అంబులెన్స్కు ఎదురెళ్లి.. వైద్యం అందించి
వైద్యాధికారి అప్రమత్తతతో గర్భిణికి సుఖ ప్రసవం తల్లీబిడ్డ క్షేమం సకాలంలో స్పందించిన జెన్కో, వైద్య సిబ్బంది
సీలేరు: మారుమూల గిరిజన గ్రామాల్లో గర్భిణులు సకాలంలో సమీప ఆస్పత్రికి వచ్చి పురుడు పోసుకోవాలని వైద్య సిబ్బంది ఎన్నిసార్లు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రసవ సమయానికి వారం రోజుల ముందే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నప్పటికీ పురిటి నొప్పులు వచ్చే వరకూ ఇంటి గడప దాటడం లేదు. దీంతో గర్భిణులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తీవ్రమైన పురిటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి సత్వర చికిత్స అందజేసి స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి సుఖ ప్రసవం చేశారు. జెన్కో అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తం అవడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యాధికారి నిఖిల్ తెలిపిన వివరాలు ప్రకారం..దుప్పులువాడ పంచాయ తీ వలసగెడ్డ గ్రామానికి చెందిన గర్భిణి కొరార శాంతికి ఆదివారం అర్ధరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆశా కార్యకర్త ద్వారా సమాచారం అందుకున్న ఏపీ జెన్ కో ఏఈ సీహెచ్ సురేష్ సీఎస్ఆర్ అంబులెన్్స్ సిబ్బందిని అప్రమత్తం చేసి వలసగెడ్డ గ్రామానికి పంపించారు. శాంతిని వలసగెడ్డ నుంచి సీలేరు పీహెచ్సీ తరలిస్తుండగా మార్గం మధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ అడంతో బాటు అప్పటికే బిడ్డ తల బయటకు వచ్చేసింది. దీంతో ఈ సమాచారాన్ని వైద్యాధికారి నిఖిల్కు తెలియజేశారు. అప్రమత్తమైన ఆయన అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్కు ఎదురుగా వెళ్లి, మార్గ మధ్యలోనే ప్రసవం చేసి, తల్లీబిడ్డను కాపాడారు. శాంతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందజేసి, స్వ గ్రామానికి పంపారు. సకాలంలో ప్రసవం చేసి, తల్లీబిడ్డను కాపాడిన జెన్కో, వైద్య సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.


