PC: BCCI/IPL
అంతా ఊహించిందే జరిగింది. భారత క్రికెట్ జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే... తిరిగి సొంత గూటికి చేరాడు. డస్కటేను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ‘హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ’గా నియమించుకుంది. రెండేళ్లుగా టీమిండియాతో కలిసి పనిచేసిన డస్కటే కాంట్రాక్ట్ ఇంగ్లండ్ పర్యటనతో ముగియగా... బీసీసీఐ అతడికి పొడిగింపు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అతడు కేకేఆర్తో జతకట్టాడు.
ఈ మేరకు ఫ్రాంచైజీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఇది గొప్ప అవకాశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఫ్రాంచైజీలను మరింత బలోపేతం చేసేందుకు నావంతు కృషిచేస్తా. దీర్ఘకాలం ఫలితాలను దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజీలను రూపొందించేందుకు కృషి చేయడంతో పాటు యువ నైపుణ్యానికి మరింత పదును పెడతా" అని నెదర్లాండ్స్కు చెందిన 46 ఏళ్ల డస్కటే పేర్కొన్నాడు.
ఫ్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ... "ఆటపై అతడికున్న అవగాహన ఫ్రాంచైజీకి ఉపయోగపడుతుంది. డస్కటే అనుభవం ఈ పదవికి సరిగ్గా సరిపోతుంది" అని అన్నాడు. డస్కటేకు కేకేఆర్ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది. కోల్కతా జట్టు రెండు (2012, 2014)సార్లు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన సమయంలో ఆ జట్టులో ప్లేయర్గా ఉన్న డస్కటే... ఆ తర్వాత్ కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్గా ఆ జట్టుకు మూడో (2024) టైటిల్ అందించాడు.
అదే సమయంలో కేకేఆర్ మెంటార్గా ఉన్న గౌతమ్ గంభీర్ అనంతరం కాలంలో... భారత జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో... అతడితో ఉన్న అనుబంధం కారణంగా డస్కటే టీమిండియా కోచింగ్ బృందంలో భాగమయ్యాడు. అయితే రెండేళ్లుగా జట్టుతో కలిసి ఉన్నప్పటికీ డస్కటేకు ఎలాంటి నిర్దేశిత బాధ్యతలు అప్పగించలేదు.


