● ఆ తరువాతనే పవన్ కల్యాణ్
జిల్లా పర్యటనకు రావాలి
● ఆదివాసీ సంఘాల డిమాండ్
అరకులోయ టౌన్: హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్లు 2, 13, 51లను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, అరకులోయ వైస్ ఎంపీపీ కిల్లో రామన్న డిమాండ్ చేశారు. ఈ జీవోలను రద్దు చేసిన తర్వాతే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా పర్యటనకు రావాలని వారు స్పష్టం చేశారు. శుక్రవారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుతో పాటు బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించిన జీవోలను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాల్లో నూరుశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయాలని, ఆదివాసీ నిరుద్యోగుల కోసం ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి భర్తీ చేపట్టాలని వారు స్పష్టంచేశారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలైన గుజ్జెలి, చిట్టంవలస, పెదకోట, ఎర్రవరం, సీలేరు ప్రాంతాల్లో 6,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం అదానీ, నవయుగ, షిరిడి సాయి వంటి కార్పొరేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని వారు విమర్శించారు.ఈ ప్రాజెక్టుల వల్ల 25 గ్రామ పంచాయతీల్లోని దాదాపు 250 గ్రామాలు, సుమారు 60 వేల మంది ఆదివాసీలు నిరాశ్రయులవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల అటవీ భూములు, కాఫీ తోటలు, వన్యప్రాణులు జలసమాధి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఆదివాసీల హక్కులను, చట్టాలను ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ ప్రాజెక్టులను నిలిపివేసిన తరువాతనే పవన్ కల్యాణ్ ఏజెన్సీలో అడుగుపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, మండల ఉపాధ్యక్షుడు బురిడి దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
బాకై ్సట్ తవ్వకాలపై స్పష్టత ఇవ్వాల్సిందే
చింతపల్లి: ఏజెన్సీ ప్రాంతంలో బాకై ్సట్ తవ్వకాలుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తరువాతనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన్యంలో పర్యటించాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు.శుక్రవారం చౌడుపల్లి పంచాయతీ గెర్లెగెడ్డ గ్రామంలో గిరిజనులతో కలసి నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయమైన మార్గంలో దోచుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖనిజ సంపద ఒడిశా తరువాత అల్లూరి జిల్లాలోనే ఉందన్నారు.దీనిని అక్రమంగా తరలించకుండా గిరిజనులంతా ఏకమై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ నేతలు రఘరాం, రమణ, రాజేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


