గర్భంలోనే శిశువు మృతి
● వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధితుల కన్నీటి పర్యంతం
● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్
గూడెంకొత్తవీధి: పండంటి బిడ్డ ను తమ చేతికి అందిస్తారన్న ఆశతో ఆసు పత్రికి వెళ్తే, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృత శిశువును తీసుకోవాల్సి వచ్చిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రి సిబ్బంది వైఖరిపై రింతాత పంచాయతీ, కడుగుల గ్రామానికి చెందిన సాగిన పూర్ణసత్యనారాయణ భార్య కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రసవం కోసం కళ్యాణిని ఈ నెల 5వ తేదీన చింతపల్లి ఆసుపత్రిలోని బర్త్ వెయిటింగ్ హాల్లో చేర్పించారు. ఈ నెల 15న (ఆదివారం) ఆమెకు పురిటినొప్పులు రావడంతో అక్కడి వైద్యులు పర్యవేక్షించారు. అయితే, సోమవారం వరకు ఆమెను అక్కడే ఉంచి, పరిస్థితి విషమించాక ‘బిడ్డ ఉమ్మనీరు తాగింది’ అని చెబుతూ హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీరా నర్సీపట్నం వెళ్లాక, అప్పటికే గర్భంలోనే శిశువు మరణించిందని అక్కడి వైద్యులు ధ్రువీకరించారని వారు తెలిపారు. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది సమయానుకూలంగా స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేదని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దుస్థితి మరెవరికీ రాకూడదని వారు డిమాండ్ చేశారు.
గర్భంలోనే శిశువు మృతి


