ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
జి.మాడుగుల: శ్రీరామ నవమి పురస్కరించుకుని స్థానిక రామాలయ ప్రాంగణంలో 100వ శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలను ఈ నెల 25 నుంచి 27 వరకు అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఆలయ ధర్మకర్త మత్స్యరాస బాలరాజు తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు, ప్రధాన కార్యదర్శి మత్స్యరాస వెంకటగంరాజు (బుజ్జి)లతో కలిసి శనివారం ఆయన ఆలయ మండపంలో ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖపట్నంకు చెందిన శ్రీ గోపాలకృష్ణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల 27 ఉదయం సీతారాముల కళ్యాణ మహోత్సవం, పూర్ణాహుతి, శ్రీ పాలకపాటి గురుదేవుల ఆశీస్సులతో మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నసమారాధన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సాయంత్రం థింసా నృత్యాలు, కోలాటాల నడుమ స్వామివారి తిరువీధి వైభవంగా సాగుతుందని పేర్కొన్నారు.ఉత్సవాల సందర్భంగా మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు మత్స్యరాస రామరాజు, కిముడు వెంకటరమణ, వడ్డాది శ్రీనివాసరావు పాల్గొన్నారు.


