డీఎంహెచ్వో కృష్ణమూర్తి నాయక్
పాడేరు: గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యాధికారులకు హైబ్రీడ్ మోడ్లో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. జిల్లాలో 17 పీహెచ్సీల వైద్యాధికారులకు మూడు రోజుల ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధులు, మాతాశిశు మరణాల నివారణ,అత్యవసర వైద్య సేవలపై వైద్యులకు అత్యాధునిక విధానాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వైద్యులంతా ఈ అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రతాప్, జిల్లా కార్యక్రమాల పర్యవేక్షణ అధికారి డాక్టర్ కిరణ్కుమార్, కార్యకర్తల శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ శాంతి తదితరులు పాల్గొన్నారు.


