందవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎటువంటి పరిహారం ఇవ్వకుండా దళిత రైతులకు చెందిన డీ పట్టా భూములను లాక్కొనేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు.దళితులు దీక్షలు చేపట్టి వంద రోజులైనా కూటమి నేతలు పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు.నిరుపేదలైన దళితుల భూముల్ని లాక్కొంటున్న ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాలకు దోచిపెడుతోందని విమర్శించారు.పంచదార్ల రైతులకోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.అనంతరం దీక్ష శిబిరం వద్ద పలువురు దళిత సంఘాలు,విదసం నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐడీ బాబు,జి.దేముడు నాయుడు,చందక రామకృష్ణ,ధోనీ కాసియా,రేబాక రాము,ఎం.డి. రాజు,సూర్య,శివ,ఆర్ కృష్ణ,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
కన్నీట్ సుడులు
రెండేళ్ల కష్టం.. ఎన్నో ఆశలు.. ఒక వైద్య సీటు కోసం జీవితాన్నే పుస్తకాలకే అంకితం చేసిన లక్షలాది విద్యార్థుల కలలను నీట్ రద్దు నిర్ణయం ఒక్కసారిగా ఛిద్రం చేసింది.ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుండగా.. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేసింది.● నీట్ రద్దుతో విద్యార్థుల కన్నీటి పర్యంతం ● ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం ● రెండేళ్ల శ్రమ బుగ్గిపాలేనని ఆవేదన సాక్షి, విశాఖపట్నం/మద్దిలపాలెం : వైద్యుడై సమాజానికి సేవ చేయాలని, తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్తో రోగి నాడి పట్టుకోవాలని.. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. మే 3వ తేదీన పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు, వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి.. ’అమ్మా, నాన్నా.. నేను డాక్టర్ అవుతాను’ అన్న ధీమా. కానీ, ఆ సంతోషం చిటికెలో ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నీట్ యూజీ 2026 రద్దు నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల గుండెల్లో గునపమై దిగినట్టయింది. ప్రతిభావంతులు బలి రాజస్థాన్లో వెలుగు చూసిన ’పేపర్ లీక్’ ఉదంతం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పునాదులను కదిలించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం, పరీక్షను రద్దు చేయడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ, అక్రమాలకు పాల్పడిన కొందరు స్వార్థపరుల వల్ల, రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది సాధారణ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు. ఆగిపోయిన కల.. ఆవిరైన శ్రమ చిన్న చిన్న గదుల్లో బందీలై, పుస్తకాలే ప్రపంచంగా బతికిన విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. ‘రెండేళ్ల శ్రమ.. వేల గంటల సాధన.. అంతా ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్లీ అదే ఏకాగ్రతతో పుస్తకాలు పట్టగలమా? ఆ ఉత్సాహం మళ్లీ వస్తుందా?’ అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం. తమ పిల్లల చదువు కోసం రెక్కల కష్టం ధారబోసి, కోచింగ్ సెంటర్లకు రూ.లక్షలు కుమ్మరించిన వారు, ఇప్పుడు తమ బిడ్డల నిరాశను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుండగాం తల్లిదండ్రులు వారిని ఓదార్చలేని పరిస్థితి నెలకొంది. మా తప్పేంటి? నిజాయితీగా చదివి, కష్టపడి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ అదే ఒత్తిడిని భరించాల్సి వస్తోంది. ఒకరి అక్రమంం లక్షల మందికి శిక్షగా మారిందనే భావన విద్యార్థుల్లో కనిపిస్తోంది. ‘మళ్లీ చదవాలి.. మళ్లీ ఒత్తిడి భరించాలి.. మళ్లీ పరీక్ష హాల్లో కూర్చోవాలి’.. అనే ఆలోచన వారిని మానసికంగా అలసటకు గురిచేస్తోంది. ఎన్టీఏ భరోసా సరిపోతుందా? రీ–ఎగ్జామ్ కోసం కొత్తగా దరఖాస్తు చేయక్కర్లేదని, ఫీజు కట్టనవసరం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. కానీ, విద్యార్థులకు కావాల్సింది ఆర్థిక వెసులుబాటు కాదు, మానసిక స్థైర్యం. ఒకసారి రాసిన పరీక్షను, అది కూడా లీకేజీ మరకల మధ్య మళ్లీ రాయాల్సి రావడం అంటే, ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే. వ్యవస్థ మారేది ఎప్పుడు? ఒక పేపర్ లీక్.. ఒక రద్దు.. వేలాది మంది విద్యార్థుల కన్నీళ్లు. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ రద్దు నిర్ణయం వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందేమో కానీ, విద్యార్థుల మనసులకు తగిలిన గాయాన్ని మాత్రం అంత సులభంగా మాన్పలేదు. కొత్త షెడ్యూల్ రావచ్చు.. కొత్త హాల్ టికెట్లు జారీ అవ్వొచ్చు.. కానీ, పోగొట్టుకున్న సమయాన్ని, మానసిక ప్రశాంతతను మళ్లీ తెచ్చి ఇచ్చేది ఎవరు? దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి మే నెల 3న జరిగిన నీట్ పరీక్ష లీకేజీతో రద్దు అయినట్టు వార్తల్లో చూశాం. నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ సోషల్ మీడియాలో లీకై ందంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అర్ధమవుతుంది. అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఈ పేపర్ లీకేజీ వెనక ఎవరున్నా..వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. – గిరిజారాణి, నీట్ విద్యార్థిని తల్లి -
సుమారు రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
అనకాపల్లి : ఏజెన్సీ ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట, జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న 194 కేజీల గంజాయితో పాటు(వీటి విలువ సుమారుగా రూ.97లక్షలు) కారు, ముగ్గురు వ్యక్తులు, మూడు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి రవాణాపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ, గంజాయి స్మగ్లర్లు ప్రత్యేక మార్గాల్లో రవాణా చేయడం జరుగుతుందని, గత ఏడాది కంటే ఈ ఏడాది గంజాయి(డ్రైయి) రవాణా తగ్గినప్పటికీ హషీష్ అయిల్ పెరిగిందన్నారు. ఈనెల 11న జిల్లాలో బుచ్చియ్యపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఈగిల్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పర్యవేక్షణలో అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు బుచ్చియ్యపేట పోలీసులు బంగారుమెట్ట–అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. గంజాయితో వెళుతున్న కారుకు రూట్ మ్యాప్ ద్వారా వెళుతున్న సమయంలో బైక్ను నడుపుతున్న వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించగా, వెనుక కారులో 194 కిలోల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పటుబడ్డారని తెలిపారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గుమ్మాల పేరునాయుడు (గతంలో 6 కేసులు), అల్లూరి జిల్లా పెదబయలు మండలం, గజ్జేడు గ్రామానికి చెందిన మండిపల్లి సత్తిబాబు(గంజాయి సాగుదారు), చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గొల్లవిల్లి గణేష్(కారు డ్రైవర్)ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందుతుల కోసం గాలిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా తక్షణమే 112 లేదా 1972 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. రెండేళ్లలో జిల్లాలో గంజాయి రవాణా గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది ఇప్పటి వరకూ 46 కేసులు నమోదు చేసి, మొత్తం 1,177 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందన్నారు. 7.14 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం ద్వారా ఈ ఏడాది 13 కేసుల్లో 24 మందికి శిక్షలు పడేలా చేశామని, ఇందులో 16 మందికి 10 నుండి 15 ఏళ్ల జైలు శిక్ష పడిందన్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేటి వరకూ రూ.1.25 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, కొత్తకోట ఎస్ఐ ఎం.శ్రీనివాస్, బుచ్చయ్యపేట ఎస్ఐ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. బుచ్చెయ్యపేట ఎస్ఐకు ఎస్పీ అభినందన బుచ్చెయ్యపేట: స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావును ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం అభినందించారు. బుచ్చెయ్యపేట రోడ్డులో సుమారు రూ.కోటి విలువ గల సుమారు 194 కిలోల గంజాయి, స్మగ్లర్లను చౌకచక్యంగా పట్టుకోవడంతో ఎస్ఐని సత్కరించారు.ఎస్ఐతో పాటు బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు మాకవరపాలెం : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలకు 273 మంది విద్యార్థులు హాజరయ్యారు. తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం నుంచి ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఈ నెల 18 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్రావు తెలిపారు. నిత్యం రెండు విడతల్లో జరిగే పరీక్షలకు గంటన్నర ముందుగా కేంద్రానికి హాజరుకావాలన్నారు. మొదటి రోజు 273 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. -
లోతుగెడ్డ రేంజ్లో చిరుత సంచారం
● అప్రమత్తంగా ఉండాలి ● డీఆర్వో అప్పారావు సూచన చింతపల్లి: మండలంలోని లోతుగెడ్డ అటవీ రేంజ్ పరిధిలోని బందబయలు, లింగాలగుడి పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతుగెడ్డ డీఆర్వో అప్పారావు సూచించారు. మంగళవారం బందబయలు, లింగాలగుడి గ్రామాల్లో అటవీశాఖ అధికారులు దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం లింగాలగుడి గ్రామానికి చెందిన ఓ గిరిజనుడి మేకను చిరుత ఎత్తుకెళ్లిందని, అలాగే మరో గిరిజనుడిపై దాడి చేయబోగా అతను చాకచక్యంగా తప్పించుకున్నాడని తెలిపారు. లింగాలగుడి పరిసరాల్లో చిరుతపులి అడుగుజాడలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిరుత గ్రామాలపై పడి పశువులు, మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గిరిజనులు పంట చేలకు, ఊటగెడ్డలకు, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లరాదని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిరుతపులి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయే వరకు అటవీశాఖ గాలింపు చర్యలు కొనసాగుతాయని, ప్రజలు సహకరించాలని కోరారు. ఒకవేళ చిరుత పశువులపై దాడి చేస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాబూరావు, ఎఫ్బీవోలు నాగరత్నం, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ వసతిగృహ విద్యార్థినికి
అవార్డు ప్రదానంబీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత నుంచి అవార్డు అందుకుంటున్న బీసీ వసతిగృహ విద్యార్థిని రుత్తల దుర్గ నర్సీపట్నం: ఇటీవల విడుదులైన టెన్త్ ఫలితాల్లో 574 మార్కులు సాధించిన బీసీ బాలికల వసతిగృహం విద్యార్థిని రుత్తల దుర్గ మంగళవారం రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది. టెన్త్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతిగృహాల విద్యార్థులకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జున్రావు, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ చేతుల మీదగా విద్యార్థిని దుర్గ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకుంది. దుర్గను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వసతిగృహం వార్డెన్ బి.వెంకటలక్ష్మి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ భవనాల పూర్తికి ప్రతిపాదనలు
రావికమతం : జిల్లాలో 9 ప్రాజెక్ట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 208 అంగన్వాడీ భవనాలను పూర్తి చేసేందుకు రూ.11 కోట్లు నిధులు మంజురూ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి తెలిపారు. మంగళవారం స్దానిక ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కిశోర వికాసంపై రూపొందించిన 18 అంశాలపై బాలికులకు అవగాహన కల్పించారు. తదనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లో 9 ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు పరిధిలో 1908 అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయని, వీటిలో నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే 24 ఖాళీగా ఉన్న సూపర్ వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయాలు, కార్యకర్తలకు సంబంధించి 236 మందిని నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని ఆమె తెలిపారు. మే ఒక్కటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులలో కిశోర బాలికలకు కిశోర వికాసం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, పోషకాహార ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీని కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో 15 నుంచి 20 మందిని గ్రూపులుగా విభజించి మంగళవారం, శుక్రవారం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో మంగతాయారు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం. రమేష్ పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పాడేరు: జిల్లాలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని కొత్త పాడేరు గ్రామంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు నూతనంగా నిర్మించిన నివాస గృహంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయాన్ని మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఒకే ప్రాంగణంలో నివాస గృహాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం శుభపరిణామన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ మరింత సేవ చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అతిథులను ఘనంగా సన్మానించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ విప్ కరణం ధర్మశ్రీ, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. అత్యధిక స్థానాలు కై వసంచేసుకునేందుకు కృషి వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు పాడేరులో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం -
నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం
నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం. ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పరిపాటిగా మారింది. నీట్ నిర్వహణలో లోపాన్ని గుర్తించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎన్డీఏ ప్రభుత్వానికి తగదు. మా పాపతో పాటు ఎంతో మంది విద్యార్థులు కష్టపడి ఏడాది పాటు ప్రిపేరు అయ్యారు. తీరా పరీక్ష రాసిన తరువాత పరీక్ష రద్దు చేయడం సరికాదు. ఈ విధమైన చర్య విద్యార్ధుల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. – వి.వి.ఎన్.హరికృష్ణ, విద్యార్థిని తండ్రి, నర్సీపట్నం -
బస్సు మెకానిజంపై డ్రైవర్లకు అవగాహన
ఆర్టీసీ డ్రైవింగ్స్కూల్ల్లో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న మెకానికల్ ఇంజినీర్ అశ్విని అనకాపల్లి : నిరుద్యోగ యువతీ, యువతులకు ఉద్యోగ ఆవకాశాల్లో భాగంగా ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ఆధ్వర్యంలో 13 వ డ్రైవింగ్ స్కూల్ బ్యాచ్కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రజారవాణాశాఖ అనకాపల్లి డిపో గ్యారేజ్ మెకానికల్ ఇంజినీర్ అశ్విని అన్నారు. మంగళవారం డ్రైవర్లకు బస్సు మెకానిక్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవర్లకు బస్సు మెకానిజంపై శిక్షణ, అవగహన కల్పించడం వల్ల వారిలో నైపుణ్యాన్ని వెలికితీయవచ్చన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు మార్గమధ్యంలో ఆగిపోయినపుడు ఈ శిక్షణ వారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ అసిస్టెంట్ బాపు నాయుడు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ పాల్గొన్నారు. -
మిన్నంటిన సంబరం
సాక్షి, పాడేరు: మన్యవాసుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఉదయం 6 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలైంది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, శివరత్నం దంపతులు ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ టి. నర్సింగరావు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన నిర్వహించగా, వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతిదేవి, కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, జీసీసీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, విశాఖపట్నంకు చెందిన నేతలు గణేష్గౌడ్, పద్మశేఖర్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రముఖులకు శాలువాలు కప్పి సత్కరించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. వైభవంగా ఊరేగింపు అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. సాయంత్రం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దంపతులు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు కలిసి ఉత్సవ విగ్రహానికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని పల్లకీలో కొలువుదీర్చి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. పాడేరు పురవీధుల్లో సాగిన ఈ ఊరేగింపులో తీన్మార్ వాయిద్యాలు, కేరళ డప్పులు, శక్తి, పులి, రాక్షస వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవంతంగా వేడుకలు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకల నిర్వహణపై ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ముందుగా ప్రకటించిన విధంగానే మే 10, 11, 12 తేదీల్లో ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం వాతావరణం అనుకూలించడంతో ఊరేగింపు ప్రశాంతంగా, భారీ భక్తజన సందోహం మధ్య ముగిసింది. పాడేరులో ఘనంగా మోదమ్మ పుట్టినరోజు వేడుకలు పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు తరలివచ్చిన భక్తజనం దర్శించుకున్న ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు సత్తాచాటిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు -
ఇటుక బట్టీలపై విజిలెన్స్ దాడులు
ఎస్.రాయవరం : మండలంలో ఇటుక బట్టీలపై విజులెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వమ్మవరం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల యజమానులు అక్రమంగా చెరువు మట్టిని తరలించి ఇటుక తయారికి వినియోగిస్తున్నారని మంగళవారం సాక్షి దినపత్రికలో ‘హోంమంత్రి ఇలాకాలో మట్టి మాఫియా’ అనే శీర్షికన వార్త వెలువడింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు స్పందించి వమ్మవరం ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించారు. మట్టి నిల్వలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. మట్టి ఎన్ని క్యుబిక్మీటర్లు ఒక్కో బట్టీవద్ద ఉన్నదీ, ఆ యజమాని ఎక్కడ నుంచి మట్టి తరలించారనే వివరాలు నమోదు చేసుకుని కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ తనిఖీలల్లో మైన్ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి, నర్సీపట్నం ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, సీఎస్డీటీ సూరి స్థానిక వీఆర్ఏలు పాల్గొన్నారు. -
వైద్య రంగంలో నర్సులు కీలకపాత్ర
సాక్షి, పాడేరు: నర్సింగ్ వృత్తిని దైవంగా భావించి, ప్రజలకు విశేష సేవలు అందించిన ఆదర్శ మూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్ స్మృత్యర్థం మంగళవారం జిల్లా ఆస్పత్రిలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నైటింగేల్ చిత్రపటానికి నర్సింగ్ సూపరింటెండెంట్లు ఎం. అన్నపూర్ణ (గ్రేడ్–1), ఎం. ఇందిర, జి. చంద్రకళ (గ్రేడ్–2) పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి తోటి సిబ్బందికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో నర్సింగ్ వ్యవస్థ పోషిస్తున్న కీలక పాత్రను, వారు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి నర్సింగ్ బృందం మొత్తం పాల్గొంది. సేవ, త్యాగాలకు నిదర్శనం నర్సులు ముంచంగిపుట్టు: సేవాభావానికి, త్యాగానికి నిదర్శనం నర్సులని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి కొనియాడారు. మంగళవారం మండల కేంద్రంలోని సీహెచ్సీలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని వైద్యులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా, ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సులందరూ కలిసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. వైద్య రంగంలో వారు అందిస్తున్న విశేష సేవల గురించి పలువురు ప్రసంగించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి మాట్లాడుతూ..ఆసుపత్రుల్లో నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో నర్సులు తమ ప్రాణాలకు తెగించి వైద్యులతో కలిసి పనిచేశారని, ప్రజల ఆరోగ్య రక్షణలో వారు చేస్తున్న కృషి వర్ణనాతీతం అని పేర్కొన్నారు. వైద్యులు రమేష్, ఆదిత్యతో పాటు సీహెచ్సీ సిబ్బంది సురేష్, రమేష్, రాంబాబు, నూకాల మ్మ, వనిత, నాగమణి, తేజవతి పాల్గొన్నారు. ఘనంగా ప్రపంచ నర్సుల దినోత్సవం -
యువకుడి అనుమానాస్పద మృతి
నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామ సమీపం నెల్లిమెట్ట వద్ద యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. రోలుగుంట మండలం, బుచ్చింపేట గ్రామానికి చెందిన లాలం సాయి కుమార్ (30) ఈ నెల 10వ తేదీ సాయంత్రం అదే గ్రామానికి చెందిన సతీష్, రాజేష్, నానాజీలతో కలిసి గబ్బాడ గ్రామం, నెల్లిమెట్ట వద్ద మద్యం సేవించినట్టు ఎస్ఐ తెలిపారు. అనంతరం మృతుడు సాయికుమార్, రాజేష్ బైక్పై నర్సీపట్నం వైపు రావడం జరిగిందన్నారు. బైక్పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి సాయికుమార్ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య లాలం రాజ్యలక్ష్మి సాయికుమార్ మృతిపై అనుమానం వ్యక్తి చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలంటు రైతుల నిరసన భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసన తుమ్మపాల: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీఓపెన్ కాకూడదని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి వారితో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్కు 123, రెవెన్యూ క్లినిక్కు 145 మొత్తం 268 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను తక్షణం నిలిపేయాలి.. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రైతుల భూములకు అనధికారక లేఅవుట్ చూపించి తప్పుడు పద్ధతిలో చేస్తున్న రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేసి రైతులకు రక్షణ కల్పించాలంటు పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందించారు. గ్రామంలో సర్వే నంబర్ల 274, 276, 279, 290, 291, 298, 347లో మొత్తం 60 ఎకరాల రైతుల భూమిలో కొంత భూమిని కొనుగోలు చేసిన ఓ ప్రైవేటు రియల్టర్ మిగిలిన రైతుల భూములను కూడా కలిపి అనధికారక లేఅవుట్ వేసినట్లు తెలిపారు. అనధికారక జీపీఏ పత్రాలతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తూ రైతుల భూముల్లోకి వచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారని, రౌడీమూకలతో భూముల్లోకి వచ్చి వివాదాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నా పోలీసులు సివిల్ వివాదం అంటూ చేతులు దులుపుకోవడం, అధికారులు జీపీఏలతో కొనసాగిస్తున్న రిజిస్ట్రేషన్లను నిలిపివేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో విచారణ చేపట్టి తమ భూములకు సంబంధించి సృష్టిస్తున్న తప్పుడు పత్రాలను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. సాగు భూములను కాపాడాలి.. ఎస్ఈజెడ్ నిర్మాణం కోసం కె.కోటపాడు మండలం పలు గ్రామాల్లో చేపడుతున్న బలవంతపు భూసేకరణ నిలిపేసి సాగు భూములను కాపాడాలంటు ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లాలో అత్యధిక రిజర్వాయర్లు కలిగి ప్రతి ఎకరం నీటి సౌకర్యంతో నిత్యం పంటలు పండే చోట ఎస్ఈజెడ్ అంటు భూములను సేకరించి కంపెనీలతో కలుషితం చేయడం మానుకోవాలన్నారు. అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే వేల ఎకరాల భూముల సేకరణ జరిగిందని, జిల్లాలో మిగిలిన భూములను వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ కార్యాలయానికి 65 ఆర్జీలు అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వేధింపులు, ఇతర విభాగాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. వాస్తవాల ఆధారంగా సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్, సీఐ సేనం రమేష్ పాల్గొన్నారు. -
రైతులంటే ఇంత చులకనా...?
చోడవరం : గోవాడ చెరకు రైతులు ఉద్యమానికి మరోసారి సిద్ధమౌతున్నారు. రైతు సంఘాల నాయకులు, పలు రైతు ఉద్యమకారులు కలిసి చోడవరంలో బుధవారం సమావేశమయ్యారు. భారతీయ జనతాపార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రైతు ఉద్యమకారుడు ఎ.ఆర్.జి శర్మ ఇంటి వద్ద రైతు సంఘాల నాయకులంతా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారంతా తప్పుబడ్డారు. రైతులంటే ప్రభుత్వానికి చాలా చులకనగా ఉందని, మరోసారి ఉద్యమానికి చెరకు రైతులు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కార్మికులంతా సిద్ధం కావాలంటూ ఈ సమావేశం నిర్ణయించింది. అవసరమైతే రైతుల తరపున న్యాయపోరాటానికై నా వెళదామని ఏ.ఆర్.జి శర్మ ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులకు తెలిపారు. పార్టీలు, రాజకీయాలు ముఖ్యం కాదని, 24 వేల మంది చెరకు రైతులు, కార్మికుల జీవన్మరణ సమస్యగా మారిన గోవాడ ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే మొదటి దశ ఉద్యమం చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపడం జరిగిందని, వారి హామీ మేరకు ఏమీ జరగకపోవడంతో మరోసారి ఉద్యమానికి అంతా సిద్ధమవ్వాలని నిర్ణయించారు. చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీత బకాయిలు రూ. 30 కోట్లు వరకూ ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉందని, అవి ఇప్పటి వరకూ చెల్లించలేదని, అంతేకాకుండా వచ్చే సీజన్ గానుగాట ఆడిందీ లేనిదీ ఏమీ చెప్పకపోవడంతో రైతులు చెరకు పంట వేయాలా వద్దా అనే మీమాంశలో ఉన్నారని, అదీ ప్రభుత్వం తేల్చలేదని సమావేశంలో రైతు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇప్పటికై నా వీటిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయకపోతే త్వరలోనే రెండో దశ ఉద్యమం చేయడానికి అంతా సిద్ధంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో రైతు సంఘం జిల్లా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, జనసేన నియోజకవర్గ నాయకుడు జెర్రిపోతుల నానాజీ, రైతు సంఘాల ప్రతినిధులు మహాలక్ష్మినాయుడు, దాడి అమర్, పెదబాబు పాల్గొన్నారు. -
‘రహదారి లేదని చెప్పడం అన్యాయం’
మాట్లాడుతున్న బుద్ద మురళీ తాతారావు అనకాపల్లి: స్థానిక మెయిన్రోడ్డు రఘరాం లే అవుట్ను ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 1535/3లో 7.603 సెంట్ల జీరాయితీ భూమిలో గేటు నిర్మిస్తున్న సమయంలో లే అవుట్ ప్రతినిధి కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావు ఈనెల 9వ తేదీన తమ భూమిలో గేటు నిర్మించుకోవడం తప్పు అని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని స్థల యజమాని బుద్ద మురళీ తాతారావు అన్నారు. స్థానికంగా ఉన్న తమ భూమిలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లే అవుట్కు ఆనుకుని ఉన్న తమ స్థలానికి ఇటు రహదారి లేదని చెప్పడం అన్యాయమన్నారు. లే అవుట్ సైడ్ గేటు ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 50 లక్షలు చెల్లించాలని పరమేశ్వరరావు చెప్పడం తగదని మురళీ తాతారావు అన్నారు. ఇదే విషయంపై సోమవారం పట్టణ పోలీస్స్టేషన్లో కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాతారావు కుటుంబ సభ్యులు విల్లూరి గణేష్, దాడి నాని, ఆడారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆవుల శేఖర్ నర్సీపట్నం: పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు దక్కే వరకు పోరాటాలు ఆగవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆవుల శేఖర్ పేర్కొన్నారు. అనకాపల్లిలో జిల్లా అధ్యక్షుడు అర్జున్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో శేఖర్ మాట్లాడారు. ఏళ్ల తరబడి గ్రామీణ పేదలకు సాగు భూములు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయమని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ భూములన్నీ రాజకీయ పలుకుబడి కలిగిన వారి చేతుల్లో ఉన్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా రాష్ట్ర ప్రభుత్వం భూములు కట్టబెడుతుందన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేస్తే పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూములు అందుతాయన్నారు. పేదల సంక్షేమ పథకాలు కత్తిరించాలనే గ్రామాల్లో సర్వే చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలుగుల అర్జున్రావు, బాలేపల్లి వెంకటరమణ, జిల్లా ఆఫీస్ బేరర్లు కొండలరావు, అప్పలనాయుడు, లవరాజు, బంగారయ్య, అప్పారావు, నాగేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
వేసవి సెలవుల్లో పనులు అప్పగించడం అన్యాయం
అనకాపల్లి: సెలవుల్లో వాట్సాప్ ఆదేశాల ద్వారా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని, లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా, కేవలం వాట్సాప్ సందేశాల ద్వారా విద్యా సంబంధిత పనులను అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు అన్నారు. స్థానిక డీఈవో కార్యాలయంలో సోమవారం డీఈవో గిడ్డి అప్పారావు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని, కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు లేనప్పటికీ, జిల్లాలో మాత్రం మే 12 నాటికి ఫౌండేషన్ ప్లాన్, మండల ప్లాన్, స్కూల్ లెవల్ ప్లాన్న్లను సిద్ధం చేయాలని ఒత్తిడి చేయడం సరి కాదన్నారు. తక్షణమే ఈ ఒత్తిడి ఆపాలని, ఉపాధ్యాయుల సెలవు హక్కు గౌరవించాలని, వాట్సాప్ ద్వారా కాకుండా అధికారిక ప్రొసీడింగ్స్ ద్వారా మాత్రమే విధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో జిల్లా కార్యదర్శి యేశపోగు సుధాకర్రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ఎస్.దుర్గాప్రసాద్, గొంది చిన్నబ్బాయ్, కె. పరదేశి, కార్యవర్గ సభ్యుడు వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి
పాయకరావుపేట : పట్టణానికి చెందిన యువకుడు తాటి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్టు ఏఎస్ఐ గోవిందు తెలిపారు. పట్టణంలో రాజుగారిబీడుకు చెందిన పంజాబీ పవన్ కుమార్ (21) తాటిముంజులు తీయడం కోసం స్థానికంగా గల తాటిచెట్టు ఎక్కి 40 అడుగులు ఎత్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుల సహాయంతో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఏఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. -
ప్రముఖ వైద్యుడు శ్రీరామ్మూర్తి మృతికి సంతాపం
బుచ్చెయ్యపేట: వడ్డాదిలో పేదల వైద్యుడిగా పేరొందిన ప్రముఖ వైద్యుడు బెన్నాబత్తుల శ్రీరామ్మూర్తి (68) (పెంటబాబు డాక్టర్ ) గుండె పోటుతో మృతి చెందారు. రెండు రోజుల కిందట హైదరాబాద్లో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం విశాఖలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదు దశాబ్దాలుగా బుచ్చెయ్యపేట, చినఅప్పనపాలెం, బంగారుమెట్ట, దిబ్బిడి, ఎల్బీ పురం, భీమవరం, వడ్డాది, వీరవల్లి, పోతనపూడి, కుముదాంపేట, లోపూడి, శింగవరం తదితర గ్రామాల ప్రజలకు తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించేవారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలతో పాటు నిరుపేదలకు ఫీజు తీసుకోకుండా వైద్య సేవలు అందించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని సమయంలో, కరోనా కాలంలో కూడా పలువురికి వైద్య సేవలు అందించి పేదల పెన్నిధిగా పేరొందారు. శ్రీరామూర్తి అకాల మరణంతో పలు గ్రామాల ప్రజలు, పలువురు వైద్యులు, నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని పెద్ద కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య, కుమారుడు ఉన్నారు. -
ప్రమాదవశాత్తూ ఆర్మీ ఉద్యోగి మృతి
వార్షిక ప్రణాళిక అమలుతో మహిళా సంఘాల అభివృద్ధి సబ్బవరం: వార్షిక ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసి, గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని డీపీఎం ఐబీ పి.వెంకటరమణ సూచించారు. సబ్బవరం మండల సమాఖ్య కార్యాలయంలో ఏఏపీ–1 సెక్షన్ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సబ్బవరం మండల సమాఖ్యతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, గొలుగొండ, చోడవరం, యలమంచిలి మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వీవో స్థాయిలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారీ, కార్యవర్గ సభ్యులకు, ఎస్హెచ్జీ సభ్యులకు అవగాహన కల్పించడం, బడ్జెట్ ప్రక్రియపై శిక్షణ అందించినట్లు ఆయన తెలిపారు. వీఎంవోఎస్ఏ అంఽశాలపై టీవోటీ కె.శ్రీనివాసరావు వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధి వంటి అంఽశాలపై సభ్యులతో చర్చించి గ్రామ, మండల స్థాయి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు సబ్బవరం మండలంలోని 58 గ్రామ సంఘాల లీడర్లు పాల్గొన్నారు. -
దేవాలయ భూములకు నష్టపరిహారం ఇప్పించండి
అచ్యుతాపురం రూరల్ : దుప్పితూరులో పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతీ సమేత భావనాఋషి ఆలయ భూములకు నష్టపరిహారం ఇప్పించాలని ఆలయ కమిటీ సభ్యులు అనకాపల్లి కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా తమ సొంత నిధులతో స్వామికి నిత్య దీప ధూప నైవేద్యాలు, ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఆలయ భూములకు పరిహారంతో పాటు భూమికి భూమి ఇవ్వాలని వినతిపత్రం ద్వారా కలెక్టర్ను కోరారు. నష్టపరిహారం చెల్లించకుండా ఆలయ భూములను ఆక్రమిస్తున్న ఏపీఐఐసీ, బ్రాండిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ప్రహారీ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ మాడెం సూరి అప్పారావు, ఉపాధ్యక్షుడు శేశెట్టి రాంబాబు, సెక్రటరీ మాడెం అప్పారావు, కమిటీ సభ్యులు అంజూరి అప్పలరాజు, శేశెట్టి నర్సింగరావు, శేశెట్టి నానాజీ, వానపల్లి ముకుందేశ్వరరావు, వానపల్లి సన్యాసిరావు, అముదూరి అర్జునరావు తదితరులు ఉన్నారు. -
ఘాట్రోడ్డులో తప్పిన ప్రమాదం
సాక్షి, పాడేరు: మైదాన ప్రాంతం నుంచి జి.మాడుగుల జీసీసీ బంక్కు పెట్రోల్,డీజిల్ రవాణా చేస్తున్న ఆయిల్ట్యాంకర్కు పాడేరు ఘాట్లో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.పాడేరు ఘాట్ రోడ్డు నుంచి అతివేగంగా దిగుతున్న టిప్పర్ను తప్పించేందుకు ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు పక్కనున్న కొండవైపునకు మళ్లించాడు.కొండకు ఆనుకుని ట్యాంకర్ ఒరిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.టిప్పర్,ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.పాడేరు ఘాట్లోని ఏసుప్రభువు విగ్రహం మలుపు సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ లీకు అయింది.పొక్లెయినర్ సాయంతో ట్యాంకర్ను రోడ్డుపైకి తీశారు.కొండకు ఆనుకుని ఒరిగిన ఆయిల్ ట్యాంకర్ -
దూరవిద్య పరీక్ష కేంద్రం మంజూరు
అరకులోయటౌన్: స్థానిక ప్రభుత్వ మహి ళా డిగ్రీ కళాశాలకు ఆంధ్రాయూనివర్సిటీ దూరవిద్య పరీక్ష కేంద్రం మంజూరైనట్టు ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు సోమవారం తెలిపారు. ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ 167ను కేటాయించారన్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి యూజీ థియరీ పరీక్షలు, బీఏ, బీకాం, బీఎస్సీ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దూర విద్య పరీక్ష కేంద్రం మంజూరు చేసిన ఏయూ వైస్ చాన్సలర్, సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇతర అధికారులకు చలపతిరావు, కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. -
లబ్బూరు వద్ద మూడు బైకులు ఢీ
ఒకరు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలో ఆదివారం మూడు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ పి.నాని అందించిన వివరాలు... మండలంలోని మాకవరం పంచాయతీ కిందుగూడ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు బైకుపై ముంచంగిపుట్టు నుంచి కిందుగూడ వెళ్తుండగా అదే సమయంలో మేభ గ్రామానికి చెందిన సుబ్బరావు, రెడ్డి బైకు ముంచంగిపుట్టు బయలుదేరారు. జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలోని ఏకలవ్య పాఠశాల ఎదురుగా ఈ రెండు బైకులు ఢీ కొన్నాయి. అదే సమయంలో కించాయిపుట్టు పంచాయతీ కేంద్రానికి చెందిన నాగేశ్వరరావు బైకుపై వస్తుండగా.. ప్రమాదానికి గురైన రెండు బైకులు అతనిపై దుసుకుపోయాయి.దీంతో అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగ్రాతులను హూటహూటిన ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు.రెడ్డి పరిస్థితి విషమయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి,అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు.కేజీహెచ్లో చికిత్స పొందుతూ రెడ్డి(25) సోమవారం మృతి చెందాడు.కిందుగూడకు చెందిన నాగేశ్వరరావు పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నాడు. మేభకు చెందిన సుబ్బరావు ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్య సేవలు పొందుతున్నాడని, కేసు నమోదు చేశామని ఎస్ఐ నాని తెలిపారు. -
విస్తారంగా వర్షాలు
సాక్షి.పాడేరు: వేసవిలోనూ జిల్లాలో రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఉదయం పొగమంచు,మధ్యాహ్నం వరకు అధిక ఎండ,సాయంత్రం నుంచి భారీ వర్షం కురవడం వంటి విభిన్న వాతావరణ పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి.సోమవారం జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.రోజు వర్షాలు కురుస్తుండడంతో ప్రధాన గెడ్డలు,వాగుల్లో వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. వర్షపాతం వివరాలు: పెదబయలు 29.5, పాడే రులో 26.5, హుకుంపేటలో 26.5,చింతపల్లిలో 17.5, ముంచంగిపుట్టులో 9, కొయ్యూరులో 5.5, జి.మాడుగులలో 4.3, జీకే వీధిలో 1.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. పాడేరులో కురుస్తున్న వర్షం -
విజృంభన
మలేరియా ● అరకొరగా దోమ తెరల పంపిణీ ● 1.50 లక్షల కుటుంబాలకు గాను ఇచ్చింది 34వేలే ● దోమల నివారణ మందు పిచికారీ 1604 గ్రామాలకే పరిమితం సాక్షి, పాడేరు: జిల్లాలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి.కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడం, పారిశుధ్యం కొరవడడం తదితర కారణాలతో దోమలు వృద్ధి చెంది మలేరియాను వ్యాప్తి చేస్తున్నాయి. దీంతో పలువురు జ్వరాల బారిన పడుతున్నారు. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్సీలకు క్యూ కడుతున్నారు. ఒక్క పాడేరు జిల్లా ఆస్పత్రిలోనే ఆరుగురు గిరిజనులు మలేరియాతో చికిత్స పొందుతున్నారు. చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన కిముడు దయాకర్ అనే టెన్త్ విద్యార్థి ఈనెల 9వతేదీన మలేరియాతో మృతిచెందాడు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండడం, గిరిజన విద్యార్థి మృతిచెందడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మలేరియా నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని వాపోతున్నారు. క్రమంగా పెరుగుతున్న కేసులు జిల్లాలోని 11 మండలాల పరిధిలో 1604 మలేరియా పీడిత గ్రామాలను మలేరియాశాఖ గుర్తించగా,ఈఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 399 మలేరియా కేసులు నమోదయ్యాయి.ఈఏడాది జనవరి 21, ఫిబ్రవరిలో 43, మార్చిలో 106, ఏప్రిల్లో 165,మే నెలలో ఇంత వరకు 64 మంది మలేరియా జ్వరాల బారిన పడ్డారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి,ముంచంగిపుట్టు,చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రులు, పాటు పీహెచ్సీల పరిధిలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు మలేరియా రోగుల తాకిడి ఎక్కువగా ఉంది.కొంతమంది రోగులు మైదాన ప్రాంత ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో మలేరియా కేసులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం పాడేరు పట్టణ పరిధిలోని లోచలిపుట్టుకు చెందిన కె.నీలకంఠం,బక్కలపనుకుకు చెందిన వంతాల భాస్కరరావు,వంట్లమామిడి గ్రామానికి చెందిన జనపరెడ్డి జస్వంత్,జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ ఇందుగుల గ్రామానికి చెందిన భార్యభర్తలు సీదరి బంగారయ్య,చిలకమ్మ,మరో గిరిజనుడు జగ్గారావులు మలేరియా జ్వరాలతో వైద్యసేవలు పొందుతున్నారు. చిరిగిన దోమతెరలు చూపిస్తున్న ఎర్రగుప్ప ఆదివాసీలుభయపెడుతున్న దోమలు జిల్లాలో పలు ప్రాంతాలు దోమల అడ్డాగా మారాయి. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు గ్రామాల్లోను అదే పరిస్థితి.సాయంత్రం 4గంటల నుంచే దోమలు దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరులో మలేరియా కేసులు నమోదవుతున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క ఇంటి వద్ద దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.జిల్లాలో 3,500 గ్రామాలుండగా,1,604 గ్రామాల్లోనే దోమల నివారణ మందు పిచికారీ చేశారు. ఆయా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో పనులు జరపలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు నెలల్లో 399 కేసులు ఓ గిరిజన విద్యార్థి మృతి జిల్లా కేంద్రం పాడేరులోనూమలేరియా కేసులు భయాందోళన చెందుతున్న ప్రజలు నివారణపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం 34,900 దోమతెరలే పంపిణీ జిల్లాలో అన్ని గ్రామాల్లోను దోమల బెడద అధికంగా ఉంది. దోమ కాట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అరకొరగా దోమతెరలను పంపిణీ చేసింది. 1.50 లక్షల కుటుంబాలు ఉంటే కేవలం 34,900 దోమతెరల పంపిణీకి గత నెలలో కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. అవి కనీసం మలేరియా పీడిత గ్రామాలకు కూడా సరిపడని పరిస్థితి. గత ఏడాది ఒక్క దోమతెర కూడా పంపిణీ చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన దోమతెరలనే ప్రస్తుతం గిరిజనులు వినియోగిస్తుండగా, వాటికి కాలం చెల్లడంతో చిరిగిపోయాయి. దోమతెరలు లేక దోమకాట్లతో గిరిజనులు రాత్రి సమయంలో నరకయాతన అనుభవిస్తున్నారు. -
నేడు మోదమ్మ పుట్టినరోజు ముగింపు ఉత్సవం
సాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాల భక్తుల ఆరాధ్యదేవత పాడేరులోని మోదకొండమ్మతల్లి పుట్టిన రోజు ముగింపు ఉత్సవాన్ని మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.మూడు రోజుల పుట్టిన రోజు వేడుకలకు మోదకొండమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శ్రీకారం చుట్టారు.ఆదివారం పుట్టిన రోజు ప్రారంభ ఉత్సవాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు.సోమవారం కూడా మోదమ్మకు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు చేశారు.భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.మంగళవారం అమ్మవారి పుట్టిన రోజు ముగింపు ఉత్సవాలకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఉదయం నుంచి మోదమ్మకు పూజలు చేయడంతో అమ్మవారి ఘటాలను ఉరేగిస్తారు.మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి మోదమ్మ ఉత్సవ విగ్రహం,పాదాలను పాడేరు వీధుల్లో ఊరేగిస్తారు.నేలవేషాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు,డప్పు వాయిద్యాల హోరులో మోదమ్మ ఊరేగింపు సంబరం జరగనుందని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తెలిపారు.రాత్రి కళా ప్రదర్శనలను ఏర్పాటు చేశామని,అన్ని వర్గాల భక్తులు మోదమ్మ పుట్టిన రోజు వేడుకను విజయవంతం చేయాలని ఆయన కోరారు.


