నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
చోడవరం : ఆన్లైన్లో ఉన్నతాధికారులుగా బెదిరించి జిల్లా స్థాయి అధికారి నుంచి దశల వారీగా రూ.59 లక్షలు ఆన్లైన్ మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితులను చోడవరం పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే పార్వతీపురం మన్యం జిల్లా డీపీవోగా పని చేస్తున్న తమరపు కొండలరావు చోడవరం మండలం గాంధీగ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇతను విధి నిర్వహణలో ఉండగా ముగ్గురు వ్యక్తులు ఈ ఏడాది జనవరి నెలలో ఫోన్కాల్స్ ద్వారా తాము వివిధ శాఖలకు చెందిన ఉన్నతాదికారులమని చెప్పి డబ్బులు కావాలని బెదిరింపులకు దిగారు. దశల వారీగా రూ.59 లక్షలు ఆన్లైన్ ద్వారాగా డీపీవో నుంచి పొంది మోసం చేసినట్టు చోడవరం సీఐ అప్పలరాజు చెప్పారు. తమ దర్యాప్తులో ఈ ఆన్లైన్ మోసాలకు పాల్పడిన సదాశివని వెంకట శివ రమాకాంత్, లెంపిముఖి మణికంఠేశ్వరరావు, ఇల్లపు హేమ సంతోష్లను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి చోడవరం కోర్టుకు తరలించగా నిందితులకు కోర్టు రిమాండ్ విధించిందని సీఐ చెప్పారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


