42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు | Former MLA RP Bhanjdev Fire On Gummadi Sandhya Rani | Sakshi
Sakshi News home page

42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు

Mar 12 2026 11:42 AM | Updated on Mar 12 2026 11:51 AM

Former MLA RP Bhanjdev Fire On Gummadi Sandhya Rani

పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టీడీపీ ఎమ్మెల్యే, గిరజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్‌ల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి సంధ్యారాణి పీఎస్‌ సతీష్‌ ఓ మహిళా ఉద్యోగినిపై ఆర్థిక, లైంగిక వేధింపుల కేసు విషయంలో పట్టణ, రూరల్‌ సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ బుధవారం భంజ్‌దేవ్‌ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. బాధితురాలి ఫోన్‌ నుంచి భంజ్‌దేవ్‌కు పలుమార్లు ఫోన్లు రావడం, భంజ్‌దేవ్‌ ఫోన్‌ నుంచి ఆమెకు ఫోన్‌ వెళ్లడంపై ప్రశ్నించారు. 

తనకు అన్యాయం జరిగిందని పలుమార్లు ఆమె ఫోన్లో తెలిపిందని, పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న భావనతో మంత్రి సంధ్యారాణితో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించినట్టు భంజ్‌దేవ్‌ తెలిపారు. వివాదం పెద్దదికావడంతో సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని, టీడీపీ అరకు పార్లమెంట్‌ ఆఫీస్‌ ఇన్‌చార్జి నాగేశ్వరరావు సైతం ఫోన్‌ చేసి, ఆమెతో (ఫిర్యాదుదారురాలితో) ఫోన్లో మాట్లాడించాలని చెప్పడంతో ఆమెకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించానని, నాగేశ్వరరావు వాట్సాప్‌కాల్‌లో తనఫోన్‌ నుంచి బాధితురాలితో మాట్లాడినట్టు వివరించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఘటన తీరును వివరించానన్నారు. 

విచారణ జరిపించడం బాధాకరం 
పోలీసుల విచారణ తర్వాత భంజ్‌దేవ్‌ మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అధికార పార్టీలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధినైన తనకు చాలా మంది బాధితులు ఫోన్‌ చేస్తారని పేర్కొన్నారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనను ఇలాంటి విషయాలపై ఏ రోజు పోలీసులు విచారణ జరపడం తెలియదని, బాధాకరమంటూ వాపోయారు. మంత్రి పీఎస్‌ కేసులో తన కాల్‌డేటాను అనుమానించి పోలీసులతో విచారణ జరిపించడం బాధకలిగిస్తోందన్నారు. ఎవరి ప్రోద్బలంతో పోలీసులు విచారణకు వచ్చారో అందరికీ అర్థమవుతుందని, జరిగిన విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని భంజ్‌దేవ్‌ స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement