వాషింగ్టన్ డీసీ: ఇరాన్పై పెద్దఎత్తున దాడులకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.ఈ మేరకు వైట్హౌస్లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి దేశానికి చెందిన మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలే టార్గెట్గా దాడులు జరపాలని అందుకు గానూ పెద్దఎత్తున గగనతల ఇంధన సరఫరా విమానాలను ఇజ్రాయెల్ పంపినట్లు ఆక్సియోస్ కథనాలు ప్రచురించింది.
కాగా ఇదివరకే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సమీపంలో ఉన్న బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం ,దక్షిణ ఇజ్రాయెల్లోని రామోన్ ఎయిర్పోర్టులలో పదుల సంఖ్యలో ఇంధన సరఫరా విమానాలున్నాయి. అయితే వీటికి అదనంగా భారీగా రీప్యూయలింగ్ విమానాలను పంపేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దాడులు ప్రధానంగా అణుఇంధన కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లు, ఇతర వ్యూహాత్మక లక్ష్యాలపై ఉండనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ దాడికి ప్రణాళికలు ఖచ్చితంగా రచించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ దూరం ప్రయాణించి దాడులు చేసే యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపడానికి ఈ ట్యాంకర్ విమానాలు చాలా కీలకం.
కాగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఇటీవల పూర్తిగా విఫలమైంది. దీంతో దౌత్యపరమైన చర్చలు ఆగిపోయి, మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ సైతం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.


