ఒమన్లో చిక్కుకుపోయిన హైదరాబాద్ మహిళ
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న భారతీయుల సంఖ్య రోజురోజూకు పెరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్కు చెందిన షబ్నం బేగం అనే మహిళ ఉపాధి కోసం ఒమన్కు వెళ్లి అక్కడ యజమాని చేతిలో దారుణమైన వేధింపులకు గురైంది. రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, మూడు నెలలుగా జీతం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది.
ఏమి జరిగిందంటే?
హైదరాబాద్ పహాడీ షరీఫ్కు చెందిన షబ్నం బేగంకు ఒమన్లో గృహ కార్మికురాలిగా ఉద్యోగం ఇప్పిస్తానని స్థానిక రిక్రూట్మెంట్ ఏజెంట్ ఒకరు నమ్మబలికాడు. నెలకు 200 ఒమానీ రియాల్స్ జీతం (సుమారు రూ. 43,000) ఇప్పిస్తానని చెప్పడంతో ఈ ఏడాది మార్చి 26న ఆమె ఒమన్ రాజధాని మస్కట్కు చేరుకుంది.
ఆమెకు అక్కడ చేరుకున్న మొదటి రోజు నుంచే నరకం మొదలైంది. ఒక ఇంట్లో పని అని చెప్పి, యజమాని ఆమెతో రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పలు ఇళ్లలో బలవంతంగా చాకిరీ చేయించుకున్నాడని షబ్నం బేగం తెలిపింది. ఉండటానికి సరైన వసతి కల్పించకపోగా, కడుపునిండా కనీసం అన్నం కూడా పెట్టకుండా వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
గత నాలుగు నెలలుగా ఆమె చేసిన పనికి పైసా జీతం కూడా ఇవ్వలేదని షబ్నం వెల్లడించింది. యజమాని బారి నుండి చాకచక్యంగా తప్పించుకున్న షబ్నం బేగం ప్రస్తుతం మస్కట్లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ)లో ఆశ్రయం పొందుతున్నారు. షబ్నంను సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు విజ్ఞప్తి చేశారు.


