మత్స్యగెడ్డలో గాలింపు నిలిపివేసిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు వద్ద గల మత్స్యగెడ్డలో గోపినాథ్ అనే గిరిజనుడు గల్లంతైన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. గత రెండు రోజులుగా ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కుమ్మరిపుట్టు గ్రామానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఎటువంటి ఫలితం లభించలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బృందాలు గాలింపును నిలిపివేశాయి.
పర్యవేక్షణలో అధికారులు, నేతలు..
ఈ గాలింపు చర్యలను తహసీల్దార్ భాస్కర అప్పారావు, ఎంపీడీవో ధర్మారావు, ఎస్ఐ నాని పర్యవేక్షించారు. వీరితో పాటు సర్పంచులు రమేష్, బాబూరావు, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, స్థానిక నేతలు జయదేవ్, సింహాచలం, రాంప్రసాద్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు
గల్లంతైన గోపినాథ్ ఆచూకీ కోసం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు మత్స్యగెడ్డ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విస్తృతంగా గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుమ్మరిపుట్టు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అధికారుల గాలింపు ఆగిపోయినప్పటికీ, గ్రామస్థులే స్వచ్ఛందంగా గెడ్డలో వెతుకులాట కొనసాగిస్తున్నారు.
ఎస్డీఆర్ఎఫ్ బృందంపై ఆగ్రహం..
ఆచూకీ లభించకముందే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపును మధ్యలోనే నిలిపివేసి వెనుదిరగడంపై కుమ్మరిపుట్టు గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలింపు చర్యలను కొనసాగించి తమ వ్యక్తిని అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


