సిలిండర్ల కోసం ఎదురుచూపులు
అక్రమాలకు పాల్పడుతున్న డెలివరీ బాయ్స్
ఏజెన్సీల నిర్వాహకులకు పట్టని వినియోగదారుల గోడు
బ్లాక్లో రూ.2 వేలు
నర్సీపట్నం: సరిపడా నిల్వలు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరత లేదంటూ అధికారులు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సమయానికి గ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హెచ్పీ గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ బాయ్స్ అక్రమాలకు పాల్పడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బాక్ల్ మార్కెట్ దందా జోరుగా నడుస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు.
వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో గృహ అవసరాల సిలిండర్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో డబుల్ సిలిండర్లు ఉన్నవారి నంబర్లను గుర్తించి వినియోగదారులకు తెలియకుండానే బుకింగ్ చేసేస్తున్నారు. ఒక్కోదాని ఖరీదు రూ.968 ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.2 వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి వినియోగదారులు హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్ చేస్తున్నా ఆ ఫోన్ ఉలకదు..పలకదు అన్నట్టుగా ఉంది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ల్యాండ్లైన్ ఫోన్ నంబర్లను తీయడం లేదు. డెలివరీ బాయ్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 75 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం నాలుగు రెట్ల మంది అధికంగా నమోదు చేసుకుంటున్నారు. బుకింగ్ చేసుకుని నెలలు గడుస్తున్నా సిలిండర్ల అందక వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.


