గొలుగొండ : తల్లి అనారోగ్యంతో రెండు రోజులు క్రితం చనిపోయింది. తండ్రి ఉన్నా లేనట్టే. పిల్లలు బాధ్యత తండ్రి పట్టించుకోలేదు. చేరదీసే తల్లి చనిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో కొత్త ఎల్లవరం గ్రామంలో బుధవారం ముగ్గురు పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు సర్పంచ్ రాంబాబు, గ్రామస్తులు అప్పగించారు. వివరాలివి. కొత్త ఎల్లవరం గ్రామానికి చెందిన పైల పెద్దినాయుడు, లక్ష్మి దంపతులకు ముగ్గరు పిల్లలు. పెద్ద కుమార్తె 7 సంవత్సరాలు, రెండు బాబుకు ఐదు సంవత్సరాలు, మూడో బాబుకు రెండు నెలలు. లక్ష్మికి కడుపులో దీర్ఘకాలిక వ్యాధి రావడంతో ఆసుపత్రిలో చూపించినా ప్రయోజనం లేకుండా పోవడంతో ఆమె రెండు రోజులు క్రితం చనిపోయింది. తండ్రి పెద్దినాయుడు కనీసం పిల్లలు వంక చూడకపోవడంతో గ్రామస్తులు అంతా ఐక్యంగా ఆలోచించి వారి సంరక్షణ బాధ్యత ఐసీడీఎస్కు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో గ్రామస్తులు గొలుగొండ ఐసీడీఎస్ పీవో శ్రీగౌరికి సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ సిబ్బంది ముగ్గురు పిల్లలను అనకాపల్లి శిశు సంరక్షన కేంద్రానికి అప్పగించడం జరిగిందని పీవో శ్రీగౌరి తెలిపారు.


