అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక ఆలయ పునర్నిర్మాణ పనులకు 2023 జూన్ 8న అప్పటి వైఎస్సార్సీపీ పాలనలో రూ.11 కోట్లతో శంకుస్థాపన చేశామని, ప్రస్తుత పాలనలో పూర్తయ్యాయని మాజీ మంత్రి, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్థానిక గవరపాలెం నూకాంబిక నూతన ఆలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమసన్వయకర్త మలసాల భరత్కుమార్, మాజీ ఎంపీ బీవీ సత్యవతి, పార్టీమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతిలతో కలిసి ఆయన గురువారం దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ఆలయ చైర్మన్ పీలా గొల్లబాబు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనభాగ్యం కల్పించి, బేడా మండపంలో శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ పాలనలో తాను మంత్రిగా ఉన్న సమయంలో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. అప్పటి ఆలయ చైర్మన్ కొణతాల మురళీకృష్ణతోపాటు కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవతో 60 నుంచి 70 శాతం ఆలయ నిర్మాణ పనులు చేపట్టారన్నారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆలయాన్ని ప్రారంభించిందన్నారు. నూతన ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో కొత్త అమావాస్య జాతర నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, పార్టీ మండలాధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80, 81, 84 వార్డు ఇన్చార్జులు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, కశింకోట మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, అనకాపల్లి మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కె.పద్మకుమారి, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


