మాకవరపాలెం : ఏజెన్సీ ప్రాంతం నుంచి వ్యానులో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు స్థానిక పోలీస్ స్టేషన్లో అందించిన వివరాలిలా ఉన్నాయి. వ్యానుతో నర్సీపట్నం వైపు నుంచి మాకవరపాలెం మండలం మీదుగా గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో ఎస్ఐ దామోదర్నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది పైడిపాల జంక్షన్ వద్ద గురువారం ఉదయం వాహనాల తనికీలు చేపట్టారన్నారు. ఈ సందర్భంగా మహీంద్ర మినీ వ్యాన్లో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. మరో ముగ్గురు పరారయ్యాయన్నారు. వీరితోపాటు ఒడిశా రాష్ట్రంలో గంజాయి విక్రయించిన వ్యక్తిని పట్టుకోవాల్సి ఉందన్నారు. పట్టుబడిన వారిలో గొలుగొండ మండలం పోలవరం గ్రామానికి చెందిన కొప్పి సత్తిబాబు(34), పాకలపాడుకు చెందిన కర్రి కృష్ణ(38), మాకవరపాలెం మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన పైల సురేష్(27), నర్సీపట్నంకు చెందిన పరవాడ శ్రీనివాస్(52) ఉన్నారన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో మినీ వ్యాన్, ఒక బైక్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, స్థానిక ఎస్ఐ దామోదర్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.


