సీలేరులో ఒడిశాఎంపీ, ఎమ్మెల్యే
● ఉమామహేశ్వర ఆలయం సందర్శన
సీలేరు : మహాశివరాత్రి సందర్భంగా ఒడిశాకు చెందిన నవరంగ్పూర్ ఎంపీ బలభద్ర మాజ్జి, మల్కనగిరి ఎమ్మెల్యే నరసింహ మడకామి సీలేరును సందర్శించారు. సరిహద్దులోని పప్పులూరు గ్రామంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తూ, మార్గమధ్యలో సీలేరులోని ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారికి ఘనస్వాగతం పలికి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించింది. సీలేరు ప్రకృతి సౌందర్యం, గుంటవాడ జలాశయం చాలా బాగున్నాయని ఎంపీ ప్రశంసించారు.ఎప్పుడూ వార్తల్లో వినే సీలేరును స్వయంగా చూడటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని వారిని ఎస్ఐ యాసిన్ కోరారు. ఒడిశా నుంచి వస్తున్న గంజాయి వల్ల ఈ ప్రాంతంలో కేసులు పెరుగుతున్నాయని వివరించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందిస్తూ, తమ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు.


