క్షతగాత్రుడికి ప్రతి నెలా రూ.2 వేల సాయం
● విశ్రాంత ఎంఈవో అమృత్కుమార్ భరోసా
మంచానికే పరిమితమైన రాముకు సాయం చేస్తున్న విశ్రాంత ఎంఈవో అమృత్కుమార్
నాతవరం: కష్టాల్లో ఉన్న పేదలను మావవతా దృక్పథంతో ఆదుకోవడమే తన ధ్యేయమని ఏకే వెల్ఫేర్ సేవా సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఎంఈవో తాడి అమృత్కుమార్ తెలిపారు. మండలంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్స రాము కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. అతడి భార్య(బాలింత), ఇద్దరు చిన్నారులతో జీవనం సాగించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాము కుటుంబానికి విశ్రాంత ఎంఈవో శుక్రవారం రూ.2 వేలు అందజేశారు. రాము పూర్తిగా కోలుకుని ఏదైనా ఉపాధి చేసుకునే వరకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అందజేస్తానని భరోసా కల్పించారు. తన పెన్షన్లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు అందజేస్తున్నట్టు తెలిపారు.


