గొడుగులను ఆశ్రయించిన వ్యాపారులు
వడ దెబ్బతో ముంంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్య సేవలు పొందుతున్న రోగులు
ముంచంగిపుట్టు: ఎప్పుడూ చల్లగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఏడాది ఎండలు ముందస్తుగానే ప్రతాపం చూపుతున్నాయి. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రానున్న రోజులను తలచుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అత్యధికంగా కొయ్యూరులో
37 డిగ్రీలు నమోదు..
● 12వ తేదీన కొయ్యూరులో 37 డిగ్రీలు, అరకులో 35.2, చింతపల్లిలో 34.5 డిగ్రీలు నమోదు అయ్యాయి. 13వ తేదీన కొయ్యూరులో 38 డిగ్రీలు, అరకులో 35.8, ముంచంగిపుట్టులో 34.7 డిగ్రీలు నమోదు అయ్యాయి. 14వ తేదీన కొయ్యూరులో 36.4 నమోదు కాగా అరకులో 34.9,ముంచంగిపుట్టులో 34 డిగ్రీలు, 15వ తేదీన కొయ్యూరులో 35.4 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 34.2 డిగ్రీలు నమోదు అయ్యాయి. 16వ తేదీన కొయ్యూరులో 34.6 డిగ్రీలు, అరకులో 34.1 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 32.6గా నమోదు అయ్యాయి. 17వ తేదీన కొయ్యూరులో 33.8 డిగ్రీలు, అరకులో 31 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 30.7 డిగ్రీలు నమోదు అయ్యాయి. 18న కొయ్యూరులో 33.3, జి.మాడుగులలో 31.6, ముంచంగిపుట్టులో 31.3 డిగ్రీలు నమోదు అయినట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ విభాగం తెలిపింది.
● వడదెబ్బ బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల మెదడులో వేడిని నియంత్రించే హైపోథలామస్ కేంద్రం దెబ్బతిని, మనిషి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
● శరీరంలో అధిక వేడి ఉత్పత్తి కావడం లేదా శరీరం ఉష్ణాన్ని కోల్పోకపోవడం వల్ల వడదెబ్బ తగులుతుంది. దీనివల్ల శరీరంలోని లవణాలు, నీటి శాతం తగ్గిపోతాయి. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో కష్టపడి పనిచేసే వారు గంటకు సుమారు 3 నుంచి 4 లీటర్ల నీటిని చెమట రూపంలో కోల్పోతారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, గుండె జబ్బులు, రక్తపోటు ఉన్నవారు వడదెబ్బకు త్వరగా గురయ్యే అవకాశం ఉంది.
వడదెబ్బ లక్షణాలు: విపరీతమైన తలనొప్పి, తల తిరగడం. తీవ్రమైన జ్వరం రావడం. మగతగా ఉండటం లేదా కలవరించడం. ఫిట్స్ రావడం లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లడం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు వాడాలి. తెలుపు రంగు, పల్చటి చేనేత వస్త్రాలు ధరించడం ఉత్తమం. తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవాలి.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఆరుబయట కష్టమైన పనులు చేయకుండా ఉండటం మంచిది. బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా నీరు తాగాలి. ఎండలో తిరిగేటప్పుడు చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు లేదా మంచినీరు తీసుకోవాలి. అయితే శీతల పానీయాలు, ఐస్ ముక్కలు తీసుకోవడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
నిర్లక్ష్యం వద్దు
వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలి.చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు అలాగే చేస్తుండాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం తాగించాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
– నిఖిల్, వైద్యాధికారి,
కిలగాడ పీహెచ్సీ, ముంచంగిపుట్టు మండలం
మన్యంలో పెరుగుతున్న ఎండ తీవ్రత
కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులు
ఈ ఏడాది ముందస్తుగానే
భానుడి ప్రతాపం
నమోదు అవుతున్న అధిక ఉష్ణోగ్రతలు


