పెదబయలు: గిరిజనులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ చేపట్టిన ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర’ గురువారం పెదబయలులో ముగిసింది. 125 రోజుల పాటు సాగిన ఈ యాత్ర ముగింపు సందర్భంగా సీతగుంట నుంచి పెదబయలు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన ముగింపు సభలో జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు 9న పాడేరులో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని కోరారు. గత డీఎస్సీలో మైదాన ప్రాంత అభ్యర్థులను నియమించడం వల్ల గిరిజన నిరుద్యోగులు 95 శాతం ఉద్యోగాలు కోల్పోయారని మండిపడ్డారు.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్టేట్ క్యాడర్లో 30 శాతం, జోనల్ క్యాడర్లో 50 శాతం, లోకల్ క్యాడర్లో నూరుశాతం పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేసేలా చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం గ్రామగ్రామాన ప్రజలను చైతన్యం చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెదబయలు మండల గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షక్ష కార్యదర్శులు తలారి చక్రదర్, లకే అనిల్, ఉపాధ్యాయ సంఘాల నేతలు పలాసి తిరుపతిరావు, రెడ్డి కమలకుమారి, సూర్యకళ, చెండా బాలకృష్ణ, రామచంద్రశేఖర్, రూడ చిన్నయ్య, మాలంనాయుడు, హనుమంతు. ప్రసాదరావు, అప్పన్న, మత్స్యలింగం, భగవాన్, అప్పలస్వామి, రాధాకృష్ణ,జేఎస్సీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు బూడిదే మాధవరావు,మానుగూరు బాబుజీ, పార్థసారధి, స్వామి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరుద్యోగులు పాల్గొన్నారు.


