9 మంది మృతి, 60 మందికి పైగా గాయాలు
మాస్కో: ఉక్రెయిన్ తన లాంగ్ రేంజ్ డ్రోన్ల సత్తాను రష్యాకు రుచి చూపింది. శుక్రవారం రాత్రి రాజధాని మాస్కో తదితర ప్రాంతాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 9 మంది చనిపోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఇంధన, సైనిక లక్ష్యాలపై జరిగిన ఈ దాడుల్లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టాంబోవ్ ప్రాంతంలోని కొటొవ్స్క్ , మాస్కోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలక్ట్రోస్టాల్ నగరంలోని గోదాములు మంటల్లో చిక్కుకున్నాయి.
ఈ రెండూ ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్కు చెందినవని అధికారులు తెలిపారు. కొటొవ్స్క్ ఘటనలో ఏడుగురు చనిపోగా, 25 మంది గాయపడ్డారు. మాస్కో ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా, 37 మంది గాయపడినట్లు గవర్నర్ తెలిపారు. ఎలక్ట్రోస్టాల్లోని గోదాములో దాడితో ఒకరు చనిపోయారు. ఇక్కడ ప్రమాద తీవ్రత కారణంగా పొరుగునే ఉన్న ఒక నివాస భవనాన్ని, ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయించారు. ఈ రెండు గోదాముల్లోనూ డ్రోన్ల తయారీకి సంబంధించిన నిషేధిత సామగ్రి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.


