టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు అర్జున్ టెండుల్కర్ చాన్నాళ్ల నుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశీ క్రికెట్లో తొలుత సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు ఈ ఆల్రౌండర్.
ముంబై నుంచి గోవాకు...
అయితే, ముంబై జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో 26 ఏళ్ల అర్జున్కు తగినన్ని అవకాశాలు రాలేదు. దీంతో 2022లో గోవా జట్టుకు మారిపోయాడు. ఆ జట్టు తరఫున మెరుగ్గానే రాణించాడు. అయితే, ఈ ఏడాది అతడు గోవా జట్టును వీడనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఒమన్ పర్యటనకు
తాజాగా గోవా క్రికెట్ జట్టుకు సంబంధించి బయటకు వచ్చిన ఓ అప్డేట్ ఇందుకు కారణం. కాగా రంజీ ట్రోఫీ 2026-27 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబరు నుంచి ఈ రెడ్బాల్ దేశీ టోర్నీ మొదలుకానుండగా.. గోవా తమ ప్రమాణాలు పెంచుకునే క్రమంలో ఒమన్కు వెళ్లనుంది.
పదిరోజుల పాటు ఒమన్లో తమ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా గోవా అసోసియేషన్ ప్రణాళిక రచించినట్లు సమాచారం. స్పోర్ట్స్స్టార్ కథనం ప్రకారం.. ఆగష్టు 8- 18 మధ్య గోవా జట్టు ఒమన్లో గడుపనుంది. ఇందులో భాగంగా ఒమన్ సీనియర్ క్రికెట్ జట్టుతో మూడు వన్డేలతో పాటు రెండు టీ20 మ్యాచ్లు ఆడనున్నట్లు సమాచారం.
హెడ్కోచ్గా దినేశ్ మోంగియా
ఈ పర్యటనలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ దినేశ్ మోంగియా గోవా జట్టు హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. మిలాప్ మేవాడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో చేరడంతో.. మోంగియా గోవా హెడ్కోచ్గా అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.
అర్జున్ టెండుల్కర్కు షాకిచ్చారా?.. తప్పుకొన్నాడా?!
అయితే, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అర్జున్ టెండుల్కర్ మాత్రం జట్టుతో పాటు ఈ టూర్కు వెళ్లడం లేదని తెలుస్తోంది. గోవా తరఫున కొనసాగేందుకు అతడు సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. తాజా ఎడిషన్లోనే అర్జున్ గోవా జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఒమన్ టూర్ను సైతం అతడు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అటు గోవా క్రికెట్ గానీ.. ఇటు అర్జున్ టెండుల్కర్ గానీ స్పందించలేదు. కాగా గత రంజీ ఎడిషన్లో గోవా ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది.


