పెంచిన పాల ధరలను తక్షణమే తగ్గించాలి
అనకాపల్లి: విశాఖ డెయిరీ పాల ధరను పెంచడం అన్యాయమని, తక్షణమే తగ్గించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. పాల ధర పెంపుతో డెయిరీ యాజమాన్యాలు లాభాలు పొందుతున్నాయన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి డి.డి. వరలక్ష్మి, సహాయ కార్యదర్శులు మంగతాయారు, ఆర్.లక్ష్మి, జగదీశ్వరి, దేవుళ్లమ్మ, చిట్టమ్మ పాల్గొన్నారు.
దేవరాపల్లి: విశాఖ డెయిరీ యాజమాన్యం పెంచిన పాల ధరలను తక్షణమే తగ్గించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడారు. లీటరకు రూ.2 ధర పెంచి ప్రజలపై భారం మోపిందని, తక్షణమే ఉపసంహరించుకోవా లని కోరారు. లేబర్ ఖర్చులు పెరిగాయని యాజ మాన్యం కుంటుసాకులు చెబుతోందన్నారు. రైతుల నుంచి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్న విశాఖ డెయిరీ యాజమాన్యానికి లాభాల దాహం ఇంకా తీరలేదని ఎద్దేవా చేశారు. డెయిరీ కార్మికులకు కార్మిక చట్టం ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని, 400 మందిని అన్యాయంగా తొలగించారని విమర్శించారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ధర్నా చేస్తున్న ఐద్వా నాయకులు


