ఆగస్టు 1 నుంచి ‘బైక్ టాక్సీలు’ చట్టబద్ధం! | Maharashtra Bike Taxis Legal From August 1st | Sakshi
Sakshi News home page

ఆగస్టు 1 నుంచి ‘బైక్ టాక్సీలు’ చట్టబద్ధం!

Jul 8 2026 5:18 PM | Updated on Jul 8 2026 5:30 PM

Maharashtra Bike Taxis Legal From August 1st

మహారాష్ట్ర రవాణా విభాగంలో భారీ మార్పు రాబోతుంది. గత కొంతకాలంగా చట్టపరమైన చిక్కులు, ఆంక్షల నడుమ యాప్ ఆధారిత బైక్ టాక్సీలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలను చట్టబద్ధం చేస్తూ సరికొత్త రవాణా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త విధానానికి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం.

4.5 లక్షల బైక్ టాక్సీలు

ప్రస్తుతం మహారాష్ట్రవ్యాప్తంగా సుమారు 4-4.5 లక్షల బైక్ టాక్సీలు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జులై చివరి నాటికి రవాణా శాఖ ఈ కొత్త పాలసీకి తుది అనుమతులు ఇవ్వనుండటంతో ఆగస్టు 1 నుంచి ఈ అసంఘటిత రంగం నియంత్రణ చట్రం పరిధిలోకి రానుంది. గతంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్ల తాత్కాలిక లైసెన్సులను రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు స్థానిక యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని సవరించుకోవడం గమనార్హం.

నిబంధనలు ఇవే!

స్థానిక నిరుద్యోగ యువత ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం ఈ పాలసీలో కొన్ని కీలకమైన నిబంధనలు పెట్టింది.

  • స్థానికంగా మహారాష్ట్ర నివాసితులకు మాత్రమే బైక్ టాక్సీ పర్మిట్లు మంజూరు చేస్తారు.

  • బైక్ టాక్సీ నడిపే డ్రైవర్లు స్థానిక భాష మరాఠీ కచ్చితంగా అర్థం చేసుకోగలగాలి.

  • మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం సూచించిన పబ్లిక్ సర్వీస్ వెహికల్ బ్యాడ్జ్ కలిగి ఉండాలి.

డ్రైవర్ల సంక్షేమం కోసం నిధి

బైక్ టాక్సీ రంగాన్ని క్రమబద్ధీకరించడంతోపాటు డ్రైవర్ల సామాజిక భద్రతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా సరికొత్త రెవెన్యూ మోడల్‌ను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఆపరేటర్లు లేదా డ్రైవర్లు రోజుకు రూ.5 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి రైడ్ బుకింగ్‌పై వచ్చే ఆదాయంలో 2 శాతం నిధులను డ్రైవర్ల సంక్షేమ పథకాల(ఆరోగ్య, జీవిత బీమా, పీఎఫ్‌) కోసం కేటాయించాలి.

‘మహారాష్ట్రలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. ఈ కొత్త విధానం ద్వారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అలాగే రైడర్ల సంక్షేమం కోసం 2 శాతం నిధిని కూడా వినియోగిస్తాం’ అని ప్రతాప్ సర్నాయక్ అన్నారు.

ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement