ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు సమీపంలో గల మత్స్యగెడ్డపై తక్షణమే వంతెన నిర్మించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. త్రినాథ్ డిమాండ్ చేశారు. గురువారం మత్స్యగెడ్డ ఒడ్డున గిరిజన సంఘం, వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్థానిక గిరిజనులు కలిసి నిరసన చేపట్టారు. వంతెన నిర్మించాలని కోరుతూ ప్రభుత్వంపై నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ కుమ్మరిపుట్టు మత్స్యగెడ్డపై ప్రతిరోజూ సుమారు 12 గ్రామాల గిరిజనులు నాటు పడవలపైనే ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. గతంలో జరిగిన నాటు పడవల ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.వంతెనతో పాటుగా గిరిజన మత్స్యకారులకు ప్రభుత్వం తక్షణమే బోట్లు, వలలు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుజనకోట సర్పంచ్ రమేష్, గిరిజన సంఘం మండల నేతలు, వివిధ పార్టీల నాయకులు శ్రీను, నరసింగరావు పడాల్, గాసిరాం దొర, నారాయణ, గురుమూర్తి పాల్గొన్నారు.


