రక్తదానం ప్రాణదానంతో సమానం
చింతపల్లి: మనం ఇచ్చే రక్తదానంతో ఎంతో మందికి ప్రాణదానం అందించి, వారిని ఆదుకున్న వాళ్లమవుతామని జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య అన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మెన్ గంగరాజు ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది బాధితులు ప్రమాదాలకు గురై సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులు నివారించడానికి ఈ రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ రక్తం దానం చేసి పలువురికి ప్రాణదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.ఈ శిబిరానికి మండలంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని రక్త దానం చేశారు. ఈ శిబిరంలో 24 యూనిట్లు రక్తాన్ని సేకరించారు. తహసీల్దారు శంకరరావు, ఎంఈఓ ప్రసాద్, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో మూర్తి, సీనియర్ అసిస్టెంట్ ఎన్టి రామారావు, ప్రసాద్ నాయుడు, సుబ్రహ్మణ్యం, రెడ్క్రాస్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.


