నర్సీపట్నం: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పుర పాలన దిగ్విజయంగా ముగిసింది. నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంగళవారం మున్సిపల్ ఆఖరి పాలకవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంతో మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ముగిస్తుంది. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నాయకత్వంలో 2021లో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న పుర పీఠాన్ని కై వసం చేసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే గణేష్ తొలిసారి అధికార వికేంద్రీకరణతో ముగ్గురు దళిత మహిళలకు చైర్పర్సన్ అయ్యే అవకాశాన్ని కల్పించారు. మొదటి చైర్పర్సన్గా గుడబండి ఆదిలక్ష్మి రెండేళ్లు కొనసాగారు. మరో రెండేళ్లు ప్రస్తుత చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మికి కల్పించారు. ఆఖరి ఏడాది చెక్కా బాలమ్మకు అవకాశం కల్పించినా సాధ్యం కాలేదు. వైఎస్సార్సీపీ పాలకవర్గం 2021 మార్చి 18న కొలువుదీరింది. మాజీ ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీని పాలకవర్గం ఎంతో అభివృద్ధి చేసింది. చివరి ఏడాది బాలమ్మను చైర్పర్సన్ చేయాల్సి ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాజకీయ పరిణామాల దృష్ట్యా సాధ్యం కాలేదు. ఏదేమైనా ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ పాలకవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేయడంతోపాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేసింది. నర్సీపట్నం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చి తమ పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది.


