ముమ్మరంగా గాలింపు
ముంచంగిపుట్టు : మండలంలో సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు సమీపంలో మత్స్యగెడ్డలో స్నానానికి దిగి ఓ గిరిజనుడు గల్లంతయ్యా డు. అతని ఆచూకీ కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. స్థానికులు అందించిన వివరాలు.. కుమ్మరిపుట్టుకు చెందిన వంతాల గోపీనాథ్(72) సోమవారం మండల కేంద్రం ముంచంగిపుట్టుకు అరటిపండ్ల అమ్మకానికి వచ్చి, రాత్రి అయిన ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు పరిసరాల గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీశారు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డ ఒడ్డున గోపీనాథ్కు చెందిన దుస్తులు, సంచీని గ్రామస్తులు గుర్తించారు. దీంతో స్నానం చేయడానికి గెడ్డలో దిగి గల్లంతై ఉంటాడని భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుజనకోట సర్పంచ్ వెంగడ రమేష్, ఎంపీటీసీ సభ్యురాలు మజ్జి సుబ్బలక్ష్మి తదితరులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. స్థానికులతో రెండు నాటు పడవలపై మత్స్యగెడ్డలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. గల్లంతైన విషయంపై కుటుంబ సభ్యులు ఎస్ఐ నానీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ మత్స్యగెడ్డ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు.
అధికారుల తీరుపై జెడ్పీ చైర్ పర్సన్ ఆగ్రహం
కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డలో గిరిజనుడు గల్లంతైనా మండల స్థాయి అధికారుల్లో కనీస స్పందన లేకపోవడంపై జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ మంగళవారం కుమ్మరిపుట్టు వెళ్లి ప్రమాద వివరాలను గ్రామస్తులకు అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయి అధికారి, పంచాయతీ,రెవెన్యూ అధికారులు రాలేదని, గ్రామస్తులమే గాలిస్తున్నామని చైర్ పర్సన్ వద్ద గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో స్పందించిన ఆమె ఫోన్లో జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.జెడ్పీ చైర్పర్సన్ వచ్చిన విషయాని తెలుసుకున్న తహసీల్దార్ భాస్కరఅప్పారావు,రెవెన్యూ సిబ్బంది సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకున్నారు.దీంతో వారిపై జెడ్పీ చైర్ పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. తీరుమార్చు కోవాలని అధికారులకు ఆమె హెచ్చరించారు.కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు జెడ్పీ చైర్పర్సన్ను కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్,ఎంపీటీసీ సుబ్బ లక్ష్మి,వైఎస్సార్సీపీ మండల నేతలు సన్యాసిరావు,జె.వి.వి.ఎన్.మూర్తి,తిరుపతి పాల్గొన్నారు.


