ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి (PC: BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఈ టీ20 లీగ్.. దినదినాభివృద్ధి చెందుతోంది. బీసీసీఐ, ఫ్రాంఛైజీలు, ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్గా కొనసాగుతోంది.
సుమారుగా రూ. 2,00,000 కోట్లు!
ఈ నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు హోలియాన్ లోకీ తాజాగా వెలువరించిన నివేదిక ఐపీఎల్ సత్తా ఏమిటో మరోసారి చాటిచెప్పింది. ఐపీఎల్-2026 బ్రాండ్ వాల్యూ స్టడీలో భాగంగా.. ఐపీఎల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ విలువలో 11.4 శాతం పెరుగుదల నమోదైందని.. మొత్తం విలువ 20.6 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 1,97,024 కోట్లు)కు చేరిందని సదరు కథనం పేర్కొంది.
రికార్డు ధరకు
అదే విధంగా లీగ్ బ్రాండ్ వాల్యూలో 10.3 శాతం పెరుగుదల కనిపించిందని.. ఇది 4.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 41,106 కోట్లు)కు చేరిందని కథనం తెలిపింది. కాగా 2026లో రెండు ఫ్రాంఛైజీల యాజమాన్యాలు చేతులు మారిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ని బ్లాక్స్టోన్, బోల్ట్ వెంటర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు రికార్డు స్థాయిలో 1.78 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాయి.
ఇక రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని మిట్టల్ కుటుంబం, ఆదార్ పూనావాలా సంయుక్తంగా 1.65 బిలియన్ డాలర్ల మొత్తానికి దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా ఎగిసినట్లు సదరు కథనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్కు రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఈ మేర బ్రాండ్ వాల్యూ పెరిగిందని హోలియాన్ లోకీ ఫైనాన్షియల్, వాల్యువేషన్ అడ్వైజరీ బిజినెస్ డైరెక్టర్ హర్ష్ తలికోటి తెలిపారు.
నంబర్ వన్గా ఆర్సీబీ
ఐపీఎల్ 2025, 2026లో వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ అమాంతంగా పెరిగింది. ఐపీఎల్లోనే అత్యంత విలువైన ఫ్రాంఛైజీగా ఆర్సీబీ అవతరించింది. అంతేకాదు బ్రాండ్ వాల్యూలో 300.0 మిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి క్రికెట్ జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఫ్రాంఛైజీ విజయాలు, అపారమైన అభిమానగణం ఇందుకు ప్రధాన కారణం.
మిగిలిన స్థానాలు ఇలా
ఇక ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ 264 మిలియన్ డాలర్లకు చేరగా.. ఆర్సీబీ తర్వాతి స్థానాన్ని ముంబై ఆక్రమించింది. కోల్కతా నైట్ రైడర్స్ బ్రాండ్ వాల్యూ 245 మిలియన్ డాలర్లకు చేరింది. ఐపీఎల్-2024లో జట్టు విజేతగా నిలవడం ఇందులో కీలక పాత్ర పోషించింది. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ 244 మిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఆర్సీబీ, ముంబై, కోల్కతా తర్వాత నాలుగో స్థానంలో చెన్నై జట్టు నిలిచింది.
అదే విధంగా ఆ తర్వాతి స్థానాల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (బ్రాండ్ వాల్యూ 168 మిలియన్ డాలర్లు), రాజస్తాన్ రాయల్స్ (161 మిలియన్ డాలర్లు), పంజాబ్ కింగ్స్ (158 మిలియన్ డాలర్లు), గుజరాత్ టైటాన్స్ (157 మిలియన్ డాలర్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (156 మిలియన్ డాలర్లు), లక్నో సూపర్ జెయింట్స్ (122 మిలియన్ డాలర్లు) నిలిచాయి.
చదవండి: అర్జున్ టెండుల్కర్కు షాక్!


