శతశాతం ఉత్తీర్ణత తప్పనిసరి
పెదబయలు: టెన్త్, ఇంటర్లో గురుకుల విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల సంస్థ సహాయ కార్యదర్శి (అకాడమిక్) డాక్టర్ ఎన్జీ కిశోర్ బాబు సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక గురుకుల కళాశాల, ఏకలవ్య మోడల్ పాఠశాలను సందర్శించారు. ఇంటర్ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్న తీరును పరిశీలించి, విద్యా ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. గత ఏడాది అల్లూరి జిల్లాలో టెన్త్ ఫలితాలు తగ్గడంతో, ఈసారి రాష్ట్రస్థాయి అధికారుల నేరుగా పర్యవేక్షణలో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రెండేళ్ల క్రితం ఒక విద్యార్థి మృతి చెందిన ఘటనలో నాటి ప్రిన్సిపాల్ విఠల్ మూర్తి సస్పెన్షన్ గురించి సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు కేశవరావు, శంకర్ రావు పాల్గొన్నారు.
గురుకుల సంస్థ సహాయ కార్యదర్శి
కిశోర్ బాబు


