మోదమ్మ ఉత్సవాల నిర్వహణపై సమావేశం రేపు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 22 మధ్యాహ్నం 3గంటలకు మోదమ్మ ఆలయ ప్రాంగణంలో అన్ని వర్గాల పెద్దలు, భక్తులతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఆలయ కమిటీ చైర్మన్,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడులు శుక్రవారం తెలిపారు. మోదకొండమ్మతల్లి ఆలయ గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాలు, పాడేరు వర్తక సంఘం నేతలు, గ్రామపెద్దలు, భక్తులంతా ఈ సమావేశానికి హాజరుకావాలని వారు కోరారు.ఈ సమావేశంలో అందరి ఆమోదం మేరకు ఈ ఏడాది నిర్వహించే మోదకొండమ్మతల్లి ఉత్సవాల తేదీలు ఖరారు చేస్తామని వారు తెలిపారు.


