● నలుగురు మాత్రమే ఉండటంపై
విశ్వేశ్వరరాజు మండిపాటు
● అంజలి శనివారంలో పర్యటన
చింతపల్లి: మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు సత్వర సేవలు అందించాల్సిన గ్రామ సచివాలయాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అంజలిశనివారం గ్రామంలో పర్యటించిన ఆయన, స్థానిక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉండటంపై ఆయన మండిపడ్డారు.
ప్రజల ముంగిటకే సేవలు అందాలి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల వద్దకే చేర్చాలనే ఉద్దేశంతో సచివాలయాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ నేడు ఆ లక్ష్యం నెరవేరకపోవడం, సేవలు ప్రజలకు చేరువలో లేకపోవడం బాధాకరమన్నారు. సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మారుమూల ప్రాంత గిరిజనులకు సేవలందించాలని, విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు.
బోడకొండమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
అంజలి శనివారంలో జరుగుతున్న శ్రీ బోడకొండమ్మ, గంగాదేవి జాతర మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు, వైసిపి సీనియర్ నాయకులు కిముడు బెన్నలింగం, లకే కళ్యాణం, సాగిన సింహాచలం, లకే ఎర్నన్నదొర, ప్రసాద్, రెహ్మాన్, హేమంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


