రూ.1.17 కోట్లతో అంగన్వాడీ భవనాలు
ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడుతున్న ఉమ్మడి విశాఖ జెడ్పీచైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర
సాక్షి,పాడేరు: జెడ్పీ నిధులు రూ.1.17 కోట్లతో పాడేరు డివిజన్లోని అంగన్వాడీ కేంద్రాలకు భవన నిర్మాణాలు చేపడుతున్నామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రం పాడేరులో నిర్మిస్తున్న ఐసీడీఎస్ కేంద్ర కార్యాలయం,శిశు గృహ భవన నిర్మాణాలను పరిశీలించారు. ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని సందర్శించారు. పీడీ ఝన్సీరామ్పడాల్తో అంగన్వాడీ భవన నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అల్లూరి సీతారామరాజు పేరిట ఏర్పడిన జిల్లాలో కొత్త భవనాల నిర్మాణాలకు తనవంతుగా కృషి చేస్తున్నానన్నారు.ఎన్నడూలేని విధంగా జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి భవనాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చామన్నారు.జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ పీడీ కార్యాలయానికి రూ.25లక్షలు, శిశు విహార్ భవనానికి రూ.5లక్షలు కేటాయించామన్నారు. గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, పాడేరు, అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు మండలాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన 17 అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు రూ.87లక్షలు కేటాయించామన్నారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.


