పాడేరు: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు అరమజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం తుప్పల పాలైంది. సోమవారం ఆయన 125వ జయంతి. ఆయన చేసిన సేవలను స్మరించుకునేందుకు ప్రతి ఏటా మార్చి 16న ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. కానీ పాడేరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో తుప్పల మధ్య ఆ మహనీయుడి విగ్రహం నిరాధారణకు గురై పడి ఉంది. గతంలో ఈ విగ్రహం ప్రధాన రహదారి పక్కన ఉన్న సాయిబాబా ఆలయ ముందున ఉండేది. కానీ రహదారి పక్కన ఆక్రమణల తొలగింపులో భాగంగా కొన్నేళ్ల కిందట ఈ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఓ పక్కన పడేశారు. అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఆ మార్గాన వెళ్తున్న వారి విగ్రహాన్ని చూసి అధికారులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


