కల్యాణపులోవ జాతరకు పోటెత్తిన భక్తులు
రావికమతం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కళ్యాణపులోవలో వెలసియున్న పోతురాజుబాబును ఆదివారం సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎన్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ , అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తదితరులు దర్శించుకున్నారు. వారికి దేవదాయ ధర్మదాయశాఖ ఈవో సత్యనారాయణ మూర్తి ఆహ్వానం పలికారు. మహాశివరాత్రి సందర్బంగా కళ్యాణపులోవ పోతురాజుబాబు, పెద్దింటమ్మ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా మెదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి పోతురాజుబాబును దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా , డీఎస్పీ శ్రావణి పర్వవేక్షణలో కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టి నిరంతర సీసీ కెమెరాలలో నిఘా ఏర్పాటు చేశారు. చోడవరం ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో ఆలయ వద్ద భక్తులకు అన్న సమారాధన జరిపారు.


