విద్యార్థినులతో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ బాలికల వసతి గృహం నిర్వహిస్తున్న అద్దె భవనాన్ని పరిశీలస్తున్న జేసీ
జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్
చీడికాడ: వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభం నాటికి బాలికల వసతి గృహానికి కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ తెలిపారు. మండల కేంద్రం చీడికాడలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాన్ని శనివారం ఆయన సందర్శించారు. విద్యార్థినుల సమస్యలపై ఆరా తీశారు. హాస్టల్ సిబ్బంది తమను ఇబ్బంది పెట్టారని విద్యార్థినులు ఆరోపణలు చేయడంతో ఇటీవల బదిలీచేసిన వార్డెన్ లలితాదేవి,కుక్కు,కమాటీ,నైట్ వాచ్మన్లను విచారించారు. అనంతరం 14 ఏళ్ల కిందట ప్రారంభించి, అసంపూర్తిగా నిలిపివేసిన హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులు సూచించిన విషయాన్ని జేసీ దృష్టికి బీసీ వేల్పేర్ డీడీ శ్రీదేవి తీసుకెళ్లారు.అనంతరం చీడికాడ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న పాఠశాల భవనాల గదులు పరిశీలించారు. కలెక్టర్కు నివేదిక అందజేయనున్నట్టు జేసీ తెలిపారు. ఆయన వెంట అనకాపల్లి ఇన్చార్జి ఆర్డీవో వై.శ్రీనివాసరావు,తసీల్దార్ కిషోర్ లింకన్ తదితరులున్నారు.


