లిక్విడ్ గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
దేవరాపల్లి: లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కె.కోటపాడు సీఐ కె.కృష్ణ శనివారం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి దేవరాపల్లి వైపు గంజాయి తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో శ్రీరాంపురం చెక్ పోస్టు వద్ద స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టినట్టు చెప్పారు. జీనబాడు వైపు నుంచి బైక్పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని, బ్యాగ్ను తనిఖీ చేయగా అందులో రెండు ప్యాకెట్లలో ఉన్న రెండు కిలోల లిక్వడ్ గంజాయి బయటపడింది. నిందితుల నుంచి లిక్విడ్ గంజాయితో పాటు బైక్, రూ. 3వేలు నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని, లిక్విడ్ గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి విశాఖపట్నం మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు యత్నించినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన రంజాన్ జాకీర్ మన్సూరి, డుంబ్రిగుడ మండలానికి చెందిన గోల్లోరి దానేష్, పాంగి దేవదాస్ ఉన్నారు. వీరిని చోడవరం కోర్టుకు తరలించనున్నట్లు సీఐ కె.కృష్ణ, ఎస్ఐ వి. సత్యనారాయణ వెల్లడించారు.


