● ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్
రామారావు దొర
పెదబయలు: గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర తెలిపారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర మంగళవారం గిన్నెలకోట పంచాయతీ కేంద్రం మీదుగా చింతగరువు లండూలు, వంచుర్భ, దోసలబంద, బొంగరం, రాసగొంది, చిట్రకాయపుట్టు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 123 రోజులుగా యాత్ర చేస్తున్నట్టు తెలిపారు. నూరుశాతం ఉద్యోగాలు గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని, గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బూడిదే మాధవరావు,మానుగూరు బాబుజీ, పార్థసారథి, స్వామి, చిన్నారావు, కొండబాబు, లక్ష్మణ్,రాంబాబు పాల్గొన్నారు.


