మెనూ అమలు చేయకపోవడంపై విచారణ
చింతపల్లి: స్థానిక బీసీ వసతి గృహంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సక్రమంగా భోజనం అందించడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకుడు జీవన్, ఎంఈవో ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఈ వసతి గృహంలో ఉంటూ స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సమస్యలపై బుధవారం ఎంఈవో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. వసతి గృహంలోని వంట మనుషులు పార్వతి, సత్యవతి వార్డెన్ సూచించిన మెనూను సక్రమంగా అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై తాము ప్రశ్నిస్తే వారు తమను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ఎంఈవో దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంఈవో ప్రసాద్ వసతి గృహం వార్డెన్, వంట మనుషులను విచారించారు. విద్యార్థుల పట్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్డెన్ శకుంతలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గిడ్డి వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


